Read more!

English | Telugu

సభ్యులకు హెల్త్‌ కార్డులు పంపిణీ చేసిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌!

తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. ఈ ఏడాదిలో అసోషియేషన్‌ రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. అసోషియేషన్‌ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో, కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు ఆరోగ్య భీమా సౌకర్యం ఉంటుంది. అలాగే టర్మ్‌ పాలసీ విషయానికి వస్తే సభ్యుడికి రూ.15 లక్షలు, యాక్సిడెంటల్‌ పాలసీ సభ్యుడికి రూ.25 లక్షలను అందేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. ఈ యేడాది (2024-25) వరకూ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్‌ కార్డ్స్‌ ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ, ఆర్‌.నారాయణమూర్తి, స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, టీఎఫ్‌జెఎ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్‌ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్‌ సురేంద్ర నాయుడు సహా అసోసియేషన్‌ సభ్యులు.. జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. 

ట్రెజరర్‌ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ ‘ఇప్పుడు 181 మంది సభ్యులం ఉన్నాం. ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కలిపి 481 మంది ఉన్నాం. ఇదీ మన కెపాసిటీ ఇవాళ. 2004లోప్రింట్‌, చానెల్స్‌ ఉన్నాం. ఇవాళ డిజిటల్‌ మీడియా కూడా కలిపి ఉన్నాం. కోవిడ్‌ టైమ్‌లో చిరంజీవిగారు మన అసోసియేషన్‌కి యోధా డయోగ్నస్టిక్స్‌ ద్వారా 50 శాతం వెసులుబాటు కల్పించారు. తల్లిదండ్రులకు కూడా ఈ సదుపాయాన్ని అందజేశారు. కోవిడ్‌ టైమ్‌లో అసోసియేషన్‌ ద్వారా రెండు సార్లు గ్రాసరీస్‌ అందజేశాం. ఇవాళ మెడికల్‌ ఇన్య్సూరెన్స్‌ ప్రతి వ్యక్తికీ 10 లక్షలను అందిస్తున్నాం. అందులో 5 లక్షలు మెంబర్‌కి, 5 లక్షలు ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇందులో సగం మెంబర్‌ కట్టుకుంటే, సగం అసోసియేషన్‌ భరిస్తోంది. అలాగే టర్మ్‌ పాలసీ ప్రతి సభ్యుడికీ 15 లక్షలు ప్రతి ఏడాదీ ఇస్తున్నాం. ఎవరికీ ఏమీ జరగకూడదని కోరుకుందాం’ అని అన్నారు. 

జనరల్‌ సెక్రటరీ వై.జె.రాంబాబు మాట్లాడుతూ ‘20 ఏళ్ల అసోసియేషన్‌లో హెల్త్‌కి ఇంపార్టెన్స్‌ ఇచ్చాం. శ్రీనివాసరెడ్డిగారి సలహాలు మేం బాగా తీసుకుంటాం. ఎలక్ట్రానిక్‌ మీడియా వచ్చిన కొత్తలో పెట్టిన అసోసియేషన్‌ ఇది. ఇప్పుడు డిజిటల్‌ మీడియా కూడా ఎలక్ట్రానిక్‌ మీడియాలో భాగం. అందుకే 2019లో డిజిటల్‌ మీడియాను కూడా కలుపుకుని ఐదేళ్లు ఫీల్డ్‌ లో పనిచేసిన వారందరికీ సభ్యత్వం ఇచ్చాం. మనది చిన్న ఫ్యామిలీ. పొలిటికల్‌ జర్నలిస్టులకి ఆ ప్రయారిటీ వేరుగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ బావుంటే అందరూ బావుంటారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ బావుండాలని కోరుకోండి’ అని అన్నారు. 

ప్రెసిడెంట్‌ వారణాసి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ‘తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అంటే ఓ యూనిటీ, ఓ భరోసా. ఈ సంస్థ ఏర్పడటానికి ముఖ్యకారణం హెల్త్‌కి సంబంధించి అందరికీ ఓ భరోసా కల్పించాలన్నదే. నెక్స్ట్‌ మన ఎయిమ్‌ హౌసింగ్‌. త్వరలో హౌసింగ్‌ మెంబర్‌షిప్‌కి అందరికీ ఆహ్వానం అందుతుంది. సభ్యులందరికీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గారి ఆధ్వర్యంలో ప్లాట్లు వచ్చే విధంగా కృషి చేస్తాం. ఇన్నేళ్లుగా మన అసోసియేషన్‌కి ఆర్థికంగా సాయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జర్నలిస్ట్‌ అంటే ఓ క్రెడిబిలిటీ, ఓ హుందాతనం ఉండాలి. అందరిలో అది పెంపొందాలి. అందరూ ముందుండాలి. ఒకరికి ఏదైనా ఇబ్బంది కలిగితే, ఇంకొకరు సాయం పడేలా ఉండాలి. సాధ్యమైనంత వరకు పక్కవారికి ఏదోలా సాయం చేసేలా ఉండేలా మీ నడవడిక ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. 

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ‘మనం ప్రజల పక్షాన పనిచేస్తున్నామనే భావన జనాలకు కలగజేయాలి. తెలంగాణలో 23వేల మంది అక్రిడేటెడ్‌ జర్నలిస్టులు ఉన్నారు. ప్రతి సంస్థలోనూ ఫిల్మ్‌ జర్నలిస్టులకు ప్రత్యేకంగా అక్రిడేషన్‌ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. ఇళ్ల స్థలాలను ఇస్తామని గత ప్రభుత్వం  ఆశపెట్టింది. నెరవేరలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తారన్న ఆశ ఉంది. ఎలిజెబుల్‌ పీపుల్‌కి కచ్చితంగా అక్రిడేషన్‌ ఇప్పిస్తాం. 40 ఏళ్ల అక్రిడేషన్‌కి  క్రితం రూల్స్‌ పెట్టినప్పుడు, ఆ తర్వాత మార్పు చేసినప్పుడు కూడా నాకు తెలుసు. ప్రభుత్వాల నుంచి ఏ సౌకర్యాలు పొందాలన్నా అందరిలోనూ యూనిటీ ఉండాలి. అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే. మన ప్రొఫెషన్‌ విలువ, స్టాండర్డ్‌ ఆఫ్‌ జర్నలిజం, ఎథిక్స్‌ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది. జూన్‌ 6 తర్వాత ఎలిజిబుల్‌ జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్‌ కార్డులు అందించే ప్రయత్నం చేస్తాం’ అని అన్నారు.

హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘జర్నలిస్టులకు శ్రీనివాసరెడ్డిగారు ల్యాండ్‌లు ఇప్పిస్తే, అందరూ ఆనందంగా ఉంటారు. జర్నలిస్టుల హెల్త్‌ కార్డుల సెలబ్రేషన్‌లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాసరెడ్డిగారు ఇన్ని మాట్లాడుతుంటే నాకు చాలా విషయాలు తెలిశాయి. ఆయన చాలా స్ట్రాంగ్‌ గైడ్‌ అనిపిస్తోంది. నా కెరీర్‌ మొదటి నుంచీ జర్నలిస్టులు నాతోనే ఉన్నారు. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మెడికల్‌ బిల్లులు ఎక్కువ వస్తాయేమోనని భయపడి హెల్త్‌ ఇన్‌స్యూరెన్స్‌లు తీసుకునేవాడిని. వాటిని ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువల్‌కి డబ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వదిలేశాను. ఇప్పుడు ఈ అసోసియేషన్‌ ద్వారా అందరూ యుటిలైజ్‌ చేసుకుంటున్నారని తెలిసి ఆనందంగా అనిపించింది. జీవితంలో ఎవరికైనా మూడే ముఖ్యం. ఒకటి ఆరోగ్యం, రెండు ఆనందం, మూడు డబ్బు. ఈ మూడిటిలో ఏది ఉన్నా, ఇంకోటి ఉంటుంది. ఉండి తీరుతుంది. జీవితంలో ఈ మూడు ఉంటాయి. అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నేను మీతో సుదీర్ఘ ప్రయాణం చేస్తాను’ అని అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘యూనియన్‌కి పిలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా టైట్‌లో ఉన్నా. ఇవాళ ఉదయం 4 గంటలకు పడుకున్నా. మీ ఇన్‌స్యూరెన్స్‌ మొదటడుగు వేయించింది నేనేనట. హెల్త్‌ కోసం ఇవాళ తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం చూస్తుంటే ఆనందంగా ఉంది. అందరికీ శుభాకాంక్షలు. మీలో ఎక్కువమంది 40 ఏళ్లు దాటినవారే. కొన్ని సినిమాల్లో సొసైటీలో అత్యంత గౌరవమున్న పాత్రలను చూపించేవారు. అందులో జర్నలిస్ట్‌ కేరక్టర్‌ ఉంటుంది. ఎన్నో సినిమాల్లో జర్నలిస్టులకు ఎంతో ఇంపార్టెన్స్‌ ఉండేది. ఇందాక శ్రీనివాసరెడ్డిగారు నిజాయతీగా ఓ మాట చెప్పారు. జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పుడు మనం చేసేది, రాసేది సొసైటీకి ఉపయోగపడాలని అన్నారు. కాలక్రమేణ జర్నలిజం కూడా మారిపోతూ వ్యాపారమైపోయింది. అందరూ బావుండాలి. వ్యాపారం చేయాలి. కానీ జర్నలిస్టుగా రాసే పదం చాలా ముఖ్యం. సెల్‌ఫోన్లను నొక్కుతున్నారు కాబట్టి, కాస్త జాగ్రత్తగా చూసి నొక్కితే పాజిటివ్‌ వైబ్‌ ఉంటుంది’ అని అన్నారు.

పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘జర్నలిస్టులకు ఇళ్లను ఫ్రీగా ఇప్పించండి. స్థలాలను రేవంత్‌రెడ్డిగారిని అడగండి. ఇళ్లు మీరు కట్టుకోండి. శ్రీనివాసరెడ్డిగారు స్థలాలను ఇప్పించి పుణ్యం కట్టుకోవాలి. తుపాకి కన్నా కలానికి భయపడతానని అన్నారు నెపోలియన్‌. ఎంతో మంది జర్నలిస్టులను కన్నది సినిమా తల్లి. ఆ రోజుల్లో వారం రోజులకు తర్వాతే రివ్యూలు రాసేవారు. కానీ ఇప్పుడు మార్నింగ్‌ షోకే రాస్తున్నారు. ఇవాళ సినిమా మూడు రోజులే బతుకుతోంది. సినిమా గురించి రాస్తున్నప్పుడు దయచేసి సినిమాను చంపేయకండి. సినిమా ఇండస్ట్రీలో 90 శాతం సగటు నిర్మాతలున్నారు. కానీ 10 శాతమే విజయం ఉంది. మిగలిన 90 శాతం ఎలా ఉంది?  మీడియాలో భారీ సినిమాలనే ప్రొజెక్ట్‌ చేస్తున్నారు. మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి? అన్నీ చూడండి.. అందరినీ ప్రోత్సహించండి’ అని అన్నారు.