Read more!

English | Telugu

కొందరి అభిమానానికి వెల కట్టలేం.. ఎమోషనల్‌ అయిన రాజమౌళి!

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తెలుగు, తమిళ భాషలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఆ తర్వాత మలయాళ, కన్నడ భాషల్లో కూడా తెలుగు సినిమా పట్టు సాధించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ పాగా వేసి భారతదేశ చలనచిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి మన తెలుగు సినిమా ఎదిగింది. బాలీవుడ్‌లో తెలుగు సినిమాకు అంతగా ప్రాధాన్యం లేని రోజుల్లో కూడా సంవత్సరంలో అధిక సినిమాలు నిర్మించే పరిశ్రమగా టాలీవుడ్‌ ప్రసిద్ధి కెక్కింది. ఇప్పుడు ప్రపంచస్థాయిలో తెలుగు సినిమాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అది కేవలం దర్శకుడు రాజమౌళి వల్లనే అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జేమ్స్‌ కేమరూన్‌ సైతం రాజమౌళికి అభిమానిగా మారిపోయాడంటే సినిమాలతో అతను చేస్తున్న మ్యాజిక్‌ ఎలాంటిదో తెలుస్తుంది.

తాజాగా జరిగిన ఓ సంఘటన రాజమౌళిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. జపాన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్‌ జరుగుతోంది. ఆ షోకి రాజమౌళి దంపతులు కూడా హాజరయ్యారు. అక్కడ జరిగిన ఓ సంఘటన రాజమౌళిని ఎమోషనల్‌ అయ్యేలా చేసింది. అభిమానానికి భాషతో, వయసుతో సంబంధం లేదని ప్రూవ్‌ అయింది. ఓ 83 ఏళ్ళ మహిళ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని చూసి ఎంతో ఎంజాయ్‌ చేసింది. రాజమౌళిపై తనకు ఉన్న అభిమానాన్ని చాటి చెప్పుకునేందుకు ఒక గొప్ప బహమతిని అతనికి అందించింది. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు రాజమౌళి. ఆయన పెట్టిన పోస్ట్‌లో ఏముందంటే.. ‘జపాన్‌లో ఓరిగామీ క్రేన్స్‌ని తయారు చేసి తాము అభిమానించేవారు ఆరోగ్యంగా, అందంగా ఉండాలని బహూకరిస్తారు. ఈ 83 ఏళ్ల మహిళ మాకోసం అలాంటివి 1000 చేసింది. ఎందుకంటే ఆమెకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంత సంతోషాన్ని ఇచ్చింది. వాటిని మాకు పంపి ఆమె మాత్రం బయట చలిలోనే ఉండిపోయింది. కొందరి అభిమానానికి వెల కట్టలేం. జస్ట్‌ గ్రేట్‌ ఫుల్‌’’ అంటూ రాజమౌళి క్యాప్షన్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను లోపలికి పిలిపించి ఆమెతో ఫొటో కూడా దిగారు. అలాగే రమా రాజమౌళిని కూడా ఆ మహిళ కలిసింది. వారితో ఫొటోలు దిగింది. వారికి తాను తయారు చేసిన ఓరిగామిలను స్వయంగా అందించింది. రాజమౌళి దంపతులు ఆ మహిళతో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.