Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 21


    "ఆ బోగంకొంప ఆడదేనా?"
    "అవును. ఆమె ఆరు రోజులక్రితం వచ్చింది. నీవు కారుదెబ్బతిన్నావనీ. హాస్పిటల్లో ఉన్నావనీ చెప్పింది. తాను హాస్పిటల్లో పని చేస్తుందనీ నీవు నాకోసం పంపించావనీ బొంకింది."
    "అంతకు ఒక వారంక్రితం నేను ఉత్తరం వ్రాశానుకదూ."
    "ప్రమాదం ఒక్క రోజుక్రితమే జరిగిందని చెప్పింది. ఆమె నీదగ్గరినుంచి ఉత్తరం తెచ్చింది. కాగితంమీద హాస్పిటల్ ముద్రవుంది. నీ చేతిగాయం రాయనివ్వకుంటే వేరే వారు వ్రాశారని పలికింది. ఆ విధంగా ఆమె నన్ను వలలో ఇరికించింది. ఉక్కు పిడికిలి మీదికి......" ఆమె ధ్వని నీరసించింది.
    ఆ సంఘటనలు ఆమె కళ్ళముందు కనిపించాయి. రైలు ప్రయాణం. తండ్రిని గురించే ఆమెభయం. ఆమెను తెచ్చిన స్థలాన్ని గురించి తెలిసినప్పటి భీతాహం, లేఖ ఆ రాక్షసికాళ్ళు పట్టుకోవడం, అది తన్నడం, అది లేఖ ముఖాన్ని నేలకువేసి రక్తం వచ్చేదాకా కొట్టడం......
    "ఆపు నేను.......నే......ను ఇక వినలేను."
    లేఖ అతని మాటలు విననట్లే చెప్పుకొని పోతూంది. ఆమె కళ్ళు జ్యోతుల్లా మండిపోతున్నాయి. కాలూ ఆమె చేయిపట్టుకొని "చంద్రలేఖా! శాంతించు. పడుకో. నిద్రపో. నేను మూర్ఖుణ్ణి. ఇవన్నీ అడగడం నాదే బుద్దితక్కువ.
    లేక ఆగలేదు. ఆమె చెపుతూనే వుంది.
    మొదటి రెండురోజులూ బోగంకొంపలో లేఖ గదిలోనే గడిచాయి. తలుపులకు తాళాలు వేశారు. కిటికీలు మూసేశారు. అన్నద్వేషం పుట్టింది. తిండి తాకనైనా తాకలేదు. భయం ఆమె నరాల్లో విద్యుత్తులా ప్రవహించింది. వణకిపోయింది. తల్లికోసం ఏడ్చింది. ఆమె ఏడుపు అరణ్యరోదనం అయింది. "అమ్మా! ఆ.......... ఆ........."
    మూడోనాడు ఆకలిభరించలేక రెండు ముద్దలు తినేసింది. మరుసటి రోజు ఆ దెయ్యం రకరకాల తినుబండారాలు తెచ్చినప్పుడుకూడా తినేసింది. తండ్రికి ఈ విషయం తెలిసి ఎలాగో రక్షిస్తాడు అనే ఆశ ఆమెలో అంకురించింది. తాను ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు అతనికి తెలియకుండా ఎలా ఉంటుంది? తండ్రికి ప్రమాదం జరగలేదు. అతడు హాస్పిటల్లో లేడు. అది ఆమెకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ముండ అబద్దం ఆడింది.
    ఆ ఆశతోనే ఆమె అసువులు నిల్చాయి. అయిదోరోజు మధ్యాహ్నం రకరకాల తినుబండారాలు వచ్చాయి. ఆశగా తినేసింది. ఆనాటి సాయంకాలం ఆ రాక్షసి వెధవ కూతలన్నీ కూసింది. కొరడాతో కొట్టింది. ఆ తార్పుకత్తె లేఖ బట్టలు లాగేసి నీలిరంగు ఉల్లిపొర చీర ఇచ్చింది. అంతే మందపు దుస్తులిమ్మని లేఖ ప్రార్ధిస్తే అది లేఖమీద సువాసనద్రవ్యాలు చల్లింది.
    లేఖ ఆగింది. కన్నుపొడుచుకున్నా కనిపించని కారుచీకట్లో తండ్రీకూతుళ్ళు రాతిబొమ్మల్లా కూర్చున్నారు. భీకర నిశ్శబ్దం తాండవించింది. "అమ్మో! వద్దు" అనే లేఖ కేకతో నిశ్శబ్దం బద్దలైంది.
    కాలూ లేఖ చేతిని పట్టుకున్నాడు. ఆమె చేయి గడగడా వణికిపోతూంది. "చంద్రలేఖా! ఇకచాలు. మాట్లాడకు. పడుకో. మా అమ్మగా - పడుకో."
    "లేఖా! పడుకో. నేను నీపక్కనే కూర్చుంటా. కళ్ళు మూసుకొని నా కథవిను. వందమైళ్ళ ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేశానూ. నువ్వూ నేను ఎన్నడూ ముట్టనైనా ముట్టని అరటిపళ్ళు దొంగిలించానంటే నమ్మగలవా? తరువాత విను......"
    లేఖ అలసిపోయి కళ్ళు మూసుకుంది. కాలూ ఒక పక్కన కూర్చుని ఆలోచనలో మునిగిపోయాడు. రజనీ ఇంకొందరితో కలిసి పన్నుగడ పన్ని ఉంటాడు. ఈ దుర్మార్గం చేసింది వారే అయినా ఈ మహాపాపంలో తనభాగంకూడా ఉంది. ఆ బోగంకొంపల్లో తాను పనిచేసిన వేశ్యాగృహాల్లో - లేఖలాంటి అమాయికలు ఎందరు బలి అవుతున్నారో? ఆ విషయం తాను తెలుసుకోలేదు. తెలుసుకోదల్చలేదు. తన విటులతార్పుడేమో తానేమో వేరే విషయం అతడు అంటించుకోలేదు. తన సంపాదనలో కొంతభాగం వల్లోపడ్డ పిట్టల కవోష్ణబాష్పాలే అనే విషయం గుర్తుకు వచ్చేవరకు మూతపడే కంటికి మెళుకువ వచ్చింది.
    ఈ ఆలోచనలు అతనిగుండెను బాకుల్తోపొడిచాయి. ఊపిరి ఆడకుండా అయింది.
    నేనేం చేయాల్సి ఉండే? ఏం చేయాలి? ఎలా చేయాలి? నాతో ఈ నీచపుపని చేయించింది ఎవరు? ఎందుకు చేయించారు? దీనికి బాధ్యత ఎవరిది? వారే! వారంటే? వారెవరూ? పోలీసులా? జడ్జీలా? ధనికులా?
    తన రొంటిన ఉన్న డబ్బు కుళ్ళినమాంసంలాంటిది. దాన్ని తన కూతురుకు తినిపించొచ్చా?
    వాస్తవంగా కాలూ నేరం ఏమీ చేయలేదు. కాని సంఘం గుడ్లెర్రచేసి తన్ను దుష్టుని క్రింద లెక్కకట్టింది. తాను నిజంగా నీచకార్యానికి దిగినప్పుడు సంఘం, సమాజం చిరునవ్వుతో తనను ఆహ్వానిస్తూంది. డబ్బుకూడా ఇస్తూంది. వీధుల్లోని ఎముకల పోగులమీద మండిపడే పోలీసు తనకు మిత్రుడై "అన్నా! వ్యాపారం ఎలా సాగుతూంది?" అని అడుగుతున్నాడు.
    ఇదంతా అతనికి వింతగా కనిపించింది. సంఘం గౌరవంగా బ్రతకనివ్వడంలేదు. వారు తనను నేరస్థునిగా బతకమంటున్నారా? అవును. కాని ఎలాంటి నేరాలు చేయాలి? వారికి పనికివచ్చే నేరాలు. వారి కామతృష్ణతీర్చే నేరాలు, వారి బొజ్జనిండే నేరాలు.
    లేఖనుగురించి వారేమనుకున్నారు?
    వారేం జవాబు చెపుతారో తనకు తెలుసు. ఆమెకూడా వారి అవసరాలు తీర్చుకోవడానికి కీలుబొమ్మ కావాలి. ఆమెకు పతిత అని ముద్రవేసేశారు.
    ఆమెను కాపాడ్డంలో ఆలస్యం జరిగింది. ఆ దృశ్యం అతని కళ్ళముందు చమక్కున మెరిసేవరకు కాలూ ముఖం బిగుసుకుపోయింది. కొరడా ఝుళిపిస్తూ ఆ ముండ హుఁ నిన్నపుట్టినకూన నన్నే మోసం చేస్తుందీ? గజ్జికుక్క లా కక్కుతుందీ......?" అని గొణిగింది. కక్కిన ఆడదాన్ని ముట్టుకునేవాడు ఆ బోగంకొంపలో ఎవడున్నాడు? అందుకే ఆ వ్యక్తి కోపంతో కసురుకుంటూ బైట పడ్డాడు. చేతికి వచ్చిన డబ్బు జారిపోయినందుకు ఉగ్రురాలైన ఆడదాని కోపంకూడా అందుకు సాక్ష్యం పలుకుతూంది.
    లేఖను కాపాడ్డంలో ఆలస్యం కాలేదనడానికి దొరికే సాక్ష్యాలకోసం వెదుకుతున్నాడు. లేఖగుండెపగిలిపోయింది. వాడు ఆమెను తాకి ఉంటే అది వేయిచెక్కలు అయిపోయేది. అతనికి తన కూతురు శీలంమీద విశ్వాసం ఉంది. లేఖ ప్రశాంతంగా నిద్రించడం చూశాడు. అది అన్నిటికంటే ముఖ్యమైన సాక్ష్యం. అతనికి నమ్మకం కుదిరింది. విశ్రాంతి లభించింది.
    తాను ఆ దుష్టవ్యాపారంలో చేరడంకూడా ఒక అదృష్టమే! అలా కాకుంటే వందల కొద్ది ఇతర అబలలకు పట్టినగతే లేఖకు పట్టేది. బరువు దిగిపోయినట్లు ఒక దీర్ఘవిశ్వాసం వదిలాడు. దైవం ఎంత విచిత్రం అయింది? అతి క్రూరమైన ఆ దైవమే చివరి క్షణాల్లో ఆమెను కాపాడింది.
    భవిష్యత్తు? జీవించడం ఎలా? వీధుల్లో ఆకలి అగ్గిలా మండిపోతూంది. కట్టుగొయ్యకుకట్టి మరిచిపోయిన జంతువుల్లా, స్త్రీలూ, పురుషులు, బిడ్డలు, పొట్టల్లో పాపలూ మలమలమాది చస్తున్నారు. అలాంటి ఆకలి దావులకూ లేఖకూ మధ్య తన రొంటిన ఉన్న డబ్బే దూరం. ఆ కాస్తడబ్బు ఎంతకాలం వస్తుంది? అంతేకాక అందులో కొంత ఇంటిదగ్గర ఉన్న ముసలిదానికి పంపాలి.
    అయితే ఏంచేయాలి?
    అతని స్మృతిఫలకంమీద బి.10 మెరశాడు. బి.10 తనకు చూపినమార్గం! డబ్బు కావాలి. అంతే. అది ఉంటేచాలు. బి.10 చెప్పిన ప్రతి అక్షరమూ జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. గాడాంధకారంలో వెలుగులా బి.10 ఉపాయం అతన్ని ఆకర్షించింది. ఓహో! ఒక తంత్రం. గారడీ!! రెండు చేతుల్తోనూ తలపట్టుకొని కూర్చున్నాడు. డబ్బుకోసం రొంటిని తడుముకున్నాడు.
    దొరికింది. దోవదొరికింది. ఈ మార్గం పొట్టగడవడానికేకాక ప్రతీకారానికి కూడా పనికివస్తుంది.
    "మనను వారు పొట్టలో పొడుస్తారు. మనం వారిని వీపున గుద్దాలి.
    మనం వీపున గుద్దాలి."
    
                                        8
    
    ప్రచార సాధనాలేమీ లేకున్నా వార్త అగ్గిలా నాల్గు మూలలకూ పాకిపోయింది. రోడ్డుకు 20 గజాల దూరంలో ఉన్న మర్రిచెట్టుక్రింద ఆడ మగా అంతా గుమిగూడారు. అంతా ఎడతెరిపిలేకుండా శివనామం జపిస్తున్నారు. కొందరు కుర్రాళ్ళూ తిరుగుబోతులూ ఆలయం చుట్టూచేరి ఆదుర్దాగా చూస్తున్నారు. ఓపికగలవాళ్ళు మర్రిచెట్టెక్కి కూర్చున్నారు. కాళ్ళు చుర్రుమంటుండగా రోడ్డుమీదినుంచి వచ్చిన వృద్ధులు "స్వామి వచ్చేశాడా? మేము ఆలస్యం కాలేదుకదా?" అని ఆదుర్దాగా అడుగుతున్నారు.

 Previous Page Next Page