Read more!

English | Telugu

అప్పుడు కామెడీ సినిమా.. ఇప్పుడదే టైటిల్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌!

1998లో అమితాబ్‌ బచ్చన్‌, గోవింద హీరోలుగా డేవిడ్‌ ధావన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘బడే మియా చోటే మియా’ సినిమా మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఘనవిజయం సాధించింది. అప్పట్లో కామెడీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న డేవిడ్‌ ధావన్‌ ఆ చిత్రంతో ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, రవీనా టాండన్‌ హీరోయిన్లుగా నటించడం విశేషం. తెలుగులో వీరిద్దరూ హీరోయిన్లుగా నటించిన సినిమా ‘బంగారు బుల్లోడు’. ఇదే కాంబినేషన్‌ని హిందీలో రిపీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని వశు భగ్నాని నిర్మించారు. ఇప్పుడు అదే టైటిల్‌తో పూర్తిగా రివర్స్‌ జోనర్‌లో మరో సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సుల్తాన్‌, టైగర్‌ జిందా హై లాంటి బ్లాక్‌ బస్టర్స్‌ ఇచ్చిన అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. వశు భగ్నాని మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ‘బడే మియా ఛోటే మియా’ కొత్త వెర్షన్‌లో హీరోలుగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.  ఇందులో అక్షయ్‌, టైగర్‌ ఇద్దరు సైనికుల పాత్రల్లో కనిపిస్తున్నారు. భారతదేశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఉన్న ఓ తీవ్రవాది విధ్వంసాన్ని బడే మియా చోటే మియా ఎలా అడ్డుకున్నారనేదే కథ. పాత సినిమాకి ఇది సీక్వెల్‌ కాకపోయినా ఆ టైటిల్‌తో వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్‌లో క్యూరియాసిటీ అనేది క్రియేట్‌ అయింది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మానుషీ చిల్లర్‌ హీరోయిన్లుగా నటించారు. రంజాన్‌ కానుకగా ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. గత కొంతకాలంగా హిట్స్‌లేక సతమతమవుతున్న అక్షయ్‌కుమార్‌కి ఈ సినిమా సూపర్‌హిట్‌ ఇస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.