Read more!

శ్రీ నారసింహ క్షేత్రాలు - 10

 



శ్రీ నారసింహ క్షేత్రాలు - 10


స్వేదం చిందించే కదిరి నరసింహస్వామి

 

 

బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా
కాటమరాయుడా కదిరీ నరసింహుడా కాటమరాయుడా కదిరీ నరసిహుడా  బేట్రాయి సామి దేవుడా
ఈ సినిమా పాటతో కదిరీ నరసింహుడు అందరికీ సన్నిహితుడైపోయాడు.  మరి మనం కూడా ఆయన్ని గురించి తెలుసుకోవాలికదా.
...

అహోబిలం కొండమీద వెలసిన నవ నారసింహ రూపాలకు ప్రతీకలుగా శ్రీ నరసింహస్వామి వెలసిన తొమ్మిది క్షేత్రాలను నవనారసింహ క్షేత్రాలు అంటారు.  వాటిలో కదిరి ఒకటి.  ఇది అనంతపురం జిల్లాలో వున్నది. కదిరిలో శ్రీ నరసింహస్వామికి రెండు ఆలయాలు వున్నాయి.  కదిరి పట్టణంలో ఒకటైతే రెండవది అక్కడికి 2 కి.మీ.ల దూరంలో వున్న ఖాద్రి కొండమీద.  స్వామి తన పాదం ఈ కొండపై మోపారు.  హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామిని బ్రహ్మాదులంతా సౌమ్యమూర్తిగా దర్శనమివ్వవలసినదిగా ప్రార్ధించగా, స్వామి అంగీకరించి, ముందుకు వెళ్ళి ఒక కొండ మీద తన పాదం మోపి, దగ్గరలోనే అర్చామూర్తిగా వెలిశారనీ భక్తుల నమ్మకం.  కొండమీద వున్న పాదం స్వామిదనీ, కింద పట్టణంలో అర్చామూర్తి అనీ భక్తులు విశ్వసిస్తారు.   సంస్కృతంలో ఖ అంటే విష్ణుపాదం అనే అర్ధం, అద్రి అంటే కొండ అనే అర్ధం.  విష్ణు పాదం వుండటం వలన ఈ కొండ ఖ + అద్రి, ఖాద్రి అయింది.  వాడుక భాషలో పట్టణం పేరు మాత్రం కదిరి అయినా, కొండ మాత్రం ఇప్పటికీ అక్కడివారు ఖాద్రి కొండ అనే అంటారు.

ఈ ప్రాంతంలో పూర్వం వేదవ్యాసుడు వేద ప్రబోధం చేసినందుకు ఈ ప్రాంతానికి వేదారణ్యం అనే పేరు వచ్చింది.  ఇక్కడ ఖదిర (చండ్ర) వృక్షాలు అధికంగా వుండటంవలన కూడా ఈ ప్రాంతానికి ఖద్రి అనే పేరు వచ్చిందంటారు.  భృగు మహర్షికి మహావిష్ణువు మూడు అర్చామూర్తులు ఇచ్చారని, అవే ఇక్కడి ఉత్సవ మూర్తులనీ భక్తుల నమ్మకం.  ఈ మూర్తులే నరహరి, వసంత మాధవుడు, వసంత వల్లభుడు. కదిరి చారిత్రకంగా కూడా ప్రసిధ్ధి చెందిన స్ధలం.  ఇక్కడా చాలా శాసనాలు లభించాయి.  క్రీ.శ. పదవ శతాబ్దంలో చాళుక్యులు దుర్గాదేవిని ఇక్కడ ప్రతిష్టించారు.  ఈ ఆలయమే తర్వాత అమృతవల్లీ తాయారు మందిరంగా చేసారంటారు.  హరిహరరాయల కాలంలోనే బ్రహ్మోత్సవం జరిగిన మరునాడు హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించినట్లు శాసనాధారాలున్నాయి.

ఆలయ నిర్మాణం
పూర్వం ఈ ప్రాంత నివాసి అయిన రంగనాయకుడు అనే వ్యక్తికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి పుట్టలో వున్న విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మంచమని చెప్పటంతో ఆయన స్వామి ఆజ్ఞ ప్రకారం  ఖాద్రి (చండ్ర) వృక్షం  కింద వున్న పుట్టలోంచి స్వామి విగ్రహం తీసి ప్రతిష్టించి, చిన్న ఆలయం నిర్మించి పూజలు చేశారు.  తర్వాత క్రీ.శ. 1274లో శ్రీ వీర బుక్కరాయల కాలంలో ఆలయ నిర్మాణ పూర్తయినట్లు శాసనాలద్వారా తెలుస్తున్నది.  2.75 ఎకరాల స్ధలంలో నిర్మింపబడున ఈ ఆలయం చుట్టూ ఎత్తయిన ప్రహరీ గోడలు, నాలుగు వైపులా గోపురాలతో అలరారుతున్నది.  ఆలయం చుట్టూ శ్రీ రామచంద్రులవారిదీ, శ్రీ గోవిందరాజస్వామి ఉపాలయాలు, అన్న సత్రాలతోపాటు భక్తులకు వుండటానికి గదులు కూడా వున్నాయి.
విశాల ప్రదేశంలో మధ్యలో నిర్మింపబడిన ఆలయం గర్భగృహం, అంతరాలయం, రంగ మండపం అని మూడు భాగాలుగా వున్నది.  ఇక్కడ స్వామి లక్ష్మీ సమేతంగా శాంతమూర్తిగా దర్శనమిస్తారు.  స్వామి సన్నిధిలో ప్రహ్లాదుడిని కూడా చూడవచ్చు. అంతరాలయానికి ముందున్న స్తంభాలలో మొదటి దానిపై వున్న సంతాన గోపాలస్వామిని సేవిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.   స్వామి గర్భగుడి పక్కన వున్న ఉపాలయంలో అమ్మవారు అమృతవల్లీ తాయారు కొలువుతీరారు.  ఇది పూర్వం దుర్గాలయమంటారు.  అమ్మవారి ఆలయం స్తంభాలపై అద్భుమైన శిల్పకళ చూడవచ్చు.

విశేషాలు
స్వామి మూల విరాట్ కు ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున అభిషేకం చేస్తారు.  అభిషేకం తర్వాత స్వామి మూల విరాట్ ని తుడుచిన తర్వాత విగ్రహం మీద స్వేద బిందువులు కనబడతాయి.  ఇది స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు.
పూర్వం ఇక్కడ భృగు మహర్షి తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు.  ఆ మహర్షి కోరికమేరకు స్వామి స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలను అందించారని కధనం.  వీటిని స్వామి వసంత ఋతువులో ప్రసాదించటంవలన ఆయనకి వసంత వల్లభుడనే పేరు వచ్చింది.  15 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామి వివిధ అవతారాలలో భక్తులకి కనువిందు చేస్తారు.

ఉత్సవాలు
ప్రతి సంవత్సరమూ సంక్రాంత్రి వేడుకల తర్వాత ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.  సంక్రాంత్రి సమయంలో పశువుల పండగ రోజు శ్రీ దేవి, భూదేవులతో కలిసి వసంత వల్లభులు కదిరి కొండకు పారువేట నిమిత్తం వస్తారని నమ్మకం.  పారు వేట తర్వాత స్వామిని పుర వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోకి తీసుకొస్తారు.  దీన్నే రధోత్సవం అంటారు.  ఏటా ఫాల్గుణ మాసంలో బహుళ పంచమినాడు ఈ ఉత్సవం జరుగుతుంది.
బ్రహ్మోత్సవంలో భాగంగా ఏడో రోజు ఫాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుకుంటారు.  ఆ రోజు భక్తులు ఉపవాసం వుంటారు. ఏటా వైశాఖ శుధ్ధ చతుర్దశినాడు నృసింహ జయంతి, వైశాఖ శుధ్ధ పౌర్ణమినాడు మల్లెపూల తిరునాళ , ఆషాఢ శుధ్ధ పొర్ణమి చింత పూల తిరుణాల, శ్రావణ బహుళ నవమి ఉట్ల తిరుణాల, దసరా, వైకుఠ ఏకాదశి వగైరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ప్రతి రోజు వైఖానసి ఆగమం ప్రకారం పూజలు జరుగుతాయి.

పెద్ద రధం.
బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామికి రధోత్సవం చేస్తారు.  ఆ రోజు బ్రహ్మ రధం పై దర్శనమిచ్చే స్వామిని దర్శించటానికి లక్షలాదిమంది భక్తులు విచ్చేస్తారు.  ఈ రధం బరువు 540 టన్నులు, ఎత్తు 37.5 అడుగులు వుంటుంది.  రధంలో పీఠం వెడల్పు 16 అడుగులు.  130ఏళ్ళ క్రితం తయారు చేయబడిన ఈ రధం చాలా పెద్దది. ఈ రధోత్సవంలో భక్తులు స్వామి మీద మిరియాలు, పండ్లు, దవనం చల్లుతుంటారు.  కింద పడిన వీటిని ఏరుకు తింటే సర్వ రోగాలూ నయమవుతాయని భక్తుల నమ్మకం.

మార్గము
అనంతపురానికి 90 కి.మీ. లు, పుట్టపర్తికి 40 కి.మీ. ల దూరంలో వున్న ఈ ఊరుకు బస్సు, రైలు, సౌకర్యం వున్నది.

సమీప దర్శనీయ ప్రదేశాలు
ఖాద్రి కొండ స్వామి ఇక్కడ తన పాదాన్ని మోపారని విశ్వాసం.  కదిరికి 2 కి.మీ. ల దూరంలో వున్న ఈ కొండమీద స్వామి పాదం, సప్త ఋషులు తపస్సు చేసిన ప్రదేశం వగైరాలున్నాయి.  ఉత్సవం సమయంలో స్వామి ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి తీసుకు వచ్చి పూజలు జరిపి తిరిగి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు.

తిమ్మమ్మ మర్రిమాను
కదిరికి 25 కి.మీ. ల దూరంలో వున్న తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకున్నది.  తిమ్మమ్మ అనే పతివ్రత సహగమనం చేసిన ప్రదేశంనుంచి ఉద్భవించిన ఈ మానును ఆ దేవతగానే భావించి కొలుస్తారు భక్తులు.

వేమన సమాధి
వేమన పద్యాలు తెలియని తెలుగువారుండరుకదా.  ఆ మహా యోగి సమాధి కదిరికి సమీపంలో వున్నది.  క్రీ.శ. 1480 లో పరమపదించిన ఈయనకి అప్పుడే సమాధి నిర్మించారు.  క్రీ.శ. 1933 లో దానిమీద చిన్న మందిరం, తర్వాత క్రీ.శ. 2005 లో చుట్టూ బిల్డింగ్ కట్టి గోడలమీద వేమన పద్యాలు చెక్కించారు.  ఇందులో చాలామందికి తెలియని పద్యాలు కూడా కొన్ని వున్నాయి. మార్చి 29, 30, 31 తారీకులలో వేమన జయంతి ఉత్సవాలు జరుగుతాయి.  వాటికి లక్షమందిదాకా వస్తారు.  సమాధి దగ్గర వున్నది వేమన వంశంలో ఏడవతరంవారుట.

పై మూడు ప్రదేశాలు కదిరినుంచి 3 గం.లలో చూసి రావచ్చు.  ఆటోకి రూ. 450 తీసుకున్నారు.

- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)