గంగానదిలో స్నానం చేసిన తరువాత బట్టలు పిండుతున్నారా... ఈ నిజాలు తెలుసా!
గంగానదిలో స్నానం చేసిన తరువాత బట్టలు పిండుతున్నారా... ఈ నిజాలు తెలుసా!
గంగా నది భారతదేశపు పవిత్ర నదులలో ఒకటి. ఇది జీవనది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది గంగానదిలో స్నానం చేయడానికి వెళతారు. సాధారణంగా నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేసి నది నుండి బయటకు రాగానే బట్టలకు ఉన్న నీటిని పిండేస్తుంటారు. అయితే గంగానదిలో స్నానం చేసిన తరువాత ఇలా నీటిని పిండటం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు పండితులు. కేవలం ఇలా నీటిని పిండేయటమే కాకుండా గంగా నది స్నానం తర్వాత చాలామంది చేసే కొన్ని తప్పుల గురించి చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
స్నానం..
గంగానది స్నానం పరమ పవిత్రం. చాలామంది నదీ స్నానం చేసిన తరువాత నదిలోనే బట్టలు పిండుతు ఉంటారు. పవిత్రమైన జలంతో స్నానం చేయాలి కానీ ఇలా బట్టలు ఉతకడం సరైన పని కాదు. ఇలా చేయడం వల్ల నది కలుషితం అవుతుంది. దీని వల్ల స్నానం చేసిన పుణ్యం పక్కన పెడితే నదిని అపవిత్రం చేసిన పాపం కలుగుతుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.
స్నానం చేసిన బట్టలు..
సాధారణంగా నదిలో స్నానం చేసేటప్పుడు బట్టలతోనే స్నానం చేస్తుంటారు. ఇలా స్నానం చేసినప్పుడు ఆ బట్టలను తీసి వేరే బట్టలు మార్చుకున్నాక తిరిగి మళ్లీ తడి బట్టలను గంగానదిలో ముంచకూడదట. ఈ విషయం శివ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారని పండితులు, ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.
స్నానం చేసిన తడి బట్టలను అలాగే ఆరబెట్టేయాలని లేదంటే ఇల్లు దగ్గరలో ఉంటే ఇంటికి తీసుకెళ్లి బట్టలు ఉతికి ఆరబెట్టుకోవాలి. అంతేకానీ ఆ బట్టలను గంగానదిలో ముంచకూడదు.
గంగా నదిలో స్నానం చేసినప్పుడు ఆ తడి బట్టలను ఒక పాత్రలో ఉంచాలట. ఇలా ఉంచినప్పుడు ఆ పాత్రలో చేరే నీటిని మరణించిన పూర్వీకులు, పెద్దలు, పితృదేవతలు స్వీకరిస్తారని అంటున్నారు. ఇలా చేస్తే పితృదేవతలు సంతోషపడతారట. పైగా పాపాలన్నీ తొలగిపోతాయని కూడా చెబుతున్నారు.
స్నానానికి ముందు..
సాధారణంగా ఏదైనా పవిత్ర నదిలో స్నానానికి వెళితే వెళ్ళేముందు మొదటే ఇంటి దగ్గర లేదా గదిలో స్నానం చేయాలి. శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి. ఆ తరువాత నదీ స్నానానికి వెళ్లాలి. శుభ్రమైన దుస్తులతో నదీ స్నానం చేయాలి. అంతే కానీ నదీ స్నానానికి ముందు స్నానం చేయకుండా మాసిన మురికి బట్టలతో స్నానికి వెళ్లకూడదు. ఇలా చేస్తే అది నదిని అపవిత్రం చేసినట్టు అవుతుంది. అలా చేసే వ్యక్తి మీద ప్రతి కూల ప్రభావం కూడా పడుతుందని అంటున్నారు. స్నానం చేసిన తరువాత కూడా శరీరాన్ని మురికి బట్టలు లేదా మాసిన బట్టలతో ఎప్పుడూ తుడవకూడదు.
*రూపశ్రీ.