Read more!

English | Telugu

'పారిజాత పర్వం' మూవీ రివ్యూ

సినిమా పేరు: పారిజాత పర్వం
తారాగణం: చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, హర్ష చెముడు, మాళవిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, మురళీధర్ గౌడ్, సమీర్ తదితరులు 
సంగీతం: రీ
డీఓపీ: బాల సరస్వతి
ఎడిటర్: శశాంక్
రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటి
నిర్మాతలు: మహీధర్ రెడ్డి, దేవేష్
బ్యానర్: వనమాలి క్రియేషన్స్
విడుదల తేదీ: ఏప్రిల్ 19, 2024

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, హర్ష చెముడు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'పారిజాత పర్వం'. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని హీరో కావాలన్న లక్ష్యంతో భీమవరం నుంచి హైదరాబాద్ కి వస్తాడు శ్రీను(సునీల్). ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాకపోవడంతో.. సినిమా వాళ్ళు ఎక్కువగా వచ్చే కృష్ణానగర్ లోని ఓంకార్ బార్ లో వెయిటర్ గా జాయిన్ అవుతాడు. అదే బార్ లో పార్వతి(శ్రద్ధా దాస్) డ్యాన్సర్ పని చేస్తుంటుంది. అయితే ఒకసారి బార్ ఓనర్ నుంచి పార్వతికి సమస్య ఎదురుకాగా, ఆమెని కాపాడే క్రమంలో ఓనర్ ని చంపేస్తాడు శ్రీను. అప్పటి నుంచి బార్ శ్రీనుగా మారి సెటిల్ మెంట్ లు చేస్తుంటాడు. అయితే శ్రీను కథనే సినిమా స్క్రిప్ట్ గా రాసుకొని డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తుంటాడు చైతన్య(చైతన్య రావు). ఆ కథ కొందరు నిర్మాతలకు నచ్చినప్పటికీ.. తన స్నేహితుడు హర్ష(హర్ష చెముడు)నే హీరోగా తీసుకోవాలని చైతన్య పెట్టే కండిషన్ కి వారు ఒప్పుకోరు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) దారుణంగా అవమానిస్తాడు. దీంతో, తానే నిర్మాతగా మారి సినిమా చేయాలని నిర్ణయించుకున్న చైతన్య.. డబ్బు కోసం శెట్టి భార్య సురేఖ(సురేఖ వాణి)ని కిడ్నాప్ చేసేందుకు రంగంలోకి దిగుతాడు. మరోవైపు బార్ శ్రీను గ్యాంగ్ కూడా ఆమెను కిడ్నాప్ చేయడానికి వస్తుంది. శ్రీను గ్యాంగ్ కిడ్నాప్ చేయడానికి ఎందుకు వచ్చింది? మరి వీరిద్దరిలో సురేఖను ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేసే క్రమంలో చైతన్య గ్యాంగ్ కి, శ్రీను గ్యాంగ్ కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? సినిమా తీయాలన్న చైతన్య లక్ష్యం నెరవేరిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
కిడ్నాప్ ప్రధానంగా సాగే క్రైమ్ కామెడీ సినిమాలు ఎన్నో వచ్చాయి. ఈ తరహా సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలంటే.. ఓ వైపు వినోదభరితంగా నడిపిస్తూనే, అక్కడక్కడా ఊహించని మలుపులతో సర్ ప్రైజ్ చేయాలి. అప్పుడే ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో కామెడీ కొంతవరకు ఓకే కానీ, కథనం ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. దీంతో సినిమా ముందుకెళ్తున్న కొద్దీ ప్రేక్షకులకు నీరసం వస్తుంది.

బార్ శ్రీను కథతో దర్శకుడు కావాలని చైతన్య చేసే ప్రయత్నాలు, హర్షని హీరోగా తీసుకోవాలనే షరతుతో ఎదురయ్యే అవమానాలతో సినిమా ఆసక్తికరంగానే ప్రారంభమవుతుంది. సునీల్, హర్ష పాత్రలతో పండించిన హాస్యం కూడా బాగానే వర్కౌట్ అయింది. పెద్దగా మెరుపులు లేనప్పటికీ, అక్కడక్కడా నవ్వులతో ఫస్టాఫ్ బాగానే నడిచింది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా మెప్పించింది. కానీ సెకండాఫ్ లోనే సినిమా పూర్తిగా గాడి తప్పింది. సెకండాఫ్ లో కిడ్నాప్ ప్రధానంగా కథను నడుపుతూ కన్ఫ్యూజన్ కామెడీ క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. పతాక సన్నివేశాలు కూడా తేలిపోయాయి.

దర్శకుడు సంతోష్ కథాకథనాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సింది. పేరుకి కిడ్నాప్ ప్రధానంగా కథను రాసుకున్నాడు. కానీ కిడ్నాప్ ఎపిసోడ్ కూడా తేలిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పరవాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
దర్శకుడు కావాలని కలలు కనే యువకుడి పాత్రలో చైతన్య రావు చక్కగా ఒదిగిపోయాడు. అతని నటన సహజంగా ఉంది. అక్కడక్కడా బాగానే నవ్వులు పంచాడు. ఇక ఈ సినిమాలో బిగ్ రిలీఫ్ అంటే సునీల్, హర్ష అని చెప్పవచ్చు. వారి కామెడీనే సినిమాని అంతో ఇంతో నిలబెట్టింది. శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఉన్నంతలో బాగానే నవ్వించారు. శ్రద్ధా దాస్, మాళవిక, సురేఖ వాణి, మురళీధర్ గౌడ్, సమీర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. 

ఫైనల్ గా..
అక్కడక్కడా కొన్ని నవ్వులు తప్ప.. మిగతా సినిమా అంతా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది.

రేటింగ్: 2/5