ఎపిలో రికార్డు స్థాయిలో పోలింగ్ 

ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలనే పట్టింపులు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోమవారం అర్ధరాత్రి 2 గంటలవరకూ పోలింగ్ కొనసాగింది. సోమవారం రాత్రి 12 గంటల సమయానికి ఏపీవ్యాప్తంగా 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.1.2శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి మొత్తం 79.4 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు చెప్పారు. రెండు గంటల వరకూ పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో  81 శాతం పోలింగ్‌ నమోదైనట్లు  తెలిపారు. జిల్లాలవారీగా చూస్తే సాయంత్రం ఐదుగంటల వరకూ.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74.06 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 55.17 శాతం పోలింగ్ నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా 73.55 శాతం, కృష్ణా జిల్లా 73.53 శాతం, బాపట్ల జిల్లాలో 72.14 శాతం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 72.85 శాతం, నంద్యాలలో 71.43 శాతం, ప్రకాశం 71 శాతం, నెల్లూరు జిల్లాలో 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.  

అఖిలప్రియ బాడీగార్డ్ మీద హత్యాయత్నం

ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు వైసీపీ గూండాలు ఎంతమందిని చంపాలని టార్గెట్‌గా పెట్టుకున్నారోగానీ, వరసబెట్టి హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతిలో పులివర్తి నానిని చంపడానికి 150 మంది గొడ్డళ్ళతో దాడి చేసిన ఘటన ఏపీ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. జనం ఇంకా ఈ భయంలో వుండగానే వైసీపీ గూండాలు మరో హత్యాయత్నం చేశారు. ఆళ్ళగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్ మీద హత్యాయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం చేశారు. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ నిల్చుని వుండగా, కారులో వేగంగా వచ్చిన దుండగులు ఆయన్ని ఢీకొట్టారు. వెంటనే మారణాయుధాలతో నిఖిల్ మీద దాడి చేశారు. తీవ్రంగా గాయపడినప్పటికీ నిఖిల్ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ని నంద్యాల ఆస్పత్రికి తరలించారు.

ఇదీ అల్లు అర్జున్ మిత్రుడి నిర్వాకం!

సరిగ్గా ఎన్నికల వేళ ఐకాన్ స్టార్, మెగా హీరోలలో ఒకడు అయిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాను నంద్యాల వెళ్లి మిత్రుడికి మద్దతు తెలపడాన్ని అల్లు అర్జున్ సమర్ధించుకున్నాడు. తనకు పార్టీలతో సంబంధం లేదనీ, మిత్రుడి కోసం మాత్రమే నంద్యాల వచ్చాననీ, ఆయనకు మద్దతు ప్రకటించాననీ చెప్పుకున్నారు. అంతే కాకుండా తాను నంద్యాల వెళ్లడానికి ముందే పిఠాపురం నుంచి పోటీలో ఉన్న జనసేనానికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశానని చెబుతున్నారు. అయితే అల్లు అర్జున్ సరిగ్గా పోలింగ్ కు ముందు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీ చేయడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నాగబూబు కూడా సీరియస్ గా స్పందించారు. మాతో ఉంటూ మా ప్రత్యర్థుల కోసం పని చేస్తూ వెన్ను పోటు పొడిచే వారిని పరాయివారిగానే భావిస్తామని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ టార్గెట్ గానే నాగబాబు ఆ ట్వీట్ చేశారని అంతా భావిస్తున్నారు. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ మిత్రుడి నిర్వాకం ఇదీ అంటూ మెగాభిమానులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి చెందిన పాత వీడియోలను  సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరిగ్గా ఎన్నికల వేళ పనిగట్టుకుని మరీ నంద్యాల వెళ్లి మద్దతు తెలిపిన మిత్రుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గతంలో   పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలూ, అలాగే ప్రజారాజ్యం సమయంలో చిరంజీవిపై చేసిన విమర్శల వీడియోలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ చేసిన ద్రోహం ఇదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  

చిలకలూరి పేటలో యాక్సిడెంట్, ఆరుగురు సజీవదహనం 

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు.ఒకే కుటుంబానికి ముగ్గురు మంటల్లో కాలి బూడిదయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలో అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనాలు రెండూ నుజ్జునుజ్జయింది. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో ఆరుగురు మంటలకు ఆహుతయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. మృతుల్లో లారీ డ్రైవర్, మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తంగా ఆరుగురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతులను అంజి (35), ఉప్పుగుండూరు కాశీ(65), ఉప్పుగుండూరు లక్ష్మి (55), ముప్పరాజు ఖ్యాతిసాయిశ్రీ (8)గా గుర్తించారు. వీరందరూ బాపట్ల జిల్లాకు చెందినవారే. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదంపై చంద్రబాబు, పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి బాధాకరంమని, క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు.

బుద్ధవనంలో అనేక పర్యాటక ప్రత్యేక ఆకర్షణలు

అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ఈమని శివనాగిరెడ్డి నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బుద్ధవనం-వారసత్వ ఉద్యానవనం అనేక పర్యాటక ప్రత్యేకతలతో, మన దేశంలోనే కాక, ఆసియా దేశాలో కూడా విలక్షణ బౌద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిందని, బుద్ధవనం బుద్ధిస్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ , బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, మయన్మార్ దేశాల పర్యాటక నిర్వాహక సమాఖ్య సంయుక్తంగా మంగళవారం( మే 14) హోటల్ హై ల్యాండ్ లో నిర్వహించిన 'ప్రమోషన్ ఆఫ్ బుద్ధిష్ట్ సెక్టార్స్ త్రూ ఆసియా హైవే' అన్న అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరై ప్రసంగించారు.  పశ్చిమ బెంగాల్  సహా వివిధ ఆసియా దేశాల పర్యాటక ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో  ప్రసంగించిన ఆయన తెలంగాణ పర్యాటక శాఖ, 274 ఎకరాల్లో బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూప వనం, మహా స్థూపం, ఇంకా ప్రవేశ ప్రాంతంలోని బౌద్ధ పర్యాటక ఆకర్షణలతో సుందర తరంగా తీర్చిదిద్దిన బుద్ధవనం ఇప్పటికే అధిక సంఖ్యలో అంతర్జాతీయ, జాతీయ బౌద్ధ పర్యాటకులను ఆకర్షిస్తున్నదన్నారు.  ఆసియా హైవేకి బుద్ధవనాన్ని అనుసందించాలని సదస్సు నిర్వహకులకు విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కౌలేష్ కుమార్ సదస్సు ఉద్దేశాలను వివరించగా, అసోసియేషన్ గౌరవ కార్యదర్శి, పూర్వ బుద్ధవనం ప్రత్యేక అధికారి  మల్లేపల్లి లక్ష్మయ్య ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ హ్యాపీ ఇండెక్ యాత్రను భూటాన్ వరకు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంపాదకుడు, కే రామచంద్ర మూర్తి, బౌద్ధ అభిమాని కేకే రాజా, ఆల్ ఇండియా పురాతన దేవాలయాల జీర్ణోదరణ సమితి అధ్యక్షుడు ఆర్కే జైన్, ఇంకా సిలిగురి పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

వైసీపీ ఓటమి ఖాయం.. వీళ్ల మాటలే సాక్ష్యం!

ఏపీలో పోలింగ్ ముగిసింది. వైసీపీ మూకల అరాచకం, హింసాకాండ, బెదరింపులు, దాడులు ఇవేమీ పట్టించుకోకుండా జనం అపూర్వమనదగ్గ పట్టుదలతో ఓటు వేశారు. భారీ పోలింగ్ నమోదైంది. 81 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది. ఈ భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పుడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే వైసీపీ ఓటమి దాదాపుగా ఖాయమైందని వారు చెబుతున్నారు.  అయితే వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు, పరిశీలకులు విశ్లేషించడం కాదు.. స్వయంగా వైసీపీయే తన తీరు ద్వారా, వ్యాఖ్యల ద్వారా, ప్రదర్శిస్తున్న అసహనం ద్వారా ఓటమిని పోలింగ్ ముగియక ముందే అంగీకరించేసింది. ఇక ఆ పార్టీ అధినేత జగన్ అయితే  పోలింగ్ తేదీకి చాలా ముందుగానే బేలగా ఈ సారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అంటూ తన ఆందోళనను, ఓటమి భయాన్నీ వెళ్లగక్కేశారు. ఏదో పార్టీ సమావేశంలోనే, కీలక నేతలతో మంతనాల సమయంలోనే కాదు.. ఏకంగా బహిరంగ వేదికపై జగన్ ఈ మాటలు చెప్పి పార్టీ పరాజయం తథ్యమన్న సంకేతాలను జనానికే కాదు, సొంత పార్టీ క్యాడర్ కు కూడా ఇచ్చేశారు.  ఇక ఆ పార్టీ కీలక నేత, మంత్రి రోజా అయితే పోలింగ్ జరుగుతుండగనే.. తాను ఓడిపోబోతున్నానని ప్రకటించేశారు. నగరి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పని చేశారని చెప్పారు. ఏకంగా మీడియా ముఖంగానే ఆమె ఈ మాటలు చెబుతూ వైసీపీ పరువు గంగలో కలిపేశారు. ఇక పోలింగ్ పూర్తయిన తరువాత మాజీ మంత్రి, నెల్లూరు నుంచి నరసరావుపేటకు వలస వచ్చి మీసం తిప్పి తొడకొట్టి కూటమికి సవాలు చేసిన వైసీపి ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్‌ యాదవ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వైసీపీ ఓటమి ఖాయమని ఖరారు చేసేశారు. సరిగ్గా ఇవే మాటలు చెప్పకపోయినా   టిడిపికి బలం ఉన్న చోట అసలు పోలీసులే లేరు. వాళ్ళను ఇష్టం వచ్చిన్నట్లు ఓట్లు వేసుకోమని వదిలేశారు. కానీ వైసీపికి బలం ఉన్న చోట వందలాది మంది పోలీసులను మోహరించి అడుగడుగునా నియంత్రించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసి అనిల్ కుమార్ వైసీపీ ఓటమి తప్పదన్న సంకేతాలు ఇచ్చారు.   ఇక మంత్రి అంబటి రాంబాబు అయితే.. మీడియా సమావేశంలో భోరున ఏడ్చినంత పని చేశారు. వైసీపీ అక్రమాలకు, దౌర్జన్యాలకూ పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారనీ, మంత్రినైన తాను చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలో రీపోలింగ్ కు డిమాండ్ చేశారు. సాధారణంగా ఓటమి ఖరారైన తరువాతే నేతల నోటి వెంట ఇటువంటి మాటలు వస్తాయి. పల్నాడు సహా పలు ప్రాంతాలలో వైసీపీ మూకలు రెచ్చిపోయి హింసాకాండకు, దౌర్జన్యాలకు తెగబడినా తెలుగుదేశం దీటుగా ప్రతిఘటించింది. పోలింగ్ సజావుగా సాగడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ ఎక్కడా ఇలా వైసీపీ నేతలు, మంత్రులు, మాజీ మంత్రుల్లా బేల మాటలు మాట్లాడలేదు. రీపోలింగ్ కు డిమాండ్ చేయలేదు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం చేతులెత్తేసింది. పోలింగ్ ఏకపక్షంగా జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.  ఇవన్నీ ఒకెత్తైతే ఇలా పోలింగ్ ముగిసిందో లేదో అలా విదేశాలకు చెక్కేయడానికి జగన్ వేసుకున్న ప్లాన్, ఆయన విదేశాలకు వెడితే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ అంటూ సీబీఐ కోర్టులో వేసిన కౌంటర్ తో జనానికి వైసీపీ ఓటమికి సాకులు, పలాయనానికి దారులు వేతుక్కుంటోందన్న సంకేతాలు ఇచ్చినట్లైంది.  

ఏపీలో భారీ పోలింగ్.. దెబ్బపడిందెవరికో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గతంలో ఎన్నడూ లేనంద ఆసక్తి చూపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏదైనా జనజాతర జరుగుతోందా అన్నట్లుగా జనం పోటెత్తారు. రాష్ట్రం నుంచి  వెళ్లి తెలంగాణ, తమిళనాడు, కర్నాటక.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో పొట్టకూటి కోసం పనులు చేసుకుంటున్నవారూ, ఉద్యోగాలు చేసుకుంటున్నవారూ.. రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ తండోపతండాలుగా తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు పది లక్షల మంది ఏపీకి వచ్చి తమతమ స్వగ్రామాలలో  ఓటు హక్కు వినియోగించుకున్నారంటే రాష్ట్రం పట్ల వారెంత అక్కరతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి పని గట్టుకు మరీ వచ్చి ఓటు వేసిన వారిలో 98 శాతం మంది కూటమికే ఓటు వేశారని మీడియా పేర్కొంది. పరిశీలకులు విశ్లేషించారు.  అసలు అన్ని లక్షలమంది  ఓటు వేయడానికి గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తితో, పట్టుదలతో తమ స్వరాష్ట్రం ఆంధ్రకు ఎందుకు తరలివచ్చారు. జరుగుతున్నది సార్వత్రిక ఎన్నికలు. ఏపీలో అసెంబ్లీకి కూడా జరిగాయనుకోండి అది వేరే విషయం. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులకు అక్కడ కూడా ఓటు హక్కు ఉంది. రెండు చోట్ల ఓటు ఉండటం కరెక్ట్ కాదు. అయినా అలా ఓటు ఉన్న వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కోకొల్లలు.  ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏమిటంటే.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ స్థిరపడిన ఆంధ్రులు అక్కడే ఓటు వేయచ్చు. కానీ హైదరాబాద్‌లో, లేదో తెలంగాణలో మరో చోట ఓటు ఉన్న వాళ్లు  అక్కడ ఓటు వేయకుండా.. ఎండను, రద్దీని లెకక్క చేయకుండా  వ్యయప్రయాసలకోర్చి  ఏపీ వచ్చి మరీ ఓటు వేశారంటే ఏమనుకోవాలి.   జగన్ ఐదేళ్ల పాలనలో  సంక్షేమం పేరిట పప్పు బెల్లాలకు సరిపోయేలా సొమ్ముల పందేరం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. ఉద్యోగాలు లేవు. వ్యవసాయం పడకేసింది.   నిర్మాణరంగం నిర్వీర్యమైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. దీంతో రాష్ట్రం నుంచి వలసలు పెరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ఇంకా  దేశం విడిచి పొట్ట చేత పట్టుకుని ఉన్న ఊరుకు, కన్నవారికీ దూరమై ఎవరి స్థాయిలో వారు ఉద్యోగాలో, ఉపాధో  వెతుక్కుంటూ వెళ్లిపోయారు.   దీంతో  రాష్ట్రంలో ప్రభుత్వం మారితే పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికాబివృద్ధి జరుగుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశతో కష్టమైనా, భరించలేని వ్యయం అయినా రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి అన్న ఒకే ఒక్క ఆశయంతో, ఆకాంక్షతో, సంకల్పంతో  ఇన్ని లక్షల మంది   ఆంధ్రాకు తరలి వచ్చి మరీ ఓటు వేశారు.  ఇంత చెప్పుకున్న తరువాత కూడా ఏపీలో ఓట్ల వెల్లువతో ఎవరికి దెబ్బపడిందన్నది ప్రత్యేకంగా చెప్పాలా?

చంద్ర‌గిరిలో వైసీపీ నేత‌ల అరాచ‌కం.. ఇంత‌కు ఈవీఎంలు భ‌ద్ర‌మేనా! ?

వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఓట‌మి భ‌యంతో ప్ర‌త్య‌ర్థుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాయి. ఏకంగా తెలుగుదేశం అభ్య‌ర్థుల‌పైనే హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డుతున్నాయి. సాధార‌ణంగా ఎక్క‌డైనా పోలింగ్ ముందు, పోలింగ్ రోజున ఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ‌డం చూస్తుంటాం. కానీ, చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ప‌లు నియోక‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు పోలింగ్ త‌రువాత రోజుకూడా దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ఏపీలో రికార్డు స్థాయిలో 81శాతానికిపైగా పోలింగ్ న‌మోదైంది. దీంతో ప‌లు నియోజ‌కవ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అభ్య‌ర్థిగా పులివ‌ర్తి నాని పోటీ చేయ‌గా.. వైసీపీ అభ్య‌ర్థిగా చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేశారు.పోలింగ్ రోజు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ శ్రేణులు పెద్దెత్తున ఓట‌ర్ల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డంతోపాటు, ప‌లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద దాడులు చేశారు. అయినా, వారిని ఓట‌మి భ‌యం వెంటాడుతుండ‌టంతో ఏకంగా తెలుగుదేశం అభ్య‌ర్థిపై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ఒక‌ ప‌క్క ప‌లు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూంల‌కు త‌ర‌లించే క్ర‌మంలో అధికారులు తెలుగుదేశం నేత‌ల‌కు స‌మాచారం ఇవ్వ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో స్ట్రాంగ్ రూంల‌ వ‌ద్ద అధికారుల స‌హ‌కారంతో ఈవీఎంల‌లో ఏమైనా మ‌త‌ల‌బు జ‌రిగిందా అనే అనుమానాన్ని తెలుగుదేశం నేత‌లు వ్య‌క్తం చేస్తుండ‌గా.. పులివ‌ర్తి నానిపైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డం, ఆయన గ‌న్ మెన్ ను తీవ్రంగా గాయ‌ప‌ర్చ‌డం ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. నాని వాహ‌నంపై దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావ‌డంతో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఏమైనా ఆఫ్గ‌నిస్థాన్ దేశంలో ఉందా అనే అనుమానం కలగక మాన‌దు.  చంద్ర‌గిరి తెలుగుదేశం అభ్య‌ర్థి పులివ‌ర్తి నానిపై చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పెంచి పోషించిన గూండాలు ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఈవీఎంల‌ను తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి మ‌హిళా యూనివ‌ర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల‌లో భ‌ద్ర‌ప‌ర్చారు. మంగ‌ళ‌వారం(మే5) సాయంత్రం స్ట్రాంగ్ రూంలో ఈవీఎంల‌ ప‌రిశీల‌న‌కు పులివ‌ర్తి నాని, ఆయ‌న స‌తీమ‌ణి సుధారెడ్డితో పాటు ప‌లువురు తెలుగుదేశం నేత‌లు యూనివ‌ర్శిటీకి వెళ్తున్నారు. యూనివ‌ర్శిటీ లోప‌లికి ఎంట‌ర్ కాగానే నాని కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడుతుండ‌గా.. ఆయ‌న వెనుకాలేఉన్న‌ సుధారెడ్డి వాహ‌నం సైడ్ తీసుకొని యూనివ‌ర్శిటీ లోప‌లికి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలోనే అప్ప‌టికే అక్క‌డ‌ కాపు కాసి ఉన్న‌   వైసీపీ గూండాలు రాడ్లు, పెద్ద సుత్తి, బీరు సీసాల‌తో నాని కారుపై దాడికి తెగ‌బ‌డ్డారు. ఊహించ‌ని ప‌రిణామంతో కొద్దిసేపు నాని, ఆయ‌న గ‌న్ మెన్‌, టీడీపీ నేత‌లు కారులో ఉండిపోయారు. దీంతో వైసీపీ గూండాలు రాడ్డులు, బీర్ బాటిల్స్ తో దాడిని ఉధృతం చేశారు. నాని ఉన్న కారు అద్దాల‌ను రాడ్‌ల‌తో ప‌గ‌ల‌గొట్టి హ‌త్యాయ‌త్నం చేశారు. గ‌న్‌మెన్స్ అప్ర‌మ‌త్త‌మై నాని ని కారుదింపి అక్క‌డి నుంచి పంపించి వేశారు. నాని వెళ్తుండ‌టంతో అత‌నిపై కొంత‌మంది వైసీపీ నేత‌లు దాడికి య‌త్నించ‌గా.. గ‌న్‌మెన్ అడ్డుకున్నాడు.  వైసీపీ జ‌డ్పీటీసీ పెద్ద సుత్తి (స‌మ్మెట‌) తో గ‌న్ మెన్ పై  దాడి చేశాడు. ఈ దాడిలో నానితోపాటు గ‌న్ మెన్‌కు, ప‌లువురు టీడీపీ నేత‌ల‌కు గాయాల‌య్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కారు డాష్ బోర్డుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌డం, ఆ దృశ్యాలు మీడియాలో ప్ర‌సారం కావ‌డంతో ఆ దృశ్యాల‌ను చూసిన‌ ఏపీ ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిపాటుకు గుర‌య్యారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గూండాల‌ దాడుల వెన‌క పెద్ద‌ప్లాన్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కొన్ని ఈవీఎంలను స్ట్రాంగ్ త‌ర‌లించేట‌ప్పుడు త‌మ‌కు స‌మాచారం లేద‌ని, సీల్ కూడా వేయ‌లేద‌ని పులివ‌ర్తి సుధారెడ్డి ఆరోపించారు. స్టాంగ్ రూంల ప‌రిశీల‌న‌కు వైసీపీ అభ్య‌ర్థి తెలుగుదేశం నేత‌ల కంటే ముందే వెళ్లిన‌ట్లు తెలిసింది. దీన్నిబ‌ట్టిచూస్తే ప్లాన్ లో భాగంగానే వైసీపీ నేత‌లు పులివ‌ర్తి నాని వాహ‌నాల‌పై దాడుల‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అభ్య‌ర్థి వ‌స్తున్న‌ట్లు ముందుగానే స‌మాచారం అందుకున్న వైసీపీ గూండాలు దాడికి చేసేందుకు కాపుకాసుకొని ఉన్నారు. వీరిని స్టాంగ్ రూంల వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని ముందుగానే అనుకున్న ప్లాన్ ప్ర‌కారం దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అయితే, వైసీపీ గూండాల దాడికంటే ముందే సుధారెడ్డి స్ట్రాంగ్ రూంల వ‌ద్ద‌కు చేరుకున్నారు. పులివ‌ర్తి నానిపై దాడి అనంత‌రం సుధారెడ్డి మాట్లాడుతూ.. కొన్ని ఈవీఎంల‌కు సీల్ వేయ‌కుండానే, త‌మ‌కు స‌మాచారం లేకుండానే స్ట్రాంగ్ రూంల‌కు త‌ర‌లించిన‌ట్లు ఆరోపించారు. పోలింగ్ స‌మ‌యం నుంచే కొన్ని పోలింగ్ కేంద్రాల‌కు చెందిన ఈవీఎంల‌లో మ‌త‌ల‌బు జ‌రిగిన‌ట్లు తెలుగుదేశం నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ముందుగావేసుకున్న ప్లాన్ ప్ర‌కార‌మే యూనివ‌ర్శిటీ ఎంట్ర‌న్స్ లో వైసీపీ గూండాలు దాడికి పాల్ప‌డిన‌ట్లు అనుమానిస్తున్నారు. అయితే, కార్ డాష్ బోర్డుల‌కు ముందుగానే తెలుగుదేశం అభ్య‌ర్థి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ‌డంతో వైసీపీ గుండాల అరాచ‌కం వెలుగులోకి వ‌చ్చింది.  చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పెంచిపోషించిన వైసీపీ గూండాలు పోలీసుల‌పైనా దాడుల‌కు తెబ‌డ్డారు. పోలింగ్ రోజు ఓ సీఐను గాయ‌ప‌ర్చారు. అయినా పోలీసుల్లో చ‌ల‌నం లేక‌పోవ‌టం ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. వైసీపీ నేత‌లు కాకుండా ఇత‌ర పార్టీల నేత‌లు పోలీసుల‌పై చేయి ఎత్తితేనే పెద్ద‌రాద్దాంతం చేసే ఏపీ పోలీసులు  వైసీపీ గూండాలు ఏకంగా  దాడులు చేసినా కిక్కురుమ‌న‌కుండా ప‌డిఉండ‌టం విస్మయం కలిగిస్తోంది. స్ట్రాంగ్ రూంలు భ‌ద్ర‌ప‌ర్చిన యూనివ‌ర్శిటీ లోప‌ల టీడీపీ అభ్య‌ర్థిపై వైసీపీ గూండాలు దాడుల‌కు పాల్ప‌డిన విష‌యంపై జిల్లా ఎస్పీ స్పందించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని ప‌రామ‌ర్శించామ‌ని, తెలుగుదేశం నేతలు ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు స్పెష‌ల్ టీంల‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే, ఈవీఎంలు భ‌ద్ర‌ప‌ర్చిన ప‌ద్మావ‌తి మ‌హిళా యూనివ‌ర్శిటీ ఎంట్రెన్స్ లోనే టీడీపీ అభ్య‌ర్థిపై బీరు బాటిళ్లు, పెద్ద సుత్తి, రాడ్లతో దాడి జ‌రుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్న‌కు ఎస్పీ నుంచి స‌మాధానం రాలేదు. అస‌లు గేటు ఎంట్రీ వ‌ద్ద భ‌ద్ర‌త ఉండ‌దా అని విలేక‌రుల ప్ర‌శ్నించ‌గా.. ఎస్పీ స‌మాధానం చెప్పేందుకు ఇబ్బంది ప‌డ్డారు. స్ట్రాంగ్ రూంలు సేఫ్‌.. అక్క‌డ భ‌ద్ర‌త ఏర్పాటు చేశాం అంటూ విలేక‌రుల ప్ర‌శ్న‌ల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు.  చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నేత‌లు, పోలీసుల వ్య‌వ‌హారం చూస్తుంటే.. దాడుల పేరుతో టీడీపీ నేత‌లు, ప్ర‌జ‌ల‌ను డ్రైవర్ట్ చేసి.. ఈవీఎంల‌లో మ‌త‌ల‌బు విష‌యాన్ని వెలుగులోకి రాకుండా చేసేందుకు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి గూండా బ్యాచ్ ప్లాన్ చేసిందన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ప్ర‌స్తుతం తెలుగుదేశం నేత‌లు, ప్ర‌జ‌ల నుంచి  వ‌స్తున్న ప్ర‌శ్న‌.. ఈవీఎంలు సేఫేనా అని. ఈవీఎంలు త‌ర‌లించే స‌మ‌యంలో, స్ట్రాంగ్ రూంలో భ‌ద్ర‌ప‌ర్చే స‌మ‌యంలో ఏం జ‌రిగింద‌నే విష‌యం అధికారుల‌కు, వైసీపీ నేత‌ల‌కు, ఆ దేవుడికే తెలియాలి మ‌రి. మొత్తానికి ఎలాగోలా మోహిత్ రెడ్డిని గెలిపించుకోవాల‌ని చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి గూండా బ్యాచ్ చేస్తున్న అరాచ‌కం చూస్తుంటే చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం భార‌త‌దేశంలోనే ఉందా? అన్న అనుమానం క‌ల‌గ‌క మానదు.

జగన్ పార్టీ దురాగతం.. పులివర్తి నానిపై దాడి

చంద్రగిరి వైసిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెంచి పోషిస్తున్న రౌడీలు చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై బీర్ బాటిళ్ళు, సమ్మెటలు, రాళ్లతో దాడి చేశారు.  సమ్మెట దెబ్బతో గాయపడ్డ పులివర్తి నాని చికిత్స నిమిత్తం స్విమ్స్ లో అడ్మిట్  అయ్యారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో వున్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్ళి తిరిగి వస్తున్న పులివర్తి నాని మీద చెవిరెడ్డి రౌడీలు దాడి చేశారు. ఈ దాడిలో పులివర్తి నానికి, ఆయన భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. దాంతో తెలుగుదేశం నాయకులు యూనివర్సిటీ ప్రధాన రహదారి మీద బైఠాయించి నిరసన తెలిపారు. పులివర్తి నాని మీద 150 మందికి పైగా రౌడీలు రాడ్లు, కత్తులు, ఇతర మారణాయుధాలతో వచ్చి దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పులివర్తి నాని మీద దాడి సమాచారం తెలుసుకున్న అనంతరం భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు యూనివర్సిటీకి వచ్చారు. అక్కడ ఒక కారులో వున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డికి సంబంధించిన కారులో వున్న వైసీపీ  జెండాలు, మద్యం బాటిళ్ళను ధ్వంసం చేశారు. కారులో వున్న మారణాయుధాలను పోలీసులకు చూపించారు. పద్మావతి యూనివర్సిటీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

జగన్ కొంప ముంచిన కొమ్మినేని!

రాష్ట్రవ్యాప్తంగా వున్న వైసీపీ అభిమాన వర్గాలు ‘‘ఓరి నాయనో.. ఈ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మా జగనన్న కొంప ముంచాడు నాయనో’’ అని లబోదిబో అంటున్నారు. జగన్ మీడియాలో కీలక స్థానంలో, జగన్ ప్రభుత్వంలో ఒక సలహాదారుడు పదవి కూడా వెలగబెడుతున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు చాలామందికి తెలిసిన వ్యక్తే. ఈయన జగన్ గురించి సాక్షి మీడియాలో ఇచ్చే బిల్డప్పులు వింటే చెవుల వెంట రక్తం కూడా కారే అవకాశాలు వుంటాయి. జగన్ విషయంలో పదిపైసలంత మేటర్ వుంటే, అది కొమ్మినేని నోట్లోంచి పది వేల రూపాయలంత రేంజ్‌లో బయటకి వస్తుంది. కొమ్మినేని పేరుకే జర్నలిస్టుగానీ, ‘జగన్ భజంత్రీల సంఘం’ వ్యవస్థాపక అధ్యక్షుడు అని గిట్టనివారు అంటూ వుంటారు.  సరే, ఈయన మంగళవారం నాడు సాక్షి టీవీ కెమెరా ముందుకు వచ్చారు. సాధారణంగా అయితే జగన్ నినాదం అయిన ‘వైనాట్ 175’ అనే నినాదానికి అనుకూలంగా వైసీపీ అదరహో, కూటమి బెదరహో, అధికారం జగన్‌దేనహో అని నానా హడావిడి చేయాలి. కానీ ఆయన ఎలాంటి హడావిడి లేకుండా, చూద్దామన్నా నెత్తుటి చుక్క కూడా కనిపించని ముఖంతో ‘ఈసారి కూడా జగన్ విజయం సాధిస్తారు.. అని సర్వేలు కూడా చెబుతున్నాయి. నేను కూడా కొందరు సర్వేవాళ్ళతో మాట్లాడాను. వాళ్ళలో చాలామంది జగనే గెలుస్తారని చెప్పారు’ అని చాలా చప్పచప్పగా ఎక్స్.ప్రెషన్ ఇస్తూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే పెద్ద అబద్ధం ఆడలేను అన్నట్టుగా తేల్చేశారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లకి అన్నీ అబద్ధాలు చెప్పారట, అలాగే పోలింగ్ సందర్భంగా భారీగా హింసకు దిగారట... అని కొమ్మినేని శ్రీనివాసరావు దిగాలుగా ముఖం పెట్టి చెబుతుంటే, పాయే.. వైసీపీ పని అయిపాయే అని ఎవరికైనా అనిపించడం ఖాయం.. పోనీ, కొమ్మినేని గారు అక్కడితో ఆగలేదు.. జగన్ బ్రెయిన్ ఛైల్డ్ అయిన ‘వైనాట్ 175’ సిద్ధాంతానికే గండి కొట్టేశారు. రాయలసీమలో గత ఎన్నికలలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి 35 నుంచి 40 సీట్లు వస్తాయి అని డిక్లేర్ చేశారు.. అద్గదిగో.. ఇక్కడ వైసీపీ వర్గాల గుండెల్లో పెద్ద బండరాయి పడింది.. ఎవరైనా గతంలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి ఇంకా నాలుగైదు సీట్లు పెరుగుతాయి అని చెబుతారుగానీ, ఈయనేంటయ్యా బాబు.. దాదాపు పద్నాలుగు సీట్లు నిర్దాక్షిణ్యంగా కోసేశారు అని లబోదిబో అంటున్నారు. మన మీడియాలోనే మనం ఈరకంగా కోసేసుకుంటే, రియల్‌గా ఓటర్లు ఇంకెంత కోసేశారో అని కెవ్వుమంటున్నారు. కొమ్మినేని వైసీపీ వర్గాల మీద బాంబులు వేస్తూ మరికొంత విశ్లేషణ చేశారు. ఉత్తరాంధ్రలో వున్న 34 సీట్లలో 20 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు. అదేంటన్నా.. మన జగనన్న వైజాగ్ రాజధాని అని పోరాటం చేస్తుంటే, ఉత్తరాంధ్రలో సీట్లన్నీ మనకి వస్తున్నాయని చెప్పాలిగానీ, 14 సీట్లు కట్ చేశారేంటన్నా.. ఇదెక్కడి న్యాయం కొమ్మినేని సారూ అని వైసీపీ వర్గాలు మొత్తుకుంటున్నాయి.  జగన్ మొదటి నుంచి వైనాట్ 175 అంటే, కొమ్మినేని వారు మాత్రం 100 నుంచి 110 సీట్లు వస్తాయని ఫైనల్ చేశారు. ఈయన తీర్పు విని వైసీపీ వర్గాలు గొల్లుమంటున్నాయి. 175 వస్తాయి అని బిల్డప్పు ఇవ్వాలిగానీ, ఈరకంగా 110 బోర్డర్ పెట్టేశావేంటి దేవుడా అని బావురుమంటున్నాయి. సాక్షి మీడియా కాంపౌండ్లోనే పరిస్థితి ఇంత నీరసంగా వుందంటే, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఆ పాల‌న మాకొద్ద‌న్న ఏపీ ఓట‌ర్‌! అధికారం టీడీపీ కూట‌మిదే!

ఏపీలో జ‌రిగిన‌ పోలింగ్ పై రాజ‌కీయ పార్టీల్లో ఉత్కంఠ‌త పెరిగిపోతోంది.  2019లో  79.64 శాతం పోలింగ్ నమోదైంది. 2014వ సంవత్సరంతో పోల్చితే, 2019లో ఓటింగ్ 1.23 శాతం పెరిగింది. ఫ‌లితం ప్ర‌తిప‌క్ష పార్టీకి 151 సీట్లు వ‌చ్చాయి. అధికార పార్టీ 23 సీట్ల‌తో స‌ర్దు కోవాల్సి వ‌చ్చింది. ఇక 2019తో 2024 పోలింగ్ ను పోల్చితే 2 శాతం తేడా క‌నిపిస్తోంది. 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో 78.41, రెండోసారి 2019లో 79.64 శాతం న‌మోదయితే ఈసారి 2024 లో పోలింగ్  81 శాతాన్ని దాటిపోయేలా వుంది. దీన్ని బ‌ట్టి ఫ‌లితం ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. తెలుగుదేశం కూటమికి 155 నుండి 160 సీట్లు, వైఎస్సార్సీకి 15 నుండి 21 అసెంబ్లీ సీట్లు, 2 లేదా 3 పార్లమెంటు సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపికి కనీసం ప్రతిపక్షహోదా కూడా రాకుండా ఓట్లతో అమోఘమైన ప్రజాస్వామిక తీర్పు ఇచ్చారనే టాక్ అయితే న‌డుస్తోంది. పోలింగ్ జ‌రిగిన తీరు చూస్తే.... ఉప్పెనలా పోలింగ్ బూతులకు జనాలు తరలి వచ్చారు. ముఖ్యంగా  మహిళ ఓటర్లు, వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే అధికారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఓటర్లు ఎక్కువ. 154 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరే గెలుపోటములను నిర్ణయిస్తారు. ఇక్క‌డ ఓ విష‌యం మాట్లాడుకోవాలి. 2019 ఎన్నిక‌ల్లో మహిళలు పెద్దయెత్తున తరలి రావడంతో తమకు అనువుగా మారుతుందని అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది. అందుకు కార‌ణం ఏమిటంటే, పసుపు కుంకుమ పేరిట పది వేల రూపాయలు నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేయడంతో ఆ ఓట్లన్నీ తమకేనని అప్పట్లో టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఫ‌లితం మ‌నం చూశాం. టీడీపీ 23 స్థానాల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. సీన్ క‌ట్ చేస్తే 2024 ఎన్నిక‌ల్లోనూ భారీ స్థాయిలో మ‌హిళా ఓట‌ర్లు ఓటు వేశారు. అంటే... ప్రభుత్వంపై వ్యతిరేకత మహిళల్లో ఉంది.  1. అభివృద్ధి లేకపోవడంతో పాటు  2. మద్యనిషేధం చేయకపోవడం 3. శాంతిభద్రతల సమస్య‌లు 4. కూట‌మి  మ్యానిఫేస్టోలో పెట్టిన అంశాలు  5. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,  6. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం,  7. తల్లికి వందనం పేరిట ఎంత మంది కుటుంబంలో ఉన్నా వారందరికీ ఇస్తామని ప్రకటించడం  8. 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 1,500 ఇస్తామని చెప్పడం టీడీపీ కూట‌మికి క‌ల‌సి వ‌చ్చే అంశాలు. అందుకే మ‌హిళ‌లు భారీ ఎత్తున ఓటు వేశారు. ఏపీలో కుల రాజకీయాలకు ఎన్నికలు పరాకాష్ఠ. వారి కులం వారికే ఓటర్లు తమ ఓటును వేస్తారనేది కాదనలేని వాస్తవం. ఆ కులానికి చెందిన వ్య‌క్తి మంచి చేస్తున్నాడా చేయ‌డం లేదా అనేది ఎవ్వ‌రికీ అవ‌స‌రం లేదు. ఆ నేత తమ కులం వాడు,  అత‌నికే తమ ఓటు అనే ఆలోచనా ధోర‌ణి ఏపీలో చాలా మంది ఓటర్ల‌కు ఉంది. ఉద్యోగులు, కార్మికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కాపు, కమ్మ కులాల ఓటర్లు సాలిడ్ గా టీడీపీ కూటమికి ఓటేసినట్లు ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి ఓటర్లు, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెబుతోంది.   59 నెలలుగా దాదాపు 2 ల‌క్ష‌ల 75 వేల కోట్ల రూపాయలు 65 లక్షల కుటుంబాలకు అనేక పధకాల ద్వారా చేరాయని జగన్ పదే పదే చెప్పడం, ' మీ కుటుంబానికి మంచి జరిగితే మీరు వోట్ వేయండి.. మీరే ఇతరులకు చెప్పండి !' అని  అన్ని చోట్లా జగనే  చెబుతూ ప్ర‌చారం చేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక  ఓటు చీలకూడదు అన్న లక్ష్యంతో చంద్ర‌బాబునాయుడు కూటమి ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ్డారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, రాష్ట్రానికి రాజధాని లేదని,  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజా వ్యతిరేక చట్టం గా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లారు.  వైఎస్ షర్మిల జగన్ చెల్లెలు గా జగన్ ని బాగా ఇరకాటంలో పడేసింది అని చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు ను పట్టుకొని ఆయన కుమార్తె Dr సునీత కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం చేయటం, చివరి రోజు వైఎస్ విజయమ్మ కూడా 'షర్మిల ను గెలిపించండి ' అని మేసేజ్ వదలటం వైఎస్సార్ పార్టీ కి నష్టం కలిగించే అంశాలు.  ETV, TV5, ABN AndhraJyothi TV ఛానళ్ళు కూటమి వైపు, TV9, NTV, Sakshi TV ఛానళ్ళు వైయస్సార్ పార్టీ కి అనుకూలంగా కధనాలు ప్రసారం చేశాయి. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

విశాఖ ఓటర్లు.. జగన్‌కి మొట్టికాయలు!

మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన జగన్నాటకం అట్టర్ ఫ్లాపైంది. నా వైజాగో.. నా వైజాగో అని జగన్ లబలబ నెత్తీనోరూ కొట్టుకున్నాడు. ఆరు నూరైనా వైజాగే శాసన రాజధాని అన్నాడు. ఈసారి ప్రమాణ స్వీకారం వైజాగ్‌లోనే చే్స్తాన్నాడు.. డామ్ అన్నాడు.. డుష్ అన్నాడు.. చివరికి తుస్ అన్నాడు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే జగన్ పిల్ల చేష్టలకి, మూడు రాజధానుల కుప్పిగంతులను వైజాగ్ ఓటర్లు మొట్టికాయలతో చక్కదిద్దారు. విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు వున్నాయి. వీటిలో ఎనిమిది స్థానాలు వైజాగ్ పరిసరాల్లోనే వున్నాయి. ఈసారి జరిగిన ఓటింగ్‌ని బట్టి చూస్తే, విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్లో కూటమి గెలవబోతోందని, మిగతా మూడు స్థానాలతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది.  భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, చోడవరం, అనకాపల్లె, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం స్థానాల్లో కూటమి గెలుస్తున్నట్టు సమాచారం. మాడుగుల, అరకు లోయ, పాడేరు స్థానాలు మాత్రం వైసీపీ అకౌంట్లో పడనున్నాయని తెలుస్తోంది. మొత్తమ్మీద విశాఖలోగాని, విశాఖ పరిసరాల్లోగానీ వైసీపీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. జగన్ మూడు రాజధానుల విధానాన్ని వైజాగ్ ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారనేదానికి ఈ ఒక్క ఉదహరణ చాలు. ఈ ఐదేళ్ళలో జగన్ వైజాగ్‌ని విధ్వంసం చేసేశారు. జగన్‌కి సంబంధించిన పులివెందుల బ్యాచ్‌లు వైజాగ్‌ని భయాందోళనలకి గురిచేశాయి. రాజధాని వద్దు.. ఏమీ వద్దు.. ఈ జగన్ పీడ వదిలిపోతే చాలురా నాయనా అని వైజాగ్ ఓటర్లు భావించారని పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమైపోతోంది. టేక్ రెస్ట్ ఇన్ పులివెందుల జగన్.

పాయె.. అయిపాయె.. ఐప్యాక్ కూడా జగన్ కు జెల్ల కొట్టేసింది!

జగన్ పని అయిపోయింది. ఎన్నికలలో ఓటమి ఖరారైపోయింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంతో జగన్ పార్టీ మూటాముల్లె సర్దుకోవడమే మిగిలింది. ఆ మిగిలిన కాస్తా జూన్ 4న పూర్తైపోతుంది అన్నది ఇప్పటి వరకూ పరిశీలకులు, విపక్ష కూటమి నేతలూ చెబుతున్న మాట. సామాన్యుల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే అధికారికంగా ఫలితం వెలువడటానికి ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉన్నా.. జగన్ పని అయిపోయిందని చెప్పడానికి తిరుగులేని రుజువుగా ఐప్యాక్ నిలిచింది. ఇన్నేళ్లుగా జగన్ వ్యూహాలు, ఎత్తుగడలన్నిటి వెనుకా నిలిచిన ఐ ప్యాక్ పోలింగ్ పూర్తి కాగానే జగన్ కు జెల్ల కొట్టేసిందని అర్ధమౌతోంది. పోలింగ్ సోమవారం (మే13) పూర్తయ్యింది. మే 15( బుధవారం ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ ఆయన టీమ్ జగన్ తో కలిసి విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు ఎప్పుడో నిర్ణయించేసుకున్నాయి. ఆ సందర్భంగా ఐ ప్యాక్ జగన్ ను సన్మానించాలని కూడా భావించింది. అయితే ఇప్పుడు ఆ విజయోత్సవ సంబరం, జగన్ సన్మాన కార్యక్రమం రెండింటినీ కూడా ఐప్యాక్ రద్దు చేసుకుంది.   అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే బుధవారం ఐప్యాక్ బృందంతో కలిసి జగన్ పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలేవారు. కానీ పోలింగ్ రోజు ఉదయం నుంచే ప్రజలలో కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత పోలింగ్ సరళితో ప్రస్ఫుటంగా కనిపించడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి ప్రజా వ్యతిరేకత సునామీలా ఈవీఎమ్ లలో నిక్షిప్తమైపోయిందని స్పష్టమైపోవడంతో  వైపీపీ బెంబేలెత్తిపోయింది. అలాగే ఐప్యాక్ కూడా మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోవడానికి రెడీ అయిపోయింది. దీంతో బుధవారం ( మే 15) విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ఐప్యాక్ కార్యాలయంలో జరగాల్సిన వేడుకలకు ఫుల్ స్టాప్ పడింది. జగన్ ను ఐ ప్యాక్ ఆఫీసుకు ఆహ్వానించి సన్మానించాలన్న రుషిరాజ్ సింగ్ ప్రణాళికకు గండిపడింది. జగన్ ఐప్యాక్ కార్యాలయానికి రావడం లేదనీ, ఆయన సన్మాన కార్యక్రమం రద్దైందనీ ఐప్యాక్ వర్గాల ద్వారానే విశ్వసనీయంగా తెలిసింది.  ఈ మేరకు వైసీపీ నుంచి ఐప్యాక్ కు స్పష్టమైన సమాచారం అందింది.  దీంతో భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవాలన్న ఐప్యాక్, వైసీపీల ప్రణాళిక కార్యరూపం దాల్చకుండానే ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇది ఎన్నికలలో జగన్ కు విజయావకాశాలు ఇసుమంతైనా లేవన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా చాటుతోందని పరిశీలకులు చెబుతున్నారు.  అంతే కాదు ఐప్యాక్ సభ్యులకు కంపెనీ ఇచ్చిన  మెబైల్ ఫెన్ లు, ల్యాప్ టాప్ ల  బుధవారం (మే 15) ఉదయానికల్లా తిరిగి ఇచ్చేయాలని విస్పష్ట ఆదేశాలు అందాయి. అంతే కాదు వారికి ఇవ్వవలసిన ఈ నెల వేతనాలు, ఇతర అలవెన్సులు అందజేస్తామని తెలిపింది. అంతే కాకుండా ఎవరైన లాప్ టాప్, మెబైల్స్ రిటర్న్ చేయకుంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరిక కూడా జారీ అయ్యింది. ఇంత అర్జంట్ గా ఐ ప్యాక్ సభ్యుల నుంచి పోన్లు, ల్యాప్ టాప్ లను వెనక్కు తీసుకోవడానికి కారణం ప్రభుత్వం మారితే తమ ఫేక్ ప్రోపగాండా బయటకు పొక్కి చిక్కుల్లో పడతామన్న భయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు జగన్ ఐప్యాక్  రిషిరాజ్ సింగ్ ఆయన టీమ్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, అంతే కాకుండా వారికి ఇస్తామన్న 50 కోట్ల రూపాయల ప్యాకెజీని హోల్డ్ లో పెట్టారనీ తెలుస్తోంది.   ఆ కారణంగానే ఐ ప్యాక్ జగన్ సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసుకుందని అంటున్నారు. 

హింసను నిలువరించింది.. పోలింగ్ కు సహకరించింది.. శభాష్ తెలుగుదేశం క్యాడర్!

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది.  ఓటర్ల తీర్పు ఈవీఎంలలో  నిక్షిప్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వందల పోలింగ్ స్టేషన్లలో మంగళవారం (మే14) తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. తమ వంతు వచ్చే వరకూ ఓటర్లు ఓపికతో ఎదురు చూస్తే రాత్రంతా జాగారం చేయడం ఓటరు చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. అంత వరకూ గెలుపు మాదంటే మాదంటూ అధికార విపక్షాలు తమ వాదనలకు సాధ్యమైనంత పదును పెట్టుకుంటాయి. పార్టీలు చెప్పుకోవడంతో సంబంధం లేకుండానే ఫలితం ఏమిటన్నది ఇప్పటికే అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. ఫలితాలు వెలువడే జూన్ నాలుగో తారిఖునే అధికారికంగా ఏ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అన్నది తేలుతుంది.  కానీ ఈ సారి ఏపీలో ఎన్నికల సరళి, ఓటరు చైతన్యం, ఓటు వేయాలన్న పట్టుదలతో జనం కదిలిన తీరు అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత  జనంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రత్యేకంగా, ఒక విశేషంగా చెప్పుకోవలసిందేమిటంటే.. గత ఐదేళ్లుగా అన్ని విధాలుగా వేధింపులకు గురై, కేసుల్లో ఇరుక్కుని నానా అగచాట్లూ పడిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ఉత్సాహం. చేసిన త్యాగాలు.   ఈ ఎన్నికల్లో కూటమి విజయం లక్ష్యంగా తెలుగుదేశం శ్రేణులు అహర్నిశలూ కష్టపడ్డాయి. ముఖ్యంగా పొత్తుల కారణంగా త్యాగాలు చేయాల్సి వచ్చినా, అనుకున్న నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పోటీలో లేకపోయినా.. తెలుగుదేశం క్యాడర్ నిరుత్సాహ పడలేదు. అదు ఉత్సాహంతో, అదే స్ఫూర్తితో పని చేసింది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం మేనిఫెస్టో ను బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లం, అలాగే  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చంద్రబాబు సంతకం అన్న సంగతిని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంలో తెలుగుదేశం క్యాడర్ కంప్లీట్ గా సక్సెస్ అయ్యింది.   అక్కడి వరకూ ఒకెత్తు అయితే పోలింగ్ రోజున పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, సంయమనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంటుంది. వైసీపీ మూకలు ఎంత రెచ్చగొట్టినా, పోలింగ్ కు విఘాతం కలిగించే లక్ష్యంతో ఎంతగా హింసాత్మక చర్యలకు పాల్పడినా తెలుగుదేశం శ్రేణులు, నేతలూ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. పోలింగ్ సజావుగా సాగేలా చూశారు.  తెలుగుదేశం నాయకులు, క్యాడర్ సర్వశక్తులూ ఒడ్డి పనిచేశారు. ఇక్కడ పోటీలో ఉన్నది తెలుగుదేశం అభ్యర్థా, బీజేపీ అభ్యర్థా అని చూడలేదు. కూటమి అభ్యర్థి అంటే తెలుగుదేశం అభ్యర్థే అన్నట్లుగా పని చేశారు. దీంతో కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీకి ఎలాంటి అవరోధాలూ లేకుండా సజావుగా సాగింది.   తెలుగుదేశం, జనసేన పొత్తులోకి బీజేపీ వచ్చి కలిసిన తరువాత తొలి రోజులలో   ఓట్ల బదిలీ పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఉన్న బలంతో సంబంధం లేకుండా పేచీపెట్టి మరీ బీజేపీ పొత్తులో భాగంగా ఎక్కువ స్థానాలు  దక్కించుకోవడం, అక్కడితో ఆగకుండా చివరి క్షణం వరకూ సీట్ల మార్పు కోసం మడత పేచీలు పెట్టడంతో  ఒక దశలో బీజేపీ పొత్తు పేరుతో తెలుగుదేశం పార్టీకి నష్టం చేయాలన్న వ్యూహంతో పని చేస్తోందా అన్న అనుమానాలు కూడా తెలుగుదేశం క్యాడర్ లోనే వ్యక్తం అయ్యాయి. పార్టీల మధ్య ఓట్ల బదలాయింపుపై అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఎన్నికల రోజుల మాత్రం అన్నీ పక్కన పెట్టి తెలుగుదేశం శ్రేణులు కూటమి అభ్యర్థుల కోసం పని చేశాయి. అలాగే జనసేన బీజేపీ శ్రేణులు కూడా కదలడంతో మూడు పార్టీలూ ఒక్కటే అన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఓటు బదలీ సజావుగా సాగింది. పల్నాడు, పుంగనూరు వంటి సున్నిత ప్రాంతాలలో  అధికార పార్టీ పెద్ద ఎత్తున హింసకు పాల్పడినా ఎన్నికల సంఘం, పోలీసు శాఖ చోద్యం చూస్తూ నిలిచిపోయాయి. అయితే అవి చేయాల్సిన పని కూడా తెలుగుదేశం క్యాడరే చేసింది. వైసీపీ గూండాయిజాన్ని ఎదురొడ్డి ఎదుర్కొని నిలువరించింది. ప్రాణాలను ఫణంగా పెట్టి కూటమి విజయం కోసం నిలబడింది. తెలుగుదేశం క్యాడర్ స్థైర్యం, ధైర్యం ముందు వైసీపీ వ్యూహాలు పారలేదు. హింసతో భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ జరగకుండా చేయాలన్న వైసీపీ ఎత్తుగడ భగ్నమైంది.  దీంతో అనీల్ కుమార్ యాదవ్, గోపిరెడ్డి వంటి వైసీపీ నేతలు ఎన్నికల సంఘం, అధికారులు, పోలీసులు తమ చేతులు కట్టేసి తెలుగుదేశం శ్రేణులకు అనుకూలంగా వ్యవహరించారంటూ మీడియా ముందు బేలగా చెప్పుకునే పరిస్థితికి వచ్చారు.  టీడీపీ క్యాడర్ ప్రతిఘటనతో   పల్నాడుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అంబటి రాంబాబు, పినెల్లి రామకృష్ణారెడ్డి వంటి వైఎస్సార్‌సీపీ నేతలందర్నీ డిఫెన్స్ లో పడేసింది. గత ఐదేళ్ల దాడులు, బెదరింపులు, వేధింపులకు దీటుగా సమాధానం చెప్పింది. ఇంకానా ఇకపై సాగవు అంటూ విస్పష్ట సందేశం ఇచ్చింది.  ప్రజలలోనూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేసే ధైర్యాన్నిచ్చింది. ఇక్కడే అధికారికంగా ఫలితం వెలువడటానికి ముందే తెలుగుదేశం పార్టీకి నైతిక విజయం దక్కేటట్లు చేసింది.  

ఫోన్ ట్యాపింగ్ కేసుకి జాతీయ హోదా!

ఏపీకి జాతీయ హోదా దక్కుతుందో, లేదో గానీ, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా వుండగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి మాత్రం జాతీయ హోదా దక్కేట్టుంది.. అదెలాగయ్యా అంటే... ఢిల్లీ లిక్కర్ కేసును కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ వర్గాలు చాలా లైట్‌గా తీసుకున్నాయి. మోడీకి, ఈడీకి భయపడేదే లేదని కేసీఆర్ ఫ్యామిలీ అంతా యతిప్రాసలు ఉపయోగించి మాట్లాడారు. ఆ కేసుతో కవితకి ఎలాంటి సంబంధం లేదని సుద్దపూసలకి చుట్టాల మాదిరిగా మాట్లాడారు.  చివరికి ఏమైంది.. డూప్లికేట్ బతుకమ్మ తీహార్ జైల్లో చిప్పకూడు తింటోంది. ఇప్పుడప్పుడే జైల్లోంచి బయటకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మంగళవారం నాడు ఢిల్లీ కోర్టు కవిత బెయిల్‌ని ఈనెల 20 వరకు పొడిగించింది. పరిస్థితి చూస్తుంటే కవిత జైలు జీవితం ఆంజనేయస్వామి తోకలాగా ఎప్పటికప్పుడు పెరుగుతూ వెళ్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ ఇచ్చే బిల్డప్పలు, మేకపోతు గాంభీర్యాలు అన్నీ ఉత్తుత్తివే అని లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మరోసారి ప్రూవ్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఇదే తరహా బిల్డప్పు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా ఇస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి సోమవారం నాడు జర్నలిస్టులు కేసీఆర్ని ప్రశ్నించినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్లో వున్నప్పుడు ఎంత పొగరుగా సమాధానం చెప్పారో, ఇప్పుడు కూడా అంతకు మించిన పొగరుగా సమాధానం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదట. పోలీసులదే మొత్తం పాపమట. ముఖ్యమంత్రి హోదాలో పోలీసులని మేం సమాచారం అడుగుతాం.. వాళ్ళు ఏమార్గంలో వెళ్ళి ఆ సమాచారం తెస్తారో మాకు సంబంధం లేదు. టెలీగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్లని ట్యాప్ చేసే అధికారం వుంది. అవసరమైతే ట్యాప్ చేసిన సమాచారాన్ని ధ్వంసం చేసే అధికారం కూడా పోలీసులకు వుంది అని చెప్పుకొచ్చారు. అంటే, ఈ ధ్వంసం చేసే వ్యవహారం కేసీఆర్‌కి తెలిసే జరిగిందన్నమాట. చట్టంలో ధ్వంసం చేయొచ్చు అని కూడా వుంది కదా.... అందుకని ట్యాపింగ్ చేసినంతకాలం చేసి, బయటపడే రోజు రాగానే ధ్వంసం చేశారన్నమాట. ‘ధ్వంసం చేయొచ్చని  కూడా చట్టంలో’ వుంది అని కాళ్ళు ఊపుకుంటూ నిర్లక్ష్యంగా అంటే సరిపోదు... ఆ ధ్వంసం చేయడమే ఇప్పుడు కేసీఆర్ని జాతీయ స్థాయిలో నేరస్తుడిలా నిలబెట్టబోతోంది. ఫోన్ ట్యాపింగ్ చేసినంతకాలం చేసిన పోలీసులు, కేసీఆర్ కుర్చీలోంచి దిగిపోగానే హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి మూసీ నదిలో పారేశారు. వాళ్ళు ధ్వంసం చేసింది వాళ్ళు ట్యాపింగ్ చేసిన హార్డ్ డిస్కుల వరకు అయితే సర్లే అనుకోవచ్చు. దేశ రక్షణ, మావోయిస్టులు, ఉగ్రవాదుల సమాచారం కూడా వున్న హార్డ్ డిస్కులు కూడా ధ్వంసం చేశారట. ఉగ్రవాదుల సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారంటే, అది కచ్చితంగా జాతీయ స్థాయి వ్యవహారమే. ఈ విషయాన్ని ఈమధ్యే  రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ఎన్నికల అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి సమీక్ష నిర్వహించి, తదుపరి చర్యలకు వెళ్తామని ఆయన చెప్పారు. అంటే, త్వరలో కేసీఆర్, కేటీఆర్ జాతీయ స్థాయి నేరస్థులుగా ప్రమోషన్ పొందబోతున్నారన్నమాట.

ఓటెత్తిన ప్రభుత్వ వ్యతిరేకత.. ఏపీలో 85శాతం పైనే పోలింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వెల్లువెత్తింది.  కొత్త ఓటర్లు,  యువత తమ భవిష్యత్ ఓటుతోనే ముడిపడి ఉందని భావించారు. అందుకే పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఇక మధ్యతరగతి, దిగువ మధ్య తరగలి వారు తమ ఆస్తులకు రక్షణ ఉండాలంటే ఓటేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడమే మార్గమని నిర్ణయించుకున్నారు. ఇక పేద, బడుగు వర్గాల వారు తాము ఆరోగ్యంగా ఉండాలంటే అరకొర సంక్షేమం కాదనీ, ఆరోగ్యం ముఖ్యమని భావించారు. లేదంటే ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంతో  తమ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయమన్న భయంతో ఓటు వేయడానికి తరలి వచ్చారు.  దీంతో గత ఎన్నికల్లో 79 శాతం ఈవీఎం ఓటింగ్  నమోదైతే  ఈ సారి 82 శాతానికి పైగా పోలింగ్ జరిగిందన్నది అంచనా.  దీనికి రికార్డు స్థాయిలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అదనం.  స్వయంగా రాష్ట్ర ఎన్నికల అధికారిముఖేష్ కుమార్ మీనా గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో ఓటింగ్ భారీగా పెరిగిందని ప్రకటించారు.  ఈవీఎంలు,పోస్టల్ బ్యాలెట్లు కలుపుకుంటే.. 85 శాతానికి మింతే పోలింగ్ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే వైసీపీ మాత్రం ఇదంతా ప్రభుత్వ సానుకూల ఓటని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది. కానీ ప్రభుత్వ పాజిటివ్ ఓటింగ్ ఎప్పుడూ వెల్లువలా సాగదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఒక ప్రభుత్వాన్ని మార్చి తీరాలన్న కసి, పట్టుదల ప్రజలలో ఉన్నప్పుడే ఓటు వేసి తీరాలన్న పట్టుదల జనం ప్రదర్శిస్తారనీ, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా లెక్క చేయకుండా పోలింగ్ బూత్ కు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటారనీ వారు సోదాహరణంగా చెబుతున్నారు. 2014తో పోలిస్తే 2019లో పోలింగ్ శాతం పెరగడంతో తెలుగుదేశం భారీగా నష్టపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు 2019తో పోలిస్తే 2014లో పోలింగ్ శాతం మరింత పెరిగిందంటే.. వైసీపీ భారీగా నష్టపోవడం ఖాయమని చెబుతున్నారు.  2019 ఎన్నికలలో పోలింగ్ శాతం పెరినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెప్పారు. ఎక్కువ ఓటింగ్ జరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటేననీ అప్పడు బల్లగుద్ది చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఇంత భారీగా పోలింగ్ నమోదయ్యిందంటూ అది కచ్చితంగా ప్రభుత్వ పాజిటివ్ ఓటు మాత్రమేనని అంటున్నారు. ఈ వాదంతో జనాలను ఎటూ నమ్మించలేరు, కనీసం పార్టీ క్యాడర్ అయినా నమ్మక పోతుందా అని తెగతాపత్రేయపడుతున్నారు.  అయితే  పార్టీ నేతలూ, క్యాడర్ కూడా ఆయన మాటలు నమ్మడం లేదని పోలింగ్ సందర్భంగా, పోలింగ్ తరువాత వారు మాట్లాడిన మాటలే రుజువు చేస్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిథి అనిల్ కుమార్ యాదవ్ అయితే పోలీసులు అధికారులు  వైసీపీ నేతలు, కార్యకర్తలను నియంత్రించి, తెలుగుదేశం నాయకులు, శ్రేణులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారని చెప్పడం ద్వారా ఎన్నికల ఫలితం ఏమిటో ఫలితాల వరకూ ఆగనవసరం లేకుండా ఆయనే చెప్పేశారు. ఇక నగరి తెలుగుదేశం అభ్యర్థి రోజా అయితే పోలింగ్ పూర్తి కాకుండానే తన ఓటమిని అంగీకరించేశారు. తనను నగరిలో  ఓడించడానికి సొంత పార్టీ నేతనే పని చేశారని చెప్పారు. ఇక చివరాఖరుగా చెప్పేదేమిటంటే.. ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడానికి ఓటర్లు ఉప్పెనలా తరలి వచ్చి ఓటేసిన సందర్భం చరిత్రలో లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటే మాత్రం జనం వెల్లువలా తరలివచ్చి ఓటు వేస్తారనడానికి చరిత్రలో ఎన్నో దాఖలాలు ఉన్నాయి. అందుకే  ఇప్పుడు రాష్ట్రంలో ఓటరు చైతన్యం ప్రభుత్వ అనుకూల ఓటా, వ్యతిరేక ఓటా అన్న విషయంపై కొత్తగా చర్చ చేయాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో జనం చైతన్యంతో  ఓటెత్తారంటే వైసీపీకి ఘోర పరాజయం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.