Read more!

లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే ఏం ఫలితాలను ఇస్తుంది?

 

లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే ఏం ఫలితాలను ఇస్తుంది?

అందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి. ఆ దేవి అనుగ్రహాన్ని పొందనివారు ఉండరు. అయితే ఆ తల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారంతో అష్టకష్టాలు పడేది మరికొందరు. అందుకే పెద్దలు మానవశరీరంలో ఆ తల్లి ఎక్కడ నివసిస్తే ఏ ఫలితం వస్తుందో సంకేతరూపంలో తెలియజేశారు. ఈవిషయాన్నే జ్యోతిష్య శాస్త్ర రీత్యా పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి.

* అమ్మవారు పాదస్థానంలో ఉంటే వాళ్ళకు విలాసవంతమైన గృహాలు లభిస్తాయట.
* తొడలలో అమ్మవారి శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది.
* గుహ్యభాగంలో ఉంటే భార్యాసుఖం సంసారిక ఆనందం లభిస్తుంది
* రొమ్ముభాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్ధిస్తూ ఉంటాయి.
* కంఠభాగంలో ఆ తల్లి తేజస్సు ఉన్నప్పుడు ఆభరణప్రాప్తి కలుగుతుంది.
* ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్ధియేకాక అప్రతిహతమైన ఆజ్ఞాశక్తి, మధురమైన కవితాశక్తి పాండిత్యము లభిస్తాయి.

ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకి ఎక్కిందో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు. వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివితక్కువతనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు. ఈ విషయాన్ని దత్తాత్రేయస్వాములవారు దేవతలకు చెప్పారు. జ్యోతిషరీత్యాపరిశీలిస్తే లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహమైన శుక్రుని సంచారంతో పై సంకేతాలు కచ్చితంగా సరిపోతున్నవి అని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జగన్మాత అయిన ఆ తల్లి కృప హఠాత్తుగానో, పుట్టుకతోనో మనపై కలుగవచ్చు. సంపదలను అనుగ్రహించే ఆతల్లి ఆసంపదలను ఉపయోగించుకుంటున్నారా లేదా అని పరిక్షిస్తుంది. ఆ అమ్మ దయతో చేరిన ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధర్మ, కామ, మోక్షాలను సాధించుకోవటానికి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి .