Read more!

శ్రీసాయిసచ్చరిత్రము 43, 44 అధ్యాయాలు

 

శ్రీసాయిసచ్చరిత్రము

 

43, 44 అధ్యాయాలు

 

 

 

 

బాబా సమాధి చెందుట : 1. సన్నాహము. 2. సమాధి మందిరము 3. ఇటుకరాయి విరుగుట 4. 72 గంటల సమాధి 5. జోగుయొక్క సన్మాసము 6. అమృతము వంటి బాబా పలుకులు


43 మరియు 44 అధ్యాయాలు కూడా బాబా శరీరత్యాగం చేసిన కథనే వర్ణించేవి కాబట్టి వాటిని ఒకచోట చేర్చటం జరిగింది.

ముందుగా సన్నాహము :

హిందువులలో ఎవరైనా మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మతగ్రంథాలు చదివి వినిపించటం సాధారణ ఆచారం. ఎలాగంటే ప్రపంచ విషయాలనుండి అతని మనస్సును మరలించి భగవంతుని విషయాలలో లీనం చేస్తే అతడు పరాన్ని సహజంగానూ, సులభంగాను పొందుతాడు. పరీక్షిన్మహారాజు బ్రాహ్మణ ఋషిబాలుడి చేత శపించబడి, వారంరోజులలో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు గోప్పయోగి అయిన శుకుడు భాగవత పురాణాన్ని ఆ వారంలో బోధించాడు. ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాటులో ఉన్నాది. చనిపోవడానికి సిధంగా ఉన్నవారికి గీత, భాగవతం మొదలైన గ్రంథాలు చదివి వినిపిస్తారు. కాని, బాబా భగవంతుని అవతారం అవటం చేత వారికి అలాంటిది అవసరం లేదు. కాని, బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి ఈ అలవాటును పాటించారు. త్వరలోనే దేహత్యాగం చేయనున్నామని తెలియగానే వారు వజే అనే అతన్ని పిలిచి రామవిజయం గ్రంథాన్ని ప్రారాయన చేయమన్నారు. అతడు వారంలో గ్రంథం ఒకసారి పఠించాడు. తిరిగి దాన్ని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దాన్ని చదివి మూడు రోజులలో రెండవ పారాయణం పూర్తిచేశాడు. ఈ విధంగా 11 రోజులు గడిచాయి. అతడు తిరిగి 3 రోజులలో చదివి అలసిపోయాడు. బాబా అతనికి సెలవిచ్చి వెళ్ళిపోమన్నారు. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణంకోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

 

 

 

 


రెండుమూడు రోజులు ముందునుండి బాబా గ్రామం బయటకు వెళ్ళటం, భిక్షాటన చేయటం మొదలైనవి మానివేసి మసీదులో కూర్చునేవారు. చివరివరకు బాబా చైతన్యంతో ఉండి, అందరినీ ధైర్యంగా ఉండమని సలహా ఇచ్చారు. వారెప్పుడు పోతారో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిరోజూ కాకాసాహెబు దీక్షిత్, శ్రీమాన్ బూటీ వారితో కలిసి మసీదులో భోజనం చేస్తూ ఉండేవారు. ఆరోజు (1918 అక్టోబరు 15వ తారీఖు) హారతి తరువాత వారిని వారివారి ఇళ్ళకు వెళ్ళి భోజనం చేయమన్నారు. అయినా కొంతమంది లక్ష్మీబాయి శిందే, భాగోజి శిందే, బాయజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబు నిమోన్ కర్ అక్కడే ఉన్నారు. దిగువ మెట్లమీద శ్యామా కూర్చుని ఉన్నాడు. లక్ష్మీబాయి శిందేకి 9 రూపాయలు దానం చేసిన తరువాత, బాబా తనకు ఆ స్థలం (మసీదు) బాగా లేదనీ, అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకొని వెళితే అక్కడ బాగా ఉంటుందని చెప్పారు. ఈ తుదిపలుకులు ఆడుతూ బాబా బాయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణాలు విడిచారు. భాగోజీ దీన్ని కనిపెట్టారు. క్రింద కూర్చున్న నానాసాహెబు నిమోన్ కర్ కి ఈ సంగతి చెప్పారు. నానాసాహెబు నీళ్ళు తెచ్చి బాబా నోటిలో పోశారు. అవి బయటికి వచ్చాయి. అతడు బిగ్గరగా "ఓ దేవా!'' అని అరిచాడు. అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా "ఆ!'' అన్నారు. బాబా తన భౌతికశరీరాన్ని విడిచి పెట్టారని తేలిపోయింది.
బాబా సమాధి చెందారనే సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చులా వ్యాపించింది. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు వెళ్ళి ఏడ్వసాగారు. కొందరు బిగ్గరగా ఏడ్చారు. కొందరు వీథులలో ఏడుస్తున్నారు. కొందరు తెలివితప్పి పడ్డారు. అందరి కళ్ళనుండి నీళ్ళు కాలువలా పారుతూ ఉన్నాయి. అందరూ విచారగ్రస్తులయ్యారు.

 

 

 

 


కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టారు. మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షం అవుతానని బాబా తమ భక్తులతో చెప్పారని ఒకరు అన్నారు. ఇవి యోగీశ్వరుని వాక్కులు కాబట్టి ఎవ్వరికీ సందేహం అఖ్ఖర్లేదు. ఎలాగంటే కృష్ణావతారంలో శ్రీమహావిష్ణువు ఈ కార్యమే ఒనర్చారు. సుందర శరీరంతో, ఆయుధాలు కలిగిన చతుర్భుజాలతో, శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారంలో ఎనిమిదేళ్ళ బాలుడుగానే ప్రత్యక్షమయ్యారు. ఆ అవతారంలో శ్రీకృష్ణుడు భూమిభారం తగ్గించారు. ఈ అవతారం (సాయిబాబా) భక్తులను ఉద్ధరించడాని కోసం వచ్చింది. కాబట్టి సంశయింపవలసిన కారణం ఏమున్నది? యోగుల జాడలు అగమ్యగోచరాలు. సాయిబాబాకు తమ భక్తులతో సంబంధం ఈ యొక్క జన్మతోనే కాదు. అది గడిచిన డెబ్బైరెండు జన్మల సంబంధం. ఇలాంటి ప్రేమబందాలు కలిగించిన ఆ మహారాజు (సాయిబాబా) ఎక్కడికో పర్యటన కోసం వెళ్ళినట్లు అనిపించటం వలన వారు శ్రీఘ్రంగానే తిరిగి వస్తారనే దృఢవిశ్వాసం భక్తులకు వుంది.
బాబా శరీరం ఎలా సమాధి చేయాలనే విషయం గొప్ప సమస్య అయ్యింది. కొందరు మహమ్మదీయులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధిచేసి దానిపై గోరి కట్టాలన్నారు. కుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. కాని రామచంద్ర పాటీలు అనే గ్రామమునసబు గ్రామంలోనీ వారందరి నిశ్చితమైన దృఢకంఠస్వరంతో "మీ ఆలోచన మాకు సమ్మతం కాదు. బాబా శరీరం రాతి వాడాలో పెట్టవలసిందే'' అన్నారు. అందుకే గ్రామస్థులు, రెండు వర్గాలుగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిపారు.

 

 

 

 


బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడు, శ్యామాకు మేనమామ అయిన లక్ష్మణ్ మామా జోషికి బాబా స్వప్నంలో కనిపించి, చేయిపట్టి ఇలా అన్నారు : "త్వరగా లెగు, బాపూసాహెబు నేను మరణించానని అనుకుంటున్నాడు. అందుకే అతడు రాడు. నీవు పూజ చేసి, కాకడహారతిని ఇవ్వు'' లక్ష్మణ్ మామా సనాతన ఆచారపరాయణుడు అయిన బ్రాహ్మణుడు. ప్రతిరోజూ ఉదయం బాబాను పూజించిన తరువాత తక్కిన దేవతలను పూజిస్తూ ఉండేవాడు. అతనికి బాబా పట్ల పూర్ణభక్తివిశ్వాసాలు ఉండేవి. ఈ దృశ్యాన్ని చూడగానే పూజాద్రవ్యాల పళ్ళెంను చేత ధరించి మౌల్వీలు ఆటంక పరుస్తున్నా పూజను హారతిని చేసి వెళ్ళాడు. మిట్టమద్యాహ్నం బాపూసాహెబు జోగ్ పూజాద్రవ్యాలతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చాడు.

 

 

 

 


బాబా తుదిపలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరాన్ని వాడాలో ఉంచడానికి నిశ్చయించి అక్కడ మధ్యభాగంలో త్రవ్వటం ప్రారంభించారు. మంగళవారం సాయంకాలం రహతానుండి సబ్ ఇన్స్ పెక్టర్ వచ్చాడు. ఇతరులు తక్కిన స్థలాలనుండి వచ్చారు. అందరూ దాన్ని ఆమోదించారు. ఆ మరుసటి ఉదయం అమీర్ భాయి బొంబాయినుండి వచ్చాడు. కోపర్ గాంనుండి మామలతదారు వచ్చారు. ప్రజలు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్లు తోచింది. కొందరు బాబా శరీరాన్ని బయటే సమాధి చేయాలని పట్టుబట్టారు. కాబట్టి మామలతదారు ఎన్నికద్వారా నిశ్చయించాలని అన్నారు. వాడాను ఉపయోగించడానికి రెండురెట్ల కంటే ఎక్కువ వోట్లు వచ్చాయి. అయినప్పటికే జిల్లా కలెక్టరుతో సంప్రదించాలని అతడు అన్నాడు. కాబట్టి కాకాసాహెబు దీక్షిత్ అహమద్ నగర్ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఈలోపల బాబా ప్రేరేపణవల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారింది. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయడానికి అంగీకరించారు. బుధవారం సాయంకాలం బాబా శరీరాన్ని ఉత్సవంతో వాడాకు తీసుకునివెళ్ళారు. మురళీధరుని కోసం కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేశారు. యదార్థంగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయం అయ్యింది. అది ఒక పూజామందిరం అయ్యింది. అనేకమంది భక్తులు అక్కడికి వెళ్ళి శాంతిసౌఖ్యాలు పొందుతున్నారు. ఉత్తరక్రియలు బాలాసాహెబు భాటే, ఉపాసనీ బాబా నెరవేర్చారు. ఉపాసనీ బాబా, బాబాకు గొప్పభక్తుడు.
ఈ సందర్భంలో ఒక విషయం గమనించాలి. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవాలనీ సాగుతూనే ఉన్నాయి. వారి కఫనీ చింపకుండా సులభంగా తీయగలిగారు.

ఇటుకరాయి విరుగుట :

 

 

 

 


బాబా భౌతికశరీరాన్ని విడవడానికి కొన్ని రోజుల ముందు ఒక దుశ్శకునం జరిగింది. మసీదులో ఒక పాత ఇటుక ఉండేది. బాబా దానిపై చేయివేసి ఆనుకుని కూర్చునేవారు. రాత్రులలో దానిపై ఆనుకొని ఆసీనుపై ఉండేవారు. అనేక సంవత్సరాలు ఇలా గడిచాయి. ఒకరోజు బాబా మసీదులో లేనప్పుడు, ఒక బాలుడు మసీదును శుభ్రపరుస్తూ, దాన్ని చేతితో పట్టుకొని ఉండగా అది చేతినుండి జారి క్రిందపడి రెండుముక్కలయ్యింది. ఈ సంగతి బాబాకి తెలియగానే వారు అమితంగా చింతించి ఇలా అన్నారు : "ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. అది నా జీవితపు తోడునీడ. దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానం చేస్తూ ఉండేవాడిని. నా జీవితంలో నాకెంత ప్రేమో దానిపట్ల నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచింది'' ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చు. "బాబా నిర్జీవి అయిన ఇటుక కోసం ఇంత విచారం ఎందుకు?'' అందుకు హేమాడ్ పంతు ఇలా సమాధానమిచ్చారు. "యోగులు బీదవారికి, నిస్సహాయులకు సహాయం చేయటం కోసం అవతరిస్తారు. వారు ప్రజలతో కలిసి మసులుతున్నప్పుడు ప్రజలలాగా నటిస్తారు. వారు మనలా బాహ్యానికి నవ్వుతారు, ఆడతారు, ఏడుస్తారు. కానీ లోపల వారు శుద్ధచైతన్యులయి వారి కర్తవ్యవిధులు ఎరుగుదురు''

72 గంటల సమాధి :

 

 

 

 


ఇటుక విరగడానికి 32 సంవత్సరాలకు పూర్వం అంటే, 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయాలని ప్రయత్నించారు. ఒక మార్గశిర పౌర్ణమిరోజు బాబా ఉబ్బసం వ్యాధితో అమితంగా బాధ పడుతూ ఉన్నారు. దాన్ని తప్పించుకోవడం కోసం బాబా తన ప్రాణాన్ని పైకి తీసుకొని వెళ్ళి సమాధిలో ఉండాలని అనుకుని, భక్త మహల్సాపతితో ఇలా అన్నారు : "నా శరీరాన్ని మూడు రోజులవరకు కాపాడు. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేకపోతే నా శరీరం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను ప్రాతిపెట్టు'' అని స్థలాన్ని చూపించారు. ఇలా అంటూ రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలిపోయారు. వారి ఊపిరి నిలిచిపోయింది. వారి నాడి కూడా ఆడకుండా ఉంది. శరీరంలో నుండి ప్రాణం పోయినట్లు ఉండింది. ఊరివారందరూ అక్కడ చేరి న్యాయవిచారణ చేసి బాబా చూపించిన స్థలంలో సమాధి చేయడానికి నిశ్చయించారు. కాని మహల్సాపతి అడ్డగించాడు. తన ఒడిలో బాబా శరీరాన్ని ఉంచుకుని మూడురోజులు అలాగే కాపాడుతూ కూర్చున్నాడు. మూడు రోజుల తరువాత తెల్లవారుఝామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు గమనించాడు. ఊపిరి ఆడటం ప్రారంభించింది. కడుపు కదిలింది, కళ్ళు తెరిచారు, కాళ్ళూ చేతులూ సాగదీస్తూ బాబా లేచారు.

 

 

 

 


దీన్ని బట్టి చదివేవారు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే బాబా 3 మూరల శరీరమా లేక లోపలవున్న ఆత్మా? పంచభూతాత్మ అయిన శరీరం నాశనం అవుతుంది. శరీరం అశాశ్వతంగాని, లోపల వున్న ఆత్మ పరమ సత్యం, అమరం, శాశ్వతం. ఈ శుద్ధాత్మయే బ్రహ్మం. అదే పంచేంద్రియాలను, మనస్సును స్వాధీనంలో ఉంచుకునేది, పరిపాలించేది. అదే సాయి. అదే ఈ జగత్తులో గల వస్తువులన్నిటిలో వ్యాపించి ఉన్నది. అది లేని స్థలం లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యాన్ని నెరవేర్చటం కోసం భౌతికశరీరం వహించింది. దాన్ని నెరవేర్చిన తరువాత శరీరం విడుస్తుంది. సాయు ఎల్లప్పుడూ ఉండేవారు. అలాగే పూర్వం గాన్గాపురంలో వెలసిన దత్తదేవుని అవతారమైన శ్రీనారసింహసరస్వతీ, వారు సమాధిచెందటం బాహ్యానికే గాని, సమస్త చేతనాచేతనాలలో కూడా ఉండి వాటిని నియమించువారూ, పరిపాలించేవరూవారే. ఈ విషయం ఇప్పటికీ సర్వస్యశరణాగతి చేసిన వారికీ, మనఃస్ఫూర్తిగా భక్తితో పూజించేవారికీ అనుభావనీయమైన సంగతి.
ప్రస్తుతం బాబా రూపం చూడటం వీలులేక పోయినప్పటికీ, మనం షిరిడీకి వెళ్ళినట్లయితే, వారి జీవితమెత్తుపటం మసీదులో వుంది. దీన్ని శ్యామారావు జయకర్ అనే గొప్ప చిత్రకారుడూ బాబా భక్తుడూ వ్రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటం ఈ నాటికీ బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగజేస్తుంది. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వరు అక్కడే కాక ప్రతిచోటా నివశిస్తూ పూర్వంలా తమ భక్తులకు మేలు చేస్తున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలే కనిపించినా నిజంగా వారే దైవం.

బాపుసాహెబు జోగ్ సన్యాసము :

 

 

 

 


జోగు సన్యాసం పుచ్చుకున్న కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. సఖారాం హరి వురఫ్ బాపూసాహెబ్ జోగ్ పూణే నివాసి అయిన సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909 వ సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుండి విరమిచిన తరువాత (P.W.D. Supervisor)భార్యతో షిరిడీకి వచ్చి నివశిస్తూ ఉన్నాడు. వారికీ సంతానం లేకుండా వుంది. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవలోనే కాలమంతా గడుపుతూ ఉన్నారు. మేఘశ్యాముడు చనిపోయిన తరువాత బాపూసాహెబు జోగ్ మసీదులోను, చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందేవరకు హారతి ఇస్తూ ఉన్నాడు. అదీగాక ప్రతిరోజూ సాఠేవాడాలో జ్ఞానేశ్వరీ, ఏకనాథ భాగవతం చదివి, వినడానికి వచ్చిన వారందరికీ బోధిస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు సేవ చేసిన జోగ్, బాబాతో "నేనిన్నాళ్ళు నీ సేవ చేశాను. నా మనస్సు ఇంకా శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినా నేను బాగుకాకుండా ఉండడానికి కారణం ఏమిటి? ఎప్పుడు కటాక్షిస్తావు అన్నాడు. ఆ ప్రార్తన విని బాబా "కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితం నశిస్తుంది. నీ పాపపుణ్యాలు భస్మం అవుతాయి. ఎప్పుడు నీ అభిమానాన్ని పోగొట్టుకొని, మొహమనే రుచిని జయిస్తావో, ఆటంకాలన్నిటిని దాటుతావో, హృదయపూర్వకమైన భగవంతుని సేవిస్తూ సన్యాసాన్ని పుచ్చుకుంటావో, అప్పుడు నీవు ధన్యుడవు అవుతావు'' అన్నారు. కొద్ది కాలం తరువాత బాబా పలుకులు నిజమయ్యాయి. అతని భార్య చనిపోయింది. అతనికి ఇంకొక అభిమానం ఏడీ లేకపోవడంతో అతడు స్వేచ్చాపరుడై సన్యాసాన్ని గ్రహించి తన జీవితపరమావధిని పొందాడు.

అమృతతుల్యమగు బాబా పలుకులు :

 

 

 

 


దయాదాక్షిణ్యమూర్తి అయిన సాయిబాబా అనేకసార్లు మసీదులో ఈ క్రింది మధురవాక్యాలు పలికారు. "ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నేను లేక ఈ జగత్తు అంతా వారికి శూన్యం, నా కథలు తప్ప మరేమీ చెప్పడు, సదా నన్నే ధ్యానం చేస్తారు. నా నామాన్నే ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారు. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానిస్తారో వారికి నేను ఋణగ్రస్తుడిని, వారికి మోక్షాన్ని యిచ్చి వారి ఋణం తీర్చుకుంటాను. ఎవరయితే నన్నే చింతిస్తూ నా గురించే దీక్షతో ఉంటారో, ఎవరయితే నాకు అర్పించనిదే ఏమీ తినారో అలాంటివారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరయితే నా సన్నిధానానికి వస్తారో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోతారు. కాబట్టి నీవు గర్వం అహంకారం లేశమైన లేకుండా, నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్యశరణాగతి వేడుకోవాలి''

నేననగా నెవరు?

 

 

 

 


నేను అంటే ఎవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించారు. వారు ఇలా అన్నారు : "నన్ను వెదకడానికి నీవు దూరంగాని మరెక్కడికిగాని వెళ్ళనక్కరలేదు. నీ నామం నీ ఆకారం విడిచినట్లయితే నీలోనేగాక అన్ని జీవులలోను, చైతన్యం లేదా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది. అదే నేను. దీన్ని నీవు గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోనూ నన్ను చూడు. దీన్ని నీవు అభ్యసించినట్లయితే, సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందుతావు''
హేమాడ్ పంతు చదివేవారికి ప్రేమతో నమస్కరించి వేడుకునేది ఏమిటంటే వారు వినయవిధేయతలతో దైవాన్ని, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక! బాబా అనేకసార్లు "ఎవరయితే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారు అవుతారు. ఎవరయితే బాధలను అనుభవిస్తారో, ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతి కూరుస్తారు'' అని చెప్పారు కదా! బాబా సర్వవస్తుజీవ సముదాయాలలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నాలుగు పక్కల నిలిచి సహాయపడతారు. సర్వజీవులను ప్రేమించటమే తప్ప వారు మరేమీ కోరరు. ఇలాంటి శుభమైన పరిశుభ్రమైన అమృతం వారి పెదవులనుండి స్రవిస్తూ ఉండేది. హేమాడ్ పంతు ఇలా ముగిస్తున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడుతారో, ఎవరు దాన్ని భక్తితో వింటారో, ఉభయులను సాయితో ఐక్యం అవుతారు.

43, 44 అధ్యాయాలు సంపూర్ణం
ఆరవరోజు పారాయణ సమాప్తం