కిరాడు దేవాలయం.. భయంకరమైన ఈ దేవాలయం గురించి తెలుసా!
కిరాడు దేవాలయం.. భయంకరమైన ఈ దేవాలయం గురించి తెలుసా!
భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలు ఎంతో విశిష్టమైనవి, ఆశ్చర్యాన్ని, రహస్యాన్ని దాచుకుని ఉన్నాయి. అలాంటి ఆలయాలలో కిరాడు దేవాలయం కూడా ఒకటి. రాజస్థాన్ లెక్కలేనన్ని విశిష్టమైన, వెన్నులో వణుకు పుట్టించే గాథలతో నిండి ఉంది. వాటిలో ఒకటి బార్మర్ జిల్లాలోని కిరాడు దేవాలయం. ఈ దేవాలయం నేటికీ భయానకమైనదిగా, భయంకరమైన రహస్యాలతో నిండి ఉందని చెబుతారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం దాని వాస్తుశిల్పం లానే అందంగా, అద్భుతంగా ఉంటుంది. కానీ దాని వెనుక ఉన్న కథ కూడా అంతే భయానకమైనది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
సాధువు శాపం..
ఈ ప్రాంతమంతా ఒక సాధువు పెట్టిన భయంకరమైన శాపం ప్రభావంలో ఉందని స్థానికులు నమ్ముతారు. నేటికీ, సూర్యాస్తమయం తర్వాత ఆలయ సరిహద్దుల్లో ఉండే ఎవరైనా శాశ్వతంగా రాతి విగ్రహంగా మారిపోతారని గ్రామస్తులు చెబుతారు.
కల్నర్ టాడ్ పుస్తకం..
రాజస్థాన్ విశిష్ట చరిత్రను మరింత లోతుగా పరిశీలిస్తే, ప్రఖ్యాత చరిత్రకారుడైన కల్నల్ జేమ్స్ టాడ్ రచించిన 'అన్నల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్' అనే పాత పుస్తకంలో ఈ ప్రాంతం గురించి చాలా విషయాలు ప్రస్తావించారు.
ఈ పుస్తకంలోని కొన్ని పేజీలను పరిశీలిస్తే, కిరాడు ఒకప్పుడు నిర్జన ప్రదేశం కాదని, గొప్పగా వర్ధిల్లుతున్న, సంపన్నమైన పట్టణమని తెలుస్తుంది. కానీ కాలంతో పాటు ఆ ఉల్లాసభరితమైన పట్టణం ఒక భయంకరమైన నిశ్శబ్దంగా మారిపోయిందట. శతాబ్దాల క్రితం ఒక ప్రఖ్యాత ఋషి తన కొంతమంది శిష్యులతో కలిసి ఈ ఆలయంలో బస చేయడానికి వచ్చారని పెద్దలు చెబుతారు. అయితే, ఆయన కోపం ఈ ప్రదేశాన్ని శాశ్వతంగా మార్చివేసిందని అంటారు.
అన్నింటినీ నాశనం చేసిన విషాద కథ..
ఈ ఆలయ శాపం వెనుక ఉన్న కథ భయంకరమైనది , హృదయ విదారకమైనది. ఒకానొకప్పుడు ఒక ఋషి తన శిష్యులను ఈ ఆలయంలో విడిచిపెట్టి కొన్ని రోజుల పాటు యాత్రకు వెళ్ళాడట. అతను వెళ్ళిపోయిన వెంటనే, అతని శిష్యులందరికీ అకస్మాత్తుగా ఒక తీవ్రమైన , తెలియని అనారోగ్యం సోకిందట.
అనారోగ్యంతో, నొప్పితో బాధపడుతున్న సాధువులకు సహాయం చేయడానికి గ్రామంలోని వారెవరూ ముందుకు రాలేదు. ఆ గ్రామం మొత్తంలో, కేవలం ఒక పేద కుమ్మరి స్త్రీ మాత్రమే మానవత్వంతో వారికి రేయింబవళ్లు సేవ చేసి అనారోగ్యంతో ఉన్న శిష్యుల ప్రాణాలను కాపాడిందట.
ఋషి శాపం..
మహర్షి తన ప్రయాణం నుండి తిరిగి వచ్చి తన శిష్యుల దుస్థితిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడట. గ్రామస్తుల ఉదాసీనత, నిర్దయ ఆయన హృదయాన్ని కలచివేసి, ఆ ఊరంతటిపై ఒక భయంకరమైన శాపాన్ని ఇచ్చాడట.
ఇతరుల పట్ల కరుణ, ప్రేమ కనుమరుగైన చోట, అక్కడి ప్రజలకు జీవించే హక్కు లేదని, వారందరినీ రాళ్లుగా మారిపోవాలని ఆయన కోపంగా శపించాడట. ఆ మహర్షి మంచిదైన కుమ్మరి స్త్రీ ప్రాణాలను కాపాడి, వెనక్కి తిరిగి చూడవద్దని హెచ్చరిస్తూ, చీకటి పడకముందే వెంటనే ఆ గ్రామం నుండి పారిపొమ్మని ఆమెను ఆజ్ఞాపించాట.
ఈనాటికీ నిశ్శబ్దమే..
కుమ్మరి మహిళ గ్రామం విడిచి పారిపోయింది, కానీ మార్గమధ్యంలో ఆమె తనను తాను నియంత్రించుకోలేక కుతూహలంతో వెనక్కి తిరిగి చూసిందట. అప్పుడు, ఆ ఋషి శాపం వల్ల, ఆమె తక్షణమే రాతి విగ్రహంగా మారిపోయిందట. కిరాడు ఆలయానికి సంబంధించిన ఈ భయంకరమైన చరిత్ర, , ఆ కుమ్మరి మహిళ రాతి విగ్రహం, బార్మర్లోని ఆ ప్రాంతంలో ఇప్పటికీ అదే ప్రదేశంలో ఉందట.
ఈ శతాబ్దాల నాటి సంఘటన ప్రజల హృదయాల్లో ఎంత భయాన్ని కలిగించిందంటే, ఇక్కడ రాత్రిపూట ఉండటానికి ఎవరూ సాహసించరు. ఆధునిక విజ్ఞానం దీనిని మూఢనమ్మకం అని పిలవవచ్చు, కానీ స్థానికులు దీనిని దృఢంగా నమ్ముతారు, అందుకే సూర్యాస్తమయం కాగానే తలుపులు మూసివేస్తారు.
*రూపశ్రీ