Read more!

English | Telugu

పవన్ వేదాళం రీమేక్ కు సై అన్నాడా..?

సర్దార్ రిజల్ట్ నిరాశ పరిచినా, తన బాటలో ముందుకు సాగిపోతున్నాడు పవన్. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగిన తర్వాత ఇక సినిమాలు చేయను అని ప్రకటించిన పవర్ స్టార్, ఈలోపే వీలైనన్ని సినిమాలు చేసేయాలనుకుంటున్నాడు. అందుకే వెంటనే ఎస్ జే సూర్యతో సినిమాకు సై అనేశాడు. తాజాగా వేదాళం రీమేక్ కు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు వస్తున్నాయి. విజయ్ హీరోగా వచ్చిన జిల్లా మూవీని డైరెక్ట్ చేసిన నీసన్ కు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలని పవన్ అనుకుంటున్నాడట. ఇంకా అధికారికంగా ఖరారు కానప్పటికీ, ప్రస్తుతానికి చర్చలు నడుస్తున్నాయని సమాచారం. కాగా, ఎస్ జే సూర్యతో పవన్ చేయబోయే సినిమా ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీ అని ఇప్పటికే పవన్ క్లియర్ గా చెప్పేశాడు. దాంతో ఈ సినిమా అజిత్ హీరోగా వచ్చిన వీరుడొక్కడే తరహాలో ఉండబోతుందనే ఊహాగానాలు మొదలైపోయాయి. ఆ సినిమాలో అజిత్ మేకప్ లేకుండా, వైట్ హెయిర్ తో తన ఒరిజినల్ ఏజ్ కు దగ్గరగా ఉండే పాత్ర చేశాడు. మేకప్ అంటే ఇష్టం లేని పవర్ స్టార్ కూడా అలాంటి సినిమాయే చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు కాబట్టి, అదే టైప్ సినిమా కావచ్చని జనాలు అంచనా వేస్తున్నారు. సమ్మర్ వెకేషన్స్ లో ఉన్న పవన్, ఫారిన్ నుంచి తిరిగిరాగానే, ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కబోతోంది. అనూప్ రూబెన్స్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు హుషారు అనే పేరును పరిశీలిస్తున్నారు.