Read more!

లక్ష్మీ కుబేరుల ఆలయం (శ్రావణ మాసం స్పెషల్)

 



లక్ష్మీ కుబేరుల ఆలయం

శ్రావణ మాసం .. మహిళలంతా మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలతో సందడిగా వున్నారుకదా. శ్రావణ మాసంలో శివుడు, విష్ణువు, సుబ్రహ్మణ్యుడు ఇలా ఎంతమందికి పూజ చేసినా లక్ష్మీ పూజ అంటే అందరికీ ఇష్టమేకదండీ. సాక్షాత్తూ ఆ శ్రీమహలక్ష్మి మన ఇంట్లో కొలువుతీరి, మనకి వరాలివ్వాలని కోరుకోనివారెవరు చెప్పండి. అందుకే శ్రావణ మాసంలో మీరంతా ఎంతో భక్తి శ్రధ్ధలతో లక్ష్మీదేవిని కొలుస్తారనే, మీ అందరికోసం నేను అష్టైశ్వర్యప్రదాత అయిన ఆ కుబేరుడి ఆశీర్వాదం, కరుణామయి అయిన ఆ కమలాక్షి కరుణ తీసుకు వచ్చి ఈ వ్యాసంద్వారా మీకందరికీ అందిస్తున్నాను. అందుకోండి.

కుబేరుడు పేరు వినని వాళ్ళు వుండరంటే అతిశయోక్తి కాదేమో. ఆయన కరుణ వుంటే సంపదలకు లోటే వుండదు. అష్టైశ్వర్య ప్రదాత లక్ష్మీ దేవి అయితే దానిని మనదాకా అందించేవాడు కుబేరుడు యక్షులకు నాయకుడు. కుబేరుని పూజిస్తే సిరులు కలుగుతాయి. మరి ఆ కుబేరుణ్ణి లక్ష్మీదేవితో సహా పూజిస్తే, వారిరువురి కరుణ మనపై ప్రసరిస్తే, అంతకన్నా మహద్భాగ్యం వుంటుందా!? అయితే వారిరువురికీ పూజా విధానాలు వేరు, మంత్రాలు వేరు. నియమ నిష్టలతో, సద్భక్తితో చేసే ఏ పూజకైనా ప్రతిఫలం తప్పకుండా వుంటుంది.

మీరు అనేక దేవీ దేవతల ఆలయాలు చూసివుంటారుగానీ కుబేరుడికి ఒక ప్రత్యేక ఆలయం ఎక్కడైనా చూశారా?. నేనయితే ప్రత్యేక ఆలయం చూడలేదుగానీ వేరే ఆలయాలలో కుబేరుడి విగ్రహాలు చూశాను. ఇప్పుడు కుబేరుడు భార్య చిత్రలేఖతోనూ, ఐశ్వర్య స్వరూపమైన శ్రీమహలక్ష్మితోనూ కొలువుతీరిన ఆలయం తమిళనాడులో చూశాను. ఆలయం గురించి చెప్పేముందు కొంచెం కుబేరుడి గురించి కూడా తెలుసుకుందాము. ఆలయంలో గర్భగుడి వెనుక చిత్రపటాలున్నాయి. వాటికింద మా అదృష్టంకొద్దీ కధ ఇంగ్లీషులో కూడా వున్నది. వాటి మీద రాసి వున్నది మాత్రమే చెబుతున్నాను. కుబేరుడు ఋషి విశ్వావసు, దేవమిని (భరద్వాజుడి కూతురు) ల సంతానం. పేరు వైశ్రవణుడు.

 

పెద్దయ్యాక తండ్రి సలహామీద బ్రహ్మగురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతనికి కుబేరుడని పేరుపెట్టి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. అతనికి పుష్పక విమానాన్ని కూడా ఇచ్చాడు. తండ్రి సలహా ప్రకారం తన లంకా రాజ్యాన్ని రావణుడికి అప్పజెప్పి శివుడిగురించి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి ప్రసన్నుడైన శివుడు పార్వతితోసహా ప్రత్యక్షమవుతాడు. పార్వతి అద్భుత సౌందర్యానికి, తేజస్సుకి తట్టుకోలేని కుబేరుడి ఒక కనురెప్ప అప్రయత్నంగా కొట్టుకుంటుంది. ఆగ్రహించిన పార్వతి అతని కంటి చూపుని పోగొడుతుంది.

శివుడు పార్వతి అపోహని తొలగించి కుబేరుడి కంటి చూపు తిరిగి ప్రసాదిస్తాడు. పార్వతి కుబేరుడికి ఇంకేమైనా బహుమతి ఇవ్వమంటే శివుడు నవ నిధులు ఇస్తాడు. అవే కల్పవృక్షం, కామధేనువు, శంఖం, చేప, తాబేలు, వజ్ర వైఢూర్యాలు, పాలు, తామర మరియు ఆవు, దూడ. ఏడుకొండల ప్రభువు వెంకటేశ్వరస్వామి కూడా పద్మావతితో తన వివాహ నిమిత్తం ఒక కోటి నలభై లక్షల బంగారు నాణేలు అప్పుతీసుకున్నాడు.

ఇది ఆలయంలోని చిత్ర పటాల కధ.
పురాణ కధ

బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణాల ప్రకారం పులస్త్యుడి కొడుకైన విశ్వావసు, ఇళల కుమారుడు వైశ్రవణుడు, ఆయనే కుబేరుడు. విశ్వావసు, కైకసిల కుమారుడు రావణుడు. కుబేరుడు లోకంలో వున్న ధనానికంతా అధిపతి. లక్ష్మీదేవి సాక్షాత్ ఐశ్వర్య స్వరూపం.

కుబేరుడు తన తండ్రి సలహాతో లక్ష్మీ నారాయణుల సువర్ణ విగ్రహాలను ప్రతిష్టించి లక్ష్మీ నారాయణ వ్రతం చేస్తాడు. ఆ రోజు అక్షయ తృతీయ. లక్ష్మీదేవి ప్రత్యక్షమయి ఆయనని ధనాధిపతిని చేసింది. ప్రజలకు వారివారి యోగ్యత ప్రకారం సంపదను ప్రసాదించే బాధ్యత అప్పజెప్పింది. అంతేకాదు, కలియుగంలో తమ ప్రతిమలతోబాటు కుబేరుడి ప్రతిమకూడా పెట్టి పూజించి తర్వాత ఆ ప్రతిమని బ్రాహ్మణుడికి దానం చేసినవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వరం కూడా ఇచ్చింది. ఏ కధ ఎలా వున్నా కుబేరుడు ఐశ్వర్య ప్రదాత. ఐశ్వర్య స్వరూపమైన లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించినవారికి వారి అనుగ్రహం వుంటుంది.

ఆలయం

రాజలక్ష్మీ కుబేర ట్రస్టు వారు నిర్మించిన ఈ ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఎడమప్రక్క గుండ్రంగా ప్రతిష్టించబడిన షోడశ (16) గణపతులను దర్శించవచ్చు. వాటికింద మూడు లైన్లు తమిళంలో రాసి వున్నాయి. అక్కడున్న శ్రీ రావుగారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ క్రింద రాసి వున్నది తిధి పేరు, ఆ తిధికి అధిపతియైన గణపతి పేరు, ఆయనని పూజించాల్సిన మంత్రం వున్నాయి. ఏ తిధిలో జన్మించినవారు ఆ వినాయకుడిని పూజిస్తే సత్వర ఫలితాలు పొందుతారుట.

వారి పక్కనే నవ గ్రహాలు భార్యలతో సహా కొలువు తీరారు. ప్రదక్షిణ మార్గంలో వెళ్తుంటే గర్భ గుడి బయట గోడలమీద ఒక ప్రక్క బ్రహ్మ, సరస్వతులు, వెనుక స్వర్ణాకర్షణ భైరవుడు (నాకర్ధం అయినంతమటుకూ ఈయన క్షేత్ర పాలకుడు), ఇంకో ప్రక్క వెంకటేశ్వరస్వామి విగ్రహాలున్నాయి. ప్రక్కనే లాఫింగ్ బుధ్ధా, కుమార స్వామి వగైరా విగ్రహాలున్నాయి. గర్భాలయంలో కుబేరుడు, చిత్రలేఖల విగ్రహాలు, వాటి వెనుక లక్ష్మీదేవి విగ్రహం వున్నాయి. కుబేరుడికి వెండి తలపాగా. విగ్రహాలన్నింటికీ వెండి తొడుగులు. కరెన్సీ నోట్ల హారాలు. మరి లక్ష్మీ కుబేరుల ఆలయం కదండీ. ఆలయం లోపలే విక్రయశాలలు. వాటిలో ఒక దానిలో పూర్వం వచ్చే చిల్లి కాణీ ఆకారంలో వున్న ఒక నాణేనికి ఎఱ్ఱ దారం కట్టి 30 రూ. లకి అమ్ముతున్నారు. అది తీసుకుని లాఫింగ్ బుధ్ధా ఎడమ చేతిలో పెట్టి, తర్వాత ఆయన బొజ్జమీద తాకించి పర్సులో పెట్టుకుంటే అదృష్టం వారిదేనట. ఇంకో విశేషమేమిటంటే కుబేరుడికి ఆకుపచ్చ రంగంటే ప్రీతి. అందుకే, అక్కడ రక్షగా అమ్మే దారాలే కాదు కుంకుమ కూడా ఆకుపచ్చ రంగే.

దర్శన సమయాలు

ఉదయం 6-30 నుంచి 12 గంటలదాకా, తిరిగి సాయంత్రం 4 గం. ల నుంచి 8 గం. ల దాకా.

మార్గము

ఎగ్మూరు రైల్వే స్టేషన్ నుంచి చెంగల్పట్ వెళ్ళే లోకల్ లో వెళ్ళి వందలూరు స్టేషన్ లో దిగాలి. దాదాపు గంట ప్రయాణం. టికెట్ 10 రూ.లు. అక్కడ నుంచి షేర్డ్ ఆటోలలో వెళ్ళవచ్చు. మేము విడిగా ఆటో తీసుకుంటే రూ. 300 తీసుకున్నాడు. పైగా అది చాలదని చివరికి కొంచెం గోల పెట్టుకున్నాడు. వెళ్ళి రావటానికి 2 గం. లు కూడా పట్టదు. చెన్నై నుంచి బస్సులు కూడా వున్నాయి.

ఆలయం రత్న మంగళం అనే ఊరిలో వున్నది. వందలూరు జూ పక్కనే వున్న రోడ్డులోంచి దాదాపు 7 కి.మీ. ల దూరం వెళ్ళాలి. (కేలంబాకం – మహాబలిపురం రోడ్డు). ఎడమచేతివైపు టాగూర్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. దాని తర్వాత ఎడమవైపు తిరిగి, అర కిలో మీటరు దూరం వెళ్ళిన తర్వాత కుడి వైపు తిరగాలి. ఎవరిని అడిగినా చెప్తారు. వందలూరు స్టేషన్ నుంచి 12 కి.మీ. ల దూరం.

తాంబరంనుంచి బస్సులుకూడా వున్నాయి. తిరుపోరూరు వెళ్ళే బస్సులన్నీ ఇక్కడ ఆగుతాయి.

అవకాశం వున్నవారు వందలూరులో జూ కూడా చూడవచ్చు.

సమీప ఆలయాలు

ఇక్కడే ఇంకో మూడు ఆలయాలు వున్నాయి. శ్రీ చక్రకాళి ఆలయం, సాయిబాబా ఆలయం, అరై కాళి అమ్మన్ ఆలయం. వీటి గురించి అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి లక్ష్మీ కుబేరుల అనుగ్రహం పొందండి.

 

 

 

 

 

 

- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)