Read more!

ఇంద్రజిత్ చేతిలో రామలక్ష్మణుల ప్రాణాలు!

 

ఇంద్రజిత్ చేతిలో రామలక్ష్మణుల ప్రాణాలు!

అంగదుడు కొట్టిన దెబ్బకు ఇంద్రజిత్ రథం బోల్తా పడిపోవడం చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కనిమిషం ఏమి జరిగిందో ఇంద్రజిత్ కి అర్థం కాలేదు. అతను పరిస్థితిని అర్థం చేసుకుని పరిసరాలను గమనించాడు. తన రథం విరిగిపోయి ఉండటం చూసేసరికి ఇంద్రజిత్ కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు అతను తనకున్న మాయ చేత మంత్రాలను జపించగానే ఆ ప్రాంతం అంతా రాత్రిపొద్దు లాగా చీకటి అలుముకుంది. ఆ తరువాత అతనికి ఉన్న మాయల సహాయంతో  సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి, ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి, రామలక్ష్మణుల మీద బాణాల వర్షం కురిపించాడు. 

కద్రువ యొక్క కొడుకులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. వాటిని నాగాస్త్రాలు అంటారు.  ఆ సర్పాలు అన్నీ  బాణములుగా వచ్చి కొట్టడమే కాకుండా,  సర్పాలుగా చుట్టుకుని మర్మ స్థానములలో కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామలక్ష్మణులని నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది. అదంతా అర్థం చేసుకున్న రాముడు లక్ష్మణుడితో "లక్ష్మణా! మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్ ని ఏమి చెయ్యలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలని కొంతసేపు భరిస్తూ ఉండకతప్పదు. ఎందుకంటే ఈ నాగాస్త్ర బంధనాన్ని విడిపించుకోలేము" అన్నాడు. 

ఆ మాటలు చెప్పగానే రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. కానీ వాటిని ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ "ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధ భూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యను విడిపించుకోడానికి ఈ లంకా పట్టణానికి వచ్చాడో అటువంటి రాముడు ఇవ్వాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి, ఉత్సాహము తగ్గిపోయి, భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు" అని అనుకున్నాడు. 

తరువాత కొంతసేపటికే లక్ష్మణుడు కూడా కింద పడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండం చేతిలోనుండి వదులయిపోయి దూరంగా పడిపోయింది. రామలక్ష్మణుల వేళ్ళ యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి ఆవేశంతో ఊగిపోతూ "మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వలన ఈ లంకా పట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వలన మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి ఋణం తీర్చుకోడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకూ కొడతాను" అని, వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి ఎంతో శక్తివంతమైన  బాణములతో కొట్టాడు.

అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి పూర్తిగా భూమి మీద ఒరిగిపోయాడు, లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్శిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాధనుడిని బాణాలతో కొట్టాడు.

వానరసైన్యంలో ఎంతో గొప్ప వీరులైన వారందరినీ ఇంద్రజిత్ అలా బాణాలతో కొట్టేసరికి వానర సైన్యం భయపడిపోయింది. వాళ్ళందరూ ఇంద్రజిత్ బాణాలు తమమీద పడుతాయేమో అని వణికిపోసాగారు. ఆ సమయంలో ఆ వానరులు అంతా ఎటు వెళుతున్నారో, ఎవరి మీద నుండి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు.

                                       ◆నిశ్శబ్ద.