Read more!

హనుమంతుడు లంకకు ఎందుకు నిప్పుపెట్టాడు?

 

హనుమంతుడు లంకకు ఎందుకు నిప్పుపెట్టాడు?

హనుమంతుడిని చంపద్దని విభీషణుడు చెప్పగానే ఆలోచించిన రావణుడు "వానరాలకి తమ తోక అంటే చాలా ఇష్టం. అందుకని వీడి తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపినవారి దగ్గరికి వెళుతుంది, అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి, తోకలేని కోతి" అని ఏడిపిస్తారు అన్నాడు.

అప్పుడు వారు పాత బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి, నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి, రథం ఎక్కించి నాలుగు కూడళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ గూఢచారి, గూఢచారి అని ప్రకటించారు. ఆ లంకా పట్టణంలో మేడల మీద మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు.

అప్పుడు హనుమంతుడు వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే కాని, రాత్రి వేళలో ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను అనుకున్నాడు. వారు హనుమని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కవారి కట్లని విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు.

అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళి "నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు" అన్నారు.

సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్థన చేసి "నేను సర్వకాలములయందు రాముడికి సేవ చేసిన దానినయితే, రాముడినే మనసులో పెట్టుకున్న దాననయితే, నాకు భాగ్యవిశేషం మిగిలి ఉంటే, రాముడికి నామీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం యదార్ధమయితే, హనుమ యొక్క తోకకి ఉన్న అగ్ని చల్లబడుగాక" అని పలికింది.

వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడాయన అనుకున్నాడు "అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిధ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది. నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు" అని అనుకుని, "ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను" అనుకొని, మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. 

రావణుడి ప్రవర్తన వలన ఇంతకాలం కడుపుమండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్ని దేవుడు కాల్చేస్తున్నాడు. వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళమీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతుంది. ఆ లంకలో అందరూ "హా తాత, హా పుత్ర, హా తల్లి" అని అరుచుకుంటూ దిక్కులుపట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి, ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది.

అప్పుడాయన "అరరే ఎంతపని చేశాను. అగ్నిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదో, అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుంది. సీతమ్మే అగ్ని, అగ్నిని అగ్ని కాలుస్తుందా" అని అనుకున్నాడు.

                                 ◆ వెంకటేష్ పువ్వాడ.