మరోమాట మాట్లాడకుండా తల పంకించి వెళ్ళిపోయాడు సాత్యకి.
అరగంట గడిచింది విశాలమైన టేబుల్ ముందు కూర్చున్నాడు విశ్వాత్మ. హండ్రెడ్ వాల్ట్స్ హేంగింగ్ బల్బు కాంతి పైనుంచి టేబుల్ మీద మాత్రమే పడుతోంది. ఆ టేబుల్ మీద హైదరాబాద్ మ్యాప్.
ఆ మ్యాప్ వైపు నిశితంగా, పరిశీలనగా చూస్తున్నాడు విశ్వాత్మ. అతని చూపులు శిధిలమైన గోల్కొండ కోటలోని వివిధ భవనాల మీద వుంది.
విశ్వాత్మకు గోల్కొండ కోట అంటే చాలా ఇష్టం. ఒక మతానికి సంబంధించిన చక్రవర్తులుగా గోల్కొండ రాజులను చూడటానికి ఇష్టం వుండదు అతనికి.
దేశంలోని రాజులు, జమిందార్లు బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా మారిపోతూ, బానిసత్వానికి సలాములు చేస్తున్న పరిస్థితుల్లో- ఆ బ్రిటీషు పాలకులకు ఎదురుగా నిలిచి వారిని ముప్పతిప్పలు పెట్టి నైజాంను స్వంతంత్ర రాష్ట్రంగా ప్రకటించి, చివరకూ వ్యక్తిత్వం కోసం, స్వేచ్చ కోసం పోరాడిన అసలైన వీరులుగానే వారిని పరిగణిస్తాడు విశ్వాత్మ.
డెబ్భై నాలుగేళ్ళ కాలంలో గోల్కొండ కోటని చాలాసార్లు చూశాడు విశ్వాత్మ. ఆ కోటలోని రాజమహల్ ప్రాంగణం చాలా ఇష్టం అతనికి.
ఆ ప్రాంగణానికి కొంచెం దూరంలో పూర్తిగా శిధిలమైపోయిన గుహల్లోంచే ఒకప్పుడు చార్ మినార్ కి రహస్యమార్గం వుండేదని చెపుతారు.
ఆ రహస్య మార్గం మూసుకుపోవడానికి పూర్వం చాలాసార్లు సగం దూరం వరకూ వెళ్ళొచ్చాడు కూడా విశ్వాత్మ. చరిత్రపట్ల విశ్వాత్మకు చాలా ఆసక్తి వుంది.
చాలాసేపు ఆ మ్యాప్ వైపు, ఆ శిధిలాలవైపు చూసిన మీదట ఎట్టకేలకు ఒక నిర్ణయానికొచ్చాడు విశ్వాత్మ. తన భవిష్యత్ జననానికి సంబంధించి, తనని తాను నిరూపించుకోడానికి వీలుగా కీలకమైన సమాచారాన్ని ఆ రాజమహల్ ప్రాంతంలోని శిధిలాల్లో, రహస్యమార్గంలో నిక్షిప్తం చేయాలన్నదే ఆ ఆలోచన.
కీలకమైన సమాచారాన్ని ఏ రూపంలో నిక్షిప్తం చేయాలి? తను నిక్షిప్తం చేసే సమాచారం ముప్పై, నలభై ఏళ్ళ వరకూ పదిలంగా వుంటుందా? అలా వుండే అవకాశాలున్నాయా?
గోల్కొండకోట హిస్టారికల్ మాన్యుమెంట్ గా కేంద్రప్రభుత్వం గుర్తించింది కాబట్టి, ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీ దానిమీద వుండదు కాబట్టి తనే భయం లేకుండా రహస్య సమాచారాన్ని నిక్షిప్తం చేయొచ్చనే నిర్ణయానికొచ్చిన విశ్వాత్మ- గబగబా తన పర్సనల్ రూంలోకెళ్ళి బీరువాతీసి వెండితో తయారుచేసిన చిన్న బాక్సును బయటకు తీశాడు.
విశ్వాత్మకు అరుదైన అతి పురాతన నాణాలను కలెక్ట్ చేయడం ఒక హాబీ. ఎంతో ప్రయాసపడి అలా సేకరించిన నాణాలన్నిటినీ ఆ వెండి బాక్సులో వుంచాడతను. దాదాపు యాభై వరకు అరుదైన, అద్భుతమైన నాణాలు.
ప్రపంచ వ్యాప్తంగా కొన్నివేల సంవత్సరాలకు పూర్వం మారకం వస్తువుల రూపంలోనే జరిగేది. వ్యవసాయ ఉత్పత్తుల్ని యిచ్చి, కావలసిన వస్తువుల్ని తీసుకోవడం జరిగేది.
ఆ తర్వాతి కాలంలో మనిషి అవసరమే ద్రవ్యంగా మారింది. ఆ ద్రవ్యానికి రూపమే డబ్బు. నాలుగువేల అయిదువందల సంవత్సరాల క్రితం ప్రాచీన మెసపటోమియాలో వెండిని తూకంవేసి అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉపయోగించేవారు.
ఆ తర్వాత కాలంలో వెండి ప్లేటు, వెండి కత్తులు, వెండిని రకరకాల ఆకారాల్లో తయారుచేసి వాటి బరువు ఆధారంగా వినిమయం జరిగేది.
గవ్వలు, ఆల్చిప్పలు, రాళ్ళు, రాగికత్తులు డబ్బుగా చెలామణి అయ్యేవి. బంగారం అమల్లోకి వచ్చాక వివిధాకృతులల్లో బంగారం డబ్బుగా వినియోగం అయ్యేది. పదో శతాబ్దంలో చైనా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పేపర్ కరెన్సీని వినియోగంలోకి తెచ్చింది. 9x13 ఇంచెస్ లో చైనా మొదటి కరెన్సీ నోటును విడుదల చేసింది. అప్పట్లో వివిధ మత సంస్థలే కరెన్సీని వివిధ రూపాలలో విడుదల చేసేవి.
విశ్వాత్మ బిజినెస్ టూర్ కి ఏ దేశం వెళ్ళినా, ఆ దేశానికి చెందిన అతిప్రాచీనమైన నాణాలను ఎంత ధరకైనా కొని తెచ్చేవాడు. ఆ నాణాలన్నిటినీ ఎంతో కాలంగా పదిలంగా భద్రపరిచాడు.
వెండిబాక్సులోని ఒక్కొక్క నాణాన్నీ బయటకు తీసి చూస్తున్నాడు విశ్వాత్మ.
వాటిలో రెండు అరుదైన కాయిన్స్ బ్రిటన్ రాజరిక వ్యవస్థకు చెందినవి. 1489వ సంవత్సరంలో ఐదవ కింగ్ హెన్రీ విడుదల చేసిన 240 సిల్వర్ పెన్నీస్ విలువగల బంగారు నాణెం.
రెండవది విక్టోరియా మహారాణి తన రాజస్థానానికి వచ్చే సందర్శకులకు కానుకగా ఇచ్చే తన బొమ్మతో కూడిన అయిదు పౌండ్ల విలువగల బంగారు నాణెం అది 1849 కాలానికి చెందినది.
ఆ రెండు నాణాలు ఒక రాజరిక దర్పానికి నిదర్శనమైతే, రెండవది దాతృత్వానికి నిదర్శనం.
మెధలేటెడ్ స్పిరిట్స్ తో ఆ నాణాలను శుభ్రం చేసి మెత్తటి దూదితో వాటిని తుడిచి పేపర్ కవర్ లో వాటినుంచాడు. ఒక పేపర్ ని తీసుకొని దానిమీద తన పేరు, వయస్సు, ఇతర వివరాలను తనే టైప్ చేసి, ఆ పేపర్ ని నాణాలతోపాటు వుంచి, ఒక దంతపు పెట్టెను తీసుకొని, ఆ పెట్టెలో ఆ కవర్ని వుంచి, ఆ పెట్టెకు తాళం వేసి, ఆ తాళం చెవిని తన దగ్గర వుంచుకొని, ఆ పెట్టెను మళ్ళీ డస్ట్ ప్రూఫ్, ఎయిర్ ప్రూఫ్, యాసిడ్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అయిన స్పెషల్ మేడ్ పాలిథిన్ కవరులో పెట్టి అంచుల్ని వేడిచేసి మూసివేశాడు. అప్పటికి ఒక ప్రక్రియ ముగిసింది.
రెండో ప్రక్రియ దానిని గోల్కొండకోట రహస్యమార్గంలో నిక్షిప్తం చేయడం. గోడ గడియారంవైపు చూశాడు. రాత్రి పదిగంటలు దాటింది.
ఆ ప్యాకెట్ ను తీసుకొని ప్యాలెస్ లోంచి బయటకు వచ్చాడు విశ్వాత్మ.
ఆ సమయంలో అనూహ్యంగా విశ్వాత్మ బయటకు రావడంతో సెక్యూరిటీ గార్డ్స్ ఎలర్టయ్యారు. బిలబిలమంటూ ఆయనవైపు పరుగులు తీశారు.
కాంటెస్సా కారు. ఫ్రంట్ డోర్ తెరచి పట్టుకొని అప్పటికే కారు డ్రైవర్ సిద్ధంగా వున్నాడు.
"నో సెక్యూరిటీ... నో డ్రైవర్" కుడిచేతిని పైకెత్తి వారిస్తూ. ముందుకెళ్ళి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇగ్నీషన్ కీ తిప్పాడు. వెంటనే హెడ్ లైట్స్ ఆన్ అయ్యాయి. కారు స్టార్టయింది.
అప్పటికే మెయిన్ డోర్ ని ఆదరాబాదరాగా ఓపెన్ చేశారు సెక్యూరిటీ గార్డులు. కరు సర్రుమని దూసుకుని ముందుకెళ్ళిపోయింది.
డ్రైవర్, సెక్యూరిటీ గార్డులు, వంటరిగా డ్రైవ్ చేస్తూ ముందు కెళ్ళిపోతున్న విశ్వాత్మవైపు ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూశారు. రాత్రి 10-45 నిముషాలు. గోల్కొండకోట ప్రాంతం దట్టమైన నిశీధి ఛాయల్లో నిర్మానుష్యంగా వుంది.
ఏటవాలుగా నున్న గుట్ట ఎక్కడం వల్ల తీవ్రంగా రొప్పుతున్నాడు విశ్వాత్మ. ఆయనలో ఆయాసం అంతకంతకు రెట్టింపయిపోతోంది. వళ్ళంతా చెమటతో తడిచి ముద్దయి పోయింది.
శిథిలమైన రాజమహల్ కు కొంచెం దూరంలో, గోడ ప్రక్కన నుంచుని నలువైపులా చూశాడు.
చుక్కల్ని తురుముకొని వెన్నెల జలతారులా మెరుస్తున్న ఆకాశానికి పోటీగా- దీపాల తోరణాన్ని అలంకరించుకున్నట్లుగా మెరుస్తోంది హైద్రాబాద్ నగరం. చీకట్లో నగర సౌందర్యాన్ని చూస్తూ కాసేపు తన అలసటను మర్చిపోయాడు విశ్వాత్మ.