Read more!

English | Telugu

ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండని దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-696 లో.. ఆరోగ్యం బాలేని రిషిని వసుధార దగ్గరుండి చూసుకోవడంతో దేవయాని ఓర్వలేకపోతుంది. "ఇంట్లో మనమంతా ఉన్నాం కదా.. మనలో ఎవరైనా రిషిని చూసుకుంటాం కదా.. ఈ పద్ధతి ఏంటో నాకు నచ్చలేదు" అని మహేంద్రతో అంటుంది దేవయాని. రిషి ఆరోగ్యం బాగవడం ముఖ్యం వదిన అని మహేంద్ర అంటాడు. అప్పుడే జగతి వచ్చి ఏం అయింది అక్కయ్యా అని అడుగుతుంది. మీరు వసుధారని పంపించేయండి.. రిషి పరువు ఏమవుతుందని దేవయాని అనగానే.. రిషికి జ్వరం తగ్గడం మనకు ముఖ్యమని జగతి అంటుంది. "ఏంటి మొగుడు పెళ్ళాం ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారు" అంటూ దేవయాని ఆవేశపడుతుంది. తనని ఇంట్లోకి రానివ్వొద్దని మొదటి నుండి చెప్తున్నాను.. అయినా ఎవరూ వినలేదు అని దేవయాని అనగానే.. "ప్లీజ్ ఆపండి వదిన" అని కోపంగా అరుస్తాడు మహేంద్ర. ఆ తర్వాత "రిషి నా కొడుకు.. ఎలాంటి తప్పు చెయ్యడు.. మీరు పెంచి పెద్ద చేసారు.. ఆ గౌరవం అలాగే ఉండనివ్వండి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి" అని వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర.

మరోవైపు రిషి పక్కనే వసుధార ఉండి తన బాగోగులు చూస్తుంటే.. రిషి తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ బయటకు కోపం ఉన్నట్లుగా చూస్తాడు. రాత్రి పాలు తీసుకొస్తానని వసుధార వెళ్తుంటే.. హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్న దేవాయనిని చూసి.. "మేడం మీరు ఇంకా పడుకోలేదా" అని అడుగుతుంది. నిద్రపోయేంత ప్రశాంతత ఈ ఇంట్లో ఎక్కడుందని దేవాయని అంటుంది. ఇల్లు ప్రశాంతంగానే ఉంది కదా మేడం అని వసుధార అంటుంది. భయం లేదు మొండిదానివి అనుకున్నాను కానీ ఇంత తెగిస్తావని అనుకోలేదు అంటుంది. వసుధార కౌంటర్ లా మరొకటి మాట్లాడేసరికి ఇంకా కోపంతో ఊగిపోతుంది దేవయాని.

ఇక రిషి దగ్గరికి జగతి, మహేంద్రలు వస్తారు. అక్కడే వసుధార కూడా ఉంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.