English | Telugu
ఊహించని దర్శకుడితో నాగార్జున వందో చిత్రం!
Updated : Mar 15, 2025
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ వంద సినిమాల మైలురాయిని అందుకున్నారు. ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. నాగార్జున వందో సినిమాకి.. డైరెక్టర్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. అయితే సాధారంగా మైల్ స్టోన్ మూవీస్ చేసేటప్పుడు.. స్టార్ డైరెక్టర్ల వైపు మొగ్గు చూపుతారు హీరోలు. కానీ, నాగార్జున మాత్రం అందుకు భిన్నంగా కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడితో వందో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (Akkineni Nagarjuna)
2024 సంక్రాంతికి 'నా సామిరంగ'తో కలిసి అలరించిన నాగార్జున.. ప్రస్తుతం ధనుష్ 'కుబేర', రజినీకాంత్ 'కూలీ' సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో నాగార్జున సోలో మూవీ, అందునా వందో సినిమా కోసం.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే నాగార్జున ఎట్టకేలకు తన వందో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కోలీవుడ్ డైరెక్టర్ రా. కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున తన మైల్ స్టోన్ మూవీ చేయనున్నట్లు వినికిడి.
'నితమ్ ఒరు వానం' అనే రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ తో కార్తీక్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తెలుగులో 'ఆకాశం' పేరుతో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కార్తీక్ ఇటీవల నాగార్జునను కలిసి ఒక కథ వినిపించాడట. కథ బాగా నచ్చడంతో.. కార్తీక్ డైరెక్షన్ లో మూవీ చేయడానికి నాగ్ ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
ఒక స్టార్ హీరో తన వందో సినిమాకి కేవలం ఒక్క సినిమా అనుభవమున్న దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ, నాగార్జున అలాంటి లెక్కలు పట్టించుకోరు. యువ దర్శకులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు తన వందో సినిమా విషయంలో సైతం.. నాగార్జున ఇదే ఫాలో అవుతున్నారని సమాచారం.
