Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ఇరవై ఎనిమిదవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము


ఇరవై ఎనిమిదవ అధ్యాయము

 

 

 

 

బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట.
1. లక్ష్మీ చంద్ 2. బురహాన్ పూరు మహిళ 3. మేఘశ్యాముడు - మొదలగు వారి అనుభవములు.
శ్రీ సాయి అనంతుడు, చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతం సకలజీవులందు ఉన్నారు. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానంలో, ఆత్మసాక్షాత్కారవిద్యలో వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండటంతో వారు సద్గురువులు అనిపించుకోవడానికి సమర్థులు. పండితులయినప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కాజాలరు. సాధారణంగా తండ్రి శరీరాన్ని పుట్టిస్తారు. తరువాత చావు జీవితాన్ని వెంబడిస్తుంది. కాని సద్గురువు చావుపుట్టుకలను రెండింటినీ దాటిస్తారు. కాబట్టి వారు అందరికంటే దయార్థ్ర హృదయులు.
సాయిబాబా అనేకసార్లు ఇలా అనేవారు "నా మనుష్యుడు ఎంత దూరంలో ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ, పిచ్చుక కాళ్ళకు దారం కట్టి ఈడ్చినట్లు అతనిని షిరిడీకి లాగుతాను'' అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము.
లాలా లక్ష్మీచంద్ :

 

 

 


అతడు మొట్టమొదటిగా రైల్వేలోనూ, అటు తరువాత బొంబాయిలోని శ్రీవెంకటేశ్వర ముద్రాణాలయంలోను, తరువాత ర్యాలీ బ్రదర్సు కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేశారు. 1910వ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యం లభించింది. శాంతాక్రజులో, క్రిస్ మస్ పండుగకు ఒకటి రెండు మాసాలకు పూర్వం, స్వప్నంలో గడ్డంతో ఉన్న ఒక ముసలివాడిని, చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూశారు. కొన్నాళ్ళ తరువాత దాసగణు కీర్తన వినడానికి తన స్నేహితుడైన దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ యింటికి వెళ్లారు. కీర్తన చేసేటప్పుడు దాసగణు బాబా పటాన్ని సభలో పెట్టటం ఆచారము. స్వప్నంలో చూసిన ముసలివాడిని ముఖలక్షణాలు ఈ పటంలో ఉన్నవారికి సరిపోయింది.

 

 

 

కాబట్టి తాను సాయిబాబాను స్వప్నంలో చూసినట్లు గ్రహించారు. పటం దాసగణు కీర్తన, తుకారాం జీవితం (అప్పుడు దాసగణు చెపుతున్న హరికథ) ఇవన్నీ మనస్సులో నాటి, లక్ష్మీచంద్ షిరిడీ వెళ్ళడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. సద్గురువుని వెదకడంలోను అధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడును అనేది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడైన శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వస్తావా అని అడిగాడు. అతని ఆనందానికి అంతులేకపోయింది. షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. పినతండ్రి కొడుకుదగ్గర 15 రూపాయలు అప్పు పుచ్చుకుని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న తరువాత షిరిడీకి ప్రయాణమయ్యాడు. రైలులో అతనూ, స్నేహితుడైన శంకరరావూ భజన చేశారు. సాయిబాబా గురించి తోటి ప్రయాణీకులు అడిగారు. చాలా సంవత్సరాలనుంచి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగిపుంగవులని వారు చెప్పారు. కోపర్ గాం రాగానే అతడు బాబా కోసం జామపళ్ళను కొనాలని అనుకున్నాడు.కాని ఆ గ్రామపరిసరాలను, ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందించి ఆ విషయం మరిచిపోయాడు. షిరిడీ సమీపిస్తుండగా వారికి ఈ సంగతి జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపుబండి వెంట పరిగెత్తుకుని వస్తున్నది. అతడు బండిని ఆపి కొన్ని యెంపుడు పళ్ళను మాత్రమే కొన్నాడు. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన తరపున బాబాకి అర్పితం చేయమని కోరింది. జామపండ్లను కొనాలని అనుకోవడం, ఆ విషయం మరిచిపోవడం, ముసలమ్మను కలుసుకోవడం, ఆమె భక్తి ఇవన్నీ యిద్దరికీ ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చు అనుకున్నారు. అంతలో బండి షిరిడీ చేరుకుంది.

 

 

 

వారు మసీదుపై జండాలను చూసి నమస్కరించారు. పూజాసామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచితరీతిలో పూజించారు. లక్ష్మీచంద్ మనస్సు కరిగింది. బాబాను చూసి చాలా సంతోషించాడు. సువాసనగల తామరపువ్వును భ్రమరం చూసి సంతోషించినట్లు బాబా పాదాలను చూసి సంతోషించాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు "టక్కరి వాడు! దారిలో భజన చేస్తాడు. నన్ను గురించి యితరులను విచారిస్తూ ఉంటాడు. ఇతరులను అడగడం ఎందుకు? మన కళ్ళతో సమస్తం చూడాలి. ఇతరులను అడగవలసిన అవసరం ఏమిటి? నీ స్వప్నం నిజమయిందా కాదా అనేది ఆలోచించు. మార్వాడీ దగ్గర 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరం ఏమిటి? హృదయంలోని కోరిక ఇప్పుడయినా నెరవేరిందా?
ఈ మాటలు విని బాబా సర్వజ్ఞాత్వానికి లక్ష్మీచంద్ ఆశ్చర్యపడ్డాడు. బాబాకి ఈ సంగతులనీ ఎలా తెలిశాయి అని అతడు ఆశ్చర్యపడ్డాడు. అందులో ముఖ్యంగా గమనించదగినది బాబా దర్శనం కోసంగాని, సెలవురోజు అంటే పండుగ దినం గడపటంగాని, తీర్థయాత్రలకు వెళ్ళడానికి గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము.
సాంజా (ఉప్మా) :

 

 

 


మధ్యాహ్న భోజనానికి కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్ కి ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చాడు. అది తిని లక్ష్మీచంద్ సంతోషించాడు. ఆ మరుసటిరోజు కూడా దాన్ని ఆశించాడు. కాని ఎవరూ సాంజా తీసుకురాలేదు. అతడు సాంజా కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. మూడవరోజు హారతి సమయంలో బాపూసాహెబ్ జోగ్ ఏ నైవేద్యం తీసుకొని రావాలని బాబాను అడిగారు. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పారు. భక్తులు రెండుకుండల నిండా సాంజా తీసుకువచ్చారు. లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉన్నాడు. అతని వీపు నొప్పిగా ఉండింది. బాబా ఇలా అన్నారు "నీవు ఆకలితో ఉండటం మేలైనది. కావలసినంత సాంజా తిను. నీ వీపు నొప్పికి ఏదయినా ఔషదం తీసుకో'' బాబా తన మనస్సును కనిపెట్టారని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడ్డాడు. బాబా ఎంత సర్వజ్ఞుడు.
దోషదృష్టి :

 

 

 


ఆ సమయంలోనే లక్ష్మీచందు చావడి ఉత్సవాన్ని చూసాడు. అప్పుడు బాబా దగ్గుతో బాధపడుతున్నారు. ఎవరిదో దోషదృష్టి ప్రసరించటంతో బాబాఐ బాధ కలిగింది అనుకున్నారు. ఆ మరుసటి ఉదయం లక్షీచందు మసీదుకి వెళ్లగా బాబా శ్యామాతో ఇలా అన్నారు "ఎవరిదో దోషదృష్టి నాపై పడటంతో నేను బాధపడుతున్నాను'' ఇలా లక్ష్మీచందు మనస్సులో ఏమి భావిస్తున్నాడో అది అంతా బాబా వెల్లడి చేస్తూ ఉన్నారు.
ఈ విధంగా సర్వజ్ఞతకు, కారుణ్యానికి కావలసినన్ని నిదర్శనాలను చూసి లక్ష్మీచందు బాబా పాదాలపై పడి "మీ దర్శనం వలన నేను ఎంతో సంతోషించాను. ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యాలను చూపించి నన్ను రక్షించు. నాకీ ప్రపంచంలో మీ పాదాలు తప్ప యితర దైవం లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజయందు, మీ భజనయందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షంతో నన్ను ప్రపంచ బాధలనుండి కాపాడుదురుగాక! నేను ఎల్లప్పుడూ మీ నామాన్నే జపిస్తూ సంతోషంతో ఉందునుగాక!'' అని ప్రార్థించాడు.
బాబా ఆశీర్వాదాన్ని, ఊదీప్రసాదాలను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషంతో, తృప్తితో, స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు. దారిలో బాబా మహిమలను కీర్తిస్తూ ఉన్నాడు. సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉన్నాడు. షిరిడీకి వెళ్ళే పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరాన్ని, దక్షిణ పంపిస్తూ ఉండేవాడు.
2.     బురహాన్ పూరు మహిళ :

 

 

 


ఇంకొక పిచ్చుక (భక్తురాలి) వృత్తాతం చూద్దాము. బురహాన్ పూరులో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనబడి గుమ్మం దగ్గరికి వచ్చి తినడానికి 'కిచిడీ' కావాలి అన్నారు. మేల్కొని చూడగా తన ద్వారం దగ్గర ఎవరూ లేరు. చూసిన దృశ్యానికి చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేసింది. తన భర్తకు కూడా తెలిపింది. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తుండేవాడు. అతనికి అకోలాకు బదిలీ చేశారు. భార్యాభర్తలు షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకుని ఒక శుభదినంలో షిరిడీకి బయలుదేరారు.మార్గమధ్యంలో గోమతీ తీర్థాన్ని దర్శించి షిరిడీ చేరి, అక్కడ రెండు మాసాలు ఉన్నారు. ప్రతిరోజూ మసీదుకు వెళ్ళి బాబాను దర్శించి, పూజించి అత్యంత సంతోషిస్తూ ఉన్నారు. వారు బాబాకు కిచిడీ ప్రసాదం సమర్పించాలని షిరిడీకి వచ్చారు. కాని అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలాయాపన యిష్టం లేకపోయింది. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చింది. మసీదులో అందరూ భోజనానికి కూర్చున్నారు. కాబట్టి తెరెవేసి ఉంది. తెరవేసి ఉన్నప్పుడు ఎవరూ లోపల ప్రవేశించడానికి సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయింది. ఒక చేతితో తెర పైకి ఎత్తి లోపలికి ప్రవేశించింది. బాబా ఆరోజు కిచిడీ కోసం కనిపెట్టుకుని ఉన్నట్టు తోచింది. ఆమె కిచిడీ అక్కడ పెట్టగానే బాబా సంతోషంతో ముద్దమీద ముద్ద మ్రింగటం ప్రారంభించారు. బాబా ఆతృతను చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ కిచిడీ కథను విన్న వారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉన్నదనడానికి విశ్వసించారు.
3. మేఘశ్యాముడు :

 

 

 


ఇక అన్నిటికంటె పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినండి. విరమ్ గాం నివాసి అయిన మేఘశ్యాముడు హరి వినాయక సాఠేగారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి ('ఓం నమశ్శివాయ') జపించేవాడు. అతనికి సంధ్యావందనంగాని, గాయత్రి మంత్రంగాని తెలియకపోయింది. సాఠేగారికి ఇతనిలో శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రంతో సంధ్యావందనం నేర్పించారు. సాయిబాబా శివుని అవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించారు. బ్రోచి స్టేషను దగ్గర సాయిబాబా మహామ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనని అక్కడికి పంపవద్దని యజమానిని వేడుకున్నాడు. కాని ఆ యజమాని మేఘుడు షిరిడీకి వెళ్ళితీరాలని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరం షిరిడీవాసి తన మామగారైన దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలగజేయాలని ఇచ్చారు. షిరిడీకి చేరి మసీదుకు వెళ్లగా బాబా కోపగించుకుని అతన్ని లోపలికి రానీయక, "ఈ వెధవను తరిమివేయండి!'' అని గర్జించి మేఘునితో ఇలా అన్నారు "నీవు గొప్పజాతిబ్రాహ్మణుడివి. నేనా తక్కువజాతి మహామ్మదీయుడిని. నీవు ఇక్కడికి వచ్చినతో నీ కులం పోతుంది, కనుక వెళ్ళిపో'' ఈ మాటలు విని మేఘుడు వణకడం ప్రారంభించాడు. అతడు తన మనస్సులో ఉన్న విషయాలు బాబాకి ఎలా తెలిశాయి అని ఆశ్చర్యపడ్డాడు.

 

 

 

కొన్ని రోజులు అక్కడే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవిస్తూ ఉన్నాడు. కాని అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన యింటికి వెళ్లాడు. అక్కడనుండి త్రయంబక్ (నాసిక్ జిల్లా) వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం 6 మాసాలు ఉన్నాడు. తిరిగి షిరిడీకి వచ్చాడు. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకోవడంతో అతడు మసీదులోకి ప్రవేశించడానికి, శిరిదేలో ఉండటానికి బాబా సమ్మతించారు. మేఘశ్యాముడికి బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగచేస్తూ చాలా మేలు చేశారు. అప్పటినుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావిస్తూ ఉండేవాడు. శివుని అర్చనకు బిల్వపత్రి కావాలి. మేఘుడు ప్రతిరోజూ మైళ్ళకొద్దీ నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజిస్తూ ఉండేవాడు. గ్రామంలో ఉన్న దేవతలనందరినీ పూహింసిన తరువాత మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి తరువాత బాబాను పూజిస్తూ ఉండేవాడు. కొంతసేపు వారి పాదాలు ఒత్తిన తరువాత బాబా పాదతీర్థం త్రాగుతుండే వాడు. ఒకరోజు ఖండోబా మందిరం వాకిలి మూసి ఉండటంతో ఖండోబాదేవుని పూజించకుండా మసీదుకు వచ్చాడు. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపేశారు. ఖండోబా మందిరం వాకిలి తెరిచి ఉన్నదని చెప్పారు. మేఘశ్యాముడు మందిరానికి వెళ్ళాడు. వాకిలి తెరిచి ఉండటంతో ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాడు.
గంగాస్నానము :

 

 

 


ఒక మకరసంక్రాతి రోజు మేఘుడు బాబా శరీరానికి చందనం పూసి గంగానదీ జలంతో అభిషేకం చేయాలని తలచుకున్నాడు. బాబాకు అది ఇష్టం లేడుపోయింది. కాని అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించారు. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరం నడిచి గోమాతీనదీ తీర్థాన్ని తీసుకురావాసి ఉండింది. అతడు తీర్థం తెచ్చి, ప్రయత్నాలు అన్ని చేసుకుని, బాబా దగ్గరికి 12 గంటలకు వచ్చి, స్నానానికి సిద్ధంగా ఉండమన్నాడు. బాబా తనకా అబిషేకం వద్దనీ, ఫకీరు అవటంతో గంగానదీ జలంతో ఎలాంటి సంబంధం లేదనీ చెప్పారు. కాని మేఘుడు వినలేదు. శివునికి ఆహిషేకం ఇష్టం కాబట్టి, తనకు శివుడిన బాబాకు అభిషేకం చేసి తీరాలని పట్టుబట్టాడు. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీఠంపై కూర్చుని తల ముందుకు సాచి ఇలా అన్నారు "ఓ మేఘా! ఈ చిన్న ఉపకారం చేసి పెట్టు. శరీరానికి తల ముఖ్యం.కాబట్టి తలపైన నీళ్ళు పోయి. శరీరం అంతా పోసినట్లు అవుతుంది'' అలాగే అని మేఘశ్యాముడు ఒప్పుకుని, నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయడానికి ప్రయత్నించాడు. కాని భక్తిపారవశ్యంతో 'హరగంగే, హరగంగే' అంటూ శరీరం అంతటా నీళ్ళు పోశాడు. కుండా ఒక ప్రకక్కు పెట్టి బాబా వైపు చూశాడు. వాడి ఆశ్చర్యానందాలకు అంతులేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరం అంతా పొడిగా ఉండిపోయింది.
త్రిశూలము, లింగము :

 

 

 


మేఘశ్యాముడు బాబాను రెండుచోట్ల పూజిస్తూ ఉండేవాడు. మసీదులో బాబాను స్వయంగా పూజిస్తూ ఉన్నాడు. వాడాలో నానాసాహెబు చాందోర్కరు ఇచ్చి పటానికి పూజిస్తూ ఉండేవాడు. ఈ ప్రకారంగా 12 నెలలు చేశాడు. వాడి భక్తికి మెచ్చుకున్నానని తెలపడానికి బాబా అతనికి ఒక దృష్టాంతం చూపారు. ఒకరోజు వేకువఝామున మేఘుడు తన శయ్యపై పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ, లోపల ధ్యానం చేస్తూ బాబా రూపాన్ని చూసాడు. బాబా అతనిపై అక్షింతలు జల్లి "మేఘా! త్రిశూలం గీయి'' అని చెప్పి అదృశ్యం అయ్యారు. మేఘుడు బాబా మాటలు విని, ఆతృతగా కళ్ళు తెరిచాడు. బాబా కనిపించలేదు గాని, అక్షింతలు అక్కడక్కడా పడిఉన్నాయి. బాబా దగ్గరికి వెళ్ళి, చూసిన దృశ్యం గురించి చెప్పి త్రిశూలాన్ని గీయటానికి ఆజ్ఞ ఇమ్మన్నాడు. బాబా అలా అన్నారు "నా మాటలు వినలేదా? త్రిశూలాన్ని గీయమన్నాడు. అది దృశ్యం కాదు. స్వయంగా వచ్చి నేనే చెప్పాను. నా మాటలు పొల్లుకావు. అర్థవంతాలు'' మేడుడు ఇలా అన్నాడు "మీరు నన్ను లేపినట్లు భావించాను. తలుపులన్నీ వేసి ఉండటంతో అది దృశ్యం అనుకున్నాను'' బాబా తిరిగి ఇలా జవాబిచ్చారు "ప్రవేశించడానికి నాకు వాకిలి అవసరం లేదు. నాకు రూపం లేదు. నేనన్ని చోట్ల నివసిస్తున్నాను. ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానంలోనే మునిగి ఉంటారో వారి పనులన్నీ సూత్రదారినై నేనే నడిపిస్తాను''

 

 

 


మేఘుడు వాడాకు తిరిగి వచ్చి, బాబా పటం దగ్గర గోడపై త్రిశూలాన్ని ఎర్రరంగుతో గీశాడు, ఆ మరుసటి రోజు ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగాన్ని సమర్పించాడు. అప్పుడే మేఘుడు కూడా అక్కడికి వచ్చాడు. బాబా ఇలా అన్నారు "చూడు శంకరుడు వచ్చినాడు! జాగ్రత్తగా పూజింపుము!'' మేఘుడు త్రిశూలం గీసిన వెంటనే లింగం రావడం చూసి ఆశ్చర్యపడ్డాడు. వాడాలో కాకాసాహెబు దీక్షిత్ స్నానం చేసి సాయిని తలచుకుంటుండగా తన మనోద్రుష్టిలో లింగం రావడం చూశాడు. అతడు ఆశ్చర్యపడుతుండగా మేఘశ్యాముడు వచ్చి, బాబా తనకు లింగం కానుకగా యిచ్చారని చూపించాడు. దీక్షిత్ దాన్ని చూసి సరిగా అది తన ధ్యానంలో కనిపించినదానిలా ఉన్నదని సంతోషించాడు. కొద్ది రోజులలో త్రిశూలాన్ని వ్రాయటం పూర్తికాగా బాబా, మేఘశ్యాముడు పూజచేస్తున్న పెద్దపటం దగ్గర లింగాన్ని ప్రతిష్టించారు. మేఘశ్యాముడికి శివుణ్ణి పూజించటం చాలా ప్రీతి గనుక త్రిశూలాన్ని వ్రాయించి, లింగాన్ని ప్రతిష్టించడం ద్వారా బాబా వాడిలో ఉన్న నమ్మకం స్థిరపరిచారు.

 

 

 


అనేక సంవత్సరాలు బాబా సేవ చేసి అంటే పూజా, మధ్యాహ్న, సాయంకాల హారతి సేవలు చేసి చివరికి 1912లో మేఘశ్యాముడు కాలం చెందాడు. బాబా వాడి కళేబరంపై చేతులు చాచి "ఇతడు నా నిజమైన భక్తుడు'' అన్నారు. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజనం ఏర్పాటు చేయమన్నారు. కాకాసాహెబు దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చారు.

ఇరువది ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం