Read more!

వైభవ గోదావరి - 11 గోదావరి గలగలలలో పాపికొండల అందాలు

 

వైభవ గోదావరి - 11

గోదావరి గలగలలలో పాపికొండల అందాలు


 అందమైన గోదావరిమీద బోటులో ఉదయం 9-00 గంటలనుంచి సాయంత్రం 6-00 గంటలదాకా గడపటమంటే ఇష్టపడని వాళ్ళుంటారా? ఇవాళ పాపికొండల అందాలు చూద్దామనన్నానుకదా. పాపి కొండలకాపేరు ఎలా వచ్చిందో తెలుసా? కొండల మధ్య ప్రవహించే గోదావరి మన జుట్టుకు తీసుకునే పాపిడిలా వుంటుందని పాపిడి కొండలు అన్నారుట. అది జనాల నోళ్ళల్లో పాపికొండలయింది. సరే పదండి...ప్రయాణం ఏర్పాట్లు చేసుకుందాం.

రాజమండ్రిలో ఈ ప్రయాణానికి ఏర్పాటు చేసే టూరిస్టు అఫీసులు వున్నాయి. ఎ.పి. టూరిజం వారు కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాదు నుంచి కూడా రిజర్వు చేసుకోవచ్చు. ఈ ప్రయాణం రెండు రకాలు. మొదటిది ఉదయం 7-30 కి బయల్దేరి మళ్ళీ రాత్రి 8-00 గం. కి తిరిగి వచ్చేది. ఇందులో వెళ్ళేటప్పడు గంటన్నర వచ్చేటప్పడు గంటన్నర బస్సు ప్రయాణం వుంటుంది. ఇది ట్రావెల్ ఏజెంట్సే ఏర్పాటు చేస్తారు. ఛార్జీలు టికెట్ లోనే కలసి వుంటాయి. టికెట్ ఒక రోజుకి మనిషికి 500 రూ.లు. (ఇప్పుడు పెరిగి వుండవచ్చు. ఒకళ్ళిద్దరు ఏజెంట్ల దగ్గరు కనుక్కోండి రేట్లల్లో తేడా వుందేమో) ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టీ కూడా ఈ టికెట్ ఖరీదులోనే లాంచీలో ఏర్పాటు చేస్తారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ లాంచీ కేంటీన్ లో కొనుక్కోవచ్చు.


మరి రెండవ ప్రయాణం భద్రాచలం దాకా. ఇది రెండు రోజుల ప్రయాణం. భద్రాచలంలో శ్రీ రామచంద్రుని ధర్శనం చేయించాక తిరుగు ప్రయాణంలో ప్రసిధ్ధి చెందిన మద్ది ఆంజనేయస్వామి దర్శనం చేయించి తీసుకు వస్తారు. బహుశ తిరుగు ప్రయాణం బస్ లో అనుకుంటా రిజర్వు చేసుకునేటప్పడు ముందు కనుక్కోండి. ఈ ప్రయాణంలో పాపి కొండలు ఇంకా అందంగా వుంటాయంటారు. ఇప్పడు ఇంతకు ముందు మేము చూసిన ఒక రోజు ప్రయాణం వివరాలు.

ఉదయం 7-30 కి రాజమండ్రి లోని లాంచీల రేవు దగ్గర వున్న మారుతీ ట్రావెల్స్ వారి ఆఫీసు దగ్గరనుంచి బస్ లో బయల్దేరి 8-50 కి పట్టిసం అనే వూరు చేరుకున్నాము. ( ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది కానీ ఒక రోజు ప్రయాణంలో ఈ దేవాలయ దర్శనం లేదు. దీని కోసం కొంత దూరం పడవ ప్రయాణం తర్వాత కొంత నడక వుంటుంది.) పట్టిసం రేవులో లాంచీలు సిధ్ధంగా వున్నాయి. మేము రిజర్వు చేసుకున్న జాబిలి అనే లాంచీ ఎక్కాము. 9-10 కి జాబిలి బయల్దేరింది. అల్ప పీడన ప్రభావంతో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా వున్నది. మేము పైన డెక్ మీదకెళ్ళి కూర్చున్నాము. గైడు ముందుగా ఆందరినీ పరిచయం చేసుకుంటూ మైకుతో సహా క్రిందా, డెక్ మీదా కలియ తిరుగుతూ హుషారు చెయ్యటం మొదలు పెట్టాడు. చుట్టుప్రక్కల ప్రదేశాల వివరాలు, విశేషాలు చెప్పటమేగాక కబుర్లు, జోక్సు, డాన్సులతో ప్రయాణమంతా హుషారుగా వుండేటట్లు చేశాడు.


నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి 1600 కి.మీ.లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ రోజు గోదావరి మీద మా ప్రయాణం 65 కి.మీ.లు. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కి.మీ.ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే వుంటుందిట. ఈ ప్రయాణంలో కుడివైపు దెందూరు అనే గ్రామం దగ్గర లాంచీ మొదటి సారి ఆగుతుంది. ఇక్కడ గట్టుమీద వున్న గండి పోచమ్మ అమ్మవారి దర్శనార్ధం 15 ని. ల సమయం ఇస్తారు. దైవ దర్శనం తర్వాత సినిమా కబుర్లు. గట్టు మీద కనిపించే పూడిపల్లి అనే వూళ్ళో పల్లెటూరు వాతావరణం వున్న సినిమాలు తీస్తారుట. త్రిశూలం సినిమాలో రావు గోపాలరావు ఇల్లు గట్టుమీద కనిపిస్తుంది. ఇంకా అందాల రాముడు, ఆట, ఆపద్బాంధవుడు, ఇలా ఎన్నో సినిమాలు అక్కడ రూపు దిద్దుకున్నాయి. తర్వాత దేశ భక్తి, చరిత్ర. అల్లూరి సీతారామరాజు చరిత్రలో వినిపించే దేవీ పట్నం లోని పాత, క్రొత్త పోలీసు స్టేషన్లను చూస్తాం. గట్టు మీద కనిపించే రెండు గులాబీ రంగు భవనాలు కొత్త పోలీసు స్టేషను, క్వార్టర్లు .. వాటి మధ్య కనిపించే పాత పెంకుటిల్లు బ్రిటిషు కాలంనాటి పాత పోలీసు స్టేషను.

కొండ మొదల అనే ఇంకో గ్రామం గురించి గైడు చెప్పిన సంగతి వింటే వెంటనే ఆ వూరు వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళటానికి రోడ్లు వగైరాలేమీ లేవు. ఇంకో విశేషం అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే ఇప్పటికీ బార్టరు సిస్టమే అంటే వస్తువులిచ్చి పుచ్చుకోవాల్సిందేగానీ, మీ డబ్బులక్కడ చెల్లవు. ఇంత వెనుకబడిన గ్రామం తర్వాత వచ్చేది కొరుటూరు. ఇక్కడ ఎ.సి. నాన్ ఎ.సి. కాటేజస్ వున్నాయి. కావాలంటే ట్రావెల్స్ వాళ్ళని అడగండి. ఇన్ని గ్రామాలను గురించి తెలుసుకుంటూ లాంచీలో జరిగే నాట్య ప్రదర్శనలు తిలకిస్తూ పాపికొండలు చేరేలోపల భోజనాలు పూర్తి చేశాము ఆ అందాలను గుండెనిండా నింపుకోవటానికి ఏ ఆటంకమూ వుండకుండా.. ప్రకృతి సోయగాలను ఇనుమడింపచేసి చూపించటానికి వరుణదేవుడు రోజులో చాలా భాగం సన్నగా కురుస్తూనే వున్నాడు. వానలో తడుస్తున్నా ఆ అనుభూతులెక్కడ కోల్పోతామోనని చాలామంది డెక్ మీదే వుండిపోయారు మాలాగే.


మా తరువాత మజిలీ పేరంటాలపల్లి, శ్రీ రామకృష్ణ మునివాటము అందులోని శివాలయం. లాంచీలో గైడు ముందే అక్కడ పాటించాల్సిన నియమాలు చెప్పాడు. గిరిజనులచే నిర్వహింపబడుతున్న ప్రదేశమని, అక్కడ వారికి సహాయం చేసే ఉద్దేశ్యం వుంటే ఆశ్రమ ప్రచురణలు కొనాలి తప్ప వేరే డబ్బు, వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా బాధపడతారని. ఆ ఆలయం చాలా శక్తివంతమైనదవటంవల్ల అక్కడ తగుమాత్రమే మాట్లాడాలి అదీ మంచిమాటలే. ఇక్కడ పూజారి వుండడు, పూజకు సంకల్పం కూడా ఎవరూ చెప్పకూడదు. సంకల్పం వల్ల సూర్య చంద్రాదుల సాక్షిగా కోరికలు వెలిబుచ్చటమవుతుంది. జన్మ రాహిత్యానికి ఈ సంకల్పము ప్రతిబంధకమని ఇక్కడ నమ్మకం. దేవునికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మాత్రం ఆశ్రమంలో వండిన పదార్ధాలే పెట్టాలి. శుచి, శుభ్రత కోసం. పాలు, పళ్ళు, కొబ్బరికాయలు, ఎవరి ఇష్టం వారిది. అయితే వాటిని వినియోగించే బాధ్యత కూడా వారిదే. ఈ దేవాలయం చేరుకోవటానికి కొంచెం దూరం కొండమీదకి ఎక్కాలి. ఇక్కడ మాకిచ్చిన సమయం అర్ధగంట. ఇక్కడనుంచి మధ్యాహ్నం 2-45 కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టి సాయంత్రం 6-10కి పట్టిసం, అక్కడనుండి బస్సులో రాత్రి 8-00 గం. లకు లాంచీల రేవు చేరుకున్నాము.

ఇంకొకసారి భద్రాచలంనుంచి కూడా ఇలాగే ఒకరోజు లాంచీ ప్రయాణం చేశాము. అప్పుడూ దాదాపు ఇదే దూరం, ఇవే ప్రదేశాలు. భోజనాలు మాత్రం ఒడ్డున. లాంచీ ఎక్కటానికి భద్రాచలంనుంచి చాలా దూరం వెళ్ళాలి. రవాణా సౌకర్యం ఏజెంట్లు ఏర్పాటు చేస్తారో లేదో, ఇంకా వివరాలేమన్నా కావాలంటే ముందే కనుక్కోడి. భద్రాచలం లో రామాలయం దగ్గర చాలామంది ఏజెంట్లు వున్నారు. ఉల్లాసంగా సాగే పాపి కొండల యాత్ర ఒక అద్భుతమైన అనుభూతి. రేపు అద్భుతమైన సౌందర్య రాశి జగన్మోహినీ కేశవస్వామివారి ర్యాలీ చూసి, ఆత్రేయపురం పూతరేకులు కొనుక్కుందాం.

- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 

 

 

 

 

 

Godavari Pushkaralu Special

Dharma Sandehalu