Read more!

English | Telugu

గ్యాప్‌ తీసుకున్నా.. ఇక హీరోగా, నిర్మాతగా ఫుల్‌ బిజీ!

‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ టాప్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ అప్పటి నుంచి వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే అనూహ్యంగా దాదాపు రెండేళ్ళుగా ఒక్క సినిమా కూడా హీరోగా చేయలేదు. ‘లాల్‌సింగ్‌ చద్దా’ (2022)లో చేసిన టైటిల్‌ రోల్‌, ‘సలామ్‌ వెంకీ’ (2022)లో చేసిన అతిథి పాత్ర తర్వాత ఆమిర్‌ ఖాన్‌ మరో సినిమాలో కనిపించలేదు. ‘సితారే జమీన్‌ పర్‌’ అనే చిత్రంతో మళ్ళీ కెమెరా ముందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. తను ఏ పాత్ర చేసినా దాని కోసం ఎంతో హోమ్‌వర్క్‌ చేసే ఆమిర్‌.. ఈ సినిమాలోని పాత్ర లుక్‌ కోసం కొన్ని నెలలుగా కష్టపడుతున్నాడు. ఇప్పటివరకు చూసుకున్న లుక్స్‌లో ఒకటి ఫైనల్‌ చేసుకున్నాడని తెలుస్తోంది. ఆర్‌.ఎస్‌. ప్రసన్న దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా కోసం దాదాపు 80 రోజులు డేట్స్‌ ఇచ్చాడట. ఈ ఏడాది క్రిస్మస్‌కి సినిమాను రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు మేకర్స్‌. 

మరో పక్క నిర్మాతగా కూడా బిజీ అవుతున్నాడు ఆమిర్‌. సన్నీ డియోల్‌ హీరోగా ‘లాహోర్‌ 1947’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతోపాటు ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌లో (ఏకేపీ) మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆమిర్‌ భార్య కిరణ్‌ రావ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్‌’. సంజయ్‌ శ్రీవాస్తవ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రీతమ్‌ ప్యారే’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆమిర్‌ అతిథి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాల నిర్మాణ బాధ్యతలను ఆమిర్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ చేపట్టారు. కొంత గ్యాప్‌ తీసుకున్నప్పటికీ హీరోగా, నిర్మాతగా కూడా ఆమిర్‌ ఖాన్‌ బిజీ అవుతున్నాడు.