Previous Page Next Page 
జన్మభూమి పేజి 12

    "అంటే ఇప్పటికీ పిల్లలని హైస్కూల్ దాకా కూడా చదివించలేదన్నమాట."
    "హైస్కూలేమిటి మామయ్యా. ప్రైమరీ స్కూలు మొహం కూడా చూడనివారున్నారు. పొలం పనులకి పిల్లలని తీసుకుపోతారు కూలీకి- ఆడపిల్లలయితే తల్లి పొలం వెడితే ఇంట్లో వంట, చిన్నపిల్లలని చూసుకుంటూ ఇంట్లో వుండిపోతారు.
    "గవర్నమెంటు ఇన్ని రకాలుగా ఇచిత విద్య అందించినా యింకా అందుకోలేని బీద స్థితిలో ఉన్నారన్నమాట పల్లెల్లో. దీనిగురించి మనం ఆలోచించాలి రంగా. ఊర్లో ఈ స్కూలుని ప్రతి ఏడు ఒకో క్లాసు పెంచుకుంటూ హైస్కూలు చెయ్యాలి. పిల్లలెవరూ బయటివూరికి వెళ్ళకుండా ఇక్కడే చదివే ఏర్పాట్లు చెయ్యాలి."
    మాటల్లో ఎలిమెంటరీ స్కూలు వచ్చింది. స్కూలంటే అంతా కల్సి రెండు గదులు, వెనక ఒక వరండా, ముందొక వరండా. ఎప్పుడు కట్టిందో పాతబడి. సున్నానికి నోచుకోకుండా, నేల అంతా గచ్చులూడి వుంది. ముందు వరండాలో చిన్న క్లాసు కాబోలు. గోలగోలగా అల, వల, తల అంటూ అరుస్తున్నారు. రెండు గదుల్లో పెద్దక్లాసు కాబోలు. ఒకోగదిలో పది, పదిహేనుమంది కూడా లేరు.
    వెనక వరండాలో మరో క్లాసు - ముందు గది ఆఫీసు గది కూడా కాబోలు. ఒక బీరువా, ఒక పాత కుర్చీ, టేబుల్ వున్నాయి. హెడ్మాస్టారు సాంబశివరావు కేశవరావుని చూసి సంభ్రమాశ్చర్యాలతో హడావిడిగా లేచి నుంచుని నమస్కారం చేశాడు. వెనక వరండాలో పాఠం చెపుతున్న టీచరమ్మ కూడా ముందు గదిలోకి వచ్చింది.
    "డాక్టరుగారా... నమస్కారం సార్... మా స్కూలు పావనమైంది మీ రాకతో. కూర్చోండి కూర్చోండి. పిల్లలూ ఈయన పెద్ద డాక్టరుగారు. మన వూరిలో ఉండడానికి వచ్చారు. నమస్కారం చెయ్యండి అన్నాడు. పిల్లలంతా 'నమస్తే' అని గోలగా అరిచారు.
    "ఏమిటి ఇక్కడ మాస్టార్లు మీరిద్దరేనా... ఎలిమెంటరీ స్కూలు అంటే ఐదుతరగతులుండాలి కదా."
    "అయ్యా డాక్టరుగారూ... ఏం చెప్పమంటారు... ఐదు క్లాసులన్నా పట్టుమని అరవై, డెబ్బయ్ మంది లేరు. ఏ టీచరుని పోస్టు చేసినా నెల, రెండు నెలల్లో శలవుపెట్టి పోతారు. మళ్ళీ పోస్టింగు అయి ఇంకెవరో వచ్చేవరకు మేం యిద్దరమే అన్ని క్లాసులకి చెప్పాలి. ఆ వచ్చినవారూ సిద్దంగా వుండరు. ఏదో మేం ఇద్దరం ఈ వూర్లో కొంప గోడు వుండబట్టి అంటిపెట్టుకుని వున్నాం. గవర్నమెంటు ఉచితంగా చదువు చెప్పిస్తాం అన్నా పంపరాయె పిల్లల్ని.
    మన ప్రజలు బాగుపడరండి... మన వూర్లు బాగుపడవు- మనదేశం బాగుపడదు. గుర్రాన్ని నీటివరకు తీసికెళ్ళగలం గాని బలవంతంగా నీరు తాగించగలమా చెప్పండి" చాలా నిస్పృహగా అనేశారు హెడ్మాస్టర్.
    "పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు ముందుకు ఎందుకు రావడం లేదన్నది మనం ఆలోచించాలి మాష్టారూ..." కేశవరావు సాలోచనగా చూశారు.
    "ఎందుకేమిటి, చదివి ఏం చేస్తారు? కూలి పనికెడితే నాలుగు డబ్బులొస్తాయి అనుకుంటారు."
    "అంటే వారి ఆర్ధిక స్థితి పిల్లలు కూడా పనిచేస్తేగాని జరగని స్థితిలో వుందన్నది మనం ఆలోచించాలి."
    "నిజమేననుకోండి! కాని నాలుగక్షర ముక్కలు నేర్చుకుంటే పిల్లలు బాగుపడతారు అన్నదీ ఆలోచించాలి గదండీ-"
    "మామయ్యా... ఒక సంగతి... వీళ్ళ నిస్పృహకి కారణం ఏమిటో చెప్పనా. వీళ్ళకి తమ పిల్లల్ని పెద్దపెద్ద చదువులు చదివించే తాహతు లేదు. మెట్రిక్ వరకు ఉచితంగా జరిగినా కాలేజి చదువుకి డబ్బుండాలి. వట్టి మెట్రిక్ చదివితే ఏ ఉద్యోగాలు రావు - ఇటు పొలం పని లేక అటు ఉద్యోగం లేక మధ్యస్థంగా వుండి పాడవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడనివారు అప్పులు చేసి, భూమి అమ్ముకుని పిల్లల్ని కాలేజి చదువులు చదివించాక, సరి అయిన ఉద్యోగాలు దొరక్క, చేసిన అప్పులు తీరక బాధపడి చదువుల్ని నమ్ముకునే కంటే తిండి పెట్టే భూమినే నమ్ముకోవడం మంచిదనుకుంటారు..."
    "అంటే చదువు జీవన భృతికి మాత్రమే కాదు, విజ్ఞానానికి అన్నది వాళ్లకి అర్థం కావాలి..." సాలోచనగా అన్నాడు కేశవరావు.
    "ఈ విజ్ఞానాలు అవీ కడుపునిండినవారు ఆలోచిస్తారు మామయ్యా! రెండు పూటలా తిండి గడిస్తే చాలు అనేవారు ఏం ఆలోచిస్తాడు..." రంగ అన్నాడు.
    "నీవు చెప్పిందీ నిజమే రంగా... ప్రతివారు కనీసం మెట్రిక్ వరకు చదవాలి. ఆ తరువాత పెద్ద చదువులు చదవకపోయినా ఏ వృత్తు విద్యో నేర్చుకోవాలి. తండ్రి పొలంలో రైతు అయితే కొడుకూ అదే చెయ్యొచ్చు. కాని ముందు కనీసం మెట్రిక్ వరకు ప్రతివారు చదవాలి అన్నది వాళ్లకి మనం అర్థం అయ్యేట్టు చెయ్యాలి- దానికి ఏం చెయ్యాలి అన్నది మనం ఆలోచించాలి."
    "డాక్టరుగారూ... మీరీవూరు దత్తత తీసుకున్నారనగానే మాలాంటి వారందరం చాలా సంతోషిస్తున్నాం. మీరు యీ వూరికి చెయ్యాల్సిన మొదటి పనులలో ఈ స్కూలు మరమ్మత్తులు. వర్షం వస్తే యిటు జల్లు అటు జల్లు. నీరు పైనించి కురిసి గదులూ తడుస్తాయి. చిన్నక్లాసు పిల్లలకి కూర్చునేందుకు చాపలన్నా లేవు. ఎప్పుడో స్కూలు ఆరంభించినరోజున వున్న బల్లలు, కుర్చీలు సగం విరిగాయి. బ్లాక్ బోర్డు అక్షరాలు కనిపించవు. గోడలు చూడండి పెచ్చులూడిపోయాయి."
    "గవర్నమెంటు మెయిన్ టినెన్సు ఖర్చులు ఇవ్వరా. మీరు పంచాయితీ ప్రెసిడెంటుకి కంప్లయింట్ ఇవ్వలేదా? వూరికో ఎమ్మెల్యే వున్నారు గదా వాళ్ళేం పట్టించుకోరా మరి" కేశవరావు సందిగ్ధంగా అడిగాడు.
    హెడ్మాస్టారు అదోలా నవ్వాడు. "అయ్యా...తమరు ఈ దేశంలో లేకపోవడం వల్ల ఈ దేశం స్థితిగతులు సరిగా తెలియవనుకుంటాను. ఎమ్మెల్యేలు ఎలక్షన్లప్పుడే కనిపిస్తారు. ప్రెసిడెంట్ కి చెపితే ఇదిగో రాశా అదిగో రాశా అంటాడు. గవర్నమెంట్ ఎంత గ్రాంట్ ఇస్తుందో, మధ్యలో ఎంత స్వాహా అవుతుందో తెలియదు. అప్పుడప్పుడు టీచర్లకి జీతాలే అందవు.
    ప్రభుత్వం మంచిపనులే తలపెడుతుంది. కాగితాలలో అన్నీ చక్కగా వుంటాయి. అవి కార్యాచరణలోనే సరిగా జరగవు. పట్టణాలలో ప్రైవేటు స్కూల్స్ ఉంటాయి. ఈ గ్రామాలలో డబ్బిచ్చి చదివేవారెందరు. అలాంటివారికి ఈ స్కూలే గతి. స్కూలు ఎలా వుంది, పిల్లలూ అంతే. చదవాలని వారికి, చదివించాలని తల్లిదండ్రులకి ఇలాంటిచోట చదువు చెప్పేందుకు టీచర్లకి ఎవరికీ ఉత్సాహం లేదు. ఏదో యాంత్రికంగా మా డ్యూటీ మేం చేస్తాం. డాక్టరుగారూ మీలాంటివారే ఏదో పూనుకోవాలి." నమస్కరిస్తూ అని గుమ్మందాకా సాగనంపాడు.
    "సరే చెప్పారుగా. నా ముందు ప్రయారిటీ లిస్టులో యీ విషయం చూస్తాను. ముందు వూరంతా చూసి అందరినీ కలిసి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ప్రణాళిక తయారుచేస్తాను. కాస్త ఓపిక పట్టండి మాస్టారూ..."
    "తప్పకుండా సార్ - ఆమాత్రం భరోసా మీరిచ్చారు. అదేచాలు!"
    "రంగా మన మూడో మజిలీ ప్రైమరీ హెల్త్ సెంటర్. విద్య, వైద్య మన దైనందిన జీవితంలో ముఖ్యమైనవి. ఈ రెండింటితోనే బ్రిటిష్ వారు మనదేశ ప్రజలని ఆకట్టుకున్నారు. మిషనరీల ద్వారా ఈ రెండింటికి ప్రాముఖ్యత యిచ్చి, వ్యాప్తి చేసి ఈ దేశంలో సుస్థిర స్థానం సంపాదించారు. దేవాలయం, విద్యాలయం అయింది. వైద్యాలయం చూద్దామా..." కేశవరావు నవ్వుతూ అన్నాడు. రంగా నవ్వాడు.
    "విద్యాలయం పేరు బాగానే వుంది కాని మామయ్యా. అది మన పక్క వూరిలో వుంది. మూడు మైళ్ళుంది. మధ్యాహ్నం చల్లబడ్డాక కార్లో వెళదాం..."
    అమెరికా హాస్పిటల్స్ లో పనిచేసినవాడివి, ఈ ఆస్పత్రి చూస్తే మూర్ఛ రాగలదు. అక్కడ ఏడాదికి పది నెలలు డాక్టరుండడు. ఎవరిని పోస్ట్ చేసినా నెలా, రెండు నెలలు కంటే వుండరు - ఓ కాంపౌండరు, ఒక ఆయా, ఒక నర్సు వుంటారు పేరుకి. ఆ నర్సు పురుళ్ళు పోస్తుంది. ఆ కాంపౌండరు వున్నంతవరకు రంగునీళ్ళు కలిపి ఇస్తాడు."

 Previous Page Next Page