అల్లుడు గదివిడిచి వెళ్ళిందాకా ఆదిలక్ష్మమ్మ ఆ గదిలో అడుగుపెట్టలేదు.
15
వాసంతి అత్తవారింటికొచ్చి సరిగ నెలయింది.
వాసంతి అత్తగారు శ్రీదేవమ్మ పెద్దల్లోపెద్ద చిన్నల్లో చిన్నగా కల్సిపోయి మసలుకునే మనస్తత్వం గల మనిషి. శ్రీదేవమ్మకి ఆడపిల్ల అంటే ప్రాణం. ఆవిడ కడుపున పడ్డ అందరూ మగనలుసులే. నెలల పిల్లలుగానే అందరూపోగా శ్యాంసుందర్ వక్కడూ దక్కాడు. కూతురయినా కొడుకయినా శ్యాంలో చూసుకోవాల్సిందే. శ్యాం పసితనంలో శ్యాంకి గౌన్లువేసి క్రాపు చేయించకుండ జడవేసి ఆడపిల్లలేదనే కొరత కొద్దిగా తీర్చుకుంది. ఆడపిల్ల పుట్టకపోవటం కోడలనే దాన్ని ఫలానా విధంగా చూడాలనే అభిప్రాయంలేంది కాబట్టి వాసంతిని కోడలుగా చూసుకోవటంలేదు. ఇరవైఏళ్ళ కోడలు పిల్ల ఇంట్లో తిరుగుతుంటే చెట్టంత కూతురులా వుంది ఆవిడకి. వాసంతి "అత్తయ్యా!" అని శ్రీదేవమ్మని పిలుస్తుంది. శ్రీదేవమ్మ "వాసంతీ!" అనే పిలుస్తున్నది వాసంతిని.
ఇంట్లో వున్నది మొత్తం నలుగురు. శ్యాంసుందర్ తండ్రి భానుమూర్తి మితభాషి. అయినా సరదామనిషి. ఒక్కోసారి నలుగురు కల్సి సినిమా కెళతారు. ఒక్కోసారి నలుగురు పెద్దజంట ఓ సినిమాకి, చిన్నజంట వేరో సినిమాకి వెళతారు. ఇంటి విషయాలలో ఎవరికి ఏ పేచీలేదు. సినిమాలు అంటే కల్సి అందరూ వెళ్ళినా విడివిడిగా వెళ్ళినా చూసొచ్చినా సినిమాకథ సర్దాగా చెప్పుకుంటూ భోజనాలు కానిస్తారు.
పగలు శ్యాంసుందర్ కాలేజిలో లెక్చరరు కాబట్టి కాలేజీ కెళ్ళిపోతాడు. భానుమూర్తి తల్లితండ్రికి వక్కడే కొడుకు, తాతలు ఆస్తి కొద్దోగొప్పో వుంది. ఆయనే వుద్యోగము చెయ్యలేదు. ఉన్న ఆస్తిని పెంచనులేదు. తరిగించను లేదు. ఉద్యోగము పురుషలక్షణం అని కాకపోయినా ఊరికే తింటూ కూర్చోటం యిష్టంలేక శ్యాం లెక్చరరు పనిచేస్తున్నాడు. భానుమూర్తికి పేకాట అలవాటు. ఆ అలవాటులో డబ్బు మాత్రం పెట్టడు, తన వయసు స్నేహితులతో కాలక్షేపంగా ఆడుతుంటాడు. ఆ యింట్లో పగలు ఎదురెదురుగా వుండేది అత్తా కోడలు. ఇరువురికి పుస్తకాల పిచ్చి. మార్కెట్ లోకి వచ్చే కొత్త నవలలు వారమాస పత్రికలు ముందు ఈ ఇంటికే వస్తాయి. శ్రీదేవమ్మకి తెలిసినవారు చాలామందివున్నారు. వాళ్లు తరచు వచ్చిపోతుంటారు. వాళ్ళతోను పరిచయం అయింది వాసంతికి. మధ్య మధ్య అత్తాకోడలు కల్సి తెలిసిన వాళ్ళింటికి వెళ్ళి వస్తుంటారు.
అత్తగారంటే తాటకి భూతకి. అత్తగారింట్లో మెలగవలసిన జాగ్రత్తలు. భర్త అంటే చిన్న రాక్షసుడు, మామగారు కాలంతకుడు లాంటివి వాసంతి పుస్తకాలలో చదివింది, అవేం అత్తగారింట్లో ఒక్కటీ అనుభవానికి రాలేదు. పుట్టింట్లో ఉన్నట్లే అత్తగారింట్లోను వుంది. కొత్త దాంపత్యంలో అదనంగా తీపిగుర్తులు అనుభవాలు మధురానందలోకాల అంచులకి తీసుకెళుతున్నాయి.
ఈ నెల రోజుల్లోను శ్యాంసుందర్ వాసంతి మధ్య చిలిపి తగాదాలు తప్ప వేరే ఏ విధమైనవి జరగలేదు. చిలిపి తగాదా అప్పుడు శ్రీదేవమ్మ వాసంతి పక్షమే చేరుతుంది. ఈ రోజు అలాగే చేరింది.
శ్యాంసుందర్ కాలేజీనుంచి సాయంత్రం వచ్చాడు. ఉదయం తాలూకా చిలిపి తగాదా మళ్ళీ తలెత్తింది.
"అసలు నన్నడిగితే..." వాసంతి మొదలుపెట్టింది తన సహజ ధోరణిలో. శ్యాంసుందర్ అడ్డుతగిలి "నిన్నిక్కడ ఎవరూ అడగలేదు. ఊకదంపుడు వుపన్యాసం దంచకు" అన్నాడు.
"నాది ఊకదంపుడు వుపన్యాసమా! మీరు చెప్పండి అత్తయ్యా!" అంది వాసంతి.
శ్రీదేవమ్మ వాసంతి పక్షమే ఎప్పటిలా వహించి "చూడమ్మా శ్యామూ! నీవు కాలేజీలో లెక్చరిస్తావు కాబట్టి వాసంతి ఏం చెప్పినా ఊకపోట్టు తవుడు ఉపన్యాసం లాగానే వుంటుంది. అసలు నన్నడిగితే..." అంటూ ఆగిపోయింది.
"స్టాప్ ,స్టాఫ్" అని చేతులతో వారిస్తూ అరిచాడు శ్యాంసుందర్.
"ఏమయిందమ్మా శ్యామూ!" అంది శ్రీదేవమ్మ. మధ్య మధ్య ఆవిడ శ్యాంని అమ్మా అనే అంటుంది.
అసలు నన్నిడిగితే అని అటు వాసంతి అని ఇటు నీవు అదేమాట ఈ అలవాట్ల విషయంలో అసలు నన్నడిగితే..." శ్యాంసుందర్ మాట పూర్తికాకముందే శ్రీదేవమ్మ వాసంతి పడిపడి నవ్వటం మొదలుపెట్టారు.
"ఎందుకు నవ్వుతారు? ఏమయింది?" తెల్లపోయాడు శ్యాంసుందర్.
"అసలు నన్నడిగితే...ఆగండాగండి అడ్డుతగలకండి. ఇదేమాట మీరు అనబట్టి మేము నవ్వాము. అంతే. అతే కదత్తయ్యా!"
"అంతే అంతే" అంది శ్రీదేవమ్మ.
అసలు విషయం పోయింది. ముగ్గురం నవ్వుల్లో పడ్డారు.
16
శ్యాంసుందర్ వాసంతి కల్సి రాసిన ఉత్తరం చూసుకుని తల్లితండ్రి వచ్చిన్ నాలుగు రోజులుండి ఉదయం తిరిగి వూరికెళ్ళిపోయారు. ఆదిలక్ష్మమ్మ ఉన్న నాలుగు రోజుల్లోనూ ఏ నాలుగొందలసార్లో అంది. "వాసంతికి ఎలాంటి భర్త వస్తాడో, ఎలాంటి అత్తగారు వస్తారో అని భయపడని క్షణంలేదు. వాసంతి అదృష్టమే కాదు. మీలాంటి వియ్యాలవారు దొరకటం మా అదృష్టం. వదినగారూ? వాసంతి వక్కతే బిడ్డ కావడంతో గారాబంతో పెంచాము. చిన్నపిల్ల తప్పుగా మాట్లాడితే నాముఖం చూచి క్షమించండి."
ఆదిలక్ష్మమ్మ చాదస్తపు భయం చూసి నవ్వి అలాగే అన్నట్లు తల పంకించి వూరుకుంది శ్రీదేవమ్మ.
తను కాపురానికి వచ్చి మూడు నెలలు నిండలేదు. అత్తయ్య చెప్పినమాట తీసుకుని తను, శ్యామ్ లెటర్ రాయటం, అదిచూసి అమ్మా, నాన్నగారు రావటం చక్కగా వుంది. అమ్మే మరీ పిచ్చిభయంతో ఉరికే సోదిమాటలు. అమ్మ వెళ్ళేటప్పుడు అన్నిసార్లు జాగ్రత్తలు చెప్పటం ఏమిటి? చాదస్తం కాకపోతే!
కూతురు అత్తగారి తరపువాళ్ళని చూసి అంతగా వదిగివుండాలా? మనషన్న తర్వాత వ్యక్తి స్వాతంత్ర్యం వుండక, వాక్ స్వాతంత్ర్యం వుండక, ఆత్మాభిమానం వుండక ఇంక జీవించటం దేనికి? అత్తగారంటే ఆరళ్ళుపెట్టినా పడి, భర్తకి భయపడి చస్తూ డామ్ ఇన్ సల్ట్! అంతకన్నా చస్తే నయం. ఛాఛా! చావటం పిరికితనం, ఎదిరించాలి.
ప్రతి ఆడపిల్ల తనకి అన్యాయం జరిగినప్పుడు ఎదిరించి ఎదురుతిరిగి పోరాడితే ఆడదానికి అన్యాయం జరగదు. అత్తగారు గయ్యాళిగాను, భర్త పులిలాగాను ప్రవర్తిస్తారా? వాళ్ళూ మనుషులు కాదూ? ఇవతలివాళ్లు వదిగివుండబట్టే అవతలివాళ్ళు విజృంభించి వెర్రిపోకడలు పోతున్నారేమో.
అమ్మ అలా సిల్లీగ మాట్లాడటంవల్ల ఇక్కడ తన్ని అత్తయ్య, శ్యామ్ గర్వంతో మా అంత మంచివాళ్ళు లేరు అనరుకదా? మాటకుముందు అలా అంటే తనుమాత్రం ఛస్తే భరించలేదు.