మోడీ పెళ్ళి కాంగ్రెస్‌ చావుకొచ్చింది!

      ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందంటారే.. అచ్చం అలాంటి సిట్యుయేషనే జాతీయ రాజకీయాల్లో వచ్చింది. బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీ వదోదరా పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేస్తూ తనకు 17 సంవత్సరాల వయసు వున్న సమయంలో యశోదాబెన్ అనే అమ్మాయితో పెళ్ళయిందని డిక్లేర్ చేయడం కాంగ్రెస్ పార్టీ చచ్చే చావు తెచ్చిపెట్టింది.   నరేంద్ర మోడీ పెళ్ళి విషయంలో ప్రజల్లో వున్న కన్ఫ్యూజన్ తొలగిపోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీ మోడీని విమర్శించడానికి ఒక ఆయుధంగా పెట్టుకున్న మోడీ పెళ్ళి వ్యవహారం కూడా ఇప్పుడు ఆ పార్టీ చేతుల్లోంచి జారిపోయింది. 17 సంవత్సరాల వయసులో పెళ్ళి అయిన మోడీ ఆ తర్వాత దేశసేవ కోసం సంసార బంధాలు వదిలించుకున్నారు. ప్రజాసేవలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు. మోడీ పెళ్ళి విషయంలో ఏదో రహస్యం దాచేస్తున్నట్టు కాంగ్రస్ పార్టీ లేనిపోని హడావిడి చేస్తూ ఈ అంశం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు మోడీ తనకు పెళ్ళి జరిగినట్టు తానే స్వయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అమ్ముల పొదిలో వున్న ఒక ఆయుధం మాయమైపోయింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ చావుకి మార్గం మరింత సుగమమైంది.

వైఎస్సార్ కాంగ్రెస్ : సినిమావాళ్ళతో డ్రామా!

      ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో పాతాళంలో కూరుకుపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి ఇంకా వుందని చాటుకోవడానికి చేతనైన డ్రామాలన్నీ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. బుధవారం తెలంగాణ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా నియోజకవర్గాలలో నామినేషన్లే పడలేదు. మిగతా స్థానాల్లో నామినేషన్లు వేసిన వాళ్లు కూడా ఆరు నూరైనా, భూమి తలకిందులైనా గెలవని వాళ్లే. దీన్ని చూసి తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ సమాధైపోయినట్టేనని జనంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డిసైడైపోయారు. కనీసం సీమాంధ్రలో అయినా ఉనికి చాటుకుందామనే ప్రయత్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న పనులు చిత్రంగా వున్నాయి. తన చిత్రమైన పనుల్లో భాగంగా సినిమా ఇండస్ట్రీలో పనిలేకుండా వున్నవాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ మా పార్టీకి ఎంత క్రేజుందో చూశారా అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. వంద సినిమాలు చేసేసి ప్రస్తుతం చేసే పనేమీ లేక విశ్రాంతి తీసుకుంటున్న దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని పార్టీలో చేర్చుకుంది. తెలుగు సినిమా రంగం, ప్రేక్షకులు ఏనాడో మర్చిపోయిన పూర్ణిమని గురువారం పార్టీలో చేర్చుకుని వైసీపీ నాయకులు మురిసిపోతున్నారు. ఈ ఎన్నికలలో దుంపనాశనం కాబోతున్న ఈ పార్టీకి చివరికి మిగిలేది ఈ ఆనందమేనేమో!

మెగా తమ్ముడు కనబడుట లేదు

  రాజకీయాలలోకి దూకుతా...దుమ్ము దులుపుతా...తాట తీస్తా..అంటూ రంకెలు వేసి జనసేనతో జనాల మధ్యకు ఊడిపడిన పవన్ కళ్యాణ్, తన రెండవ (వైజాగ్) సభతోనే పార్టీకి మంగళ హారతి పాడేసి మళ్ళీ కనబడకుండా మాయమయిపోయాడు. “ఆయన సోదరజీవి ప్రజారాజ్యాన్ని దాదాపు ఓ ఏడాది పాటు నెట్టుకొచ్చి చివరికి కాంగ్రెస్ గూటికి చేర్చగలిగాడు. కానీ, ఈ మెగా తమ్ముడు మాత్రం ముచ్చటగా మూడో మీటింగ్ కూడా అవసరం లేకుండానే బోర్డు తిప్పేసి చేజేతులా పరువు తీసుకొన్నాడు” అని జనాభిప్రాయం. “కనీసం ఎన్నికలలో ఓ పది మందిని నిలబెట్టి ఓడిపోయినా ఇంత ఇదిగా ఉండేది కాదు కదాని” అనుకొంటున్నారు. అయితే కాకుల వంటి లోకులు అప్పుడు మాత్రం నోరు పారేసుకోరని గ్యారంటీ ఏమీ లేదు గనుకనే ఇంకా టైము, డబ్బు, శ్రమ ఎందుకని పవన్ బాబు బ్రేకులేసుకొని జనసేన బండిని గ్యారేజీలో పార్క్ చేసేసాడు. అయితే దానిని లోపల పెట్టక ముందే మళ్ళీ వచ్చే ఎన్నికల సమయానికి మళ్ళీ దుమ్ము దులిపి, సర్వీసింగ్ చేయించి తప్పకుండా బయటకి తీస్తానని ఆయన హామీ కూడా ఇచ్చేరు.   ‘ఈ లోగా మరో ఐదో పదో సినిమాలు తీసుకొని పదో పరకో పోగేసుకొంటూ, ఏవయినా కొత్త రచనలు కూడా మొదలుపెడితే బెటర్ కదా’ అని శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. ‘రాజకీయాలలోకి వచ్చే దమ్ము, దైర్యం లేనప్పుడు అలా జగన్ గురించి కాంగ్రెస్ గురించి నోరు పారేసుకోవడం ఎందుకు, కొత్త శత్రువులను సృష్టించుకోవడం ఎందుకు? ఒకవేళ రేపు వారే అధికారంలోకి వస్తే తీరికగా బాధపడటం ఎందుకని’ కొందరు శ్రేయోభిలాషులు బాధ పడుతున్నారు.   ఆయన ఎన్నికల వేళా పనిగట్టుకొని పార్టీ పెట్టి, గుజరాత్ వెళ్లి మోడీకి దండం పెట్టి, అడగకుండానే తమ పార్టీలకే మద్దతు ప్రకటించినందుకు తెదేపా, బీజేపీలు చాలా సంతోషిస్తున్నపటికీ కనీసం తమ పార్టీలకి ఉచిత ఎన్నికల ప్రచారమయినా చేయకుండా ఎలా వచ్చాడో అలాగే మాయమయిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ‘ఇంత హడావుడి చేసిన తరువాత ఈ చిన్నసాయం చేసిపెట్టినా బాగుండేది కదా!’ అని సదరు పార్టీల నేతలు నిట్టూర్పులు విడుస్తున్నారు.   ‘చేతిలో కత్తిలాంటి ఛానలొకటి, న్యూస్ పేపర్ ఒకటీ ఉంది గాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే మెగా ఫ్యాన్ల ధాటికి తమ ఫ్యాన్ తిరగడం కూడా కనా కష్టమయిపోయేది కదా!’ అనుకొంటూ జగన్ పార్టీ వాళ్ళు మెటికలు విరిచారు.   మొత్తం మీద పవన్ కళ్యాణ్ మీకు నచ్చిన వాళ్ళకే ఓటేసుకోమని జనాలకి పర్మిషన్ కూడా ఇచ్చేసి వచ్చినంత వేగంగాను మాయమయిపోయారు. జనాలు మాత్రం “ఎవరో వస్తారని... ఏదో చేస్తారని...ఎదురు చూసి మోసపోకుమా..’ అనే పాత పాటనే మళ్ళీ పాడుకొంటూ ఎదురుగా కనబడుతున్న పాత పార్టీలలో కొత్తగా చేరిన పాత కాంగ్రెస్ నేతలకి ఓటేయాలా వద్దా... అని డైలేమాలో ఉన్నారు.

రేవంత్‌రెడ్డిని వాడుకుని వదిలేశారు!

      తెలుగుదేశం పార్టీలో సత్తావున్న నాయకులలో ఒకరైన రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న పరిస్థితులు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో రేవంత్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అండగా నిలిచిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కూరలో ఏరిపారేసే కరివేపాకులా వాడుకుని వదిలేసిన వ్యక్తిలా అవమానాలు ఎదుర్కోవడం బాధాకరమని అంటున్నారు. ఈ అంశం పూర్వాపరాల్లోకి వెళ్తే... ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యేగా వున్న రేవంత్‌రెడ్డి గత రెండు సంవత్సరాలుగా తనకు వచ్చే ఎన్నికలలో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి వుందని చెబుతూ వస్తున్నారు. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. మంచి వాగ్ధాటి, అన్ని అంశాల మీద సంపూర్ణమైన అవగాహన, విషయ పరిజ్ఞానం వున్న రేవంత్‌రెడ్డిని చంద్రబాబు రాజకీయంగా బాగా ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకున్నారని అనడం కంటే, అడ్డదిడ్డంగా వాడుకున్నారనడం బెటర్. అటు జగన్ మీదకి అయినా, కిరణ్ కుమార్‌రెడ్డి మీదకి అయినా, ఇటు కేసీఆర్ దగ్గర్నుంచి ఏ తెలంగాణ నాయకుడి మీదకి అయినా రేవంత్‌రెడ్డి అనే అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించేవారు. రేవంత్‌రెడ్డి అనేక సందర్భాలలో ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసి తెలుగుదేశానికి రాజకీయంగా మైలేజీ పెంచారు. అలా తెలుగుదేశం పార్టీకి అస్త్రంలా ఉపయోగపడిన రేవంత్‌రెడ్డి వస్త్రాలు ఒలిచే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టింది. ఈ ఎన్నికలలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని రేవంత్‌రెడ్డి చంద్రబాబు దగ్గర వ్యక్తం చేసినప్పుడు అటు వైపు నుంచి నో రెస్పాన్స్. ఆ తర్వాత రేవంత్‌రెడ్డికి చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా కట్టయింది. మల్కాజ్‌గిరి పార్లమెంటు టిక్కెట్ రేవంత్‌రెడ్డిని కాదని ఆర్థికంగా బలంగా వున్న ఒక వ్యాపారవేత్తకు ఇచ్చే ప్రయత్నం జరిగినప్పుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మల్కాజిగిరి టిక్కెట్ని సదరు వ్యాపారికి కేటాయించడానికి నలభై కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు కూడా వున్నాయి. తనకు టికెట్ కేటాయించాలని మరోసారి కోరేందుకు రేవంత్‌రెడ్డి మూడు రోజులుగా చంద్రబాబుని కలవటానికి ప్రయత్నిస్తున్నా బాబు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా మెలిగిన తనకు ఇప్పుడు అపాయింట్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి వచ్చేసరికి రేవంత్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. టిక్కెట్ ఇవ్వకపోయినా తాను మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచే నామినేషన్ వేస్తానని రేవంత్‌రెడ్డి బెదిరించేసరికి చంద్రబాబు దూతలుగా సుజనా చౌదరి, సీఎం రమేష్ రంగంలోకి దిగి రేవంత్‌రెడ్డిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రేవంత్‌రెడ్డి  నామినేషన్ నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా చేశారు. దీనికితోడు బుధవారం నాడు కోడంగల్ అసెంబ్లీ స్థానానికి రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో నామినేషన్లకు బుధవారమే చివరి రోజు కావడంతో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాలా.. లేక పార్టీ చెప్పిన సీటులో నామినేషన్ వేయలా అన్న సందిగ్ధంలో రేవంత్‌రెడ్డి వున్నారు. ఇంతకాలం పార్టీకి సేవ చేసినా తనను చంద్రబాబు ఎంతమాత్రం పట్టించుకోకపోవడం, కనీసం చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి అయినా మాట్లాడకుండా మధ్యవర్తుల ద్వారా రాయబారాలు నడపటం పట్ల రేవంత్‌రెడ్డి ఎంతో బాధపడుతున్నట్టు సమాచారం. కనీసం తాను చంద్రబాబు స్వయంగా మాట్లాడ్డానికి కూడా పనికిరాకుండా పోయానా అని తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

సీట్లకి కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారా?

  రాజకీయ పార్టీలు సీట్లకు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ, ఆయా సీట్ల కోసం అభ్యర్థులు పోటీ పడేలా చేసి కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా డిమాండ్ సృష్టించడం ద్వారా పార్టీలకు ఆర్థికంగా బాగా గిట్టుబాటు అవుతున్నట్టు కనిపిస్తోందని పరిశీకులు అంటున్నారు. రాష్ట్రంలో చాలా సీట్ల విషయంలో అనేకమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చాలా సీట్లను పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఆశిస్తున్నారు. వారిలో ఆయా టిక్కెట్ల మీద భారీగా ఆశలు పెంచిన తర్వాత, పార్టీలోని కొంతమంది సదరు టిక్కెట్లను ఆశిస్తున్నట్టు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఈ టిక్కెట్ మీకు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నామని సదరు సౌండ్ పార్టీలకు చెబుతున్నారు. దాంతో పారిశ్రామికవేత్తలు ఎంత ఖర్చయినా పర్లేదు నాకు టిక్కెట్ కావాల్సిందేనని పట్టుపట్టేట్టు చేస్తున్నారు. దాంతో పార్టీల అధ్యక్షులు భారీ స్థాయిలో ‘పార్టీఫండ్’ డిమాండ్ చేసి వారికి టిక్కెట్లు ఇస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో చేతులు మారుతున్న డబ్బు 40 కోట్లు దాటిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీకులు చెబుతున్నారు. ఈ ధోరణి ఏ ఒక్క పార్టీలోనో కాకుండా.. అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోందని అంటున్నారు. పంచ్ లైన్ సీట్ ఫర్ సేల్

టీడీపీకి ‘కన్నా’లు పొడుస్తున్నారు!

      గుంటూరు-2 నియోజకవర్గంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను భారీ మెజారిటీతో గెలిపించడానికి తెలుగుదేశం నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ మాట చదివి మీకు కొన్ని సందేహాలు కలగొచ్చు. కాంగ్రెస్ నాయకుడైన కన్నా లక్ష్మీనారాయణని గెలిపించడానికి టీడీపీ నాయకులు కృషి చేయడమేంటబ్బా అని మీకు అనిపించడం న్యాయం. ఒకవేళ అలా జరుగుతోందంటే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌కి గుడ్ బై కొట్టేసి తెలుగుదేశంలో చేరబోతున్నారా అనే డౌట్ కూడా రావొచ్చు. కానీ, కన్నా అలా పార్టీ మారకుండానే కన్నా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే పరిస్థితులు కొంతమంది స్థానిక తెలుగుదేశం నాయకులు కల్పిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ వర్గాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఇష్యూ గురించి పూర్తి సమాచారం చిత్తగించండి...     సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాషౌట్ అయిపోయింది. మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ గెలుపు కూడా డౌట్‌గానే వుంది. తెలుగుదేశం పార్టీ అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థిని నిలబెడితే కన్నా లక్ష్మీనారాయణ గుండెజారి, డిపాజిట్ గల్లంతయ్యే ఛాన్సుంది. ఈ విషయాన్ని ఆలోచించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థి కోసం అన్వేషించారు. ఆ అన్వేషణలో ఆయనకి సరైన వ్యక్తి కనిపించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు... తులసీ సీడ్స్ అధినేత రామచంద్రప్రభు. సౌమ్యుడిగా, సమర్థుడిగా, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం మీద పూర్తి అవగాహన వున్న వ్యక్తిగా, వివాద రహితుడిగా, సేవాభావం వున్న వ్యక్తిగా  మంచి పేరు వున్న రామచంద్ర ప్రభును గుంటూరు-2 నియోజవర్గం నుంచి కన్నా మీద పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావించారు. ఈ మేరకు రామచంద్రప్రభును పిలిపించి మాట్లాడారు. కన్నా మీద పోటీ చేయాలని చంద్రబాబు కోరినప్పుడు రామచంద్రప్రభు తన అంగీకారాన్ని తెలిజేశారు. రామచంద్రప్రభు గుంటూరు-2 నుంచి పోటీ చేయబోతున్నారన్న విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం నాయకులు ఉత్సాహంతో ఉరకలు వేశారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని ఫిక్సయిపోయారు. అయితే ఇక్కడే స్థానిక తెలుగుదేశంలో వున్న కొంతమంది సైంధవులు రామచంద్రప్రభు మీద తమ చాణక్య నీతి ప్రయోగించడం ప్రారంభించారు. నర్సరావుపేట ఎంపీ సీటు దక్కని మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి అక్కడి తెలుగుదేశంలో ఒక వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా మోదుగులను రెచ్చగొడుతోంది. మోదుగుల గుంటూరు-2లో పోటీ చేస్తే కాపు సామాజికవర్గం ఓట్లు రాలవని, ఓడిపోవడం ఖాయమని తెలిసి కూడా గుంటూరు-2 నియోజకవర్గ తెలుగుదేశం బాధ్యుడైన ‘ఒక పెద్దమనిషి’ ఆ దిశగానే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. సదరు పెద్దమనిషికి రామచంద్రప్రభు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్టుగా, పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి టిక్కెట్ ఇస్తానని చెప్పినా, స్థానిక తెలుగుదేశం కీలక నాయకుడు దానికి మోకాలు అడ్డే ప్రయత్నం చేయడం, చివరకు తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం రామచంద్రప్రభుకు మనస్తాపం కలిగించినట్టు సమాచారం. ఇలాంటి అవమానకర వాతావరణంలో ఆయన గుంటూరు-2 నుంచి పోటీ చేయకుండా వుండటమే ఉత్తమమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు-2 గంజాయి వనంలో తులసిమొక్కకు గౌరవాన్ని ఆశించడం అత్యాశే అయింది. అయితే సరైన అభ్యర్థి అయిన రామచంద్రప్రభు విషయంలో ఇలా వ్యవహరించడం మంచిది కాదని, ఆయన్ని వదులుకుంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోవడం ఖాయమని స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా సరే గెలవాలన్న ఉద్దేశంతో వున్న కన్నా ఇప్పటికే 20 కోట్లు ఖర్చుపెట్టారట. తనమీద తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిని నిలపకుండా ఓడిపోయే అభ్యర్థిని నిలిపేలా చేయడం కోసం కన్నా జిల్లా తెలుగుదేశం ‘పెద్దలతో’ టచ్‌లో వున్నట్టు వినికిడి. ఈ విషయంలో డబ్బు భారీగా చేతులు మారినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు-2 నియోజకవర్గం విషయంలో జరుగుతున్న ఈ అంతర్గత రాజకీయం గురించి, తెలుగుదేశం పార్టీకి ‘కన్నా’లు పొడుస్తున్న నాయకుల గురించి పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.  

సోనియా, రాహుల్ తల్లీకొడుకులు కాదా?

      కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తల్లీకొడుకులు కాదా? ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తోంది ఎవరో కాదు.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు! కొడుకును ప్రధానమంత్రి చేయడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కూడా సిద్ధమైన సోనియాగాంధీ రాహుల్ గాంధీకి తల్లి అవునా కాదా అనే సందేహం ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే కొంత డెప్త్ లోకి వెళ్ళాల్సిన అవసరం వుంది.   సోమవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 111 స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితా చూసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలామంది  షాకైపోయారు. ఎందుకంటే, లిస్టులో వాళ్ళ పేర్లయితే వున్నాయిగానీ, వివిధ స్థానాల నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న వాళ్ళ పుత్రరత్నాలకు మాత్రం టిక్కెట్లు దక్కలేదు. ఇక టిక్కెట్లు వచ్చేస్తాయ్.. పోటీ చేసి గెలిచేద్దాం అని ఎదురుచూసిన సీనియర్ నాయకులు, పుత్రరత్నాలు జాయింట్‌గా బిత్తరపోయారు. ఎందుకిలా? అని అధిష్ఠానాన్ని అడిగితే ‘ఇంటికి ఒక్కటే టిక్కెట్’ అని బ్లంట్‌గా చెప్పేసింది. దాంతో వాళ్ళకి భోరున ఏడవటం ఒక్కటే తక్కువైంది. మా పుత్రరత్నాలకు టిక్కట్లు ఇవ్వలేదు. వారసులకు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వమని చెబుతున్నారు. మరి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తల్లీ కొడుకులే కదా.. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో వుండే ఒకే కుటుంబానికి చెందినవాళ్ళే కదా.. మరి వాళ్ళిద్దరికీ పార్టీ టిక్కెట్లు ఎందుకు ఇచ్చిందో అని అమాయకంగా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు తల్లీకొడుకులు కాదేమోనని ఆగ్రహంగా అంటున్నారు. వాళ్ళకి వర్తించని రూల్స్ మాకెందుకు వర్తించాయో అనుకుంటున్నారు!

అన్ని పార్టీలలో ఎన్నికళలు!

  రాష్ట్రంలో ఈనేలో 30న జరిగే మొదటిదశ ఎన్నికలకి నామినేషన్లు వేయడానికి ఈరోజే ఆఖరి రోజు. అన్ని ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్ధులను దాదాపుగా ప్రకటించినప్పటికీ, ముఖ్యమయిన కొన్ని స్థానాలపై ఇంకా పట్లుపడుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలలో కూడా టికెట్ దొరకని నేతలు, వారి అనుచరులు వీరంగం వేస్తున్నారు. కొందరు చురుకయిన నేతలు చకచకా కండువాలు, టోపీలు, పార్టీలు మార్చేసి టికెట్స్ దక్కించుకొంటే, మరి కొందరు స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు. అయితే ‘నామినేషన్ల ఉపసంహరణ’ అనే వెసులుబాటు అటువంటివారిని బుజ్జగించి బరిలోనుండి తప్పించేందుకే ఉంది కనుక అప్పటికి అన్ని పార్టీలలో చెలరేగిన అశాంతి కొంతవరకు సర్దుమణగవచ్చును. కానీ పొత్తుల్లో భాగంగా టికెట్ దొరకని తమ పార్టీ నేతలని సదరు పార్టీలే స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగేందుకు పరోక్షంగా ప్రోత్సహించి, వారిపై బహిష్కరణ వేటు కూడా వేసి, ఎన్నికలలో గెలిచిన తరువాత ఆ బహిష్కరణ ఎత్తివేసి తిరిగి పార్టీలోకి రప్పించుకోవడం గతంలోనే చాలాసార్లు జరిగింది. గనుక రాజకీయ పార్టీలు, వాటిని వదిలి వెళ్ళిన లేదా పార్టీల గోడలు దూకి టికెట్ సాధించుకొన్న అభ్యర్ధులు అందరూ ఒక తానులో ముక్కలేనని స్పష్టమవుతోంది. అన్ని పార్టీల, నేతల ఏకైక లక్ష్యం ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకోవడమే తప్ప వేరేమి కాదని వారి ఈ చేష్టలే నిరూపిస్తున్నాయి. ఇంతకాలం ప్రజలను చైతన్యపరిచేందుకు యాత్రలు చేసిన సదరు నేతల ఆలోచనలు, పద్దతులలో ఎన్నడూ మార్పు రాబోదని, ప్రజలు అటువంటివి ఆశించడం అత్యాశే అవుతుందని నిరూపిస్తున్నారు. అందువల్ల ప్రజలు కూడా ఇవ్వన్నీ ప్రతీ ఎన్నికల ముందు కనబడే సర్వ సాదారణ దృశ్యాలే అని సరిబెట్టుకొని వారిలోనే ఎవరికో ఒకరికి ఓటేసి వస్తుంటారు.

రెండు చోట్ల కేసీఆర్ పోటీ : అపనమ్మక ప్రభావం!

  తెలంగాణలో తెరాస అధికారంలోకి రాగలిగినంత మెజారిటీ సాధించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు ఎప్పుడూ చెబుతూనే వున్నారు. ఆ విషయం కేసీఆర్‌కి కూడా తెలుసు. ఉత్తర తెలంగాణలో తప్ప దక్షిణ తెలంగాణలో పట్టులేని తెరాస తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది కలలో మాట. ఈ విషయం కేసీఆర్‌కి కూడా తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత తన పార్టీకి మెజారిటీ రావడం సంగతి దేవుడెరుగు, అసలు ఎన్నిసీట్లు గెలుస్తామో కూడా ఊహించలేని పరిస్థికి కేసీఆర్ చేరుకున్నారు. ఇంతకాలం తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కేసీఆర్ పెంచుకున్న ఆశల మంచు చాలా వేగంగా కరిగిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కళ్ళ ముందు వాస్తవ పరిస్థితి కనిపిస్తోంది. తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్న వాస్తవ అపనమ్మకి కేసీఆర్‌లో నిండిపోయింది. అందుకే అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేయాలన్న ఆలోచనకి కార్యరూపం తీసుకొచ్చారు. గజ్వేల్ అసెంబ్లీకి, మెదక్ పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నారు. పొరపాటున, ఊహించని విధంగా, అనుకోకుండా తెరాసకి మెజారిటీ వస్తే అసెంబ్లీ సీటు ఆధారంగా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. మెజారిటీ రాకపోతే ఢిల్లీలో హడావిడి చేయడానికి ఎంపీ సీటు ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సరికొత్త రోగం : కేజ్రీవాల్ ఫోబియా

  ప్రపంచ వైద్య చరిత్రలో ఒక సరికొత్త రోగం తెరమీదకి వచ్చింది. ఆ రోగం పేరు ‘కేజ్రీవాల్ ఫోబియా’. ఇది ఒక మానసిక రోగం. మానడానికి ఎంతమాత్రం అవకాశం లేని రోగం. జనం నమ్మకాన్ని వమ్ము చేసిన రాజకీయ నాయకులకు మాత్రమే ఈ రోగం వచ్చే అవకాశం వుంది. ఈ రోగ లక్షణాలు ఎలా వుంటాయంటే, తాను జనం మధ్యలో వుండగా ఎవరో ఒక సామాన్యుడు తన ముందుకు వచ్చి చెంప చెళ్ళుమనిపిస్తాడని సదరు రాజకీయ నాయకుడు ఎప్పుడూ భయపడుతూ వుంటాడు. పైకి మాత్రం ‘నేను ప్రజాసేవకుడిని, సమస్యల పరిష్కరామే నాకు ముఖ్యం. నన్ను ఎవరు, ఎక్కడకి రమ్మన్నా వస్తా. ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి’ అని కేజ్రీవాల్ తరహాలో స్టేట్‌మెంట్లు ఇస్తూ వుంటారు. ఈ రోగం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి మొట్టమొదటిసారి వచ్చంది కాబట్టి దీనికి ‘కేజ్రీవాల్ ఫోబియా’ అని పేరు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ రోగం సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులకు వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే ఈ మూడు పార్టీల నాయకులు సీమాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రాష్ట్రం అన్యాయంగా ముక్కలయ్యేందుకు సహకరించారు. ప్రజల మనసులను గాయపరిచారు. ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో అర్థంకాకుండా వున్నారు. నమ్మకద్రోహం చేసిన తమకు ప్రజల నుంచి ‘చెంపదెబ్బ’ లాంటి సత్కారాలు జరుగుతాయేమోనని భయపడుతూ వున్నారు. ఇలా భయపడీ భయపడీ వీళ్ళకు ‘కేజ్రీవాల్ ఫోబియా’ వచ్చే అవకాశం వుంది.

కేసీఆర్‌కి కోదండరామ్ పెంపుడుకుక్కా?

      పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ మొదటి నుంచీ టీఆర్ఎస్‌కి, కేసీఆర్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలో వాస్తవాలు అందరికీ తెలుసు. దీనిమీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే వుంది. కోదండరామ్ కేవలం టీఆర్ఎస్‌కి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వుంటారని, టీఆర్ఎస్ ఆదేశాలను పాటిస్తూ వుంటారని, తెలంగాణ కోసం కృషి చేస్తున్న మిగతా పార్టీలను ఎంతమాత్రం పట్టించుకోరని అంటూ వుంటారు. ఇవన్నీ ఇలా వుంటే, కోదండరామ్ గురించి తెలుగుదేశం శాసనసభ్యుడు, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాపలా కుక్కలా వుంటానని చెప్పుకునే కోదండరామ్ కేసీఆర్ పెంపుడుకుక్కలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోదండరామ్ ఒక ప్రొఫెసర్‌లా కాకుండా పోరంబోకు లాగా మాట్లాడుతూ వుంటారని నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. కోదండరామ్ వ్యవహారశైలి టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నట్టు వుంటుందే తప్ప, పొలిటికల్ జేఏసీ ఛైర్మన్‌ స్థాయిలో వుండదని నర్సిరెడ్డి దుయ్యబట్టారు. తమకు నచ్చని పార్టీలు తెలంగాణలో వుండకూడదనే ప్రజాస్వామ్య విరుద్ధమైన ధోరణి కేసీఆర్‌లో, కోదండరామ్‌లో కనిపిస్తున్నాయని నర్సిరెడ్డి విమర్శించారు.

కేసీఆర్ నిర్వేదం!

      మీడియాతో ఎప్పుడు మాట్లాడినా బోలెడంత పౌరుషంగా మాట్లాడే కేసీఆర్ సడెన్‌గా నిర్వేదంగా, నిరాసక్తంగా, నీర్సంగా, నిస్తేజంగా మాట్లాడారు. ఆయన గొంతులో ‘ఏంటో పాడు పాలిటిక్స్’ అనే ధోరణి వినిపించింది. ఎన్ని తంటాలు పడినా, ఎంత ప్రాంతీయ విద్వేషాలు రగిల్చినా చివరికి ఎన్నికల్లో అవమానం తప్పదన్న బాధ ఆయన గొంతులో వినిపించింది.   సోమవారం ఆయన మాట్లాడుతూ, నా పని నేను చేస్తున్నాను ఇక ఫలితం ఇచ్చేది ఆ పైవాడే అన్నట్టుగా మాట్లాడారు. తెలంగాణ తెచ్చానన్న ఖ్యాతి నాకు మిగిలింది అది నాకు చాలు అనే మాట ఆయన నోట్లోంచి వచ్చినప్పుడు ఆ మాట విన్నవాళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు కలిగాయి. తెలంగాణ తెచ్చానన్న ఖ్యాతి తప్ప తనకేమీ మిగలదని కేసీఆర్ చెప్పకనే చెబుతున్నారా అనే సందేహాలు కలిగాయి. ఈ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి ‘వస్తే’ అభివృద్ధి జరుగుతుందని కూడా ఆయన అన్నారు. నిన్నటి వరకూ తెరాస అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి అయిపోతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ‘వస్తే’ అనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే కేసీఆర్ టీఆర్ఎస్ అధికారంలోకి రాదన్న విషయాన్ని ఒప్పుకుంటున్నట్టే వుందని అందరూ అనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కార్యకర్తలు వద్దంటున్నా టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నాయని అని బిక్కముఖం వేసుకుని చెప్పారు. అప్పటిగ్గానీ అసలు విషయం క్లియర్‌గా అర్థం కాలేదు. అసలే ఇప్పటికే విజయావకాశాలు అంతంతమాత్రంగానే వున్న టీఆర్ఎస్‌కి టీడీపీ, బీజేపీ కలయిక దారుణమైన నష్టం తెచ్చే అవకాశం వుంది. అందుకే కేసీఆర్ గొంతులో నిరాశ, నిర్వేదం ధ్వనించాయి.

కాంగ్రెస్ కి నిజంగానే టైమ్ దగ్గరపడిందా

  ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లు వేయడానికి ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించలేని దుస్థితిలో ఉంది. తెలంగాణాలో పార్టీకి విజయావకాశాలు కొంచెం మెరుగుగా ఉన్నందున టీ-కాంగ్రెస్ నేతలందరూ తమ బంధు మిత్ర పరివారాలకు టికెట్స్ ఇప్పించుకొనే ప్రయత్నంలో అధిష్టానంపై తెస్తున్న తీవ్ర ఒత్తిళ్ళ కారణంగా ఇప్పటికి ఇప్పటికి రెండు సార్లు అభ్యర్ధుల పేర్లను ప్రకటించబోయి ఆగిపోయింది.     ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న ఈ తరుణంలో ప్రత్యర్ధ పార్టీలు అభ్యర్ధుల జాబితాలను విడుదల చేసిన తరువాతనే తాము విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సరిగ్గా ఎన్నికల దగ్గరపడుతున్నతరుణంలో టికెట్స్ ఎరగా చూపించి ప్రత్యర్ధ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించి, ప్రత్యర్ధ పార్టీలను బలహీనపరిచేందుకే ఈ ఎత్తుగడ వేసి ఉండవచ్చును. ఇప్పటికే, తెదేపా, తెరాస, వైకాపా, బీజేపీలలో టికెట్స్ దొరకక అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి దూకేస్తున్నారు. ఇంకా చాల మంది దూకవచ్చు కూడా.   కాంగ్రెస్ పార్టీకి ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా, మొట్టికాయలు పడినా తన ఆలోచనా ధోరణిని, పద్దతులను ఎన్నడూ మార్చుకోబోదని చెప్పడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఈసారి కూడా ప్రతీసారిలాగే ప్రత్యర్ధుల కోసం త్రవ్వుతున్న గోతిలో మళ్ళీ తానే పడేందుకు రంగం సిద్దం చేసుకొంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సీమాంద్రాలో అభ్యర్ధులను వెతుకోవలసిన అవసరం ఉందేమో గానీ తెలంగాణాలో లేదు. అక్కడ అవసరమయిన వారికంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు. పైగా టీ-కాంగ్రెస్ నేతలు స్వయంగా తమ పిల్లజెల్లాకి కూడా టికెట్స్ ఇమ్మని కోరుతున్నారు. అటువంటప్పుడు ఉన్నవారికే టికెట్స్ ఇవ్వలేనప్పుడు కొత్తగా వచ్చిన వారికి ఏవిధంగా టికెట్స్ కేటాయించగలదు?అని ప్రశ్నిస్తే దానికి సమాధానం దొరకదు. ఇతర పార్టీలలో నుండి టికెట్స్ దొరకనందునే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నవారు, ఒకవేళ అక్కడ కూడా టికెట్ దొరకని పరిస్థితి ఏర్పడితే అప్పుడు వారు కాంగ్రెస్ లో కొనసాగరు కదా! ఒకవేళ కొనసాగినా అసంతృప్తితో ఉన్న వారివల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఏమిటి? అని ఆలోచిస్తే వారు ప్రత్యర్ధ పార్టీకి మద్దతు ఇవ్వకుండా అడ్డుకోనేందుకేనని భావించవలసి ఉంటుంది.   ఉదాహరణకి తెదేపా-బీజేపీ పొత్తుల కారణంగా మల్కాజ్ గిరీ టికెట్ పోగొట్టుకొన్నమెదక్ యం.యల్యే. మైనంపల్లి హన్మంత రావు తెదేపాకు గుడ్ బై చెప్పేసి ఈరోజే కాంగ్రెస్ లో చేరారు. ఆయనకి మల్కాజ్ గిరీ టికెట్ ఇచ్చేందుకు దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. బాగానే ఉంది. కానీ ఇటీవల కాంగ్రెస్ నుండి తెరాసకు వెళ్లి మళ్ళీవెనక్కి వచ్చిన ఆకుల రాజేందర్ కి కూడా మల్కాజ్ గిరి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏవిధంగా నిలబెట్టుకోగలదు? అంటే లేదనే అర్ధమవుతుంది.   అప్పుడు మళ్ళీ వారిరువురితో కలిసి పార్టీలో అక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న మిగిలిన అభ్యర్ధుల మధ్య యుద్దం మొదలయితే అంతిమంగా నష్టబోయేది కాంగ్రెస్ పార్టీయే. ఎదుటవాడివి రెండు కళ్ళు పోగొట్టాలని కాంగ్రెస్ పార్టీ, ఉన్న తన ఒక (తెలంగాణా) కన్ను పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం చాలా నవ్వు తెప్పిస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే బహుశః ఇదేనేమో!

నేరుగా లోక్ సభ బరిలోకే దిగుతున్న దినేష్

  మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఈరోజు వైకాపాలో చేరబోతున్నారు. ఆయనకు మల్కాజ్ గిరీ నుండి లోక్ సభకు టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్లు తాజా సమాచారం. ఇంతకాలం పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం వింతేమీకాకపోయినా, కోట్లు రూపాయలు పార్టీకి ఫండు, మరికొన్ని కోట్ల రూపాయలు ఎన్నికల ప్రచారం ‘ఇత్యాదులకు’ మంచి నీళ్ళలా ఖర్చు చేయాల్సిన లోక్ సభ సీటుకే పోటీ చేయాలనుకోవడం చూస్తే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు పోగేసుకొన్నారని ఇంతకాలంగా మాజీ మంత్రి శంకర్ రావు చేస్తున్నఆరోపణలలో ఎంతో కొంత నిజముందని అనుమానించవలసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఆయన ఎంతకాలం పనిచేసినా, ఆయన మిగిల్చుకొన్న డబ్బు లోక్ సభ సీటుకి పోటీ చేసేందుకు ఏమాత్రం సరిపోదని ఎవరికయినా తెలుసు. అయితే గతంలో శంకర్ రావు తనపై ఆరోపణలు చేస్తున్నపుడు ఆయన తనకు ఉద్యోగంలో చేరక ముందు నుండే చాలా ఆస్తులున్నాయని సంజాయిషీ చెప్పుకొన్నారు. అయితే తన ఆస్తుల వివరాలను మాత్రం ఎన్నడూ బయటపెట్టే ఆలోచన చేయలేదు. కానీ ఆయన ఇప్పుడు వైకాపా లోక్ సభ అభ్యర్ధిగా నామినేషన్ వేయదలిస్తే, తప్పనిసరిగా ఆ వివరాలను అందులో పేర్కొనవలసి ఉంటుంది. మరి ఒక పోలీసు అధికారిగా చేసి పదవీ విరమణ చేసిన ఆయన ఇంత భారీ మొత్తాలను వెచ్చించే శక్తి కలిగి ఉన్నారంటే ఆయన చాలా సౌండ్ పార్టీ అయినా అయ్యి ఉండాలి లేకుంటే శంకర్ రావు చెపుతున్నట్లుగా ఆయనకు జీతం కంటే గీతం ఎక్కువయినా అయ్యి ఉండాలని ప్రజలు గుసగుసలాడుకొంటున్నారు. ఏమయినప్పటికీ (సోనియాగాంధీకి గుడి కట్టినా కూడా టికెట్ దొరకని) ఆయన ‘ప్రియ శత్రువు’ శంకర్ రావుకే ఆయన గురించి నాలుగు ముక్కలు మాట్లాడే నైతిక హక్కు ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

తెదేపా-బీజేపీ పొత్తులతో ప్రత్యర్ధ పార్టీలకు భయమేలనో?

  తెదేపా-బీజేపీ ఎన్నికల పొత్తులు బెడిసికోడితే బీజేపీతో తామే పొత్తులు పెట్టుకోవచ్చని ఇంతకాలం ఆశగా ఎదురుచూసిన తెరాస, వైకాపాలు వారి పొత్తులను అనైతిక పొత్తులని ఒక్క ముక్కలో తేల్చేసాయి. తెదేపాకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, దైర్యం లేనందునే బీజేపీతో పొత్తులకి తహతహలాడిందని, కాంగ్రెస్, వైకాంగ్రెస్ పార్టీలు విమర్శించాయి. కానీ, తెదేపా కూడా తమలాగే ఒక రాజకీయ పార్టీ గనుక దానికి ఏ ఇతర పార్టీతోనయినా పొత్తులు పెట్టుకొనే అధికారం హక్కు ఉంటుందని ఏ ఒక్క పార్టీ భావించలేదు, అనలేదు. తమ పొత్తులు చారిత్రిక అవసరం అని చెప్పే పార్టీలు, తెదేపా-బీజేపీల పొత్తులను చూసి ఎందుకు అంత తీవ్రంగా దాడి చేస్తున్నాయి? అంటే, ఆ పొత్తుల వలన రెండు రాష్ట్రాలలో మారే బలాబలాలతో అవి తమపై చేయి సాధిస్తాయనే అభద్రతా భావంతోనే.   కేసీఆర్ దురాశకు పోకుండా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే, వారి కూటమి తెదేపా-బీజేపీ కూటమి కంటే చాలా బలంగా ఉండేది. కానీ కేసీఆర్ పదవీ కాంక్షతో కాంగ్రెస్ పార్టీని కాలదన్నుకొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా కేసీఆర్ ని నమ్ముకొని తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి సిద్దపడింది తప్ప తన స్వంత పార్టీ నేతలకి ఎన్నడూ ప్రాధాన్యం ఈయలేదు. ఇచ్చి ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ తెరాసను పొత్తుల కోసం ఇంతగా దేబిరించవలసిన అవసరం ఉండేదే కాదు. ఏ పొత్తులు లేకుండానే తెరాస, తెదేపా-బీజేపీ లకు గట్టి పోటీ ఇవ్వగలిగేది.   సీమాంద్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే తప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని స్వంత పార్టీలో హేమాహేమీలయిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరి రాజకీయ భవిష్యత్తుతో చెలగాటమాడుకొని వారినందరినీ దూరం చేసుకొని, ఈరోజు పార్టీలో నాయకుల కోసం వెతుకోవలసిన దుస్థితిలో ఉంది. వారే గనుక ఈరోజు పార్టీకి అండగా నిలబడి ఉండి ఉంటే, తెదేపా-బీజేపీ పొత్తులను చూసి ఇంతగా బెదిరిపోనవసరం ఉండేదే కాదు.   ఇక జగన్మోహన్ రెడ్డి నేటికీ కూడా తండ్రి (సానుభూతి, సంక్షేమ పధకాలు) పేరు చెప్పుకొని ఓట్లు కోరాల్సిన దుస్థితిలో ఉన్నారు. ఆయన తన సమయాన్ని ప్రజలలో సానుభూతిని నిలుపుకొనేందుకు వెచ్చించే బదులుగా పార్టీ నిర్మాణం కోసం వినియోగించి ఉండిఉంటే పార్టీయే ఆయనకు కొండంత బలంగా నిలిచేది. జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో కావలసినంత సానుభూతి ఉంది. పార్టీలో చాలా బలమయిన నేతలు కూడా ఉన్నారు. కానీ ఆయన ఎవరినీ లెక్కచేయకుండా తన దుందుడుకు నిర్ణయాలతో పార్టీకి శల్యసారధ్యం చేస్తున్నందునే పార్టీ ఆశించినంత బలం పుంజుకోలేకపోయింది. అందుకే అతను కూడా వారి పొత్తులు చూసి భయపడవలసి వస్తోంది.   రాష్ట్రంలో ఈ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు స్వీయ తప్పిదాల వలననే ఈరోజు తెదేపా-బీజేపీల పొత్తులు పెట్టుకోవడం చూసిభయపడవలసి వస్తోంది, లేకుంటే దాని గురించి ఆలోచించే అవసరమే ఉండేదే కాదు.

సారీ.. శ్రీకాంతాచారీ!

      తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతచారికి ఇప్పుడు తమ మనసులలో సారీ చెబుతున్నారు. అమరవీరుడిగా నిలిచిన శ్రీకాంతాచారి కుటుంబానికి టీఆర్ఎస్ చేస్తున్న అవమానాన్ని అడ్డుకోలని తమ అశక్తతను తామే నిందించుకుంటున్నారు. అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లు ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ఎన్నికలు వచ్చినవేళ ఆ ప్రస్తావనే తేలేదు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ అధినేత దగ్గరకి వెళ్ళి టిక్కెట్ అడిగితే టిక్కెట్ ఇవ్వనని ముఖంమీదే చెప్పేశాడు.   టీఆర్ఎస్ నేత అసలు స్వరూపం తెలుసుకుని బాధపడిన శంకరమ్మ నాకు టిక్కెట్ ఇవ్వకపోతే నా కొడుకులాగా నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తేగానీ టిఆర్ఎస్ టిక్కెట్ ఇస్తానని ప్రకటించలేదు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ టిక్కెట్‌ని శంకరమ్మకి ఇస్తున్నారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ ఎంతమాత్రం గెలిచే అవకాశం లేదు. ఈ సీట్ తనకు వద్దని శంకరమ్మ మొత్తుకున్నా వినకుండా తొలి జాబితాలో ఆమె పేరుని ఆ స్థానానికే ప్రకటించారు. అదేంటని శంకరమ్మ ప్రశ్నిస్తే పోటీ చేస్తే చెయ్ లేకపోతే లేదని నిర్దాక్షిణ్యంగా చెబుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న తెలంగాణ ప్రజలు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అమరవీరుల కుటుంబాల విషయంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి దారుణంగా వుందని అంటున్నారు. శ్రీకాంతాచారి చేసిన త్యాగానికి, బలిదానానికి టీఆర్ఎస్ ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.  

కాంగ్రెస్‌లో ‘1’ నేనొక్కడినే!

      దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమని ఇప్పటి వరకూ జరిగిన అన్ని సర్వేలూ చెప్పాయి. లేటెస్ట్ గా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతేనని సదరు సర్వే చెప్పింది. దేశం సంగతి అలా వుంచితే, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖతమ్ అయిపోవడం ఖాయమని, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం మాత్రమే దక్కే అవకాశం వుందని సర్వే తేల్చి చెప్పింది.   ఇదిలా వుంటే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో  పదకొండు లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో  తొలి జాబితాని ప్రకటించింది. వీళ్ళలో శ్రీకాకుళం- కిల్లి కృపారాణి, విజయనగరం- బొత్స ఝాన్సీ, కర్నూలు- కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అరకు- కిషోర్ చంద్రదేవ్, కాకినాడ- పళ్ళం రాజు, అనకాపల్లి- తోట విజయలక్ష్మి, నరసాపురం- కనుమూరి బాపిరాజు, నెల్లూరు- వాకాటి నారాయణరెడ్డి, విజయవాడ- దేవినేని అవినాష్, బాపట్ల- పనబాక లక్ష్మి, తిరుపతి- చింతా మోహన్ వున్నారు. ఎన్డీటీవీ సీమాంధ్రలో కాంగ్రెస్ ఒక్క సీటే గెలుస్తుందని ఎన్డీటీవీ చెప్పింది కాబట్టి.. ఆ గెలిచే ఒక్కడు నేనొక్కడినే అని ఈ పదకొండు మంది అభ్యర్థులు అనుకుంటూ వుండొచ్చు. మిగతా 14 మంది పేర్లను ప్రకటిస్తే వాళ్ళు కూడా గెలిచేది నేనొక్కడినే అనుకుంటారేమో! సీమాంధ్ర ప్రజలు మాత్రం ఈసారి సీమాంధ్రలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా గెలిచే ఛాన్సే లేదని అంటున్నారు.

రాష్ట్ర విభజన లోకజ్ఞానం!

      ‘‘గురువర్యా’’ ‘‘ఏంటి శిష్యా?’’ ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం చివరికి ఏమి కాబోతోంది? ఏం జరగబోతోందా అన్న టెన్షన్‌తో నేను అల్లాడిపోతున్నా. మీ దివ్యదృష్ణితో చూసి భవిష్యత్తులో జరిగేదోంటో కాలజ్ఞానం చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి’’ ‘‘ఈ విషయం చెప్పడానికి కాలజ్ఞానం ఎందుకు శిష్యా? లోకజ్ఞానం చాలు’’ ‘‘అయితే ఆ లోకజ్ఞానం ఏంటో చెప్పేయండి గురువర్యా’’ ‘‘చెప్తా విను శిష్యా.. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకే తాను అనుకూలంగా వున్నట్టు కలరింగ్ ఇస్తుంది. తెలంగాణలో పోలింగ్ పూర్తయిన తర్వాతే అసలు ట్విస్టు వుంటుంది’’ ‘‘ఏంటా ట్విస్టు గురూజీ?’’ ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదని కోర్టు చెబుతుంది. దాంతోపాటు అనేక న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాలు బయటకి వస్తాయి. అప్పుడు విభజన ప్రక్రియ సరిగా జరగలేదు కాబట్టి మళ్ళీ తెలంగాణ బిల్లును రూపొందించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, పార్లమెంట్‌లో చర్చించాలని డెసిషన్ వస్తుంది’’ ‘‘నిజంగా ఇలా జరుగుతుందంటారా గురూజీ?’’ ‘‘వేచి చూడు నాయనా’’....!  

కిషన్‌రెడ్డి అలకపాన్పు!

      రాష్ట్ర బీజేపీకి కిషన్ రెడ్డి పెద్ద గుదిబండలా తయారయ్యారు. ప్రతి సందర్భంలోనూ లేనిపోని ఇష్యూలు క్రియేట్ చేసి తలనొప్పులు సృష్టిస్తున్నారు. తెలంగాణ ఇష్యూని సాధ్యమైనంత ఎక్కువగా రాజేసీ, సుష్మా స్వరాజ్ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చేలా చేయడంలో కిషన్‌రెడ్డి పాత్ర ఎంతో వుంది. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుల ఇష్యూ జీడిపాకంలా సాగడానికి కూడా కిషన్ రెడ్డే కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పొత్తు కుదిరేదాకా వచ్చిన ప్రతిసారీ కిషన్ రెడ్డి దాన్ని చెడగొట్టడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు.   ఇదిలా వుంటే ఇప్పుడు ఆయన తాజాగా అలక సీన్ సృష్టించారు. తాను ఈసారి ఎన్నికలలో పోటీ చేయడం లేదని బాంబు పేల్చారు. అలా ఎందుకని అడిగితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ అంతటా పర్యటించాల్సి వుంటుంది కాబట్టి తాను పోటీ చేయదలచుకోవడం లేదని చెప్పారు. అయితే దీనికి వెనుక అసలు కారణం మరోటి వుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందరి చూపూ మల్కాజిగిరి లోక్‌సభ స్థానం మీదే వుంది. చాలామంది అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలని తహతహలాడుతున్నారు. ఆతహతహ కిషన్‌రెడ్డికి కూడా మొదలైంది. మొన్నటి వరకూ సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేసి దత్తాత్రేయకి జెల్ల కొట్టాలని కిషన్‌రెడ్డి  ప్రయత్నించారు. అయితే కిషన్‌రెడ్డిని అంబర్ పేట నుంచే పోటీ చేయించాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు కిషన్ రెడ్డికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకి హర్టయిన కిషన్ రెడ్డి అస్సలు పోటీయే చేయనని అలిగి కూర్చున్నారు. అలిగిన తనను బీజేపీ అగ్ర నాయకత్వం బుజ్జగించి పార్లమెంట్‌కి పోటీ చేయిస్తుందని కిషన్‌రెడ్డి ఆశిస్తున్నారని సమాచారం.