Previous Page Next Page 
సాహసి పేజి 17


    "ఎవరూ... రాజానా... వాడు మెరీనా హోటల్లో ఉంటాడు" అన్నాడా వ్యక్తి రెండో ప్యాకెట్ ని చేతిలోకి తీసుకుంటూ.

    "యువరాజు కాదు బాబూ... రాజు కావాలి" అన్నాడు ముత్యాలనాయుడు.

    "ఏంటది... నాకేం అర్ధం కాలేదే" అన్నాడు ఆ వ్యక్తి లేచి నిలబడుతూ.

    "యువరాజుని మెరీనా హోటల్ లో కల్సే వస్తున్నాం. మాకు కావల్సింది రాజు. యువరాజు కాదు" అంది ఇందుమతి.

    ఆ వ్యక్తి బిత్తరపోయాడు. కళ్ళను టపటపలాడించాడు. "రాజెవడు?" అన్నాడు కళ్ళు తేలవేస్తూ.

    "మందు తలకి బాగా ఎక్కి వుంటుంది చూడు బాబు యువరాజు తమ్ముడు రాజు లేడూ... అతను మాకు కావాలి ఎక్కడ వుంటాడు?" అన్నాడు ముత్యాలనాయుడు తూలిపోతున్న అతడ్ని పట్టుకుని నిలబెడుతూ.

    "ఏంటది?" షాక్ తిన్నాడా వ్యక్తి.

    "యువరాజు తమ్ముడు రాజు"

    ఆ వ్యక్తి ఒక్కక్షణం కళ్ళు నులుముకుని చూసాడు. ఆ పైన ఇందుమతి ముత్యాలనాయుడు కాళ్ళకేసి చూసాడు. అతనికేదో అర్ధమయ్యింది. "నేనెవరికీ అన్యాయం చేయలేదు దేవుడో... నన్నొదిలేయండి" అన్నాడతడు భయపడుతూ.

    అతనెందుకలా ప్రవర్తిస్తున్నాడో వాళ్ళకి అర్ధం కాలేదు.

    అక్కడింకెవరయినా ఉన్నారేమో అడుగుదామని పరిసరాల్ని గమనించింది ఇందుమతి. అక్కడున్న మిగతా నలుగురు అప్పటికే బాగా తాగేసి ఇసుక మీద పడిపోయున్నారు.

    "నీకు డబ్బులిస్తాం. యువరాజు తమ్ముడు రాజు ఆచూకీ కావాలి మాకు" అన్నాడు ముత్యాలనాయుడు తిరిగి.

    ఒక్కక్షణం ఆగి చేతిలో వున్న ప్యాకెట్ మొత్తం నోట్లో ఒంపుకొని...

    ఆ తరువాత గుక్కపట్టి ఏడవడం ప్రారంభించాడు. "ఒక ఆడదెయ్యం... ఒక మొగ దెయ్యం... ఒక పిల్ల దెయ్యం... ఒక ముసలి దెయ్యం... నన్నెవరు కాపాడుతారో దేవుడో..." అని ఏడవటం మొదలుపెట్టాడు.

    "అసలేమయింది బాబూ... మేం దెయ్యాలం కాము. మా కాళ్ళు చూడు... ముందుకే ఉన్నాయి" అన్నాడు ముత్యాలనాయుడు తన కాళ్ళు చూపిస్తూ.

    అతని కొక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. అంతలో అటుగా ఎవరో వచ్చారు. వాళ్ళనాపి అదే అడిగారు. అతనూ ఓ క్షణం అనుమానంగా చూసాడు.

    "ఏమైంది మీకు... యువరాజు తమ్ముడు రాజు గురించి అడిగితే ఎందుకలా ప్రవర్తిస్తున్నారు?" అంది ఇందుమతి అసహనంగా.

    "మాకేం కాలేదు. మీకే ఏదో అయింది. యువరాజుకి అసలు తమ్ముడు లేడు. యువరాజు, రాజు ఒక్కరే" అంటూ సముద్రంలోకి దూకేసే వాడిలా సముద్రంకేసి వడిగా సాగిపోయాడు రెండో వ్యక్తి.

    మొదటి వ్యక్తి అప్పటికే ముత్యాలనాయుడు కాళ్ళు పట్టుకుని అవి ఎటు తిరిగి ఉన్నాయోనని చూస్తున్నాడు.

    జరిగిందేమిటో వాళ్ళకో క్షణం అర్ధంకాలేదు. అర్ధం కాగానే బిత్తరపోయారు. ఒకరికేసి ఒకరు చూసుకుని ఒక్కసారే నవ్వుకున్నారు. "ఆ యువరాజో స్టుపిడ్... మనల్నెంత ఫూల్స్ ని చేసాడు. చూసావా ముత్యాలు" ఒకింత కోపంగా, ఉక్రోషంగా అంది ఇందుమతి.

    "కాదమ్మా... సెన్షాఫ్ హ్యూమర్ అని మీరంటుంటారే... అలాంటి కుర్రాడతను. నేను దాన్ని గురించి ఆలోచించడం లేదు. మనం చూస్తుండగానే ఐదుగుర్ని తుక్కు కింద కొట్టేసి అప్పుడే అంతలోనే ఆ హోటల్ కెప్పుడు చేరుకున్నాడు? చేరుకున్నా, అంతకు ముందేమీ జరగనట్టే జాలీగా పాటలు ఎలా పాడేస్తున్నాడో? బలమైనవాడే కాదు సరదా మనిషి కూడా. అంతేకాదు లేడిలాంటోడు. చాలా వేగం ఉందతని కాళ్ళల్లో. ఎప్పటికప్పుడే మర్చిపోక పోయినా తేలిగ్గా తీసుకొనే తత్వం ఉన్నవాడు. అతను మనకి సరిగ్గా సరిపోతాడు. మనల్ని రక్షించగలడనే నమ్మకం ఏర్పడింది. నిజాయితీ కూడా ఉంది. ఆ ముసలమ్మకి జరిగింది అన్యాయమని భావించబట్టే ఆ ఐదుగుర్ని కొట్టాడు. కరెక్ట్ మనిషే మనకి దొరికాడమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నాడు ముత్యాలనాయుడు ముందుకు సాగుతూ.

    సరిగ్గా అలాంటి భావాలే ఇందుమతిలోను చోటు చేసుకున్నాయి.

    "మనల్ని ఫూల్స్ ని చేస్తున్నట్లు ఏ మాత్రం పసిగట్టలేక పోయామే" అంది ఇందుమతి తన అమాయకమయిన మొఖాన్ని, మాటల్ని తలుచుకుంటూ.

    "చెప్పాను కదమ్మా- సరదా మనిషని- విశ్వరూపశర్మ సమర్థుడమ్మా- మీ నాన్నగారికి విశ్వరూపశర్మ గుర్తుకు రావటం మన అదృష్టం గొప్ప మార్గదర్శి మనకు దొరికాడమ్మా... సరిగ్గా మనకు సరిపోయే కుర్రాడ్ని చూసి పెట్టాడు... ఆయనకు ఐదు లక్షలివ్వటం తప్పేమీ కాదమ్మా... ఆయనకా అర్హత వుంది అన్నాడు ముత్యాలు వడివడిగా నడుస్తూనే.

    "ఎస్! ఆఫ్ కోర్స్!" అంది ఇందుమతి స్వగతంగా- లోలోన నవ్వుకుంటూ.

    ఆషామాషి మనిషి... విచిత్రమైన వ్యక్తిత్వం... అని అనుకుంది ఇందుమతి యువరాజుని తలుచుకుని లోలోనే.

    "కుర్రాడు జమాజెట్టీలా ఉన్నాడు. కరెక్టు మనిషి" మెచ్చుకున్నాడు ముత్యాలనాయుడు మరలా. ముత్యాలుకి యువరాజు బాగా నచ్చాడు.

    ఇందుమతి కూడా సంతోషంగా ఉంది.


                                       *    *    *    *


    "FROM TIMES WHEN FORTH FROM THE SUNLIGHT

    THE FIRST OF OUR KINGS CAME DOWN AND HAD THE EARTH HIS FOOTSTOOL

    AND WORE THE STARS FOR HIS CROWN"   

    పైకి గంభీరంగా చదివాడు విశ్వరూపశర్మ. కొద్ది క్షణాలాగి ప్రారంభించాడు. మానవ నాగరికతకు కొండ గుర్తు... పాడిపంటలు. అంటే... జలసమృద్ధి. పూర్వకాలంలో జలసమృద్ధి ప్రాంతాలనే సస్యశ్యామల ప్రాంతాలనేవారు... అలాగే మహానగరాలు, పట్టణాలు సుభిక్షంగా ఉన్నాయంటే అర్ధం... ప్రాధమిక అనవసరమైన నీరు... పరిపుష్టంగా లభ్యమౌతోందనే అందుకే సుమతి శతకకారుడు ఎడతెగని పారే ఏరు... అన్నాడు. నీటి ప్రాధాన్యత అంత గొప్పది.

    అలాగే పూర్వకాలంలో మహారాజులు కోటలకు నీటిసరఫరా విషయమై చాలా జాగ్రత్తలు తీసుకునేవారు... ఇప్పట్లా అప్పుడు ట్యూబులు, గొట్టాలు ఏమీ ఉండేవి కావు. అంతా మట్టే కదా... రిజర్వాయర్ల సిస్టమ్ అప్పటికే ఉంది. సుదూర ప్రాంతాల జలపాతాల దగ్గర్నించి తవ్వించిన కాలువలు కొన్ని మైళ్ళ తర్వాత ఒకచోట నీళ్ళు నిలువ కోసం ట్యాంక్స్ లాంటి గదులు వాటికి కాపలా లుండేవి. శత్రువులెవరైనా, నీళ్ళలో విషం కలిపితే... అందుకే రాత్రింబవళ్ళు... కాగడాల వెలుగులతో, నీళ్ళను ప్రాణంతో సమానంగా రక్షించుకునేవారు. 

    వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహిత్ ను మనం చూస్తే కోటల్లో నీటి సరఫరా విధానం ఎలా ఉండేదో మనకు స్పష్టంగా తెలుస్తుంది.

    మట్టిగొట్టాల్లోంచి నీటిని సరఫరా చేసేవారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా?

    ఇప్పుడు దేవులపల్లికోట నీటి సరఫరా విషయం మనం తెలుసుకుంటే... ఎక్కడెక్కడ రిజర్వాయర్లు ఉండేవో తెల్సుకుంటే... ఏ జలపాతం నుంచి దేవులపల్లి కోటకు నీరు పంపిణీ అయ్యేదో తెల్సుకుంటే ఆయా ప్రాంతాల ప్రజలతో, దేవులపల్లి కోటకు లింకులున్నాయనే విషయం మనకు తెలుస్తుంది... నిధి అన్వేషణకు మనకు ఒక దారి దొరుకుతుంది.

    నా పరిశోధన ప్రకారం...

    దేవులపల్లి కోటకు తాడిపూడి చెరువునుంచి నీటిసరఫరా జరిగేది. తాటిపూడి చెరువుకు నీరెలా వచ్చేది అంటే... వర్షపు నీరు మాట వదిలేసెయ్...

    జలపాతం నీరు ఎలా వచ్చేది... నిన్న రాత్రంతా నాకిదే పని... అసలు గుట్టు తెలిసింది.

    దబ్బలపాడుకి ఆనుకుని ఉన్న కొండల్లోంచి ప్రవహించే జలపాతం నీరు తాటిపూడి చెరువుకి వచ్చేదని... అంటే... దబ్బలపాడు జలపాతం దగ్గర ఆనాటి నీటి పంపిణీ విధానానికి సంబంధించిన రిజర్వాయర్లు- వాటిని సురక్షించడానికి ప్రజలు ఉండే ఆనవాళ్ళు దొరుకుతాయి.

    మన నిధి అన్వేషణలో గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్ దబ్బలపాడు జలపాతం" అని చెప్పడం ఆపాడు విశ్వరూప శర్మ.

    "అదెక్కడుంది" ప్రశ్నించింది ఇందుమతి.    

    "విజయనగరం జిల్లాలోని పెద్దమజ్జిపాలెం అన్న గ్రామానికి దాదాపు అయిదు మైళ్ళ దూరంలో ఉంది. విశాఖపట్నం జిల్లాలోని అరుకు నుంచి కూడా దారుంది.. అరుకు ఊరు నుంచి అరకు లోయలు పధ్నాలుగు మైళ్ళ పర్యంతం వ్యాపించి ఉన్నాయి. ఒక పక్క ఒరిస్సాకు దారితీస్తే, మరో పక్క మహారాష్ట్రకు దారితీస్తాయి" చెప్పాడు విశ్వరూపశర్మ.

    "మన నిధి అన్వేషణకు ఈ పధ్నాలుగు మైళ్ళ ప్రాంతాన్నే ఎంచుకోవాలంటారా" అడిగింది ఇందుమతి.

    "చెప్పలేం... ఇందూ! అప్పట్లో వన్యప్రాంతం వేరు... ఇప్పుడు వేరు. అప్పుడుండే కొండజాతులన్నీ... ఇప్పటికీ అక్కడే ఉంటాయన్న రూలేం లేదు గదా... సంచారం వారి జీవన విధానం... కరువొస్తే కదిలిపోతారు. ఇంకో పాయింటు... మీ మూలపురుషుడు అని చెప్పానే.. ఆదిత్య భూపతి... ఆయన వివాహం చేసుకున్న గిరిజన మహిళ స్వగ్రామం కంచూరువాక. ఒకప్పుడు అక్కడ ఆదిత్య భూపతిరాజా వారు ఒక సూర్యదేవాలయాన్ని కూడా కట్టించారట. ఆ గ్రామంలో మనకు చాలా సమాచారం దొరకవచ్చు. ఇంతకీ ఇప్పటికీ ఆ గ్రామం ఉంటే..." నవ్వుతూ అన్నాడు విశ్వరూపశర్మ.

    ఇందుమతి, ముత్యాలు అర్ధం కానట్లు చూసారు.

    "ఇలా చెప్తే... మీకు అర్ధం కాదు. నేనో మేప్ తయారు చేసిస్తాను. ఇకపోతే యువరాజు దొరికాడు. ఒప్పుకున్నాడు కనుక, ఆర్కియాలజీ డిపార్టుమెంటు వ్యక్తి దగ్గరకు ఎప్పుడెల్తారు" అడిగాడు విశ్వరూపశర్మ.

    "ఫోన్ చేసాను. మీ పేరు రిఫర్ చేసాను. సాయంత్రం నాలుగు గంటలకు రమ్మన్నాడాయన" చెప్పింది ఇందుమతి.

    "కపాలేశ్వర్... సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉన్నాట్ట. వస్తాడు. ఆ పని కూడా పూర్తయితే కరెక్ట్ ప్రోగ్రాం మనం పెట్టుకోవచ్చు" చెప్పాడాయన.


                  *    *    *    *


    కపాలేశ్వర్ కి ముప్పయి అయిదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉంటాడు. అతనికి ఇష్టమైన సబ్జెక్ట్ ఆర్కియాలజీ. ఆ డిపార్టుమెంటుకి కపాలేశ్వర్ పేరుని రికమెండ్ చేసిన వాడు కూడా విశ్వరూపశర్మే. కొన్నాళ్ళు బాగానే జరిగింది కానీ, మూడేళ్ళ క్రితం భీమునిపట్నం బస్టాండ్ కెదురుగా వున్న పూర్వకాలంనాటి సత్రం బాగా పాడైపోయి కూలిపోయి పడగా, ఆ గోడల్లో నిధి బయటపడిందని పుకారు రాగా కపాలేశ్వర్ బృందం అక్కడ కెళ్ళింది. మట్టి పాత్రల్లో నిక్షిప్తం చేసిన బంగారు నాణాలు నిజంగానే దొరికాయి కాని కపాలేశ్వర్ రెవిన్యూ డిపార్ట్ మెంటుతో కుమ్మక్కయిపోయి ఓ మార్వాడీ సేటుకి ఆ బంగారు నాణాల్ని అమ్మేశాడు. ఆ తరువాత అక్కడ ఏం దొరకలేదని, రిపోర్టు తయారుచేశారు. లోకల్ పోలీసులు ఊరుకోలేదు కేసును తవ్వారు దాంతో కపాలేశ్వర్ రెడ్ హేండ్ గా దొరికిపోయాడు. మార్వాడీ సేట్ లబోదిబో మన్నాడు. కపాలేశ్వర్ కి కోర్టు మూడేళ్ళు శిక్షపాటు శిక్ష విధించి జాబ్ నుంచి సస్పెండ్ చేసింది. అబిద్ నగర్లో ఎల్.ఐ.జి. అపార్ట్ మెంటులో ఉంటున్నాడు అని విశ్వరూపశర్మ చెప్పిన వివరాల్ని మననం చేసుకుంటూ అబిద్ నగర్ చేరుకుంది ఇందుమతి.

    కాలింగ్ బెల్ నొక్కింది.

    అప్పటికే రెడీ అయి కూర్చున్నాడు కపాలేశ్వర్.

    "నా పేరు ఇందుమతి" కూర్చుంటూ అంది ఇందుమతి.

 Previous Page Next Page