Read more!

విష్ణు శయన విగ్రహాలు ఎన్ని ... ? అవి దేనికి ప్రతీకలు ...?

 

విష్ణు శయన విగ్రహాలు ఎన్ని ... ?

 

 

అవి దేనికి ప్రతీకలు ...?

 

 

 

 

విష్ణుమూర్తి విగ్రహాల అమరికలో శయన విష్ణుమూర్తి ఒకటి. స్వామివారిని శయన, ఆసన, స్థానక, నృత్య రూపాల్లో మనం దర్శించుకోవచ్చు. శయన విగ్రహాలు ముఖ్యంగా నాలుగు విధాలుగా ఉన్నాయి. అవి యోగం, సృష్టి, భోగం, సహారం. యోగం - ముక్తికి, సృష్టి - వృద్ధికి, భోగం - భుక్తికి, సహారం - అభిచారికాలకు మార్గాలకు ప్రతీక. మోక్షం కోరేవారు యోగశయనాన్ని, పుత్రపౌత్రాది వృద్ధి కోరుకునేవారు సృష్టిశయనాన్ని, భోగ వృద్ధి కోరుకునేవారు భోగశయనాన్ని, శత్రువుల నాశనం కోరుకునేవారు సంహారశయనాన్ని ధ్యానించాలని మన పురాణాలు చెబుతున్నాయి. నదీతీరాల వెంబడి, సరస్సుల ప్రక్కన యోగశయన విగ్రహాలు ప్రశస్తమైనవిగా చెపుతారు.


యోగశయనం :

 

శ్రీమహావిష్ణువు ఎర్రతామర రేకులవంటి నేత్రాలతో యోగనిద్రా సుఖములో వుంటుంది. 2 భుజాలు కలిగి, ఒక ప్రక్కగా పడుకున్నట్టు అర్థశయనంలో ఉంటుంది. ఐదుపడగల శేషుడు శంఖంలా, చంద్రునిలా తెల్లగా ఉంటుంది. దీనిమీద శయనించిన విష్ణువు గౌరశ్యామ వర్ణంతోగానీ, పీతశ్యామ వర్ణంతోగానీ ఉంటారు. ఈ విధమైన విష్ణుమూర్తి పూజాపీఠానికి కుడివైపున భ్రుగువు కానీ మార్కండేయుడు, ఎడమవైపున భూదేవి కానీ మార్కండేయ మహర్షి ఉంటారు. మధుకైటభులు, బ్రహ్మదేవుడు, పంచాయుధాలు, నమస్కరిస్తున్న మహర్షులు ఉంటారు.


సృష్టిశయనం :


తొమ్మిది పడగలు గల శేషపానుపు పైన శ్రీహరీ, పద్మాలవంటి నయనాలతో, రాజస భావంతో, నల్లని శరీరచ్చాయతో, ఎఱ్ఱని అరికాళ్ళతో, శాశ్వతుడై సృష్టిశయన రూపంలో ఉంటాడు. లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అప్సరసలు, మహర్షులు, రుద్రులు. ఆదిత్యులు, కిన్నెరలు, మార్కండేయ, భ్రుగు, నారద మహర్షులను, మధుకైటభులను వీరందరితో కలిగిన శయనం ఉత్తమ సృష్టి శయనమవుతుంది.

 

 

 

భోగశయనం :

 


ఈ శయన రూపంలో శ్రీమన్నారాయణుడు సకలపరివారంతో కూడి ఏడు పడగల శేషునిలో పడుకొని ఉంటాడు. ఈ స్వామి నాభినుండి వికసించిన తామరపువ్వులో కూర్చున్న బ్రహ్మ బంగారు రంగు కలవాడై ఉంటాడు. బ్రహ్మకు రెండు ప్రక్కల శంఖము, చక్రం, గద, ఖడ్గం, శార్జ్గం అనే పంచాయుధాలు, పద్మం, వనమాల, కౌస్తుభం కలిపి అష్టాయుధాలు కలిగి ఉంటాడు. ఆ ఆయుధాల ముందు గరుత్మంతుడు ఉంటాడు. స్వామి కుడిచేతి ప్రక్కన లక్ష్మీదేవి, కుదిపాడం ప్రక్కన సరస్వతి, ఎడమచేతి ప్రక్కన శ్రీదేవి, ఎడమపాదం ప్రక్కన భూదేవి ఉంటారు. సూర్యచంద్రులు, తుంబురనారదులు, సప్తఋషులు, అప్సరసలు, లోకపాలకులు, అశ్వనీదేవతలు ఉంటారు. పాదాల దగ్గర మధుకైటభులు ఉంటారు. శ్రీవారు సస్యశ్యామల వర్ణంతో, అర్థశయనంతో, యోగనిద్రా రూపంతో, నాలుగు భుజాలతో, వికసించిన ముఖంతో, తామర రేకులవంటి నేత్రాలతో పూర్ణచంద్రుని వంటి ముఖంతో దర్శనమిస్తాడు.


సంహారశయనం :

 


శ్రీమన్నారాయణమూర్తి రెండు పడగల శేషుని పానుపుగా చేసుకుని గాఢనిద్రలో, మూసిన కన్నులతో, తామస భావాన్ని వ్యక్తం చేసి మూడు కన్నులతో, వాడిన ముఖం మొదలియన్ సర్వాంగాలతో నల్లని వస్త్రాలతో, రెండు భుజాలతో, నల్లని శరీర కాంతులతో, రుద్రుడు మొదలైన దేవతలా రూపంతో ఉంటాడు.