Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 17

 

        "ఆబల గడునేడ యెరుగని యాడుదాన
        మెలత నతిభీత నన్ను నమ్మించి తెచ్చి
        కాననంబులో గన్నులు కట్టి కాడు
        సరిచి నీకిట్లు పోజన్నె భావజన్మ!

        నిన్ను బాసి జీవింతునే నిముసమైన
        కామరహితంబుగా రతి గలదె యందు"
        అని వాపోయింది.
        ఎయెద బతి బోడగానక
        హా! యని యెలుగెత్తి దిక్కులద్రువగ నరచున్
        గూయిదు; మొరయిదు ; బలుమరు
        వా యుడుపక చీరు ; నేడ్చు ; వడి నాపోవున్.
    చివరకు "పుష్పకోదండ పల్లవచ్చత్ర మకర కేతనంబుల నచ్చుపడి యున్న " మరుని భస్మాకారం చూచి ఫాలనేత్రుని నేత్రాగ్ని జ్వాలలలో తన పతి భస్మమైనాడని నిశ్చయించి వలవల ఏడ్చింది.

        "గిరిజ నొడగూర్చి వరదుచే వరము వడయ
        నోవు బొమ్మని నమ్మి యేనున్నచోట
        నెట్టి విడుమర వచ్చె ; నీకెట్టి చావు
        సంభవించెనె మనసిజ చక్రవర్తి!"
        అంటూ గొంతెత్తి ఆక్రోశించింది.
        "నీ పరిరంభణంబు ధరణీ పరిరంభణమయ్యే సమ్మదా
    రోషిత శుష్కరోదనము రోదనమయ్యే" అని రోదించింది.
    తన భర్తను హరుని పైకి ఉసికొల్పి పంపిన దేవతల నుద్దేశించి -
    
    'అక్కట! వేల్పులారా! కుసుమాయుధు నారడిచావు చూచి మీ
    రిక్కడ మాయమైతి? రసమేక్షణ! మన్మధు నీరుసేసి నీ
    వెక్కడ పోయితయ్య? పొడవెవ్వరు జూపద కానలోన? నే    
    నెక్కడ సొత్తు? నాకు దెస యెయ్యదియో పలరాజ! చెప్పవే?"
    అంటూ వాపోయింది.
    రతీదేవి అర్తనాదాలకు తపోవనమంతా ప్రతిధ్వనించింది. మధుకణాలనే అశ్రుబిందువులు రాలుస్తూ , పక్షుల కలకల ధ్వనులతో ఆశ్రమవృక్షాలు కూడా దుఃఖించాయి.
    రతి శోకమయమూర్తిని  రాజకవిశేఖరుడు ఇలా వర్ణించాడు -

        తలకి కనుగవ గన్నీరు ధారలొలుక
        మేన బేర్పించు లురులంగ మెలత వొలిచే
        గీలు ప్రిదిలిన జలధార లోలి గలయ
        గ్రమ్మి చెదరేడు ధారాగృహమ్ము వోలె.
    రతీదేవి అర్తధ్వని ఆలకించి, వసంతుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వసంతుడిని చూడగానే రతి శోకం ఇనుమడించింది. అ లతాంగి రెండు చేతులతో తల బాదుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. తుదకు పతి ఎడబాటు సహింపలేని రతి అగ్నిప్రవేశం చేయటానికి సిద్దమయింది.
    అప్పుడు ఆకాశం నుంచి దివ్యవాణి ఇలా వినవచ్చింది -
    'ముల్లోకాలకూ హితం కలిగించటం కోసం త్రిలోచనుడు నీ భర్తను నీకు ప్రసాదిస్తాడు."
    దివ్యవాణి వాక్కులు విని, రతి మరణ ప్రయత్నం మానింది. వసంతుడు రతిని ఓదార్చి కుసుమాయుధుని పునరావతరణానికి ఎదురుచూస్తుండమని హితోపదేశం చేస్తాడు. రతి నిరతిశయ భక్తితో పరమేశ్వరారాధనం చేస్తుంటుంది.
    కొంతకాలానికి ఉమామహేశ్వరుల కల్యాణం మహా వైభవంగా జరుగుతుంది. సర్వేశ్వరుడు పార్వతీ సమేతుడై సుప్రసన్నుడై ఉన్న సమయం గుర్తించి హరి బ్రహ్మేంద్రాది దేవతలు కరములు జోడించి ఇలా విన్నవించుకుంటారు -
    
        "దేవకార్యంబుగా మహాదేవి తోడ
        మీకు సంగతి గావించి మెచ్చు వడయ
        వచ్చెగా కంగభవుడు , నిన్ నిచ్చ నెరిగి
        యెరిగి పై నేత్తిరా నెన్నియెడలు గలవు?"
    ఈ విధంగా విన్నవించి చిరవిరహోత్కంఠిత అయిన రతికి పతిని ప్రసాదించమని ప్రార్ధిస్తారు.
    పరమేశ్వరుడు కరుణార్ద్ర హృదయుడై అంగజుడు జగములకు అనంగుడుగానూ, రతికి మాత్రం సహజ స్వరూపుడుగానూ గోచరిస్తాడని వరం అనిగ్రహిస్తాడు.
    మరుక్షణమే మరుడు రతి ముందు స్వస్వరూపంతో సాక్షాత్కరిస్తాడు.

        మలయుచు బొలుపారు మకరకేతనముతో
                    నెలగారు గెందలి రెల్లి గ్రాల
        దళుకొత్తు నెత్తావి యలరంపపోదులతో
                       మేలిల్లు నించు విల్గేల నమర
        జెలరేగు నళి పీక కుల నినాదములతో
                      రాజకీలాలాప రవము లులియ
        వేచి సమ్మదలీల వీచు తెమ్మెరలతో
                      నలి వసంతుడు గూడి నడవనొండ
        కామసుఖములతో పూర్వకామకేళి
        కామచిహ్నములు మెయి సురంగంబు గాగ
        నెరయ గైసేసి జవనిక దెరచి వచ్చు
        చెలువుతో వచ్చి రతిమ్రోల నిలిచే మరుడు.
    రసమయమైన ఆ శుభసమయంలో రతి పొందిన ఆనంద పారవశ్యాన్ని నన్నెచోడ కవీంద్రుడు ఇలా వర్ణించాడు.
    తళుకొత్తెం దరహాస మాననమునం దట్టూర్చి పోమేన ము
    త్సులకల్ గ్రక్కున బర్వే; లోల నయనాంభోజాత పత్రంబులన్
    వెలరెన్ భోరన సమ్మదా శ్రుజల; ముద్వేగంబు రాగంబుగా
    నెలమోం , జిత్తము తత్ క్షణంబ రతి కాత్మేశావతారంబునన్.
    ఈ ప్రకారంగా గౌరీ శంకరుల కల్యాణమహోత్సవం మనసిజ పునరవతరణ మహోత్సవమై విశ్వకల్యాణ కారణమయింది.
    కుమార సంభవ మహాకావ్యంలో కవిరాజ శిఖామణి అయిన నన్నెచోడుని సువర్ణ లేఖిని రతీదేవి పాత్రను దిద్దితీర్చింది.
    చతుర్దాశ్వాసంలో పతికి హితోపదేశం చేసే ఆదర్శవతిగా, పంచమాశ్వాసంలో పతి వియోగంతో పరితపించే కరుణామయిగా, నవమాశ్వాసంలో నవనవోన్మేషం పొందిన నాధునితో కలిసి కళకళలాడుతున్న సాద్వీతిలకంగా రతీదేవి రసజ్ఞ పాఠకులకు దర్శనమిస్తుంది. 

 Previous Page Next Page