Read more!

ఆహ్లాదకరమైన అనంతగిరి అందాలు

 

 

ఆహ్లాదకరమైన అనంతగిరి అందాలు

                                                                                

         “అనంతానంత దేవేశ అనంత ఫలదాయకా
          అనంత దుఃఖనాశాయ అనంతాయ నమోనమః g

అనంతగిరి ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లాలోవుంది.  వికారాబాద్ కి 5 కి.మీ. లు, హైదరాబాద్ కి షుమారు 90 కి.మీ. ల దూరంలో వుంది.  పురాణ ప్రసిధ్ధికెక్కిన ఈ పుణ్య క్షేత్రం నిత్య  జీవితంలో పరుగులు పెట్టే మానవాళికి సేద తీర్చే ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్ కూడా.  అఖిల జగాలకూ ఏలికైన శ్రీ అనంత పద్మనాభస్వామియొక్క ఈ  ఆవాసము  అటవీ ప్రదేశం అవటంవల్ల (పెద్దది కాదండోయ్..పులులూ, సింహాలూ వుండవు) ప్రకృతి సౌందర్యంతో అలరారుతోంది.  అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్టువు పానుపైన ఆదిశేషుని  శిరస్సు ఏడుకొండలలోని శేషాద్రి, నడుము భాగము అహోబిలము, తోక భాగమీ అనంతగిరి అని చెప్పబడుతున్నది.  అంతేకాదు..హైదరాబాదు ప్రాంతంలో ప్రసిధ్ధికెక్కిన ముచికుందా నది....అర్ధంకాలేదా  అదేనండీ మూసీ నది జన్మస్ధానం ఇది.

 

 

ఇక్కడ కొండగుహలో వెలిసిన దేవుడు శ్రీ అనంత పద్మనాభస్వామి, దేవేరి శ్రీ  మహలక్ష్మి. సాలగ్రామరూపంలో వెలిశాడు.    కొన్ని వేల సంవత్సారాలకు పూర్వం మృకండ మహర్షి తనయుడైన మార్కండేయుడు శివ సాక్షాత్కారం తర్వాత విధాత సలహా ప్రకారం ఇక్కడ తపస్సు చేశాడు.  కలియుగ ప్రారంభమున శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి, అతని కోరికపై అక్కడ సాలగ్రామ రూపంలో వెలిశాడు.  ఆ సాలగ్రామానికి ఉదర, ఛాతీ భాగంలో  లెక్క పెట్టలేనన్ని చక్రాలు వున్నాయిట.  అందుకని  ఆ స్వామిని అనంతుడన్నారని అక్కడి పూజారిగారు చెప్పారు.  ఆ గుహలోంచి ఒక సొరంగ మార్గమున్నది.  ఆ మార్గము కాశీదాకా వున్నదని అంటారు.  మార్కండేయ మహర్షి నిత్యం ఆ మార్గంగుండా కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసివచ్చి స్వామిని అర్చించేవాడట.

 

మార్కండేయ మహర్షి సమయంలోనే ముచికుందుడనే రాజర్షి వుండేవాడు.  ఆయన ఒకసారి చాలా సంవత్సరాలు రాక్షసులతో యుధ్ధం చేసి వారిని ఓడించాడు.  బాగా అలసి పోయి వుండటంతో భూలోకంలో తాను అలసట తీర్చుకోవటానికీ, సుఖంగా కొంతకాలం నిదురించుటకూ అనువైన ప్రదేశం చెప్పమని ఇంద్రుని కోరాడు.  అంతేకాదు, తన నిద్రా భంగము చేసినవారు తన తీక్షణ దృక్కులతో వెంటనే భస్మమైపోయేటట్లు వరాన్నికూడా ఇంద్రుడినుంచి పొందాడు.  ఈ రమణీయమైన ప్రదేశానికి వచ్చి ఇక్కడవున్న ఒక గుహలో  నిదురించసాగాడు.

ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు కంసవధానంతరం తన రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలిస్తున్నాడు.  ఆ సమయంలో కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకమీద దండెత్తివచ్చి, యాదవ సైన్యాన్ని చిత్తుచేసి,. మధురానగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.  శ్రీకృష్ణ బలరాములు అప్పుడు కాల యవనునికి భయపడినట్లు నటించి అతను చూస్తుండగా ఈ ప్రదేశానికి వచ్చారు.  కాలయవనుడుకూడా వారిని వెంబడించి ఇక్కడికి వచ్చాడు.  అంత వారు శ్రీ కృష్ణుని వస్త్రము నిదురించుచున్న ముచికుందునిమీద కప్పి తాము పక్కకి తప్పుకున్నారు.  కాలయవనుడు శ్రీ కృష్ణుని వస్త్రములు చూసి, నిదురించుచున్నది శ్రీ కృష్ణుడే  అనుకుని ఆతని నిద్రా భంగముగావించెను.  నిద్ర మేల్కాంచిన ముచికుందుని తీక్షణ దృక్కులు పడి కాలయవనుడు భస్మమయ్యాడు.

 

అప్పుడు ముచికుందునికి శ్రీ కృష్ణ బలరాములు ప్రత్యక్షముకాగా, ఆయన వారి పాదాలు కడిగి ధన్యుడయ్యాడు.  ముచికుందుడు శ్రీ కృష్ణ పాద ప్రక్షాళన చేసిన జలమే జీవనదియై ఆయన పేరుమీద ముచికుంద నదియై కాలక్రమమున మూసీ అయినది. ఇక్కడి పుష్కరిణి పేరు భవనాశని.  ఆంధ్ర ప్రదేశే కాకుండా, కర్ణాటక, మహారాష్ట్ర మొదలైన ప్రదేశాలనుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి, ఈ భవనాశనిలో స్నానమాచరించి స్వామిని సేవించి ధన్యులవుతున్నారు.

ఈ ఆలయం చుట్టు పక్కల ప్రదేశాలు ప్రశాంతంగా, ఆకర్షణీయంగా వుంటాయి.  పక్కనే అనంతగిరి అడవులున్నాయి.  పచ్చని ప్రకృతి కాంత ఇక్కడ హాయిగా విహరిస్తూ వుంటుంది.  చెట్ల ఊడలు పిల్లలనేగాక పెద్దవారినీ ఒక్కసారి బాల్యంలోకి వెళ్ళి ఆడుకోండి, రండి,  అని ఆహ్వానిస్తున్నట్లుగా వుంటాయి.  మళ్లీ పిల్లలమయి కోతి కొమ్మచ్చులాడుకుంటాం.

 

 

ఆసక్తి వున్నవారు సమీపంలో వున్న ఇంకొక ఆలయం బుగ్గ రామేశ్వరం కూడా చూడవచ్చు.

ఆహార, పానీయాలు వెంట తీసుకు వెళ్తే ఉదయంనుంచి సాయంకాలందాకా కుటుంబంతో, మిత్రులతో, సరదాగా గడపవచ్చు ఈ ప్రదేశంలో.. 

 

.... పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)