ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లాలకే పరిమితం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల అమలులో స్పీడ్ పెంచారు. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచీ అమలు చేయనున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత చంద్రబాబు ఒకదాని వెంట ఒకటిగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేశారు.  అయితే ఈ పథకంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో  ఉచిత ప్రయాణం పథకం అమలు అవుతుందనీ, అయితే ఈ పథకంలో ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలు తమ జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చనీ, అయితే జిల్లా దాటితే మాత్రం టికెట్ తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని క్లారీటీగా చెప్పేశారు. జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్రం అంతటికీ వర్తింప చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అములులో సాధ్యాసాధ్యలన్నిటినీ అధ్యయనం చేసిన అనంతరం జిల్లాలకు పరిమితం చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక పోతే  తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ,  పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అటువంటి వారి కోసం ఉచిత బస్సు పాసులను ఇవ్వాలని యోచిస్గున్నది.  గుండెజబ్బులు, కిడ్నీల సమస్య, పెరాలసిస్, తలసేమియా, లెప్రసీ,   వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.  

నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ ఉరకలు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గరిష్ట మట్టానికి నీరు చేరువ అయ్యింది. దీంతో  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆ నీరు నాగార్జున సాగర్ కు ఉరకలేస్తున్నది. దీంతో  దీనితో నాగార్జునసాగర్ జలాశయానికి 1,05,764 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అధికారులు   9,334 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా..  ప్రస్తుతం 534.50 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 177 టీఎంసీలుగా నమోదైంది. 

అందరి టార్గెట్ హండ్రెడ్ సీట్స్.. మూడు పార్టీలది ఒకటే క(గో)ల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగానే సమయం వుంది. జమిలి ఎన్నికలు వస్తేనో, ఇంకేదైనా జరిగితేనో ఏమో కానీ, లేదంటే..  2028 సెకండ్ హాఫ్ లో కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం లేదు.  నిజానికి..  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నిండా రెండేళ్ళు అయినా కాలేదు. కానీ ఇంతలోనే రాష్ట్రంలో  ఎందుకో ఏమో కానీ ఎన్ని ‘కలలు’ మొదలయ్యాయి. అదికూడా మరెవరో కాకుండా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే  ఎన్ని’కల’లకు శ్రీకారం చుట్టారు.  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో..  వంద అసెంబ్లీ, 15 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని ముఖ్యమంత్రి  హామీ ఇవ్వడంతో..  రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ‘వంద’ చర్చ మొదలైంది.  నిజానికి.. ప్రస్తుత రాజకీయాల్లో బొమ్మా– బొరుసూ తారుమారు అయ్యేందుకు మూడున్నర సంవత్స రాలు చాలా చాలా ఎక్కువ సమయం. మూడున్నర సంవత్సరాలు కాదు..  మూడున్నర వారాలలో కూడా రాజకీయం ఉల్టాపల్టా అయ్యే అవకాశం ఉందని  నడుస్తున్న చరిత్రే చెపుతోంది. ఎక్కడిదాకానో ఎందుకు..  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు కూడా విశ్వసించలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో  హస్త రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. సో.. రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో.. గెలుపు ఓటములు ఎలా తారుమారు అవుతాయో  నెలల ముందు  ఉహించడం కూడా  ఒక విధంగా సాహసమే అవుతుంది. కానీ.. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు  ముందున్న స్థానిక  సంస్థల ఎన్నికలను పక్కన పెట్టి, ఎప్పుడో మూడున్నరేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటి నుంచే కలలు కంటున్నాయి. నిజానికి..  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రాజకీయ ముఖ చిత్రం ఎంతగానో మారిపోయింది. సో... మూడున్నర సంవత్సరాల తర్వాత రాజెవరో రెడ్డెవరో ఇప్పుడే చెప్పడం సాహసం కాదు..  ఒక విధంగా దుస్సాహసమే అవుతుంది. అయినా..  మూడు ప్రధాన పార్టీలూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తునాయి. చప్పట్లు కొట్టి  చిటికెల పందిళ్ళు వేస్తున్నాయి.  అయితే..  అందరికీ తెలిసిన ఈ రాజకీయ సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు తెలియదా అంటే తెలియక కాదు కానీ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుకున్న 100 అసెంబ్లీ , 15 లోక్ సభ సీట్ల  రాగాన్ని  బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ అధ్యక్షడు ఎన్. రామచంద్ర రావు ఎత్తు కున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ వందకు ఐదు తక్కువ 95 సీట్లు ఖాయంగా వస్తాయని కేటీఆర్   అంటే..   బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు  కమలానికి వంద సీట్లు ఖాయమని చెప్పుకొచ్చారు.  అంతే  కాదు..  గమ్మత్తుగా రామచంద్ర రావు, ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేస్తారు, బీజేపీని ఎందుకు గెలిపిస్తారు అనేందుకు..  కడుపుతో ఉన్నమ్మ కనక మానదు అన్నంత సింపుల్ లాజిక్ చెప్పారు. అవును..  తెలంగాణ ప్రజలు పదేళ్లు టీఆర్ఎస్/బీఆర్ఎస్ సుందర ముదనష్ట పాలన చూశారు.  ఇప్పుడు అదే తరహాలో.. ఇంకా చెప్పాలంటే.. అంతకంటే ఘోరంగా సాగుతున్న కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. కాబట్టి..  తెలంగాణ ప్రజలకు బీజేపీని గెలిపించడం తప్ప మరో గత్యంతం లేదన్న రీతిలో చెప్పుకొచ్చారు.  అయితే ఎవరి కలలు ఎలా ఉన్నా.. వాస్తవాలు మరోలా ఆన్నాయని చరిత్ర చెపుతోంది. రీసెంట్  ఉదంతాలనే ఉదాహరణగా తీసుకున్నా..  2024 ఎన్నికల్లో బీజేపీ  చార్ సౌ పార్ (400 ప్లస్) కలలు కంది. ఫలితం ఏమిటో చెప్పనక్కర లేదు..  దో సౌ చాలీస్’ (240) దగ్గరే ఆగిపోయింది. అలాగే.. ఇంకొంచెం వెనక్కి వెళితే, 2023 తెలంగాణ  శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్  కూడా హండ్రెడ్ ప్లస్ (100ప్లస్) పైనే ఆశలు పెట్టుకుంది. కానీ.. 40 దగ్గరే ఆగి పోయింది.(అందులో  ఓ పది సీట్లు ఇప్పటికే జారి పోయాయి అనుకోండి అది వేరే విషయం). అలాగే..  ఇంకో అడుగు వెనక్కివేస్తే, 2019 లోక్సభ ఎన్నికల్లో, మారుమోగిన, సారూ ..కారూ .. పదహారు  స్లోగన్ గురించి చెప్ప నక్కర లేదు.  సో .. రాజకీయ నాయకుల  పగటి కల గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు కానీ.. రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వివాదాలు మాత్రం, రాను రాను రాజు గుర్రం గాడిద  సామెతను గుర్తు చేస్తున్నాయి. రోజురోజుకు గీత దాటుతున్నాయి. రోత పుట్టిస్తున్నాయన్న అభిప్రాయం అయితే సర్వతా వ్యక్తమవుతోందని అంటున్నారు.

ఓ సినీ వ‌ట వృక్షం.. శివ‌శ‌క్తి ద‌త్త‌

ఒక్కో వంశానికి ఒక్కో మూల పురుషుడు ఉంటారు. రాజ‌మౌళి వంశానికి శివ‌శ‌క్తిద‌త్త అలాగ‌. ఎందుకంటే ఆయ‌నేగానీ తాను సినిమాల్లోకి రావాల‌ని అనుకోకుండా ఉండి  ఉంటే ప‌రిస్థితి మ‌రోలా  ఉండేది.   అస‌లా కుటుంబానికి సినిమా పిచ్చి ప‌ట్టి ఉండేదే కాదు. రాజ‌మౌళీ వంటి లెజండ‌రీ  డైరెక్ట‌ర్ల‌ు వచ్చి ఉండేవారు కాదు అంటారు  నిపుణులు. శివ‌శ‌క్తి ద‌త్త‌.. చెప్పుకోడానికి కేవ‌లం గీత ర‌చ‌యిత‌. అంతే అనుకోవ‌డంతో స‌రిపోదు. ఆయ‌న ప్ర‌భావం ఆ ఇంట శాఖోప శాఖ‌లుగా విస్త‌రించింది. ఆయ‌న రాసిన పాట‌లు కొన్నే కావ‌చ్చు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది ఒకటి రెండు సినిమాలే కావ‌చ్చు. కానీ ఆ ఇంట్లో లేని టెక్నీషియ‌న్ లేరు. మీకు తెలుసో తెలీదో.. రాజ‌మౌళి కుటుంబంలో ప్ర‌తి ఒక్క‌రూ సినీ నిపుణులే. ఒక సీన్ ఎక్క‌డో వంటింట్లో కూర‌లో పోపు వేస్తూనే విని.. అది జ‌నానికి ఎక్కుతుందా ఎక్క‌దా.. చెప్పేయ‌గ‌ల‌రు రాజ‌మౌళి త‌ల్లి. వారి ఇంట్లో ప‌ని చేసే వారు కూడా సినిమా ప‌ట్ల ఒక పేష‌న్ని  క‌లిగి ఉంటారు. ఒక స‌మ‌యంలో నాగార్జున   ఇండ‌స్ట్రీలో ఎవ‌రితో పెట్టుకున్నా పెట్టుకోకున్నా రాజ‌మౌళి ఫ్యామిలీతో మాత్రం పెట్టుకోలేమ‌ని అన్నారు. అందుకు కార‌ణం.. ఆ కుటుంబం అంత‌టి  సిని జీనియ‌స్ ల నిల‌యం కావడమే.  దిగ్గజ ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్, దిగ్దర్శ‌కుడు రాజ‌మౌళి, ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి.. ఇలా వారి  ఇంట్లో ఇంకా ర‌క‌రాల రంగాల‌కు చెందిన వారు ఉన్నారు.  కాంచి సైతం కామెడీ పండించ‌డంలో దిట్ట‌. లాస్ట్ బట్ నాట్ లీస్ట్  ర‌మా రాజ‌మౌళీ సైతం కాస్ట్యూమ్ డిజైనింగ్ లో ఎక్స్ ప‌ర్ట్. త‌ర్వాతి త‌రం కూడా మ‌త్తు వ‌ద‌ల‌రా అంటూ కామెడీ పండిస్తూ.. ప్రేక్ష‌క జ‌నాన్ని  ఉర్రూత‌లూగించేదే. ఇక సంగీతంలో కీర‌వాణితో పాటు శ్రీలేఖ, క‌ళ్యాణీ మ‌ల్లిక్ వంటి వారు సైతం ఈ కాంపౌండ్ లోంచి వ‌చ్చిన వారే. క‌ళ్యాణి మ‌ల్లిక్ అయితే.. శివ‌శ‌క్తి ద‌త్త కుమారుడు.   ఒక్క సినీ జీవి ఒక విత్త‌నంలా మారి ఆ ఇంట 24 క్రాఫ్ట్ ల‌లో దాదాపు స‌గం వ‌ర‌కూ రంగాల్లో విస్త‌రింప చేసింది ఎక్క‌డైనా ఉందంటే అది శివ‌శ‌క్తిద‌త్త ఇంట్లోనే.  ఆయ‌న త‌న 92వ ఏట మంగళవారం (జూలై 7) హైద‌రాబాద్ మ‌ణికొండ‌లోని త‌న స్వ‌గృహంలో వ‌యోధిక స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఒక మేరు న‌గ ధీర‌, ఒక మ‌హా సినీ వ‌ట వృక్షం నేల‌కూలింద‌ని చెప్పాల్సి ఉంటుంది. ఆయ‌న తెలుగు సినిమాల్లో సంస్కృత పాట‌ల‌కు పెట్టింది పేరు. ఈయ‌న విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి సోద‌రుడు, కీర‌వాణికి తండ్రి. రాజ‌మౌళికి పెద‌నాన్న అవుతాడ‌ని అన‌డం క‌న్నా.. వారంద‌రికీ ఆరాధ్య దైవం. సినీ భిక్ష పెట్టిన ఆదిగురువుగా చెప్పాలి. శివ‌శ‌క్తి ద‌త్త సై, ఛ‌త్ర‌ప‌తి, రాజ‌న్న‌, బాహుబ‌లి ద బిగినింగ్, బాహుబ‌లి టూ, ట్రిపుల్ ఆర్, హ‌నుమాన్ వంటి సినిమాల‌కు పాట‌లు రాశారు. బాహుబ‌లి చిత్రంలోని మ‌మ‌త‌ల త‌ల్లి, ఛ‌త్ర‌ప‌తిలో అగ్ని స్ఖ‌ల‌న‌, మ‌న్నేల తింటివిరా కృష్ణ‌, రాజ‌న్న‌లో అమ్మా అవ‌ని వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సాంగ్స్ రాశారు.   ఆయ‌న మొద‌ట సినిమా వారు కారు. సాహితీ వేత్త కావ‌డం వ‌ల్లే సినిమాల్లోకి వెళ్లాల‌ని భావించారు. అలా సినిమాల‌పై ఉన్న ఆస‌క్తి కొద్దీ ముంబై వెళ్లి జేజే కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరారు. అక్క‌డ చిత్ర‌క‌ళ‌పై ప్రావీణ్యం సంపాదించారు. త‌ర్వాత క‌మ‌లేశ్ అనే క‌ళం పేరిట చిత్ర‌కారుడిగా కొంత కాలం ప‌ని చేశారు. సంగీతం పట్ల మక్కువతో గిటార్, సితార్, హార్మోనియం వంటి వాద్యాలను నేర్చుకున్నారు. అలా అలా శివశక్తి దత్త సినీరంగంలో ప్రవేశించిన త‌ర్వాత‌ ఆయన సోదరుడు విజయేంద్ర ప్రసాద్ తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. 1988లో విడుదలైన జానకి రాముడు సినిమా ద్వారా శివశక్తి దత్తా రచయితగా మంచి గుర్తింపు పొందారు. ఆపై ఆయన రచించిన పాటలు, స్క్రీన్ ప్లేలు.. తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. 

ప్రజలే ప్రభువులు- చందాలతో పనులు

ఎవరో వస్తారని,ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న ఓ కవి మాటను ఆదర్శంగా తీసుకున్న ఆ గ్రామాల ప్రజలు తమ సొంత వ్యయంతో సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ప్రజలే ప్రుభువులు.. చంద్రాలతో పనులు అంటూ గ్రామాల అభివృద్ధికి నడుంబిగిస్తున్నారు.   మొన్నటికి మొన్న ములుగు జిల్లాలోనీ వెంకటాపురం మండలం ముత్తారం గ్రామస్తులు  ఓ మోస్తారు వర్షానికి ఉప్పొంగి రవాణాకు ఆటంకంగా ఉన్న వాగుపై కల్వర్టు నిర్మించుకున్నారు. ముత్తారం గ్రామ గిరిజనులు చందాల రూపంలో రెండు లక్షల 50 వేలు  సేకరించి ఆరు సిమెంట్ పైపులు కొనుగోలు చేసి అందరు కలిసి రెండు రోజుల్లో కల్వర్ట్ నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నేడు  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు కోటగడ్డ గ్రామ ప్రజలు..  డ్రైనేజీ కాల్వ కోసం అధికారులకు వినతులు ఇచ్చి ఇచ్చి విసుగెత్తి.. ప్రతి ఇంటికీ నాలుగు వేల రూపాయల చొప్పున వసూలు చేసి దాదాపు  630 ఫీట్ల మేర డ్రైనేజీ నిర్మించుకున్నారు.     డ్రైనేజీ నిర్మించండని అధికారులకు చెప్పి చెప్పి విసుగేసి కాలనీ వాసులే సొంత నిధులతో  డ్రైనేజీ పనులు చేయించుకుంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిం చుకోవడానికి నడుం   బిగించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కోటగడ్డ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించిన పనులు జరగలేదు.దీంతో  ఇక అధికారుల చుట్టూ తిరిగితే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి సొంత నిధులతో డ్రైనేజీ పనులు చేపట్టి  మొత్తం 630 ఫీట్ల మేర డ్రైనేజీని నిర్మించుకుంటున్నారు. కాలనీలో ఉన్న దాదాపు 20 కుటుంబాలు ఇంటికి 4000 చొప్పున జమ చేసుకొని డ్రైనేజీ పైపులైన్లు వేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా కాలనీలో సిసి రోడ్డు, డ్రైనేజీ కాలువలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రోడ్డుపై మురుగునీరు నిలిచి దోమలు, పందులకు ఆవాసంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తామే తలా కొంత డబ్బులు వేసుకొని డ్రైనేజీ నిర్మించుకొన్నారు. 

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (జులై 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదుగంటలకు పైగా సమయం పడుతుండగా, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (జులై 8) శ్రీవారిని మొత్తం 78 వేల 320 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 950 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హండీ కానుకల ఆదాయం 4 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది. 

ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర : పయ్యావుల

  ఏపీ బ్రాండ్‌ను  దెబ్బతీసేందుకై మాజీ సీఎం జగన్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి కుట్రలు చేస్తూ  రాష్ట్రంలో  ఏదో జరిగిపోతున్నదంటూ గగ్గోలు పెడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి  పయ్యావుల కేశవ్ అన్నారు. సచివాలయంలో నిర్వహించిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్దిని అడ్డుకునేందుకు  పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాభివృద్దికై ఏపిఎండిసి ద్వారా రూ.9 వేల కోట్ల మేర ఋణా తెచ్చేందుకు  ప్రభుత్వం జి.ఓ. నెం.32 ను ఈ ఏడాది మార్చిలో జారీ చేసినప్పటి నుండి ఆ ఋణం రాకుండా అడ్డు పడేందుకు విఫల యత్నం చేశారని పేర్కొన్నారు.  జర్మనీలో పనిచేస్తున్న విప్రో ఉద్యోగి ఉదయభాస్కర్ అనే అతనితో  బాంబో మార్కెట్లోని పెట్టుబడిదాలు అందరికీ  పెట్టుబడులు పెట్టవద్దు అంటూ దాదాపు 200 మెయిల్స్  పంపించారు. వైసీపీ పార్టీకి చెందిన రాజ్య సభ సభ్యులు మరియు ఫైనాన్సు స్టాండింగ్ కమిటీ సభ్యులతో కేంద్ర ప్రభుత్వానికి ఆర్.బి.ఐ.కి సెబీ కి కంప్లైంట్స్ పెట్టించారు, వారి పార్టీ సభ్యులు లేళ్ల అప్పరెడ్డితో హైకోర్టులో  పిల్ వేయించారని ఆర్థిక మంత్రి తెలిపారు. వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా ఏపీ బ్రాండ్ ఎక్కడా తగ్గలేదు, ఓవర్ గా సబ్ స్క్రైబ్ చేశారు. ఇప్పటికైనా వాళ్లు ఏడుపులు ఆపితే మంచిదని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్దిని అడ్డుకునేలా వీరు చేసిన తప్పుడు ప్రచారానికి, రాద్దాంతానికి దేశ ద్రోహం కేసులు వీరిపై పెట్టాలని అన్నారు  

టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెన్షన్

  టీటీడీలో పనిచేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును అధికారులు సస్పెండ్ చేశారు.తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం . ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన  సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగింది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది.  

ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ సీరియస్

    నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి , వైసిపి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మంగళగిరిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ, పదవులు పోయినా కూడా కొందరు వైసీపీ నేతలు హీరోలు లాగా ఫీల్ అవుతున్నారని అన్నారు.  మహిళల పట్ల వ్యక్తిత్వహననానికి పాల్పడటం సర్వ సాధారణమైపోయిందని అన్నారు.  రాజకీయాల్లో ఉన్న మహిళ గురించి అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేక మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల అమరావతి మహిళల పై కూడా ఇలాగే కించపరిచేలా మాట్లాడారని, ఇటువంటి వారిపై మహిళా కమిషన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పారు.మీరు అనుకుంటున్నట్లు మహిళలు బలహీనులు కాదని, మీకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని ఆమె అన్నారు.

మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్

  అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని మంగళవారం తిరుపతి లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా, మదనపల్లి కలెక్టరేట్లో.. గత ఏడాది జులై  21 రాత్రి ఫైళ్ల దగ్ధం పాఠకులకు విధితమే అన్నారు. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, మాధవ రెడ్డీలను అరెస్టు చేయగా, ఇప్పుడు మాజీ ఆర్డీఓ మురళిని తిరుపతి కె ఆర్ నగర్‌లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ తేజ్ ను ఏపీ సీఐడీ  అరెస్టు చేసింది.   మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జులై 21న అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్దం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పని చేసిన ఆర్డీవో, ఇతర అధికారులను పోలీసులు వారం రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.  

టీటీడీ ఉద్యోగులపై భక్తుల రాళ్లదాడి

  తిరుమల ఎంప్లాయిస్ గదుల కౌంటర్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గదులు కోసం గంటల గంటలు నిరీక్షించిన  భక్తులు సమయమనం కోల్పోయి  నేరుగా గదులు పొందుతున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేశారు. దీంతో తిరుపతికి చెందిన ఒక భక్తుడు విసిరిన రాళ్లతో ఇద్దరి ఉద్యోగులకు గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తి పరారైపోవడంతో వారి మిత్రులను అదుపులోకి తీసుకుని తిరుమల క్రైమ్ పోలీసులు విచారిస్తున్నరు. అయితే ఈ ఘటనతో మిగతా భక్తులకు ఆందోళనకు గురయ్యారు. ప్రశాంత వాతావరణం ఉన్న తిరుమలలో ఈ తరహా ఘటనలు ఏమిటని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  

కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాతో సీఎం రేవంత్ భేటీ

  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. తాజాగా ఇవాళ సీఎం కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ న‌డ్డాతో  భేటీ అయ్యారు.  తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి ఏప్రిల్-జూన్ నెల‌ల మ‌ధ్య 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు గానూ కేవలం 3.07 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేశార‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల‌కు నీరు రావ‌డం.. సాగు ప‌నులు జోరుగా సాగుతున్నందున‌ యూరియా స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు త‌లెత్త‌కుండా చూడాల‌ని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.. దేశీయంగా ఉత్ప‌త్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణ‌కు పెంచాల‌ని సీఎం కోరారు.  యూరియా స‌ర‌ఫ‌రాకు సంబంధించి రైల్వే శాఖ త‌గిన రేక్‌లు కేటాయించ‌డం లేద‌ని... వాటి సంఖ్య పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో  ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా అనుకుంటున్న పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు. అలాగే విదేశాల నుంచి ముడి సరుకులు దిగుమతుల విషయంలోనూ వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ముడిసరుకులు సకాలంలో రాకపోవడం వల్ల తెలంగాణలోని పరిశ్రమల ఉత్పత్తులు తగ్గిపోతున్నదని ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నదని అందువల్ల ముడిసరుకుల దిగుమతుల విషయంలో సడలింపులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.   

రాజావారి బడిలో నారాయణ వ‌ర్సెస్ రామ నారాయ‌ణ‌

  ఆయ‌నొక మంత్రి. ఈయ‌నా మంత్రే. ఒక‌రు దేవాదాయం, మ‌రొక‌రు మున్సిప‌ల్. VRC నెల్లూరు జిల్లాకే అతి పెద్ద చ‌రిత్ర గ‌లిగిన విద్యా సంస్థ‌లుగా పేరుంది. పెద్ద పెద్ద వాళ్లు ఇక్క‌డ చ‌దువుకున్న వారే అన్న హిస్ట‌రీ సైతం క‌లిగి ఉందీ ప్రాంగ‌ణం. అలాంటి ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ‌లు గ‌త యాభై ఏళ్ల నుంచి ఆనం కుటుంబం అధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయి. అయితే గ‌త  జ‌గ‌న్ స‌ర్కార్.. ఈ విద్యా సంస్థ‌ల‌ను ఆనం వారి  నుంచి లాగేసుకుంటే.. ఇప్పుడా ప్ర‌క్రియ‌ను మంత్రి నారాయ‌ణ పూర్తిస్థాయిలో నిర్వ‌హిస్తున్నారా? అన్న అనుమానం  వెలుగు చూస్తోంది. తాజాగా VRCకి సంబంధించి ఒక ప్రొగ్రాం జ‌రిగింది. ఇది మంత్రి నారాయ‌ణ అధ్వ‌ర్యంలో జ‌రిగింది. బేసిగ్గానే మంత్రి నారాయ‌ణ అంటే నారాయ‌ణ కార్పొరేట్ ఎడ్యుకేష‌న‌ల్ సంస్థ‌ల అధినేత‌. ఆయ‌న కూడా VRCలో చ‌ద‌వ‌డం మాత్ర‌మే కాదు.. ఇక్క‌డ అతి త‌క్కువ జీతానికి లెక్చ‌ర‌ర్ గా ప‌ని చేసినట్టుగానూ చెబుతారు. ఆయ‌నే చాలా సార్లు త‌న‌కూ వీఆర్సీకీ ఉన్న గ‌తాన్ని గుర్తు చేసేవారు. త‌న‌కూ VRCకి ఉన్న అనుబందం దృష్ట్యా తాను గెలిస్తే.. 15 కోట్లు వెచ్చించి ఈ విద్యా సంస్థ‌ల‌ను ఆధునీక‌రిస్తాన‌ని హామీ ఇచ్చిన నారాయ‌ణ అన్నంత ప‌నీ చేశారు. అంతే కాదు విద్యా మంత్రి నారా లోకేష్ ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ స‌భ‌కు పిల‌వ‌కుండానే మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ  రెడ్డి వ‌చ్చారు. ఈ విద్యా సంస్థ‌ల చ‌రిత్ర గురించి వివ‌రించారు. 150 సంవ‌త్స‌రాల క్రితం బ్రిటీష్ హ‌యాంలో క్రిస్టియ‌న్ మిష‌న‌రీ స్కూళ్లు మాత్ర‌మే ఉండేవ‌నీ.. 1975లో సుంకాల నారాయ‌ణ స్వామి శెట్టి- హిందూ వ‌ర్నాక్యుల‌ర్ ఆంగ్లో హై స్కూల్ స్థాపించార‌నీ.. అప్ప‌ట్లో వెంక‌ట‌గిరి రాజా వారు రూ. 50 వేల విరాళం ఇస్తామ‌న్నార‌నీ. దీంతో ఈ విద్యా సంస్థ‌ల‌కు వెంక‌ట‌గిరి రాజాస్ కళాశాల అని  పేరు పెట్టార‌నీ.. అయితే రాజావారు ఇస్తాన‌న్న విరాళం ఇవ్వ‌లేద‌నీ.. గ‌త  యాభై ఏళ్లుగా ఆనం పెద్ద‌లు... ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంక‌ట‌రెడ్డి, ఆనం వివేకానంద‌రెడ్డి, ఆ త‌ర్వాత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి చైర్మ‌న్ గా ఉండేవార‌నీ.. వైసీపీ హ‌యాంలో ఆనం వారి అధికారం పోయిందనీ.. దీంతో ఇక్క‌డి విద్య మ‌స‌క‌బారింద‌ని చెప్పుకొచ్చారు మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి. సొంత ప్ర‌భుత్వం వ‌చ్చాక అయినా.. ఈ విద్యా సంస్థ‌ల్లో ఆనం వారి ప‌ట్టు నిలుస్తుంద‌ని భావిస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కూ తాము విస్త‌రిస్తూ వ‌చ్చిన VRC లెగ‌సీని.. ఒక్క దెబ్బ‌తో మంత్రి పొంగూరు నారాయ‌ణ త‌న్నుకు పోవ‌డంతో.. అది పిల‌వ‌ని పేరంట‌మే అయినా స‌భ‌లోకి దూసుకొచ్చేశారు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి. త‌న ఆక్రోశం మొత్తం వెళ్ల‌గ‌క్కారు. త‌మ కుటుంబం ఈ క‌ళాశాల‌ను ఎలా కాపాడుకుంటూ వ‌స్తుందో చెప్పి.. ప్ర‌స్తుతం మంత్రి పొంగూరు నారాయ‌ణ వంటి వారు ఎలా ఆక్ర‌మిస్తున్నారో వివ‌రించారాయ‌న‌.తాము మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన వార‌మ‌నీ. అందుకే వెంక‌ట‌గిరి రాజా వారి విద్యా సంస్థ‌ల‌ను మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్ధుల విద్యాభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దుతూ వ‌చ్చామ‌నీ.. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థ‌ల అధినేత అయిన నారాయ‌ణ వ‌చ్చి.. ఇక్క‌డి విద్య‌ను కార్పొరేటీక‌ర‌ణ చేయ‌డం స‌రికాద‌న్న ధోర‌ణిలో  ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి చేసిన కామెంట్లు నెల్లూరు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి. వీటిలో మొద‌టిది స్థానికంగా ఒక మంత్రి ఉండ‌గా.. ఆయ‌నకంటూ ఒక ప్రొటోకాల్ ఉంటుంది. అది ఎందుకు పాటించ‌లేదు? ఇది ప్ర‌భుత్వ ప‌ర‌మైన చ‌ర్చ కాగా.. ఇద్ద‌రు మంత్రులు.. నారాయ‌ణ వ‌ర్సెస్ ఆనం రామ‌నారాయ‌ణ మ‌ధ్య విబేధాలు అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌స్తున్నాయా? అస‌లేం జ‌రుగుతోందీ నెల్లూరులో అన్న మ‌రో రాజ‌కీయ రగ‌డ ప్రారంభ‌మైంది.మ‌రి అధిష్టానం ఈ ఇరువురు మంత్రుల‌ మ‌ధ్య గ‌ల వివాదాన్ని ఎలా ప‌రిష్క‌రిస్తుంద‌న్న‌ది ఉత్కంఠ‌గా  మారింది. అయితే కార్పొరేట్ విద్యా సంస్థ‌ల అధినేత‌ అయిన నారాయ‌ణ పిల‌వ‌గానే విద్యా మంత్రి లోకేష్ రావ‌డం చూస్తుంటే ఈ రాజ‌కీయ‌పు త్రాసు అటు వైపే ఎక్కువ‌గా మొగ్గుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.  గ‌త వైసీపీ పాల‌న‌లో ఇలాంటివి స‌హించ‌లేక‌.. టీడీపీలోకి వ‌చ్చిన ఆనం రామనారాయ‌ణ రెడ్డికి  మంత్రిత్వం ఇచ్చారు లే అనుకుంటే అది కూడా దేవాదాయ శాఖ కావ‌డం. వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ టీటీడీ నుంచి అప్ప‌న్న ఆల‌యం వ‌ర‌కూ ఏవో ఒక వివాదాలు. ఆపై ఈ శాఖ‌కున్న సెంటిమెంటూ వెర‌సీ.. ఆనం ఒకింత అస‌హ‌యానికి గుర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఉన్న త‌ల‌నొప్పులు చాల‌వ‌న్న‌ట్టు గ‌త అర శ‌తాబ్దంగా త‌మ ఆధీనంలో ఉన్న VRC ఆనే బ్రాండెడ్ విద్యా సంస్థ‌ల‌ను ఇన్నేళ్ల పాటు కాపాడుకుంటూ వ‌స్తే.. అది కూడా  కార్పొరేట్ కింగ్ మంత్రి నారాయ‌ణ క‌బ్జా చేస్తుంటే ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితిలో ప‌డ్డార‌ట మ‌రో మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ  రెడ్డి. మ‌రి చూడాలి.. ఈ ఇద్ద‌రు అమాత్యుల మ‌ధ్య చెల‌రేగుతోన్న వివాదాల‌ను అధిష్టానం ఎలా ప‌రిష్క‌రిస్తుందో తేలాల్సి ఉందంటున్నారు నెల్లూరు వాసులు.

ఏపీ సీఎం చుట్టూ తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెంట్రిక్‌గా  సాగుతున్నట్లే కన్పిస్తోంది. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వివిధ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను నిశితంగా గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.  ప్రధానంగా బనకచర్ల అంశంలో ఏపీ ప్రభుత్వం తీరుపై తెలంగాణ సర్కారు భగ్గుమంటోంది. ఓవైపు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం చెబుతున్న ఏపీ సర్కారు.. వరద జలాలతో సముద్రంలోకి వృథాగా పోయే నీటితో బనకచర్ల కట్టుకుంటామని చెప్పడం సరికాదని వాదిస్తోంది. కేంద్రంలో పలుకుబడి ఉందని.. బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని  ముఖ్యమంత్రి రేవంత్ దెప్పిపొడుస్తున్నారు. కేంద్ర అండతో ముందుకు పోదామని అనుకుంటే తమ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ వద్ద అవసరమైన ప్రణాళిక, వ్యూహం ఉన్నాయంటున్నారు. అదలా ఉంటే సముద్రంలో వృధాగా కలిసే జలాలు వినియోగంలోకి తేవడానికి ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విమర్శల పాలవుతోంది. ఇక..  ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబు.. బనకచర్ల విషయంలో చేస్తున్న కామెంట్లు సరైనవి కావంటున్నారు మాజీ మంత్రి హరీశ్‌రావు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ..ఏపీ సీఎం డజన్ల కొద్దీ లేఖలు కేంద్రానికి రాసిన విషయాన్ని గుర్తు చేశారాయన. బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతోందని విమర్శించారాయన. ప్రజాభవన్‌లోనే సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. బనకచర్ల విషయంలో బీజేపీ వాదన మరోలా ఉంది. మోడీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనంటూ చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతోపాటు, కేంద్ర ప్రభుత్వ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేశారని.. అన్ని అనుమతులు పొందాకే ప్రాజెక్టు ముందుకు సాగుతుందన్నారు.  ఒక్క బనకచర్ల అంశమనే కాదు.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపైనా సీఎం చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాలు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారని ఆరోపిస్తున్నారు. ఈటల రాజేందర్, డీకే అరుణలాంటి వాళ్లు ఉండగా.. తనకు అనుకూలమైన రామచంద్రరావుకు చంద్రబాబు ఆ పదవి ఇప్పించుకున్నారని ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్.         అయితే.. తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో ఆచి తూచి స్పందిస్తున్నారు. అసలు తమ పార్టీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం, ప్రభావం ఎందుకు ఉంటుందని కమలం ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి అధ్యక్షుడిని నియమించాలంటే చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం అధిష్టానానికి లేదని మరికొందరు కాషాయ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.  అలాంటి వాళ్లకు నల్లా, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలని ధ్వజమెత్తారు. ఇలా దాదాపుగా తెలంగాణలోని అన్ని పార్టీలూ చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు చేయడం వెనుక కారణం ఏంటన్న దానిపై  పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద చర్చే సాగుతోంది.త్వరలోనే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండటం, తెలంగాణలోనూ టీడీపీ అధినేత పార్టీని యాక్టివ్ చేస్తుండటంతో తెలంగాణ పార్టీలు చంద్రబాబు సెంట్రిక్‌గా రాజకీయం మొదలుపెట్టాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వైసీపీ నుంచి ప్రసన్నను సస్పెండ్ చేయాలి : అనిత

  మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ హోం మంత్రి అనిత డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హోం మంత్రి  స్పందించారు. ప్రసన్న కుమార్ నువ్వు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను నీ తల్లికి చూపించు మీరు మాట్లాడిన మాటల్లో తప్పులేదని ఆమె అంటే మాకు చెప్పడి మేం మాట్లాడటం మానేస్తాం అని హోం మంత్రి  అన్నారు .మహిళల గౌరవాన్ని జగన్ కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 11 సీట్లు వచ్చినప్పటికీ వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని నిప్పులు చెరిగారు.  ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై.. ప్రసన్నకుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనపై కూడా ప్రసన్న కుమార్ ఇలాగే ఇష్టానుసారంగా మాట్లాడారని ఆమె గుర్తుచేశారు. వైసీపీలో మహిళలను అగౌరవపరిచే సంస్కృతి ఉందని, సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు అనేక మంది నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఆమె విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పర్యటనలో భాగంగా ఆమె సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  మరోవైపు  రాజకీయంగా ఎదుర్కోలేక మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఇలాంటి వారిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి డిమాండ్. తనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో కోవూరులో జరిగిన అక్రమాల గురించి మాట్లాడుతుంటే మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై నోరు పారేసుకున్న ప్రసన్నను మహిళా సమాజం క్షమించదన్నారు.

తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కావాలనేది నా లక్ష్యం : సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం జలాశయం నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు.. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది.  ఆనకట్టపై రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి  కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరసారెలను సమర్పించారు. ఆ తర్వాత ఆనకట్టపై 6, 7, 8, 11 గేట్ల ద్వారా లాంచనప్రాయంగా నీటిని విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు.  దీంతో జలాశయానికి వరద పోటెత్తుతున్నది. సుంకేశుల, జురాల నుంచి 1.70లక్షల క్యూసెక్కులకరుపైగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882 అడుగుల మేర నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు.  ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది.అనంతరం మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చన, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతు తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్ కావడం తన లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. ఆ తప్పులు సరిచేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని తెలిపారు. ఇవాళ తన జీవితంలో సంతోషకరమైన రోజుని సీఎం అన్నారు. జులై తొలి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం శుభపరిమాణం అని తెలిపారు. నీటి కరువు ఉన్న రాయలసీమను ఎవరూ కాపాడలేరని చాలా మంది  అన్నారు.  కానీ ఆ ప్రాంతం స్థితిగతులు మార్చందుకు ఎన్టీఆర్ నడుం బిగించారు. ఇప్పుడు రాయలసీమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నానని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులకు రూ.68వేల కోట్లు ఖర్చు చేశాం. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత మా ప్రభుత్వానిదే. ఈనెల 15 నాటికి ఆ ప్రాంతానికి నీరు రావాలని అధికారులకు టార్గెట్‌ విధించా. ఈనెల 30 కల్లా కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకెళ్తాం. పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, గండికోట.. అన్నీ మేమే తెచ్చామన్నారు. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, జనార్దన్ రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, దేవదాయ శాఖ సెక్రటరీ వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, జేఈవోలు పాల్గొన్నారు.

30 యాక్ట్... హౌస్ అరెస్టులు లేవు.. ఆంక్షలకే వైసీపీ అనవసర గగ్గోలు!

ఐదేళ్లు వైసీపీ పాలనలో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు వాటి నాయకులు పర్యటన చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నాయకుడు రావాలన్నా తీవ్ర అడ్డంకులు సృష్టించారు. పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిప్పుకుని పర్యటన అనుమతు కోసం వెళ్తే 30 యాక్ట్ అంటూ హడావుడి చేసి అనుమతులు ఇవ్వకుండా చేశారు. ఆనుమతులు ఇచ్చ కూడా ముఖ్య నాయకులను హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కూడా ఉంటాయని చూపించిన ఘనత వైసీపీకే దక్కుతుందని ప్రజలు అంటున్నారు. అయితే జగన్ ఐదేళ్ల పాలన ముగిసింది. ఇప్పుడు జగన్ పార్టీకి రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఐదేళ్ల నిర్బంధ కాండ నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఇప్పుడు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడిలో పడింది. పోలీసులు సైతం తమ విధులు స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇక అధికారం కోల్పోయిన వైసీపీ మాత్రం ప్రశాంతంగా పర్యటనలు చేసుకుంటే   మైలేజ్ రాదని పరామర్శ యాత్రల పేరిట వెళ్తు గొడవలు, దాడులకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజల, చివరికి సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలతో చెలగాటాలాడుతోంది.   మామిడి రైతుల సమస్యలు అంటూ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంకు రానున్న జగన్ కు గతంలో జరిగిన కారణాలతో పోలీసులు ఆంక్షలు విధిస్తే దాన్ని సైతం రాజకీయం చేస్తున్నారు. గతంలో వైసీపీ చేసిన పనిని కూటమి ప్రభుత్వం చేయడం లేదు. ప్రజాస్వామ్యం లో తిరిగే హక్కుతో పాటు భద్రత కూడా కల్పిస్తున్నది. 30 యాక్ట్ అంటూ అరెస్టులు చేయడం లేదు. శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలు మాత్రమే విధిస్తున్నది. దీనికే జగన్ అంటే, జగన్ వస్తుంటే.. కూటమి ప్రభుత్వం భయపడుతోంది అంటూ నానా యాగీ చేస్తున్నది వైసీపీ. జగన్  బంగారుపాల్యం యాత్రనే తీసుకుంటే.. మామిడి సీజన్ ముగిసిన దశలో మామిడిరైతుకు పరామర్శ, భరోసా కోసం అంటూ జగన్ కుట్ర కోణం దాగి ఉందన్నది ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం. అయితే నిజమైన రైతులతో మాట్లాడుతారా లేక పేటీఎం బ్యాచ్ ను జిల్లా వైసీపీ నాయకులు ఏర్పాటు చేస్తారా అన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ యాత్ర ఏ తీరున సాగుతుందో చూడాలి. 

సిగాచీ ప్రమాద ఘటనపై..ఎన్‌డీఎం బృందం సీరియస్

  సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పార్మా ప్యాక్టరీలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది.   పేలుడు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఘటనపై ఇప్పటి వరకు 44కు మృతుల సంఖ్య చేరింది. అనంతరం ఎన్‌డీఎంఏ అక్కడే సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డీఎంఏ ప్రశ్నలు సంధించింది. యాజమాన్యం సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంతో సీరియస్ అయింది. పేలుడు ఎలా సంభవించిందో చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.  సమావేశం అనంతరం పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది.  సంగారెడ్డిలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖలేశ్వర్, బీరంగూడ సమీపంలోని పనేసియా మెరిడియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆరిఫ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత ఆసుపత్రుల్లో చేరిన వారిలో గత వారం రోజుల్లో ఇప్పటివరకు 8 మంది మరణించారు. ప్రస్తుతం మరో 16 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జూన్ 30న పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.  ఈ ఘటనలో మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసు బృందాలు శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. గల్లంతైన తమ వారి కోసం బాధితుల కుటుంబాలు సహాయ కేంద్రం వద్ద ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి. మరోవైపు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

జమిలికి లైన్ క్లియర్!?

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్నది. ఇందు కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని వేసి నివేదిక తీసుకుంది. ఆ నివేదిక జమిలిని సానుకూలంగా ఉండటంతో దేశంలో అన్ని ఎన్నికలూ ఒకే సారి జరిపే దిశగా అడుగులను వేగవంతం చేసింది. ఈ విషయంగా రాష్ట్రాలతోనూ చర్చించింది.  బీజేపీ పాలిత రాష్ట్రాలూ, ఎన్డీయే కూటమి పార్టీలూ జమిలికి సై అన్నాయి. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలూ, బీజేపీ ప్రత్్యర్థి పార్టీలూ జమిలికి నో అన్నాయి.  ముఖ్యంగా కాంగ్రెస్ స‌హా.. స్థానిక పార్టీల నేతృత్వంలో న‌డుస్తున్న ప్ర‌భుత్వం ఉన్న రాష్ట్రాలు జ‌మిలికి   గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. విషయం అలా ఉండగా కొందరు న్యాయవాదులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించారు.  జమిలి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు. అలాగే జమిలి నిర్వహణ వల్ల వ్యయం తగ్గుతుందన్న విషయంలోనూ వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకే దఫా ఎన్నికల నిర్వహణ ఎన్నికల అవినీతి పెచ్చరిల్లడానికే దారి తీస్తుందని విమర్శలు గుప్పించారు. అయితే వీటిలో వేటికీ కేంద్రం బదులివ్వకపోవడంతో ఢిల్లీ బార్ అసోసియేషన్ సహా దేశ వ్యాప్తంగా సుప్రీం కోర్టులో పెద్ద సంఖ్యలో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. సరే సుప్రీం కోర్టు ఆ పటిషన్లను ఏకకాలంలో విచారించేందుకు అంగీకరించడంతో కేంద్రం కూడా సుప్రీం కు మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నివేదికను సుప్రీం కు సమర్పించింది. ఆ నివేదిక ప్రకారమే ముందకు వెడుతున్నట్లు పేర్కొంది. ఈ నివేదికపై అధ్యయనం చేసి జమిలికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను క్వాష్ చేయాలని సుప్రీం ను కోరింది. దీనిపై నివేదికను పరిశీలించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం జమిలి ఎన్నికలకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికల వల్ల ఖర్చు భారీగా తగ్గుతుందన్న అంశంతో ఏకీభవించింది.  అలాగే జమిలికి ఓకే చెప్పింది. దీంతో జమిలికి ఇక అడ్డంకులన్నీ తొలగిపోవడంతో కేంద్రం తన కార్యాచరణను స్పీడప్ చేసింది. జమిలికి దేశ వ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాలలోనే జమిలి బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది.