English | Telugu
'దృశ్యమ్ 2' షూటింగ్ మొదలుపెట్టిన అజయ్ దేవ్గణ్, శ్రియ
Updated : Feb 17, 2022
మలయాళం హిట్ మూవీ 'దృశ్యమ్ 2' ఇప్పటికే తెలుగులో అదే పేరుతో రీమేక్ అయ్యి, ఘన విజయం సాధించింది. ఈ రెండు సినిమాలూ డైరెక్టుగా ఓటీటీలో రిలీజయ్యాయి. ఇప్పుడు ఇదే సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. 'దృశ్యమ్' సినిమాలో జోడీగా నటించిన అజయ్ దేవ్గణ్, శ్రియా శరన్ ఈ సీక్వెల్లోనూ అవే పాత్రలను చేస్తున్నారు. తన భార్యనూ, పెద్ద కుమార్తెనూ ఒక హత్యానేరం నుంచి కాపాడ్డానికి విజయ్ అనే వ్యక్తి ఏం చేశాడో తొలి సినిమాలో చూశాం. ఇప్పుడు మరోసారి ఆ కేసును పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించినప్పుడు విజయ్, అతని కుటుంబం ఎలాంటి చిక్కులు ఎదుర్కొంది, ఈసారి విజయ్ ఏం చేశాడనేది సీక్వెల్లో ప్రధానంగా చూడబోతున్నాం.
ముంబైలో హిందీ 'దృశ్యమ్ 2' షూటింగ్ ప్రారంభమైంది. అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి సంబంధించి అజయ్ దేవ్గణ్, శ్రియపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. "దృశ్యమ్ను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అదొక లెజెండ్. ఇప్పుడు 'దృశ్యమ్ 2'తో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీని ప్రెజెంట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. విజయ్ అనేది పలు కోణాలున్న పాత్ర. అతను చేసే పనులు స్క్రీన్పై ఊపిరి బిగపట్టేలా చేస్తాయి. ఒక ఫ్రెష్ విజన్తో అభిషేక్ పాఠక్ ఈ మూవీని తీస్తున్నాడు. పార్ట్ 2 కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని చెప్పాడు అజయ్ దేవ్గణ్.
'దృశ్యమ్ 2'ను టి-సిరీస్, పనోరమ స్టూడియోస్, వయాకామ్ 18 సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. "ఒక సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ అఫిషియల్ రీమేక్ను తీయడం ఒక గౌరవం, ఒక సవాలు. టాలెంట్ విషయంలో పవర్హౌస్ లాంటి అజయ్ దేవ్గణ్తో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం ఏ క్రియేటివ్ పర్సన్కైనా బూస్టర్లా పనిచేస్తుంది." అని చెప్పాడు జాతీయ అవార్డు విజేత అయిన దర్శకుడు అభిషేక్ పాఠక్.