Read more!

పూజా సమయం ఎప్పుడు?

 

పూజా సమయం ఎప్పుడు?

 

 

మన పూర్వికులు పూజా విధానాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు. 5,16,18,226 విధాలుగా పూజలనూనుసరించడం జరుగుతోంది. అసలు మెలకువ వచ్చిన వెంటనే భగవంతుని స్మరిస్తూ కుడి అరచేతిని చూసుకుంటూ కళ్ళు తెరవాలని చెప్పారు. అందుకనే ప్రభాత కాలంలో కరదర్శనం కల్యాణప్రదం.
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ
కరపృష్ఠే చ గోవింద: ప్రభాతే కరదర్శనం

ఇక పూజలకు, అర్చనలకు, ఉపాసనలకు సంధ్యా సమయం ఎంతో ఉత్తమమైనదని నిర్ణయించారు. త్ర్సంధ్యోపాసన అత్యంత ఫలదాయకమైనది. త్రిసంధ్యలను -
1. ప్రాత: సంధ్య
2. మధ్యాహ్నసంధ్య
3. సాయంసంధ్య
అని మూడు రకాలుగా విభజించారు.

1. ప్రాత:సంధ్య – ఇది మరలా మూడు విధాలు. అ) ఉత్తమం (భ్రాహ్మీముహూర్తం) , ఆ) మధ్యమం (తారకా రహీం), ఇ) అధమం (సూర్యోదయం అనంతరం అంటే, సూర్యోదయానికి ముందు ఘడియలకు ముందన్నమాట.
2. మధ్యాహ్నసంధ్య – మిట్ట మధ్యాహ్నానికి ఒకటిన్నర ఘడియల ముందు, ఒకిన్నర ఘడియల తరువాత
3. సాయంసంధ్య – అ) ఉత్తమం, సూర్యాస్తమయానికి 3 ఘడియల ముందు , ఆ) మధ్యమం, సూర్యాస్తమయకాలం. ఇ) అధమం, నక్షత్రాలు కనిపించిన తరువాత.

 

 



అన్ని సంధ్యలలో బ్రాహ్మీమూహూర్తకాలమే ప్రశస్తమైనది. బ్రాహ్మీముహూర్తమంటే తెల్లవారుఝామున 3.30 గంటల నుండి 4.45 గంటల మధ్య సమయమని పెద్దల వాక్కు. బ్రాహ్మీముహూర్తసమయంలో ప్రకృతి సత్త్వగుణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి. అందుకే ఈ సమయం జపతపాలకు చాల అనుకూలమైన సమయమని చెప్పబడింది. ఇక, ఘడియకాలన్ని ఒకరోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు లెక్కగడతారు. ఒకరోజు సూర్యోదయం నుంచి మరుసటిరోజు సూర్యోదయం వరకు 60 ఘడియలకాలం. అంటే 30 ఘడియలు పగలైతే, మిగతా 30 ఘడియలు రాత్రన్నమాట. సూర్యోదయం నుండి 55 ఘడియలు అనంతరపు 5 ఘడియల కాలాన్ని ఉష:కాలమని, 57 ఘడియలు దాటిన తరువాత మూడు ఘడియల కాలాన్ని అరుణోదయకాలమని అంటారు. 58 ఘడియలు దాటిన తదనంతరపు 2 ఘడియల కాలన్ని ప్రాత:కాలమని అంటారు. ఆ ప్రాత:కాలం తరువాతే సూర్యోదయం. ఇలా పరిశీలించినపుడు 55 వ ఘడియ నుంచి 58 ఘడియల మధ్యకాలం పూజలు, జపధ్యానాదులకు ప్రశస్తమైన సమయంగా చెప్పబడుతోంది. ఇక, ప్రాత:కాలన్నే నిద్రలేచి, స్నానాదికాలను ముగించి పూజ చేయడానికి ఉద్యుక్తులైన భక్తుల మనసులలో పూజ ఎలా, ఎక్కడ చేయాలన్న సందేహాలుంటాయి.

 

 



గృహే జపం సమం విద్యాగోష్ఠే శతగుణం భవేత్
నధ్యాం శత సహస్రం స్యాత్ అనంతం దైవ సన్నిధౌ
సముద్రతీరే చగ్రాదౌ గిరఒ దేవాలయేషు చ
పుణ్యాశ్రమే అర్వేషు జనం కోటి గుణోభవేత్

 

 



మన ఇంట్లో చేసే జపం సామాన్య పలితన్ని కలిగిస్తుంది. గోశాలలో చేసే జపం ఇంట్లో చేసే జపానికంటే నూరురెట్లు అధికమైన ఫలితాన్ని కలిగిస్తుంది. నదీతీరంలో చేసే జపం లక్షరెట్లు ఫలితాన్ని కలిగిస్తుండగా, సముద్ర తీరం, పర్వతశిఖరాలు, పుణ్యాశ్రమాలలో చేసే జపం కోటి ఫలితాలను ఇస్తుండాగా, దైవసన్నిధిలో చేసే జపం అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని ఋషివాక్కు.
అయితే నేటి పరిస్థితులలో, కాలంతో పోటి పడుతున్న మనిషికి అంత తీరిక లేకపోవచ్చు. అందుకే కాస్త పెద్ద ఇల్లుగలవాళ్ళు పూజగదిని, ఇరుకు ఇళ్ళూగలవాళ్ళు ఓ వైపు పూజాప్రదేశాన్ని ఏర్పాటుచేసుకుని పూజలను నిర్వహించుకుంటున్నారు. పూజా ప్రదేశాన్ని పరిశుభ్రముగా ఉంచుకోవడంతో పాటూ మనసును కూడ ప్రశాంతముగా ఉంచుకోవాలి. అప్పుడే పూజలను నిర్విఘ్నంగా చేసేందుకు వీలవుతుంది. పూజ చేస్తున్నప్పుడు ఆసనానికి కూడ అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ నిర్విఘ్నంగా జరిగేందుకు ఆసనం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే ఆసనం గురించి ఈ క్రింది విధంగా చెప్పారు.
ఆత్మసిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం
నవసిద్ధి ప్రదానాశ్చ ఆసనం పరికీర్తితం

ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి, సర్వరోగాలను నివారించడానికి, నవసిద్ధులను ప్రాప్తింపజేయడానికి, ‘ఆసనం’ అత్యంతావశ్యకమైయున్నదని చెప్పబడుతోంది.

 

 


ఇక ‘ఆ’ అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తూ, 'స' అంటే సర్వరోగాలను హరిస్తూ, 'నం' అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్థం. ఆ రోజులలో పులిచర్మాన్ని, కృష్ణాజినం, కంబళి, దర్భాసనం, పట్టు వస్త్రం, నూలువస్త్రాలను ఆసనాలుగా ఉపయోగించేవారు. నేటి పరిస్థితులకు తగినట్లుగా పులిచర్మం, కృష్ణాజినం తప్ప మిగితావాటిని అసనాలుగా ఉపయోగించుకోవచ్చు.
కొంతమంది పూజలోని అంత్రరార్థాన్ని తెలుసుకోకుండా, అదొక తంతువలె భావిస్తుంటారు.
పూజను ప్రారంభించేటప్పుడు ముందుగా ధ్యానంతో ప్రారంభిస్తాం. ధ్యానం ద్వారా భక్తునికి, తానెవరో, తను ఇక్కడకు ఎందుకు వచ్చాడో , ఈ ప్రయాణం ఎక్కడికి పోతుందోనన్న విషయన్ని తెలుసుకుంటాడు. అన్ని కర్మలను విడిచిపెట్టి మన మనస్సును లీనం చేయడం ఆవాహనమనబడుతుంది. ఆ స్వామే అన్నింటికి ఆధారమన్న జ్ఞానాన్ని ఆసనం. స్వామిపట్ల అంకితభావాన్ని కలిగిఉండటం సాద్యం. మనసులోకి ఏ ఇతర భావనలు రాకుండా అరికట్టడం అర్ఘ్యం. అమృతవృత్తియే స్నానం. రాగద్వేషాలకు అతీతంగా ఉండటం గంధం. కర్మవాసనలకు దూరంగా ఉండటమే అక్షతలు. మనసులో దోషాలేవీ లేకుండా మనస్సును అర్పించడమే పుష్పం. మనసులోనున్న చెడు ఆలోచనలను దూరంగా పోగొట్టు కోవడం ధూపం వలన సాధ్యమవుతుంది. తనకు ఈ లోకంలో లభించినవన్నీ ఆయనవలననే లభించాయన్న ఉద్దేశ్యంతో నైవేద్యాన్ని సమర్పిస్తుంటాం. నిశ్చలంగా మనసులో ఎటువంటి భావనలు లేకుండా ఉండటం ప్రదక్షిణం. ఆయనే నేను అన్న భావాన్ని కలిగి ఉండటం నమస్కారం. మౌనంగా ఉండటం స్త్రోత్రం. సర్వసంతోషమే విసర్జనం అని చెప్పబడింది. ఇలా మన నిర్వహించే పూజలోని ఉపచారాలు అంతరార్థమై ఉంది. అలాగే మన పెద్దలు అధ్యాత్మిక సాధనలో ఇంద్రియాలే సాధనాలని, ప్రాణాలే సేవకులని, షట్ కమలాలే పువ్వులని, శరీరంలో ఉన్న అగ్నే ధూపమనీ, జీవకళలే దీపాలని, అనందమే నైవేద్యమని, లోనున్న సూర్యచంద్ర జ్యోతులే హారతులనీ, బ్రహ్మపథంలో ఉన్న పరమాత్మను సేవించడమే ఈశ్వరసేవ అని చెప్పబడింది.

త్వం సర్వభూతేషు విరాజసే సదా
సర్వేషు జీవేస్వపి జీవనం స్వయం
త్వద్దర్శనం సర్వగమేస్తు సర్వత
స్తలైన పూజాస్తు చ కర్మభిర్మమ

 

 


ఓ సర్వాంతర్యామీ! నీవు నిరంతరం సర్వ ప్రాణూలలో నిండి ఉన్నావు. సమస్త ప్రాణులలో ప్రాణంగా ఉన్నావు. సర్వత్రా నీ దర్శనం మాకు కలుగుగాక. నా సమస్త కర్మలతోనే నీ పూజ అగుగాక. నీ కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలి స్వామీ!!

"మన పూజా విధానాలలో అనేక అంతరార్థాలున్నయి. పెద్దలు మన కోసం ఏర్పరిచిన ఈ విధానాలు, మన జీవితాలను సన్మార్గం వైపు నడిపించి, జీవితాన్ని అనందమయం చేస్తాయి. పూజా విధానంలో ప్రతి ఒక్క ఉపచారం వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంది.''