25
సీత తాపీగా కూర్చుని సుష్టుగా కాఫీ, టిఫెన్ తింది.
"మొదట్లో నాకేం వద్దన్నావ్? కాఫీ తాగమన్నా అదీ తోసేషావ్ ఆకలయిందా సీతా?" అరుంధతి కావాలని వ్యంగ్యంగా అంది.
"ఇందాక ఆకలిలేదు. ఇప్పుడు మీకో వాగి వాగి కడుపు. నోరు ఖాళీ కాగా, టిఫెన్ తిన్నాను." అంది సీత.
"ఏ మాటకీ తడుముకోవు. మాటకి మాట వేస్తావు. గడుసుదనం ఆత్మాభిమానం, లాంటివి బాగానే వుంనాయి." అంది అహల్య.
"రవ్వంత పొగరుకూడా...." అంది సుమతి.
"ఎలా కనిపెట్టావ్?" అడిగింది లక్ష్మి.
సుమతి ఏదో చెప్పబోయింది. ఈ లోపలే సీత సీత అందుకుంది.
వెరీ సింపుల్, నా ముఖం చూచిన ఎవరైనాసరే. ఈ పిల్లకు రోషం, పొగరు, గర్వం, బోలెడు, అనేస్తారు. మా ఇంట్లో నాకు గడుగ్గాయని పెరెలాగూ వుంది." అని సీత నాలుక కొరుక్కుంది.
"ఆ....మార్చేపోయ్యాం, మా కథలన్నీ వివరంగా చెప్పాము. నీ కథ చెప్పలేదేం సీతా?" అంది అరుంధతి.
"మనం అడగలేదుగా?" అంది సరస్వతి.
"అవునవును అడగలేదు కదూ? మందే పొరపాటు. చెప్పు సీతా కథేమిటో?" అడిగింది అహల్య.
"నా కథా? నా కథ......ఆ.....పద్నాలుగేళ్లు వనవాసం వచ్చాను. రావణుడి కంట పడ్డాను. అశోకవనానికి చేర్చబడ్డాను. ఇదీ కథ, ఇహ జరగబోయే కథ.....వార్, అంటే యుద్దము." అంది సీత.
"వేళాకొళం కథ ఎందుకుగాని నీ కథ చెప్పు. ఇంట్లోంచి ఎవరినన్నా తీసుకుని పారిపోయి వచ్చావా?"
"మొగుడుంటే వాడినే వదిలేసి వచ్చావా?"
"సినిమాలో చేరాలని కొందరు ఇల్లొదిలి వస్తుంటారు. అలా వచ్చావా?"
"చెప్పు......"
"నీ కథ చెప్పు."
"క్విక్....క్విక్....."
సీత చుట్టూ మూగి సీత కథ చెప్పమని బలవంతం చేశారు.
"చెప్పక తప్పదా?" అంది సీత.
"తప్పదు." ఏక కంఠంతో అన్నారు అందరూ.
అయితే నన్ను కాస్త ఆలోచించుకొనివ్వండి, చెపుతాను.
"అలాగే." అందరి తరపున అరుంధతి అంది.
సీత చెంపన చెయ్యి చేర్చుకుని ఆలోచించింది. తన గురించి చెప్పటానికే నిర్ణయించుకుంది.
"మీకు నా కథ నచ్చకపోవచ్చు ఎందుకంటే, ఏ ప్రత్యేకతాలేనిది నాకథ. మాది గౌరవనీయమైన పెద్ద ఫామిలీ. ఇళ్లు, పొలాలు, పలుకుబడిలాంటివి కొన్నున్నాయి. మా నాన్నగారు, పెదనాన్నగారు, పిననాన్నలు ఇద్దరు. అంతా కలసి నలుగురన్నదమ్ములు, పెద్దాయనకీ, ఆఖరాయనకీ డబ్బు కాపీనం ఎక్కువ. నాన్నగారికి, పెద్దతమ్ముడికీ దానధర్మాలు ఎక్కువ. ఆస్తులు పంచుకుని విడిపొయ్యారు. నాన్నగారు సగం ఆస్తీ దానధర్మాల పేరిట హారతి కర్పూరం చేశారు. హార్ట్ ఎటాక్ వచ్చి మరణించారు. అమ్మ పుట్టిల్లు చేరింది. మేము ముగ్గురం అప్పచెల్లెళ్ళము. అమ్మ, అక్క, మెతకమనుషులు. నేనూ, చెల్లీ అప్పుడప్పుడూ కాస్త గందరగోళం లేవదీసే రకం.
మా మామయ్య పేరుచెప్పుకుని రోజూ దీపం పెట్టుకుని దండం పెట్టుకోవచ్చు. నాన్నగారు పోయిం తరువాత మా ఆస్తి తన ఆస్తిలో కలుపుకుని ఉచితంగా తన మంచితనంతో మమ్మల్ని పోషిస్తున్నట్లు మాటకు ముందు గుర్తు చేస్తుంటాడు అంతటి మహా మంచి మనిషి. పొలాలమీద ధాన్యం వస్తుంది. నగదు డబ్బు కలిపి ఎనభై వేలదాకా వుంది. అందరం ఆడవాళ్ళం అమ్మ నోరులేనిది. మామయ్య పిడికిటిలో బంధింపబడ్డాము.
నన్ను చదివించాడు. అక్కని ఓ పనికిమాలిన వాడికిచ్చి పెళ్ళి చేశాడు. పెళ్ళికి ఇరవై వేలయిందని లెక్కచెప్పేవాడు. ఎవరూ అడగక పోయినా, నాన్నగారు పోయింతరువాత మా దర్జా, గౌరవం పోయింది. మాకు డబ్బుండి మామయ్య దయాధర్మంమీద బ్రతుకీడ్వవలసి వచ్చింది.
అక్క పెళ్ళయి కాపురాని కెళ్ళింది. బావ కర్కోటకుడు. అక్క అత్తగారు సినిమాలో సూర్యకాంతం. అక్క పెళ్ళివల్ల అమ్మకి, అక్కకి మిగిలింది వేదన, కళ్ళనీళ్లు. ఇదిలావుంటే.....మా మామయ్యకో సుపుత్రుడున్నాడు. పేరు సింగయ్య, తట్టెడు చెముడు, ఓ కన్ను మెల్ల మామయ్యకి పెద్దకొడుకు, అక్కనిచ్చి పెళ్ళి చేద్దామంటే అక్క సింగయ్య కన్నా రెండేళ్లు పెద్దదయింది. నన్ను సింగయ్యకిచ్చి పెళ్ళి చెయ్యొచ్చు సింగయ్యకన్నా రెండేళ్ళ చిన్న నేను.
ఓ రోజు మామయ్య పెళ్ళిప్రసక్తి ఎత్తాడు. అమ్మకీ పెళ్ళి ఇష్టం లేదు. అలా అని నోరేత్తేదమ్ములేదు. నేనే తెగేసి చెప్పాను. "సింగయ్యని చేసుకోను. ఇంకో సింగినాదాన్నిచేసుకోను, చదువుకుంటాను." అంటే......"ఇక్కడున్నంతవరకూ చదివావు. పెళ్ళి చేసుకుని ఈ ఇంటి కోడలివి కావాల్సిందే. అన్నాడు. ఒకవేళ పెళ్ళంటూ చేసుకున్నా సింగయ్యని చేసుకోను. మనసులు కలిసిన తర్వాతే మనువు." అన్నాను.
చిలికిచిలికి గాలివానయింది. అన్న కొడుకైనా కూడా అమ్మకి ఇష్టంలేదు, నేను సింగయ్యని చేసుకోటం, ఎటూ మాట్లాడలేక, ఎదిరించలేక బాధపడుతుండేది.
"మీ డబ్బంతా మీరు ఇన్నాళ్ళు తిని పడున్నందుకు సరిపోయింది. సీత నా కోడలయితే, జీవితాంతం నిన్ను భరించి, దాన్ని కూడా ఓ ఇంటి దాన్ని చేసి సలక్షణంగా పంపుతాను. ఇక్కడుంటారా? పోతారా? ఆలోచించుకోండి." అన్నాడు మామయ్య.
కట్టుబట్టలతో ఎక్కడికి పోతాం..... పెదనాన్నకి, చిననాన్నలకి లెటర్స్ చాటుగా రాశాను. ఎవరూ సాయం చేస్తామని జవాబివ్వలేదు. మామయ్య నా పెళ్ళికి ముహూర్తం పెట్టించాడు.
నా దృష్టిలో ఇష్టం లేకుండా భర్తతో కాపురం...... వ్యభిచారం లాంటిది. శారీరకంగా, మానసికంగా వేశ్య ఇష్టపడి విటుడి వద్దకు పోదు. అలాగే ఇష్టం లేని భర్తతో సంసారం శారీరకంగా, మానసికంగా అయిష్టతతో చేయటమే!
సింగయ్యకి అంగవైకల్యమని అసహ్యించుకోటం లేదు. ఐదో తరగతి దాటి చదవని సింగయ్య- ముక్కులో పక్కులు గిల్లుకుంటూ, ఆడంగి కబుర్లు చెపుతూ, మాటకు ముందు తల గోక్కోటం, లూజుగా వున్న పొట్టి నిక్కర్లు, పాతికేళ్లు వచ్చినా పసిపిల్లాడిలా కోతి కొమ్మచ్చి. ఆటలు.... ఆ వెర్రి బాగులవాడిని పెళ్లాడటమా? నా కంఠంలో ప్రాణం వుండగా జరగని పని?
ఓ పక్క నా ఇష్టం లేకుండానే పెళ్ళిపనులు జోరుగా సాగుతున్నాయి. సాయం పలికే మనుషులు లేరు, స్వాతంత్ర్యం లేదు, చేతిలో పైసా లేదు. ఏం చేయాలి? ఓ నిర్ణయానికొచ్చాను.
ఇంట్లో నలభై రూపాయలు మాత్రమె చేతికి చిక్కాయి. అవి తీసుకున్నాను. చెల్లాయితో చెప్పాను- "మామయ్య ఎన్ని మాటలన్నా మౌనం వహించి ఊరుకోండి. చిన్నాన్నల వద్దకెళ్ళి మన పరిస్థితి చెపుతాను. అక్కడ రక్షణ లేకపోతే, చడువుంది. ఏదో ఒక ఉదోగ్యం చూసుకుని నా కాళ్ళమీద నిలబడి, నిన్నూ, అమ్మని తీసుకెళతాను. నే ఇంట్లోంచి వెళ్ళినతర్వాత చాటుగా అమ్మ కొక్కదానికీ ఈ విషయం చెప్పు! నా గురించి బాధపడవద్దును. అక్కపెళ్ళివల్ల అమ్మకి ఓ బాధ ఏర్పడింది నా పెళ్ళి వల్ల నాకూ, అమ్మకు మరోరకం బాధతప్ప సౌఖ్యంలేదు. అందుకే వెళ్లానని చెప్పు." ఇలా అనగానే చెల్లాయి భయపడలేదు. "అలాగే అక్కా! నీ ఇష్టమే నా ఇష్టం." అంది.
ఓ అర్థరాత్రి ఇల్లు వదిలాను. మంచివాడనుకున్న చిన్నాన్న, కఠినంగా మాట్లాడి తరిమేశాడు. ఆఖరి చిన్నాన కఠినుడని తెలుసు. నాన్నగారు మరణించిన తర్వాత అక్కపెళ్ళికి చూశాను. సూత్రధారణ సమయానికొచ్చి అక్షింతలు జల్లి వెళ్ళిపోయాడు. ఎవరింటికీ వెళ్లదల్చుకోక విజయవాడలో రైలు దిగాను.
నన్ను ఆడుకున్న అంజమ్మ డబ్బు కళ్ళపడగానే సతీ అనుసూయకి అమ్మేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇదీ నా కథ. ఒక గౌరవకుటుంబంలో పుట్టి డబ్బుండి, చదువుండి, ఏమీ లేనిదానిలా ఈ వలయంలో చిక్కుకున్నాను. చెప్పండి, ఏం చేయాలి......?" సీత తన కథ ముగిస్తూ అంది.
"ఇక్కడే ఉండిపో!"
"మనసు కాస్త మార్చుకో, మా లాగా హాయిగా వుండొచ్చు.
"మీవాళ్ళని కూడా తీసుకురావచ్చు, కొన్నాళ్ళైన తర్వాత.
"మీ చెల్లెలు కూడా అందంగా వుంటే యీ వృత్తిలోనే దింపోచ్చు......"
"మళ్ళీ నోరెత్తారంటే పీక నొక్కేస్తాను. నా కథ చెప్పటమూ పొరపాటు, మీతో ఇంతసేపు వాగటం......మరింత పొరపాటు. పంది బురద మెచ్చుగాని, పన్నీరు మెచ్చునా అని మీకిదే స్వర్గం, నాకు కాదు." అంది సీత.
తర్వాత ఎవరెంత పలకరించబోయినా సీత పలకలేదు. టేబుల్ పై ఏదో మ్యాగ్ జెయిన్ వుంటే, అది తీసుకుని సోఫాలో నిగడదన్ని పడుకుని చదువుతూ ఉండిపోయింది.
సీతని పలకరించి లాభం లేదని వారిలోవారు ఏవేవో ముచ్చటించుకుంటూ, వాదించుకుంటూ వుండిపోయారు.
సీత మ్యాగ్ జెయిన్ చదువుతూ వుండిపోయింది.
26
"నీ మొండి పట్టుదల వదలనన్నమాట .........?" అంది సతీ అనసూయ.
"నీ మొండి పట్టుదల నువ్వు వదిలావా, నేనూ వదలటానికి......?" అంది సీత.
"నాకూ నీకూ పోలికెక్కడ?"
"నిజమే....మనుషులతో వ్యాపారం చేసేదానివి నువ్వు. నువ్వాడ దానివి కాదు. నీకు మనసు లేదు."
"ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?"
"ఆ.......సతీఅనుసూయ నామంబు గల, స్త్రీ హృదయం లేని ఓ బండరాతితో."
సతీఅనసూయకి సీత పీక మలిమేద్డామన్నంత కోసం వచ్చింది. వచ్చి గంటైంది. నయాన చెప్పినా భయాన చెప్పినా సీత మాటలకి లొంగటం లేదు. మాటకు మాట జవాబు చెపుతున్నది. నువ్వెంత అన్నట్లు మాట్లాడుతున్నది. పెద్ద పెద్ద స్మగ్లర్స్, రౌడీలు, కేడీలు, ఆఖరికి పోలీసులు, లక్షాదివతులు, కోటీశ్వరులు అందరూ గౌరవం ఇస్తారు. లొంగి వుంటారు. అలాంటివారితో ఒక్కమాట పడకుండా ఈ రోజు వరకూ గడిపింది. ఈ పిల్ల..... ఈ సీత..... జానెడు లేదు, తన్నో పురుగును చూసినట్లు చూసి మాట ఎదురు చేపుతున్నదే! దీన్నేం చెయ్యాలి?
సతీఅనసూయకి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు.
"నువ్వు నా ప్రాణం తీస్తున్నావు!" అంది సతీ అనసూయ, సగం ప్రాణం అప్పటికే పోయినదానిలా ముఖం పెట్టి.
"ఎందుకంత బాధపడతావ్! నీ ప్రాణం అంత తొందరగా పోదు. నన్ను వదిలేసెయ్యి." అంది సీత.
"డబ్బుపోసి కొన్నది, వదిలెయ్యటానికి కాదు. డబ్బు సంపాదించటానికి."
"నాపై నీకేం హక్కుందని కొన్నావు?"
"ఆ విషయం ఆడగాల్సింది అంజమ్మని."
"అలాగా.....అయితే అంజమ్మ వద్దకు పోదాం పద."
"అదేం కుదరదు....నోరు మూసుకు నా మాటింటే మంచిజరుగుతుంది. కాదంటే నీ ఖర్మ. నావద్ద కీచకులు, భీములు వున్నారు. ఓసారి వాళ్ళకప్పగిస్తే, చక్కగా ఒళ్ళు చదును చేసిపెడతారు. వాళ్లు మరీ మోటాళ్లు. ఒళ్ళూపై తెలియని వెధవలు.....ఓ పావుగంటకే నీ శరీరం సగం కొరుక్కుతిని వికృతం చేస్తారు, ఏమంటావ్?"
సీత సమాధానం చెప్పలేదు.
"చివరిగా అడుగుతున్నాను- నా మాట వింటావా? వినవా?"
"చివరిగానే చెపుతున్నాను. నీ మాట వినను.....వినను......"
"సరే, ఈ రాత్రికి సేంపిల్ ఓ గట్టివాడ్ని నీ గదిలోకి పంపుతాను. చూద్దాం......నీ పస తెలుస్తుంది, అప్పుడు ఆలోచిస్తాను నిన్నేం చేయాలో?" అంటూ కుర్చీలోంచి లేచింది సతీ అనసూయ.
సీత నిర్లక్ష్యంగా చూసి తనని కాదన్నట్లు ముఖం ప్రక్కకు తిప్పుకుంది.
కోపంగా సతీఅనసూయ గదిలోంచి బయటికెళ్ళింది.
'ఇప్పుడేం చెయ్యాలి.....??'
సీత దీర్ఘంగా ఆలోచిస్తూ వుండిపోయింది.