కాంగ్రెస్ పార్టీలో అందరూ తేడాయేనా

  కాంగ్రెస్ అధిష్టానం తన రాష్ట్ర నేతలను నియత్రించడంలో విఫలమవడం కొత్త విషయమేమీ కాదు. వారి క్రమశిక్షణా రాహిత్యానికి వారు ప్రజాస్వామ్యమని ముద్దు పేరు పెట్టుకొని సమర్ధించుకొంటారు కూడా. బహుశః కేంద్ర నాయకులలో ఈ ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువేననిపిస్తుంది. ఒకే అంశంపై పదిమంది నేతలు పది రకాలుగా మాట్లాడటం కాంగ్రెస్ సంస్కృతి అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నమాట నిజమని ఒప్పుకోక తప్పదు.   రాష్ట్ర విభజనపై సీమాంధ్ర, తెలంగాణా నేతలు రెండు రకాలుగా మాట్లాడుతుంటారు. సీమాంధ్ర యంపీలు రాజీనామాలు చేద్దామని చెపుతుంటే, రాకరాక వచ్చిన మంత్రి పదవులను వదులుకొని ఏమి సాధిస్తామని కేంద్రమంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.   ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే సోనియా గాంధీ కార్యదర్శి షకీల్ అహ్మద్ ‘రాష్ట్ర విభజన ప్రకటన చేసి తొందరపడ్డామేమో!’ అని అంటే, ‘పార్టీ నిర్ణయాన్నిప్రభుత్వం కూడా ఆమోదించింది,విభజన ఖాయం!’ అని మనిష్ తివారి కుండ బ్రద్దలు కొడతాడు. వాయలార్ రవి ‘అంటోనీ కమిటీ నివేదిక వచ్చిన తరువాతనే టీ-నోట్ క్యాబినెట్ ముందుకు వెళుతుందని’ చెప్పిన కొద్దిసేపటికే హోంమంత్రి షిండే ‘టీ-నోట్ రెడీ, త్వరలో క్యాబినెట్ ముందుకి’ అని ప్రకటిస్తారు. మరో మంత్రి గారు మధ్యలో దూరి ‘టీ-నోట్ కి అంటోనీ కమిటీకి ఒకదానితో మరొకదానికి అసలు సంబంధమే లేదని’ శలవిస్తారు.   దిగ్విజయ్ సింగ్ సీమాంద్రా కాంగ్రెస్ యంపీలను ఒకపక్క ఒదారుస్తూనే, ‘తెలంగాణా ప్రక్రియ ఆగే ప్రసక్తిలేదు, మాటంటే మాటే! ఎన్నికలలోగా తెలంగాణా పక్కా!’ అని గిల్లి వదిలిపెడతారు. “అలాగయితే మేము రాజీనామాలు చేస్తామని” సీమాంధ్ర నేతలు బెదిరిస్తే “ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడబోమని” దిగ్విజయ్ సింగ్ బదులిస్తారు.   మరో చాకు లాంటి పెద్దాయన చాకో వచ్చి ‘వాళ్ళు ప్రజల పోరు పడలేక అలాగంటున్నారు గానీ వాళ్ళు నిజంగా రాజీనామాలు చేస్తారా ఏమిటీ?’ అని వారిని సమర్దిస్తునాడో లేక విమర్శిస్తునాడో తెలియకుండా గిల్లుతాడు.   రాష్ట్ర విభజన చేసేస్తున్నామని ప్రకటించి ఇప్పటికి 50రోజులయినా ఇంకా అడుగు ముందుకు వేయడానికి సాహసించలేని కాంగ్రెస్ నేతలు కచ్చితంగా ఎన్నికలలోగా విభజించిపడేస్తామని బల్ల గుద్ది మరీ హామీ ఇస్తున్నారు. హైదరాబాదుపై ఏమి చేయాలో పాలుపోక మా దగ్గిర మూడు ఆప్షన్స్, ముప్పై మూడు ఆప్షన్స్ ఉన్నాయని తమ అయోమయ పరిస్థితిని బయటపెట్టుకొనే పెద్దమనుషులు, ‘హైదరాబాద్ విషయంలో అందరికీ అమోదయోగ్యమయిన నిర్ణయం తీసుకొంటాము, అందరికీ న్యాయం చేస్తాము’ అంటూ మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు.   ఏవిషయంలోనైనా అనుమానాలు వస్తే ఆ అంశంపై ముందుగా మీడియాకు లీకులు ఇచ్చి జనం నాడి తెలుసుకొనే ప్రయత్నం చేసే వాళ్ళే ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెపుతుంటారు. అయినా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండానే తీసుకొంటున్నట్లు వారు చేసే హడావుడికి మాత్రం లోటు ఉండదు. దాదాపు రెండు నెలలుగా రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయినా ‘అంతా ప్రశాంతంగా అండర్ కంట్రోల్లో’ ఉందని ప్రకటించి చేతులు దులుపుకొంటారు.   ఏమయినప్పటికీ అసలు ఒకే అంశంపై ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడటమే చాల గొప్ప విషయమని నమ్మక తప్పదు. నిజం చెప్పాలంటే మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్ళే కాంగ్రెస్ నేతలవుతారేమో! ఆ లెక్కన వీళ్ళు నటులు కాబోయి రాజకీయ నాయకులయ్యారని చెప్పవలసి ఉంటుంది.

జగన్ బెయిలుకి ఉద్యమ కారణమే అడ్డుపడుతుందా

    అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను మరో మూడు రోజుల్లో కోర్టు ముందుకు రానున్న తరుణంలో, సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి వచ్చేనెల 3 వరకు అతని జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ఈసారి తప్పకుండా అతనికి బెయిలు దొరుకుతుందని అతని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దృడంగా నమ్ముతున్నారు.   ప్రస్తుతం సీబీఐ తుది చార్జ్ షీట్ కూడా వేయడం పూర్తయిపోయింది గనుక, ఇక అతనికి బెయిలు ఇవ్వడం అనివార్యం అవుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ, సీబీఐ మాత్రం షరా మామూలుగానే అతనికి బెయిలు ఇస్తే తమ దర్యాప్తుకి ఆటంకం కలుగుతుందని వాదించడం విశేషం. తుది చార్జ్ షీట్లు కూడా వేసిన తరువాత సీబీఐ తన దర్యాప్తు కొనసాగుతుందని, జగన్మోహన్ రెడ్డికి బెయిలు ఇస్తే దానికి ఆటంకం కలుగుతుందని చెప్పడం చూస్తే, సీబీఐ ఈ కేసుని మరికొంత కాలం సాగదీసేందుకే నిశ్చయించుకొన్నట్లుగా భావించవలసి ఉంటుంది. మరి వైకాపా ఆరోపిస్తున్నట్లు ఒకవేళ ఇందులో కాంగ్రెస్ ప్రమేయం ఉండి ఉంటే, బహుశః డిల్లీ నుండి సీబీఐకి ఇంకా ఎటువంటి నిర్దిష్ట సూచనలు రాలేదని భావించవలసి ఉంటుంది.   జగన్మోహన్ రెడ్డి తన బెయిలు పిటిషనులో ప్రస్తుతం సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ చేస్తున్న ఉద్యమాల గురించి పేర్కొని, పార్టీ అధ్యక్షుడిగా వాటిని ముందుండి నడిపించవలసిన బాధ్యత తనపై ఉంది గనుక తనకు బెయిలు మంజూరుచేయవలసిందిగాకోరడం బహుశః పెద్ద పొరపాటు అవుతుందేమో!   ఒకవేళ అతనికి కోర్టు బెయిలు మంజూరు చేసినట్లయితే, సమైక్యాంధ్ర ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని అర్ధం అవుతోంది. ఇప్పటికే ఈ ఉద్యమాలతో, ఉద్యోగుల సమ్మెతో తలబొప్పికట్టిపోయిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పడు తనకి బెయిలు మంజూరు చేస్తే ఆ అగ్నికి ఆజ్యం పోస్తానని అతను స్పష్టంగా చెపుతున్నపుడు మరి కాంగ్రెస్ అధిష్టానం అందుకు మార్గం సుగమం చేస్తుందని అనుకోలేము. ఒకవేళ బెయిలు విషయంలో కాంగ్రెస్ ప్రమేయం ఏమీ లేదనుకొన్నాబహుశః కోర్టు కూడా బెయిలు నిరాకరించినా ఆశ్చర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి తన బెయిలు దరఖాస్తులో ఈ కారణం పేర్కొని తప్పు చేసాడేమో?

రాష్ట్ర నాయకుల "రహస్య లిపి''

      - డా. ఎబికె ప్రసాద్   [సీనియర్ సంపాదకులు]       కవి శ్రీరంగం నారాయణ బాబు అనేక సంవత్సరాల క్రితం ఓ పాట రాశాడు. రంగూన్ (బర్మా)తో వర్తక, వ్యాపార లావాదేవీలు మన రేవు పట్టణాలనుంచి జరుగుతున్నప్పుడు ఓ జానపద దంపతుల జంట మధ్య నడిచిన సంభాషణకు అక్షర రూపమిచ్చాడు : "రంగమెళితే నేటి రంగైనవోడ!  నే      రంగమెళితే నేటి అచ్చరాల నీ పేరే పచ్చాపొడుసుకొన్నాను     సాటుమాటుగ దాన్ని సదివించుకొన్నాను  రంగమెళితే నేటి? ...'' ఇక్కడ 'రంగం' అంటే రంగూన్ అనే. ఎవడిగోలవాడిదే అన్నట్టుగా తొలి రోజుల్లో మన కవిత్వం మనమేగాని యితరులకు తెలియకుండా వుండాలనే ఊహ ఉండేది మన కవులకు! ఈ దుస్థితిని కనిపెట్టి తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు అలాంటి "దుస్థితి''ని "రంగూను ఉత్తరాల''తో పోల్చుతూ వుండేవారు! ఇంతకీ ఈ "రంగూన్ ఉత్తరాల'' కథాకమామీషు ఏమిటి?! ఆనాటి ఆంధ్రదేశంలో శ్రీకాకుళం నుండి గోదావరి జిల్లాల వరకూ ఒకప్పుడు రంగూన్ తో భారీస్థాయిలో వ్యాపార లావాదేవీలు జరుగుతుండేవి. మొగలాయీలు, నిజాంపాలకులు కూడా తెలంగాణా తెలుగుప్రాంతంలో సముద్రప్రాంతం లేనందున మచిలీపట్నం, కాకినాడ రేవుల నుంచే వర్తక, వ్యాపారాలు నిర్వహించుకునే వారు! నాటి వర్తక వ్యాపారానికి సంబంధించిన పరస్పర ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ రహస్య (సంకేత) లిపిలో సాగుతుండేవట. ఆ 'లిపి' చాలావరకు తెలుగు, ఉర్దూలే అయినప్పటికీ ఆ లిపిని అటు ఇటూ కూడా ఉత్తరాలు పంపేవారికి, అందుకునేవారికి మాత్రమే అర్థం చేసుకోగలిగేవాళ్ళట. అంటే, వ్యాపార రహస్యాలు వెల్లడి కాకుండా ఈ ప్రత్యేక 'లిపి' వాడేవారట! చాలామందికి గుర్తుందో లేదో మన చిన్నప్పుడు ఆట పాటల్లో ఉన్న పిల్లలు పెక్కుమంది 'క' భాషలో (సంకేత భాష) ఇతరులకు తెలియకుండా వాడుతూ వుండేవారు సరదాగా! కాని ఇప్పుడు అలాంటి భాష ఏదో రాష్ట్ర విభజన సమస్యపైన అటు కేంద్ర నాయకులకూ, ఇటు దశదిశా తెలియకుండా ప్రజల్ని సొంత ఎజెండాలతో వేధిస్తున్న పార్లమెంటు సభ్యులకు, శాసనసభ సభ్యులకూ, "సొంత పార్టీలు'' పెట్టుకుని యుతవలో, ప్రజలలో భ్రమలు గొలిపే రాజకీయ నాయకులకూ మధ్య "ఆసులో గొట్టాం''లా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ జరుపుతున్న "రాజకీయ వ్యాపార లావాదేవీలు'' కూడా "రంగూన్'' ఉత్తరాల మాదిరే నడుస్తున్నాయి! కాని 'వాళ్ళ' మోసపు సంభాషణ మాత్రం మనకు తెలియదు! రాష్ట్ర విభజన సమస్యపై వీళ్ళు ఇక్కడ రాష్ట్రప్రజలకు చెప్పేదొకటి, ఢిల్లీ పరుగెత్తి అక్కడ నాయకత్వం చెవిలో ఊది వచ్చేదొకటీ! భాషాజ్ఞానం నుంచే గాక, చరిత్ర పాఠాలను కూడా పాఠ్యప్రణాళికల్నుంచి ఎత్తించి వేయించిన ఘనులు మన పాలకులు!   అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, తెలుగుజాతి చరిత్ర తెలియని ఆ చరిత్రలో బొత్తిగా సంబంధం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం తెలుగుజాతిని అవమానిస్తూ రాష్ట్ర నాయకుల్ని తన చుట్టూ గానుగెద్దుల్లాగా తిప్పుకుంటున్నా రాష్ట్రనాయకులకు సిగ్గులేదు. ఇది దుర్భరం! తెలుగువారికి అవమానకరం. డాక్టర్ అంబేడ్కర్ పదేపదే హెచ్చరించినట్టుగా పార్లమెంటులో మెజారిటీ స్థానాలు దక్కించుకునే కోరికను సఫలం చేసుకునేందుకు కాంగ్రెస్ ఇన్నాళ్ళుగా ఆడుతూ వచ్చిన నాటకం మూడు ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలం మీద ఆధారపడి, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను ఉత్తరాదివారు దెబ్బతీస్తున్నారన్న భావన దక్షిణాది వారిలో కలిగే ప్రమాదం ఉందని మరచిపోరాదు. ఎంతసేపూ ఉత్తరప్రదేశ్ కు చెందిన 80-85 సీట్లపైన, మధ్యప్రదేశ్, బీహార్ స్థానాలపైన కాంగ్రెస్ దృష్టి పెట్టడంవల్లనే అనేక దఫాలుగా ఆ పార్టీ సంక్షోభాలు ఎదుర్కొనక తప్పడంలేదు! ఈ గుర్తింపు, జ్ఞానం కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పటికీ లేదు. కనుకనే తమ లాభలబ్ది కోసం ఎక్కడికక్కడ తాడూబొంగరం లేని రాజకీయ విధానాలతో, కుట్రలతో 'వోటు-సీటు' ప్రయోజనాలతో ప్రజలను విభజించి తమ పబ్బం గడుపుకునే స్థానికపార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉండటం.   పైగా తెలుగుజాతి చరిత్ర గురించి, అది చరిత్రలో భాషా వ్యాప్తి ద్వారా, వందల, వేల సంవత్సరాల స్వీయ సంస్కృతీ విభావంతో మగధనుంచి మచిలీపట్నందాకా [మూడు ప్రాంతాలూ] శాతవాహన, కాకతీయ, విజయనగర యుగాల దాకా విలసిల్లిందని తెలియని కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని తెలుగేతర "మాయలమారుల'' దుష్టచతుష్టయం [దిగ్విజయ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, తాజాగా ఆంటోనీ] తొమ్మిది కోట్ల మంది తెలుగుప్రజల భావితవ్యంతో జూదమాడుతున్నారు! ఈ విషయం తెలిసి కూడా కేవలం పదవులకోసం జాతి విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పచ్చి అవకాశవాద రాజకీయాల్లోకి జారుకున్న కొన్ని ప్రతిపక్షాల నాయకులూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.   రాజకీయ శక్తిగా రాష్ట్రప్రజా బాహుళ్యంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన సమస్త ప్రతినిధుల సమక్షంలో చర్చలు జరపకుండా కేవలం ఒక రాజకీయపార్టీకి చెందిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకపక్షంగా చేసిన రాష్ట్ర విభజన తీర్మానాన్ని కాలదన్ని రాష్ట ప్రయోజనాలను, తెలుగుజాతి ఐక్యతనూ కాపాడవలసిన ప్రధాన పార్టీల రాష్ట్రనాయకులు చొల్లుకబుర్లతోనూ, పనికిమాలిన "ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో''నూ కాలక్షేపం చేస్తున్నారు. కేంద్ర కాంగ్రెస్ స్వార్థబుద్ధితో చేసిన చారిత్రిక తప్పిదాన్ని తిప్పికొట్టే భారమూ, బాధ్యత, ఉద్యోగ, కార్మిక, కర్షక, విద్యార్థులు, యువత, మహిళాది వర్గాలపైన రాజకీయ పార్టీల స్వార్థపర నాయకులు మోపేశారు!   ఒకడు ప్రజల "ఆత్మగౌరవా''న్ని ఢిల్లీ వీథుల్లో కేంద్ర పాలకులకు పాదాక్రాంతం చేశాడు; ఇంకొకడు తన స్వార్థంకోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఆవురావురుమని అంగలార్చి, ఆ అవకాశం చివరికి తన చేజారిపోతుందన్న బెంగతో ఢిల్లీలో అనేకరోజుల తరబడి కాంగ్రెస్ నాయకత్వంతో రహస్య మంతనాలు జరిపి తన వేర్పాటువాదం ద్వారా విభజన ప్రక్రియ కోసం "సెలైన్ సత్యాగ్రహం'' తతంగాన్ని నడిపి కేంద్రాన్నీ, ప్రజలనూ మభ్యపెట్టిన స్థానిక పార్టీ మోసగాడైన 'దొర'; ఇంకొకడు పేరుకు 'వామపక్షం' అని చాటుకొంటూనే, తెలుగుజాతిని ఒక్క తాటిపైకి తెచ్చిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాట స్ఫూర్తిని గాలికి వదిలేసిన వారు;ఇక మరొకడు ఇదీ అదీ గాదు "అత్తమీద కోపాన్ని దుత్తమీద తీర్చుకు''న్నట్టుగా ఒక మాజీముఖ్యమంత్రి కొడుకుమీద దుగ్ధనుతన ఆస్తిపాస్తుల రక్షణార్థం, కేంద్రానికి మోకరిల్లి తనపై వచ్చిన ఆర్థిక నేరారోపణలనుంచి ఎలాగోలా బయటపడడం కోసం కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలుగుజాతి విభజన ప్రతిపాదనకు స్వయం లేఖ ద్వారా దొంగచాటుగా మద్ధతు తెలిపివచ్చి, ఇప్పుడు "సమన్యాయం'' కల్పించాలన్న భట్టిప్రోలు పంచాయితీతో కాలక్షేపం చేస్తూ రాష్ట్రపర్యటనకు బయలుదేరి ఆత్మగౌరవం కోల్పోయి అడుగడుగునా అభాసుపాలవుతున్న ఒక రాష్ట్ర మాజీముఖ్యమంత్రీ!   ఈ అవకాశవాద రాజకీయాలను దళిత, బహుజనవర్గాలకు కూడా పాకించడం  - వీళ్ళు ప్రజాక్షేమం కోరిన రాజకీయులు కారనీ, సంపన్న రాక్షససంతతి అనీ మరొకసారి నిరూపితమయింది! ఇక మరో పోర్ఫేసర్ ఉన్నాడు, ఆయనగారు ముఖ్యమంత్రినీ, ఇతర మంత్రులనూ జీతాలు తీసుకోవటం మానేసి, రాజీనామాలు చేసి బయటకు రమ్మంటూ తాను మాత్రం పిల్లలకు పాఠాలు చెప్పడం మానేశాడు, యూనివర్సిటీనుంచి నెలవారీ జీతం [లక్షరూపాయలకు పైగానేనని ఉస్మానియా వర్గాలు] క్రమం తప్పకుండా పొందుతూ ఒక వేర్పాటు సంయుక్త కార్యాచరణ సంస్థకు నాయకస్థానంలో ఉన్నాడు. అయినా వేర్పాటువాద స్థానిక పార్టీపెట్టిన నాయకుడికీ, సంయుక్త కార్యాచరణ పేరిట వేరొక కుంపటి పెట్టిన ఈ ప్రొఫెసర్ కూ మధ్య పడిచావక [ఎందుకు పడటంలేదో చెప్పకుండా] ఎవరి దుకాణం వారు నడుపుకుంటున్నారు. ఉభయ వర్గాలు బెదిరింపుల ద్వారా వసూళ్లు మాత్రం చేసుకుంటున్నారని ఆ రెండు క్యాంపుల్లోని వారూ పరస్పరం ఆరోపించుకుంటున్నారు! ముఖముఖాలు చూసుకోకపోయినా "కలిసే ఉన్నట్టు''గా ప్రజల్ని మాత్రం మోసగిస్తున్నారు. టాంక్ బండ్ విధ్వంసకాండకు కారణం నీవంటే నీవని వాదించుకున్నారు. ఇక స్థానిక పార్టీ నాయకుడైన 'దొర' ఊసరవెల్లి మాదిరిగా పొంతన లేకుండా వేర్వేరు ప్రకటనల ద్వారా ప్రాంతప్రజలను మభ్యపెడుతున్నాడు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం రేపో, మాపో వస్తుందని దాదాపు సంవత్సరకాలంగా ఊరిస్తూనే ఉన్నాడు! ఆ నమ్మకం సడలి పోయింతరువాత తేదీలు జరుపుకుంటూ వెడుతూన్నాడు ఇంతకూ కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిపిన చర్చలు ఏమి హామీపడ్డాడో ఇతడు తెలియదుగాని, సమస్యను "వాయిదాల రత్తయ్య''లా నానబెట్టడంలో అధిష్ఠానంతో 'మిలాఖత్' అవుతున్నాడు! విఫలమైన, మసకబారిన తన 'గౌరవాన్ని'' నిలబెట్టుకునే తాపత్రయంలో కాంగ్రెస్ లో తన పార్టీని "విలీనం'' చేస్తానని యిచ్చిన హామీ విషయంలో కూడా ప్రజల్ని మోసగించడానికిగాను ఒక్కోసారి ఒక్కో ప్రకటన చేస్తున్నాడు.   మొదట్లో హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాలస్వతంత్ర రాష్ట్రమైతేనే "ఒప్పుకుంటా''నని చెప్పిన ఈ మాటకారి హైదరాబాద్ ప్రతిపత్తిపైన కూడా తన వైఖరిని క్రమంగా మార్చుకుంటూ వస్తున్నాడు; ముందు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచడానికి కూడా అంగీకరించని ఈయన, హైదరాబాద్ ప్రతిపత్తిపైన వచ్చిన మూడు రకాల కేంద్ర ప్రత్యమ్నాయాలలో తాను దేనికి సుముఖమో చెప్పకుండా దాటవేస్తూ "ఉమ్మడి రాజధానిగా రెండేళ్ళకు మించి ఒప్పుకునేది లేదని'' కొత్త ప్లేటు పెట్టాడు. కాంగ్రెస్ లో తన పార్టీ కలిసిపోవాలంటే ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని, ఆ తర్వాత తన పార్టీని 'గంగ' (కాంగ్రెస్)లో కలిపేస్తానని బీరాలు పలికిన ఈ అవకాశవాద నాయకుడు ఇక "ప్రత్యేక రాష్ట్ర్త''బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోవచ్చుననీ, అయితే 'హైదరాబాద్' అంశం తెలంగాణా ప్రజలు కోరుకుంటున్నట్టుగా  ఉండకపోవచ్చు''ననీ ఏదైనా "కిరికిరి పెట్టే అవకాశముందనీ'' "ఫామ్ హౌస్ నాయకుడు'' నెమ్మదిగా బయటపడ్డాడు!   అంటే, ఈ "దొర''నిత్యం కాంగ్రెస్ అధిష్ఠానంతో ఎలా మంతనాలు సాగిస్తున్నాడో, వ్యవహారమంతా రకరకాల ప్రభావాలకు లోనైన వ్యక్తిగా ఫామ్ హౌస్ నుంచే ఎలా నడిపిస్తున్నాడో రాష్ట్రప్రజలందరికీ దాచినా దాగని సత్యంగా గుట్టు బయట పడిపోయింది! ఇప్పుడతని బాధంతా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందో లేదోనన్న బాధకన్నా, ఏర్పడకపోతే తనను తెలంగాణా ప్రజలనుంచే చుట్టుముట్టే భయంకర పరిస్థితుల్ని తాను చవిచూడవలసి వస్తుందేమానాన్న విచారమే ఎక్కువగా ఆయన్ని పట్టిపీడిస్తోంది! కనుకనే కాంగ్రెస్ అధిష్ఠానం తద్వారా స్థానిక కాంగ్రెస్ నాయకత్వాలు "కుడితిలో పడిన ఎలుకలా'' కొట్టుకు చస్తున్నాయి! అంటే దారితప్పిన నాయకులందరికీ అధిష్ఠానం ఏం చెబుతుందో ప్రజలకు తెలియదు, అన్ని రకాల నాయకులు, మంత్రులు, ఎం.పీ.లూ, ఎం.ఎల్.ఎ.లూ తిరిగి అక్కడ ఏం చెప్పారో, ఇక్కడ జనాలకు ఏమి చెబుతున్నారో ప్రజలకు తెలియదు; ఏతావాతా రాష్ట్ర సమస్య తేలకుండా, అలా మరికొన్నాళ్ళు నానుతూ ఉంటుంది! నాయకుల మంతనాల రహస్య లిపిని బద్ధలు కొట్టాల్సినవారు ప్రజలే!

సమ్మె ఆపుతారా లేదా చెప్పండి: హైకోర్టు

  ఏపీఎన్జీవోల సమ్మెపై వరుసగా మూడవ రోజు కూడా హైకోర్టులోఇరుపక్షాల మధ్య సుదీర్గ వాదనలు జరిగాయి. అయితే, మధ్యలో కోర్టు కలుగజేసుకొని ప్రభుత్వోద్యోగులు భాద్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేయాలని, కానీ వారు చేస్తున్ననిరవధిక సమ్మెవలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏపీఎన్జీవోల తరపున వాదిస్తున్నలాయర్ మోహన్ రెడ్డి అందుకు బదులిస్తూ, ఉద్యోగుల సమ్మెను కేవలం సమ్మెగా కాకుండా తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటంగా చూడాలని చెపుతూ, గతంలో తెలంగాణా ఉద్యోగులు కూడా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం నెల రోజులు పైగా సకల జనుల సమ్మెచేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన కోర్టుకు గుర్తు చేసారు. ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో ప్రజలందరూ కూడా స్వచ్చందంగా పాల్గొంటున్న సంగతిని కోర్టు గమనించాలని విన్నవించుకొన్నారు. కానీ, కోర్టు మాత్రం ఆయన వాదనలతో ఏకీభవించలేదు. ప్రభుత్వం లేదా అందులో ఒక వ్యవస్థ తమ కర్తవ్యం సమర్ధంగా నిర్వహించడంలో విఫలమయినప్పుడు కోర్టు జోక్యం చేసుకొని దానిని చక్కదిద్దవలసి వస్తుందని స్పష్టం చేసింది. ఉద్యోగులు సమ్మె విరమించుకుంటున్నారా లేదా? అనే సంగతిని రేపటి వాయిదాలో తప్పనిసరిగా స్పష్టం చేయాలని సూచిస్తూ కేసును రేపటికి వాయిదా వేసింది.

జగన్ రిమాండ్ పొడిగింపు

      అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 3కు పొడిగించింది. ఈరోజుతో జగన్ రిమాండ్ ముగియడంతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అలాగే విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, బహ్మానందరెడ్డిలను కూడా విడియో కాన్‌ఫ్రోన్స్ ద్వారా కోర్టు విచారణ జరిపి అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజి మంత్రులు దర్మాన ప్రసాదరావు, సభితా ఇంద్రారెడ్డిలు ఈరోజు ఉదయం కోర్టులో హాజరైయ్యారు. సిబిఐ ఇప్పటికి ఈ కేసులో 10 చార్జిషీట్లను దాఖలు చేయగా అందులో 5 చార్జీషీట్లు ఈ నెలలో వేసిన విషయం తెలిసిందే.

కావూరి,లగడపాటి పై విజయమ్మ అరోపణలు

      రాష్ట్ర విభజనకే ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుకు కేంద్రంలో మంత్రి పదవిని...విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు కొన్ని కాంట్రాక్టు పనులు ఇచ్చారని తమకు తెలిసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు. విభజన విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించని విజయమ్మ ఇప్పుడు లగడపాటి, కావూరిల మీద ఆరోపణలు చేయడం ఆసక్తిగా ఉంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకు వస్తే కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీలలో ఎలాంటి చలనమూ లేదని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖ మూలంగానే తెలంగాణ ఇచ్చారని విజయమ్మ అన్నారు. కాంగ్రెస్ నేతలు అధిష్టానం ముందు ఒకమాట – బయట ఒకమాట చెబుతున్నారని, తెలంగాణకు వ్యతిరేకంగా జైలులో ఉన్న జగన్ తో పాటు తాను, తమ పార్టీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామాలు చేశారని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా ముఖ్యమంత్రి, మంత్రులు అంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే శాసనసభ సమావేశం పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని విజయమ్మ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధిష్టానానికి అగ్నిపరీక్షలు

  ఈ రోజు కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఇందులో తెలంగాణా పై నోట్ ప్రవేశపెట్టే అవకాశం లేన్నపటికీ హోంశాఖ నోట్ పై తయారుచేసిన ముసాయిదాపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సమావేశంలో నోట్-ముసాయిదాపై తుది నిర్ణయం తీసుకొన్నట్లయితే, త్వరలో విభజన ప్రక్రియ జోరందుకోవచ్చును.   టీ-నోట్ పై అడుగు ముందుకు వేస్తే వెంటనే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్న సీమాంధ్ర యంపీలకు దిగ్విజయ్ సింగ్, వారికి భయపడి వెనకడుగువేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం రానున్నఎన్నికలలోగా విభజన ప్రక్రియను తప్పకుండా పూర్తి చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో ఈ రోజు సమావేశంలో ఆ దిశగానే కేంద్రం అడుగులువేయవచ్చును.   ఇది కాంగ్రెస్ పార్టీకే కాక, సీమాంధ్ర యంపీలకు,మంత్రులకు, శాశనసభ్యులకు అందరికీ అగ్ని పరీక్షగా మారనుంది. ఒకవేళ వారు రాజీనామాలు చేస్తే, ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కల్పించడమే కాకుండా, ఎందరు వ్యతిరేఖిస్తున్నాముందుకే సాగుతున్నదుకు కాంగ్రెస్ పార్టీ పట్ల సీమాంధ్రలో వ్యతిరేఖ భావనలు మరింత పెరిగే అవకాశం ఉంది.   ఇక మరో ఏడు నెలలో సాధారణ ఎన్నికలను పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేజేతులా కూల్చుకొంటే అది పార్టీకి, నేతలకీ ఇద్దరికీ తీవ్ర నష్టం కలిగించడం ఖాయం. అలాగని రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతున్న అధిష్టానాన్నివెనకేసుకు వస్తే ఇప్పటికే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రానున్న ఎన్నికలలో ప్రజల మద్దతు పొందడం కష్టం. పైగా తెదేపా, వైకాపాలు వారి పరిస్థితిని మరింత క్లిష్టం చేయడం ఖాయం. కనుక కాంగ్రెస్ అధిష్టానానికి ఇది మరో పెద్ద అగ్ని పరీక్షే నని చెప్పవచ్చును.   ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం-రాష్ట్ర విభజన, హైదరాబాద్ అంశం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ, రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడం వంటి అన్నిఅంశాలను ఒకేసారి నేర్పుగా పరిష్కరించుకోవలసి ఉంటుంది.

సమైక్యాంద్ర కు మద్దత్తు గా డల్లాస్ ప్రవాసాంద్రుల ఉద్యమాలు !

      మన రాష్ట్రము లో జరుగుతున్న సమైక్యాంద్ర మద్దత్తుగా ప్రవసాంద్రులు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు! స్థానిక జల్సా రెస్టారెంటు లో జరిగిన ప్రవాస ఆంధ్రుల ముఖ్య సమావేశం లో తెలుగు జాతిని విడగొట్ట వద్దూ అంటూ సమైక్యాంద్ర కోసం ఆంధ్ర ప్రదేశ్ లో పోరాడుతున్న ప్రజలకు మద్దత్తుగా ప్రవాసాంద్రులు "సమైక్యాంద్ర పరి రక్షణ సమితి" ని ఏర్పాటు చేసినారు . సమైక్యాంద్రకు మద్దత్తుగా ప్రవాసాంద్రులు "సమైక్యాంద్ర  పరి రక్షణ సమితి " ఆద్వర్యములో  వివిధ రకాల ఉద్యమాలు చేయాలనీ ఈ సమావేశం లో నిర్ణ యించారు.  ఈ నెల సెప్టెంబర్ 29 వతేదీ న దాదాపు 1500 మందితో పెద్ద ఎత్తున  సమైక్యాంద్ర వన భోజనాలు నిర్వహించి తెలంగాణా ,రాయల సీమ ,కోస్తాంద్ర  ప్రత్యెక వంటకాలతో  వంట వార్పూ నిర్వహించి తెలుగు జాతి అంతా ఒక్కటిగా వుండాలి అనే సందేశాన్ని చాటి చెపుతున్నాము  అన్నారు .వివిధ సాంసృతిక కార్యక్రమాలు నిర్వ హించ నున్నారు .  సమైక్యాంద్ర వన భోజన కార్యక్రమానికి  కోఆర్డినేటర్  గా సుదీర్ చింతమనేని వ్యవహరిస్తారు . ----------------------------------------------------------------------------------------------- అదేవిధముగా  తెలుగు జాతి ఐక్యత ,సమైక్యాంద్ర కోసం "ఫ్రవాసాంద్ర పాదయాత్ర " గాంధీ జయంతి రోజున నిర్వహిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రములోని అన్ని ప్రాంతాల నుంచి  సమైక్యాంద్ర కు మద్దత్తుగా  హ్యూస్టన్ ఇండియన్ కాన్సులేట్ ఎదుట ధర్నా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ను ఒక్కటిగానే ఉంచాలని విభజన ఆపాలి అంటూ మెమొరాండం ఇవ్వనున్నారు  . ఈ సమావేశములో  Dr కొర్సపాటి  శ్రీధర్ రెడ్డి , వేణు పావులూరి ,ప్రతాప్ రెడ్డి , చంద్ర కాజ, లోకేష్ నాయుడు , అజయ్ గోవాడ, సుగన్ చాగర్లమూడి, కోడూరు కృష్ణా రెడ్డి , రమణా రెడ్డి,సుదీర్ చింతమనేని,  చిల్లకూరు గోపి,వెంకట శరణు,భావి రెడ్డి శ్రీనివాస్ , కిరణ్ తుమ్మల, ఎన్ ఎం ఎస్ రెడ్డి ,శివ బలుసు, వెంకట నారపల,శ్రీనివాస్ అడ్డా ఇతర ప్రవాసాంద్ర ప్రముఖులు  పాల్గొన్నారు.  

హైదరాబాద్ పై మూడు ఆప్షన్ లు

      ఈ రోజు జరగనున్న కోర్ కమిటీ భేటీలో తెలంగాణపై కీలక చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, హైదరాబాద్ ప్రతిపత్తిపై కొన్ని ప్రతిపాదనల గురించి షిండే కోర్ కమిటీ సభ్యులకు వివరిస్తారని తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దాలి? హైదరాబాద్ ప్రతిపత్తిపై ఏ నిర్ణయం తీసుకోవాలి? అనే విషయంపై కోర్ కమిటీ మంతనాలు జరుపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.   హైదరాబాద్‌కు సంబంధించి మూడు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకటి... హైదరాబాద్‌ను చండీగఢ్ తరహా యూటీగా ప్రకటించి, రెండు రాష్ట్రాలకు రాజధానిగా చేయడం. రెండు...హైదరాబాద్‌కు ఢిల్లీ తరహా రాష్ట్ర ప్రతిపత్తి కల్పించి, రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంచడం. మూడు... హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ప్రకటించి, ఆర్టికల్ 258ఏ కింద హైదరాబాద్‌లో శాంతి భద్రతల వంటి కొన్ని అధికారాలను కేంద్రం తన చేతిలో ఉంచుకుని, సీమాంధ్ర రాజధానిని కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం. హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంచడం. ఈ మూడు ప్రతిపాదనలకు కూడా వర్కింగ్ కమిటీ పేర్కొన్న పదేళ్లనే కాలపరిమితిగా సూచించే అవకాశం ఉందని తెలిసింది.  మొత్తానికి, ఈ మూడు ప్రతిపాదనల గురించి కోర్ కమిటీకి షిండే వివరించే అవకాశాలున్నాయి. ఆంటోనీ కమిటీ ఇప్పటిదాకా జరిపిన చర్చలను కూడా కోర్ కమిటీ సమీక్షిస్తుందని తెలిసింది.

అంతా అయోమయ విభజన

  రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న కుప్పిగంతులు చూస్తే చాలా నవ్వు వస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం నేతలు ఒకరికొకరు పొంతన లేని మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పట్ల ప్రజలలో మరింత చులకన భావం కలిగిస్తున్నారు. నిన్న సోనియా గాంధీ కార్యదర్శి విభజన ప్రకటన చేయడంలో తొందర పడ్డామని అభిప్రాయం వ్యక్తం చేస్తే, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ సీమాంధ్ర నేతలతో మాట్లాడుతూ అంటోనీ కమిటీ నివేదిక వచ్చిన తరువాతనే టీ-నోట్ కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళుతుందని హామీ ఇచ్చారు.   కానీ, ఈ రోజు హోంమంత్రి షిండే రంగ ప్రవేశం చేసి, ఆరోగ్యకారణాలతో తను ఇంతకాలంగా కార్యాలయానికి రాలేనందునే టీ-నోట్ పరిశీలించలేకపోయాయని, ఈ రోజు పరిశీలించి క్యాబినెట్ సమావేశంలో సమర్పిస్తానని అన్నారు. ఇక, వివిధ పనులతో, కారణాలతో పలువురు మంత్రులు బిజీగా ఉన్న కారణంగా రద్దయిన క్యాబినెట్ సమావేశం మళ్ళీ రేపు ఉదయం నిర్వహించబోతున్నట్లు తాజా సమాచారం.   కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేయడం అయితే చేసింది గానీ, దానిని సజావుగా ఏ విధంగా పూర్తి చేయగలదో దానికే అర్ధం కాకుండా ఉంది. కనీసం ఇప్పటికయినా తన రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించడం మాని, ఉభయ ప్రాంతాలకు చెందిన తన పార్టీ నేతలతో ఈవిషయంపై సమగ్రంగా చర్చించి, అందరినీ ఒప్పించుకోగలిగినా అడుగు ముందుకు వేయగలదు. లేకుంటే రానున్న ఎన్నికలలో ఇరుప్రాంతలలో ఘోర పరాభవం తప్పదు.   తాజా సమాచారం: సీమాంధ్రా యంపీలు, కేంద్ర మంత్రులు ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో సమావేశం కానున్నారు. మరి ఈ సారి ఆయనేమి కొత్త మాట చెపుతాడో చూడాలి.

రెండో పెళ్లి గొడ‌వ నుంచి ల‌గ‌పాటికి ఊర‌ట‌

  కాంగ్రెస్ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు సుప్రిం కోర్టు ఊర‌ట నిచ్చింది. రాజ‌గోపాల్ రెండో పెళ్లికి సంభందించిన పిటిష‌న్‌ను ఎలాంటి ఆదారాలు లేని కార‌ణంగా సుప్రిం కోర్టు కొట్టేసింది. 2004లో ఎన్నిక‌ల అపిడ‌విట్‌లో త‌న‌కు ఇద్దరు కుమారుల‌న్నట్టుగా తెల‌పిన ల‌గ‌డ‌పాటి త‌రువాత 2009లో మాత్రం త‌న‌కు ముగ్గురు కుమారుల‌ని మూడో కుమారుడి పేరు ఎల్ హ‌ర్మన్ అని పేర్కొన్నారు. దీంతో ల‌గ‌డపాటి రెండో పెళ్లి ఉదంతం తెర మీద‌కు వ‌చ్చింది. దీంతో ల‌గ‌డ‌పాటికి రెండో పెళ్లి జ‌రిగింద‌ని వారికి కుమారుడు కూడా జ‌న్మించాడ‌ని మైల‌వ‌రానికి చెందిన అడ్వకేట్ సుంక‌ర కృష్ణమూర్తి గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేశారు. ల‌గ‌డ‌పాటి జానకి అనే యువ‌తిని రాజ‌గోపాల్ రెండో వివాహం చేసుకున్నార‌న్న లాయ‌ర్ వారి కుమారుడే హ‌ర్మోన్ అని పేర్కొన్నారు. రాజ‌గోపాల్, జాన‌కి దండ‌లు మార్చుకున్న ఫోటోను కూడా ఆయ‌న స‌మ‌ర్పించారు. అయితే ఈ సాక్షాలేవి చెల్లవ‌న్న కోర్టు స‌రైన సాక్షాలు లేని కార‌ణం కేసు కొట్టివేసింది.

రాజకీయ నేతల విషయంలో ఏపీఎన్జీవోలు వైఖరి మార్చుకొన్నారా

  ఏపీఎన్జీవోలు తమపై క్రమంగా రాజకీయ నేతల దాడి తీవ్రతరం అవుతుండటంతో కొంచెం వెనక్కి తగ్గినట్లున్నారు. రేపు విజయవాడలో భారీ ఎత్తున జరుగబోయే సమైక్యాంధ్ర సభకు రాజకీయ నేతలను తాము ఆహ్వానించకపోయినప్పటికీ, ఎవరయినా వస్తే వారిని కాదనకుండా సముచిత గౌరవం ఇస్తామని ఏపీఎన్జీవో నేతలు ప్రకటించారు.   కానీ, ఇది ఇరువురికీ ఇబ్బందులు సృష్టించడం తప్ప వేరే ఉపయోగం ఉండదు గనుక బహుశః రాజకీయ నేతలు కూడా ఈ సభకు దూరంగా ఉండవచ్చును. ఒకవేళ ఎవరయినా దైర్యంచేసి ప్రజలు, ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొనే ఈ సభకు వచ్చినా, వారి నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొని అవమానకరంగా నిష్క్రమించాల్సి ఉంటుంది గనుక, నేతలు దూరంగానే ఉండవచ్చును.   అయితే ఏపీఎన్జీవోల సమ్మె పతాక స్థాయికి చేరుకొన్నఈ తరుణంలో వారికి బలమయిన ఒక రాజకీయ పార్టీ అండ ఉంటే చాలా మేలు చేయవచ్చును. కానీ, మూడు ప్రధాన పార్టీలలో వారు దేనిని ఎంచుకొన్నా ఊహించని కొత్త సమస్యలు ఏర్పడి, వారి మధ్య చీలికలు సృష్టించే ప్రమాదం ఉంది. అందువల్ల వారు అన్ని రాజకీయ పార్టీలను సమదూరంలో ఉంచవలసివస్తోంది. లేకుంటే సమైక్యాంధ్ర ఉద్యమం నేడు మరో విధంగా ఉండేది.ఏమయినప్పటికీ, ఏ రాజకీయ పార్టీ మద్దతు తీసుకోకుండా ఇన్ని రోజులు దాదాపు ఆరు లక్షల మంది ఉద్యోగులు, తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను సైతం లెక్క జేయకుండా ఏక త్రాటిపై నడుస్తూ ముందుకు సాగడం నిజంగా అద్భుతమేనని చెప్పక తప్పదు.

త్వరలో చంద్రబాబు డిల్లీ యాత్ర

  బహుశః వైకాపా ఆరోపణలకు కొంచెం జంకినందునేమో చంద్రబాబు తన డిల్లీ యాత్రను వాయిదా వేసుకొని తన పార్టీ యంపీలను మాత్రమే డిల్లీ పంపి ఈడీ, విజిలన్స్ అధికారులకు తాను చెప్పదలచుకొన్నది వారిచే చెప్పించారు. అయితే, తను డిల్లీ బయలుదేరుతున్నట్లు ప్రకటించేసిన తరువాత, ఇప్పుడు వెళ్ళకపోతే నిజంగానే వైకాపా ఆరోపణలకు జడిసి వెళ్ళలేదనే మరో అపవాదు కూడా పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని భావించినందునో లేక ముందుగానే తన డిల్లీ ప్రయాణ తేదీలు ఖరారు చేసుకోవడం వలననో, చంద్రబాబు ఈ నెల 21న డిల్లీ బయలుదేరుతున్నారు. ఆయన తన పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించి, రాష్ట్ర విభజనపై అందరికీ అమోదయోగ్యమయిన విధంగా సత్వర నిర్ణయం తీసుకోమని వినతి పత్రం ఈయనున్నారు. అదేవిధంగా తన రెండు రోజుల పర్యటనలో ప్రతిపక్ష నేతలను కూడా కలిసి రాష్ట్ర పరిస్థితులపై వారితో చర్చించనున్నారు.   కానీ ఇప్పడు కూడా ఆయన  జగన్మోహన్ రెడ్డి బెయిలుపై కోర్టు 23న తీర్పు చెప్పబోతుండగా, సరిగ్గా దానికి రెండు రోజుల ముందే ఆయన డిల్లీ వెళుతున్నందున, మళ్ళీ వైకాపా ఆయనపై ఆరోపణల గుప్పించడం ఖాయం. ఎలాగూ వైకాపా నిందలు భరించక తప్పదు గనుక, మరి ఆయన కూడా సీబీఐ, ఈడీ, విజిలన్స్ అధికారులను కలిసి జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుతారో లేదో చూడాలి.

పేలుళ్లతో భయపెడుతున్నారు: ఎన్ఐఏ

  అక్తర్, భత్కల్‌లను ఇటీవలే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం కోర్టుకు తెలిపింది. హైదరాబాదు - గోవా, హైదరాబాదు - బెంగళూరు జాతీయ రహదారులతో పాటు పలు ముఖ్య పట్టణాలలోను అక్తర్, భత్కల్‌ లు రెక్క నిర్వహించారని ఎన్ఐఏ తెలిపింది. పాకిస్తాన్ నుండి వచ్చే ఆదేశాల వల్ల భారత్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడు అసదుల్లా అక్తర్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి 17వ తేది వరకు రిమాండు విధించింది. దాంతో అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్ ఐదవ నిందితుడిగా ఉన్నాడు.

కాంగ్రెస్‌లో ఉల్లి లొల్లి

  కాంగ్రెస్ నాయ‌కుడు క‌పిల్ సిబాల్ ఉల్లిపాయ‌ల ధ‌ర‌లపై చేసిన స్టేట్‌మెంట్‌తో దూమారం లేవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చ‌ర్యల‌కు దిగింది. ఉల్లి ధ‌ర‌లు పెరిగితే వ్యాపారుల‌ను అడ‌గాలిగాని ప్రభుత్వానికి ఏం సంబందం అంటు కపిల్‌సిబాల్ చేసిన వ్యఖ్యాల‌పై ఇత‌ర పార్టీల‌తో పాటు సామాన్యుల కూడా భ‌గ్గుమ‌న్నారు. దీంతో దిద్దుబాటు చ‌ర్యల‌కు దిగిన కాంగ్రెస్ రెండు, మూడు వారాల్లో త‌గ్గుతాయ‌ని కేంద్ర వ్యవ‌సాయ శాఖ మంత్రి శ‌ర‌ద్‌ప‌వార్ హామి ఇచ్చారు.మ‌హారాష్ట్రతో పాటు ఇత‌ర ప్రాంతాల్లో పండించిన కొత్త పంట మార్కెట్‌లోకి వ‌స్తుంద‌ని త‌రువాత ధ‌ర‌లు నియంత్రణ‌లోకి వ‌స్తాయ‌ని ప‌వార్ చెప్పారు.

తెలంగాణ నేత‌లతో సీమాంద్ర నాయ‌కుల చ‌ర్చ

  రాష్ట్ర విభ‌జ‌న‌పై కేంద్ర త‌న ప‌ని తాను చేసుకుపోతుంటే, ఇరు ప్రాంతాల్లో జ‌రుగుతున్న ఉద్యమాల‌ను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు తెలంగాణ‌,సీమాంద్ర కాంగ్రెస్ నేత‌లు ముందుకు వ‌స్తున్నారు. ఈ మేర‌కు సీఎల్పీలో మంత్రి జానా రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి సీమాంద్ర మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస్‌లు క‌లిసి చ‌ర్చలు జ‌రిపారు. తెలంగాణ ప్రక‌ట‌న‌తో పాటు త‌రువాత సీమాంద్రలొ జ‌రుగుతున్న ఉద్యమాల‌పై ఇరు ప్రాంత నేత‌లు చ‌ర్చ జ‌రిపిన‌ట్టు స‌మాచారం. దీంతో పాటు తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయంతో పాటు సీమాంద్రుల్లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌కు సంభందించి కూడా ఈ నేత‌లు చ‌ర్చించారు. రాష్ట్ర విభ‌జ‌నకు వ్యతిరేఖంగా ఉద్యమంలో తీవ్రంగా పాల్గొంటున్న గంటా, ఏరాసు లాంటి నేత‌లు తెలంగాణ నేత‌ల‌ను క‌ల‌వ‌టంతో ఈ  స‌మావేశం ప్రదాన్యం సంత‌రించుకుంది.

తెలంగాణ నోట్‌పై గ‌డికో మాట‌

రాష్ట్రవిభ‌జ‌న అంశంపై గంట‌కో ర‌కంగా మాట్లాడుతుంది కాంగ్రెస్‌. రాష్ట్రవిభ‌జ‌న నుంచి వెన‌క్కి త‌గ్గేది లేదు అంటునే సీమాంద్రుల‌కు విభ‌జ‌న జ‌ర‌గ‌దు అన్న హామి ఇస్తుంది. ఏక‌భ్రియం లేకుండా తెలంగాణ అంశంపై ముందుకు వెళ్లేది లేద‌ని అహ్మద్ ప‌టేల్‌, మొయిలీ చెప్పి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే తెలంగాణ నోట్ రెడీ అయిన‌ట్టుగా ప్రక‌టించారు హోం మంత్రి షిండే. ఇప్పటికే అధికారులు రెడీ చేసిన తెలంగాణ నోట్ త‌న వద్దకు వ‌చ్చింద‌న్న షిండే. రేపు ఆ నోట్‌ను ప‌రిశీల‌స్తామ‌న్నారు. నోట్ సంభందించి అధికారుల‌తో స‌మావేశం నిర్వహించిన త‌రువాత త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని ప్రక‌టించారు.

ఈగ విలన్ కి వలేస్తున్న కాంగ్రెస్ పార్టీ

  రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ గురించి ఇప్పుడు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈగ సినిమా అమాంతం అతనికి జాతీయ స్థాయిలోమంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక కర్ణాటక రాష్ట్రంలో, కన్నడ సినిమా పరిశ్రమలోఅతని పేరు మారు మ్రోగిపోతోంది. మరి అటువంటి వ్యక్తి మీద రాజకీయ పార్టీలు కన్నుపడటం సహజమే గనుక అన్ని రాజకీయ పార్టీలు ఆయనని తమ పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.   కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్వయంగా ఆహ్వానించడంతో బుధవారం ఉదయం సుదీప్ బెంగళూరులో ఆయన అధికారిక నివాసం ‘కృష్ణ’కు వెళ్లి దాదాపు అర్ధ గంట సేపు ఆయనతో సమావేశమయ్యారు. రానున్న సాధారణ ఎన్నికలలో సుదీప్ ను కాంగ్రెస్ అభ్యర్ధిగా పార్లమెంటుకు పోటీ చేయించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. అయితే, వారి సమావేశ వివరాలు ఇంకా తెలియలేదు.   రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్న సందీప్ ఇటీవల జరిగిన కర్ణాటక శాసన సభ ఎన్నికలలో జగలూర్ నుండి సుదీప్ పోటీ చేయాలని భావించినప్పటికీ, ఆ సమయానికి ఏ రాజకీయ పార్టీలో జేరాలో నిర్ణయించుకోకపోవడంతో ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ బీదర్ నుండి పోటీ చేసిన అశోక్ ఖేని అనే అభ్యర్ధికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. బహుశః వచ్చే సాధారణ ఎన్నికలలో సుదీప్ కాంగ్రెస్ యంపీగా పోటీ చేయవచ్చును.

గణేష్ నిమజ్జనానికి వరుణుడి అడ్డు!

  గణేశ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి ముస్తాబయ్యాయి. కానీ ఈ ఏడాది గణేష్ నిమజ్జనంకు భారీ వర్షం అడ్డుపడటంతో, వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్‌తో పాటు, 21 చెరువులలోనూ గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతుంది. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం 71 భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు రక్షణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బలగాలు మోహరించారు.