శృతి చేస్తున్న పని ఆపి సీతమ్మ దగ్గరకొచ్చి రెండు భుజాలమీద చేతులేసి, ముద్దుముద్దుగా అంది. "అక్కడికేదో నాకు హాయిగా వున్నట్టు, సంతోషంగా వెడుతున్నట్టు. ఏం మాటలమ్మా? ఒక్క రోజు నిన్ను చూడకపోయినా నాకు తోచదే. నీ చేతి భోజనం తినంది భోజనంచేసినట్టే వుండదే."
సీతమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పెళ్ళిచేసి అత్తవారింటికి ఎప్పుడు పంపుదామా అని ఆలోచించేదేగాని పరాయి వూళ్ళో, పరాయి పంచన పడి వుండడానికి కూతుర్ని పంపించవలసి వస్తుందని ఏనాడూ ఊహించలేదు.
శృతిమాత్రం సీతమ్మ మరీ భయపడుతుందని పైకి దైర్యంగా నవ్వుతూ ప్రయాణమవుతున్నదిగాని లోలోపల ఎన్నో ఆలోచనలు, ఏదో తెలియని పిరికితనం.
"పోమ్మా! ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకుని బాధపడితే నే వెళ్ళనుగాక వెళ్ళను" తను జాబ్ లో చేరడానికి ఎన్నో విధాలుగా మాట్లాడి తల్లిని వప్పించిన శృతి కరిగిపోయింది తల్లి కళ్ళలో నీళ్ళు చూసి.
అంత జాలిగా శృతి అంటుంటే సీతమ్మ కరిగిపోయింది. పిచ్చి పిల్ల. అది మాత్రం నన్ను విడిచి వంటరిగా ఎప్పుడైనా వుందా! అది చెప్పిందీ నిజమే. కొద్ది రోజులో, కొద్ది నెలలో కళ్ళు మూసుకుంటే వాళ్ళు ఒప్పుకొనేటట్టు చేయవచ్చు కాదంటే అప్పుడే చూసేది.
సీతమ్మ మనసు గట్టి చేసుకుంది.
"తల్లి ప్రాణం అలా అనిపిస్తుంది తల్లీ! నీ మనసు నాకు తెలియదా? వంటరిగా వుంటావని నీ గురించి బెంగ అంతేనమ్మా!"
"నాకేం ఫరవాలేదమ్మా! నా బెంగ నీ గురించి" అంది శృతి.
"నా గురించి దేనికి? ఉన్నవూళ్ళో వుంటాను. శ్రీదేవి వాళ్ళు వున్నారు. నీ వక్కడ వంటరిగా....."
"నే వెళ్ళేది అరణ్యవాసానికి కాదుకదమ్మా! అదో పెద్ద ఊరు. రాజభరణాలు రద్దయిన జమీందారీ కొంప. కాపురం చేసే మనుష్యులున్నారు. పదిమంది వున్నచోట భయమేముంది?"
"వాళ్ళ పద్దతు లేమిటో? ఉద్యోగానికి వెధవ కండిషన్లు."
"వంటరివాళ్ళయితే ఇంటిపట్టున పడి వుంటారనేమో!"
"అలా అని సమర్థించుకోవలసిందే."
శృతి మాట్లాడలేదు.
కొద్దిసేపు సీతమ్మ మాట్లాడలేదు.
"రైలు టయిమవుతున్నది. శ్రీదేవి వచ్చేస్తూ వుంటుంది. తొందరగా సర్దుకోమ్మా!" అంది సీతమ్మ.
శృతి మౌనంగా తనకు అవసరమయినవి బ్యాగ్ లోను, సూట్ కేస్ లోను సర్దుతూ వుండిపోయింది.
రెండువారాలక్రితం ఒక పేపరులో తమాషా అయిన ఉద్యోగం ప్రకటించబడింది. వెంకటాద్రిపురంలో జమీందారీ వంశస్తులైన రాజా నృసింహరాయభూపతిరావ్ ఇంట్లో ఉద్యోగం. పాతికలోపు ఆడపిల్లలకి మాత్రమే అర్హత. ఆ ఆడపిల్ల వంటరిదై వుండాలి. వివరాలు హొటల్ రాజ్ కమల్ లో వున్న రఘునందన్ తో సంప్రతించమని వుంది.
శృతి ఎంతో ఆలోచించి హొటల్ రాజ్ కమల్ కి బయలుదేరింది. ముందు జాగ్రత్తకి శ్రీదేవి నాన్నగారితో సంప్రతించి ఒక నిర్ణయానికి వచ్చే వుంది.
హొటల్ రాజ్ కమల్ నాలుగో అంతస్తులో ప్రయివేట్ రూమ్ లో రఘునందన్ ని కలిసింది.
రఘునందన్ జమిందారు గారింట్లో మేనేజరు, మనిషి హుందాగాను, అందంగాను వున్నాడు. చాలా మర్యాదగా శృతితో మాట్లాడాడు.
జమిందారుగారి కూతురు స్వాతి వయసు పద్దెనిమిది. పసితనంలోనే రెండుకాళ్ళూ చచ్చుపడ్డాయి. ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. ఆమెకో మంచి స్నేహితురాలు కావాలి. అహర్నిశలు ఆమెనే అంటిపెట్టుకుని వుండాలిట. పెద్దగా పనేమీ వుండదు. జీతం నాలుగొందలు. తిండి, బట్ట వాళ్ళే ఇస్తారు. ఆమెకోసం నియమించే మనిషికి నా అనే వాళ్ళుండ కూడదు. ఇదివరలో ఏర్పాటు చేసిన మనుషులవల్ల స్వాతి మనసు గాయపడిందేగాని ఫలితం లేకపోయింది. స్వాతి స్నేహపూరితంగా తనకోసం నియమించిన వాళ్ళపై మమత పెంచుకొని తన ప్రాణ స్నేహితురాలే అనుకుంటే వాళ్ళు తుర్రున ఏదో ఓరోజు ఎగిరిపోతూ వుండేవారు, అందుకు ఇప్పుడు కొత్త ఏర్పాటు చేశారు నా అంటూ ఎవరూ లేని వారినే స్వాతిదగ్గర వుంచుతారు. ఈ విశాల ప్రపంచంలో నా అంటూ ఎవరూ లేనివారు చాలామందే వున్నారు. స్వాతిదగ్గర వుండవలసిన అమ్మాయికి అందము, చదువు, చలాకీతనము, పాతికలోపు వయసు వుండాలి. ఇవిగాక కొన్ని కండిషన్లు వున్నాయి.
రఘునందన్ వివరంగా చెప్పి శృతినేదయినా అడగమన్నాడు.
శృతి అప్పటికప్పుడే ఓ నిర్ణయానికొచ్చి తనకో చిన్నమ్మ వుందని, ఆమె తన్ని పెంచి పెద్దచేసి చదివించిందని, నా అనే ఇలాంటి చిన్న అనుబంధం లేకుండా ప్రపంచంలో ఎవరూ వుండరని, ఆమెకి నెలనెలా జీతంలో కొంత డబ్బు పంపితే చాలని, స్వాతిని అంటిపెట్టుకొని వుంటానని చెప్పింది.
ఎంత ప్రయత్నించినా అన్ని అర్హతలతో స్వాతికోసం ఏ అమ్మాయీ దొరకలేదు. అన్ని విధాలా శృతే బాగుంది. అప్పటికే విసిగి వేసారిన రఘునందన్ కొన్ని కండిషన్లు పెట్టి శృతికి ఆ ఉద్యోగం ఇచ్చాడు. స్వాతిని వదిలిపెట్టి పోరాదు. ఉద్యోగంలో చేరిన తరువాత శృతి చిన్నమ్మకి డబ్బు పంపవచ్చు. కాని ఆమెను కలుసుకునే ప్రయత్నం చేయరాదు. ఇవన్నీ గట్టిగా చెప్పాడు.
అన్నింటికీ అప్పటికి ఆమోదం తెల్పి ఇంటికొచ్చింది శృతి.
అబద్ధాలాడి ఈ ఉద్యోగంలో చేరాలి. అది తెప్పే, కానీ తప్పదు. ఇది వదులుకొని వున్న డబ్బు ఖర్చయి వీధినిపడే బదులు ఆ జమిందారింట్లో చేరి మంచితనంతో అందరినీ వప్పించి అందరి తలలో నాలుక అయి సమయం చూసి నిజం చెపితే వాళ్ళు తనను అర్థం చేసుకుని ఆదరిస్తారు. ఇలా ఆలోచించిన శృతి ఎంతో కష్టంమీద తల్లిని వప్పించింది.
ఇది ప్రమాదంతో కూడుకున్న పనేమో అని సీతమ్మ భయం. కానీ తలొగ్గక తప్పలేదు.
శ్రీదేవి వాళ్ళు సీతమ్మని తమ ఇంట్లో ఉండమన్నారు. ప్రస్తుతానికి ఈ యిల్లు కదలనని, శ్రీదేవి కనబడి వెళుతుంటే చాలునని అంది సీతమ్మ.
ఈరోజు ఇక్కడ బైలుదేరి రేపటికి వెంకటాద్రిపురం చేరి ఈ విచిత్రమైన ఉద్యోగంలో చేరుతుంది శృతి. ప్రయాణానికి కావలసినవి తనకి రోజూ అవసరమయేవి సర్దుకుంది.
"ఎంతవరకయింది?" అంటూ శ్రీదేవి వచ్చింది.
"ఇదిగో ఇప్పటికి సామాను సర్దటం , అమ్మకి నచ్చ చెప్పటం అయింది" అంటూ సూట్ కేసు తాళం చేసింది శృతి.
"వీవిలా ఒంటరిగా వెళ్ళటం నాకూ కష్టంగానే వుంది శృతీ! ఎంత ప్రయత్నించినా ఈ చుట్టుప్రక్కల చిన్న జాబ్ కూడా దొరకలేదు.
"నా జాతకం అంత దివ్యంగా ఉంటే నువ్వు బాధపడి ప్రయోజనం ఏముంది శ్రీ! అంతా మన మంచి కేనని ఇదెందు కొచ్సిందో చూద్దాం. మంచి మర్యాద సమంగా ఉంటే ఉండి పోతాను. లేకపోతే ఓ గుడ్ బై కొట్టి వచ్చేస్తాను. అమ్మని జాగ్రత్తగా చూడటం, పట్టుబడని విధంగా నే లెటర్ రాయగానే నీవు రిప్లయి ఇవ్వటం చెయ్యి చాలు."
"ఇప్పటికిది ఏ వందోసారో చెప్పటం."
"ముందు జాగ్రత్త" అంటూ శృతి నెమ్మదిగానవ్వింది.
"అన్నయ్యగారికి చెప్పావా?" అంటూ సీతమ్మ పలకరించటంతో శ్రీదేవి ఆవిడతో మాట్లాడుతూ వుండిపోయింది.
ఇంకో గంటకి తను బైలుదేరి వెళ్ళిపోతుంది. ఇహ తన తల్లికి కూతురైనా కొడుకైనా శ్రీదేవే. కొడుకు అనుకోగానే సిద్దార్థ గుర్తుకొచ్చాడు శృతికి, హృదయాన్ని ఎవరో పట్టి పిండివేస్తున్నాట్లయింది.
"ఏమిటో అంత దీర్ఘాలోచన?" శృతి భుజంపట్టి కుదుపుతూ అడిగింది శ్రీదేవి.
గతంలోంచి బైటపడింది శృతి.
17
వెంకటాద్రిపురానికి రైలుమార్గం లేదు బస్సు సౌకర్యం ఒక్కటే. బస్సు స్టాండింగ్ అంటూ వేరే లేదు. బస్సు ఆ రూట్ లో వెళుతూ రోడ్డుమీద ఆగుతుంది. ప్రయాణీకులు దిగి రోడ్డుకి ఎడంవేపు పొలాలు, నల్లచెరువు వున్నాయి.
బస్సు ఉదయం ఏడు గంటలవేళ వెంకటాద్రిపురంలో ఆగింది.
చంకన ఎయిర్ బ్యాగ్, చేతిలో సూట్ కేసుతో బస్సులోంచి దిగింది శృతి.
మరో యిద్దరు దిగారు.
బస్సు దుమ్ము రేపుకుంటూ హారను మోగించి ముందుకు పరుగు తీసింది.
పరిసరాలు గమనిస్తూ ఊళ్ళోకి బైలుదేరింది.
దోవన నడిచేవాళ్ళు ఈ కొత్తపిల్ల ఎవరా అన్నట్లు ఆగి మరీ చూసి పోతున్నారు.
రాజానృసింహరాయ భూపతిరావ్ ఇల్లెక్కడ అని అడిగిందే తడవు బహు జాగ్రత్తగా తోడువచ్చి వారిల్లు చూపించారు కొందరు.
పల్లెసీమలే దేశ సౌభాగ్యం అన్నమాట ఎంత నిజం? అనుకుంది శృతి.
ఏ వీధులు చూసినా శుభ్రంగా చిమ్మి పేడనీళ్ళతో సిమెంటు తాపడంలా చేసి నయనాలకి విందులా పెద్ద పెద్ద ముగ్గులు. వాహనాలు లేకపోవడంవల్ల ధ్వని కాలుష్యం లేక పోవటం, వాయుదేవుడి స్థిరనివాసం ఇక్కడే అన్నట్లు చల్లని గాలి, కొత్త గాలి శృతికి కొత్తగానే వుంది.
వాకిట్లోనే వున్న నౌకరు శృతి చేతిలో పెట్టె అందుకుని శృతిని వెంటబెట్టుకుని లోపలికి దారితీశాడు.
రాజాగారిది పూర్వం కట్టించిన ఇల్లయినా ఆధునికం గానే వుంది. ఇప్పటి ఫాషన్లు అనుకరించి పైపైనరీ మోడల్ చేశారు. ఆ పెద్దై ఇల్లు రెండంతస్తులది. లోపల గదులెన్ని వున్నాయన్నది ఊహించటం కష్టం. పల్లెటూళ్ళలోకూడా కరెంటు రావడంవల్ల ఇంటికి కరెంటు పెట్టించారు. వాకిట్లోనే ఎదురయిన టెలిఫోన్ పోల్ చూసి "ఓహొ. ఈ యింట్లో ఫోన్ కూడా వుందన్నమాట అవసరానికి ఉపయోగపడుతుంది. మంచిదే" అనుకుంది శృతి.
ఇంటి చుట్టూ ఎటు చూసినా రెండు వందల గజాల స్థలం వదిలేశారు. ఖాళీ స్థలంగా గాక రకరకాల పూల మొక్కలతోను, కొన్నిపళ్ళ చెట్లతోను క్రమపద్దతిలో వుంచటంవల్ల ఆ యింటికి మరింత అందాన్ని తెచ్చి పెట్టాయి.
ఒక్కో గదినీ దాటుకుంటూ మధ్య హల్లోకొచ్చారు. అన్నింటినీ పరిశీలనగా చూస్తూ నడుస్తున్నా శృతి నౌకరు ఆగడంతో తనూ ఆగింది.
"యీ రేనేంటి అమ్మాయిగారి కోసం వస్తారన్న అమ్మ" బొంగురుస్వరంతో తారునలుపులాంటి ఓ రుబ్బుడు పత్రం ఆడమనిషి అడిగింది.
"అవునే రంగమ్మా! బస్సు దిగి యింటికొచ్చేశారు. అయ్యతో చెప్పు" అని కూర్చోండమ్మా ఆ కుర్చీలో" అన్నాడు నౌకరు.
"ఆహా, చూడంగానే అనుకున్నాలే. అన్నట్లు మర్చేపోయ్యా శాయన్నా! పెద్దయ్యగారు నిన్నోసారి రమ్మన్నారు." అంది రంగమ్మ.
"నీ మతిమరుపు తగలబడ. ఇప్పుడా, నే కనపడ్డ తర్వాత చెప్పటం?" అంటూ కంగారుగా పరుగు తీశాడుశాయన్న.
ఏం మాట్లాడకుండా రంగమ్మ లోపలి కెళ్ళింది.