వల్లభనేని వంశీ అసంతృప్తి

        టిడిపి పార్టీ నాయకుడు వల్లభనేని వంశీమోహన్ తనకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్నటి వరకూ విజయవాడ లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న వంశీకి ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పించి, కొత్త బాధ్యతలు అప్పగించారు. తనకు ఏ పదవి అక్కర్లేదని , తాను సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన అంటున్నారు. విజయవాడ లోక్ సభ స్థానం బాధ్యతలు కేశినేనినానికి అప్పగించగా, వల్లభనేనికి ఇంకా నియోజకవర్గం ఏదీ కేటాయించినట్టు లేదు. గతంలో గన్నవరం శాసనసభ స్థానం పార్టీ టిక్కెట్ తనకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఒకవేళ ఆయన ఇవ్వకపోతే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వంశీ స్పష్టం చేశారు.

ఈ ‘దూకుడు’ లాభించేనా?

  గత కొంత కాలంగా ప్రతిపక్షాలతో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మొదట్లో పార్టీ వర్గాలు, మీడియా కూడా మెచ్చుకొన్నపటికీ అది చూసి మరి కొంచెం అతిగా వ్యవహరిస్తున్న ఆయన ధోరణిని ఇప్పుడు అదే పార్టీవర్గాలు, మీడియా కూడా తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టాయి.   ముఖ్యమంత్రిలో గణనీయమయిన ఈ మార్పు సహకార ఎన్నికల తరువాత నుండే మొదలయిందని చెప్పవచ్చును. సహకార ఎన్నికలలో పార్టీలో ఎవరూ సహకరించకపోయినప్పటికీ, ఆయన ఒంటి చేత్తో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడమే అందుకు కారణం అని చెప్పవచ్చును. ఆ తరువాత ప్రతిపక్షాలు తన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా అవలీలగా వీగిపోవడంతో ఆయన ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. కానీ, అవిశ్వాసానికి తెదేపా దూరంగా ఉనందునే తన ప్రభుత్వం నిలబడి ఉందని ఆయనకు తెలిసినప్పటికీ, తెదేపా తనపై అవిశ్వాసానికి మద్దతు ఈయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఆయన భ్రమించడమే ఆయనకు కొండంత దైర్యం ఇచ్చి ఆయన దూకుడు కొనసాగించేలా చేస్తోంది.   ఇప్పుడు ఆయన ప్రవర్తన చూస్తుంటే, కిరణ్ కుమార్ అసలు నైజం ఇదే అయినప్పటికీ, ఇంత కాలం పార్టీలో, ప్రభుత్వంలో పరిస్థితులు తనకు వ్యతిరేఖంగా ఉనందునే సాత్విక ముసుగు వేసుకోవలసి వచ్చిందేమోననిపిస్తుంది.   కొద్ది నెలల క్రితం ఇదే ముఖ్యమంత్రి రవీంద్రభారతిలో విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘ఎన్ని రోజులు పదవిలో ఉంటానో’ అంటూ వైరాగ్యం ప్రదర్శించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చే ఎన్నికల తరువాత కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగబోతునట్లు దృడంగా విశ్వసిస్తున్నట్లు కనబడుతున్నారు.   అయితే, క్రమంగా ఆయన దూకుడు అహంకారంగా మారుతుండటంతో ఇప్పుడు అన్ని వర్గాల నుండి విమర్శలు మూట కట్టుకొంటున్నారు. కొద్ది రోజుల క్రితం తెరాస నేత హరీష్ రావుకి దీటుగా సమాధానం చెబుతూ ‘తెలంగాణకు ఒక్క నయాపైసా కూడా విదిలించాను ఏమి చేసుకొంటారో చేసుకోండి’ అని ఆయన అనడం తెరాస నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.   ఆ తరువాత మొన్న శాసన సభలో ‘కాగ్ నివేదిక అంటే అదేమి బైబిలో భగవద్గీతో కాదు అందులో చెప్పినవన్నీ నిజాలని నమ్మడానికి’ అంటూ కాగ్ నివేదికలను సైతం ఆయన తప్పుపట్టారు. మళ్ళీ అదే కాగ్ చేత ఆ మరునాడే అక్షింతలు వేయించుకోవలసి వచ్చింది.   ఒకవైపు విద్యుత్ కోతలతో నీళ్ళు అందక పంటలు ఎండిపోతుంటే, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఎకరం కూడా నీళ్ళు అందక ఎండిపోలేదని ఆయన శాసనసభలో చాల గట్టిగా వాదించడం చూసిన తరువాత మేధావులు సైతం ఆయన ధోరణిని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. అదే విధంగా విద్యుత్ బిల్లులు పెరిగితే ప్రజలు తప్పనిసరిగా ఆ భారం బరించాల్సిందే అంటూ దురుసుగా మాట్లాడి ప్రజలలో కూడా తనను తానూ చులకన చేసుకొన్నారు. అందుకు ప్రతిచర్యగా ప్రతిపక్షాలు అన్నీ ధర్నాలు నిరాహార దీక్షలు చేయడం, చివరికి వారి ఒత్తిడికి తట్టుకోలేక ఆయన విద్యుత్ బిల్లుల పెంపు విషయంలో వెనక్కి తగ్గాల్సిరావడం ఇటీవల కాలంలో ‘పెరిగిన ఆయన రేటింగ్స్’ పెరిగినంత వేగంగానూ పడిపోయేలా చేసాయి.   నానాటికి అడ్డు ఆపులేకుండా పెరుగుతున్న ధరలు, విద్యుత్ కోతలు, విద్యుత్ లేకపోయినా సామాన్య ప్రజలకు షాకులు ఇస్తున్న విద్యుత్ బిల్లులు వంటి అనేక ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా, కేవలం కాంగ్రెస్ అధిష్టానం అండదండలు చూసుకొని, రాష్ట్రంలో ప్రతిపక్షాల మద్య జరుగుతున్న తీవ్రయుద్ధాలను చూసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పుడు ‘తన గాలి వీస్తోందనుకొంటే’ అంతకంటే పొరపాటు ఉండదు.   కాంగ్రెస్ పార్టీలో ఎవరి పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండదని ఆ పార్టీ చరిత్ర తెలిసిన వారెవరయినా చెప్పగలరు. ఆయన ఎంత అకస్మాత్తుగా ముఖ్యమంత్రి అయ్యారో అంతే అకస్మాతుగా దాని నుండి దింపబడినా ఆశ్చర్యం పోనవసరం లేదు. అటువంటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇంత దురుసుగా వ్యవహరించడం అంటే తానూ కూర్చొన్న కొమ్మను తానే నరుకొంటున్నట్లు అవుతుంది. ఉన్న కొద్దిపాటి సమయంలో ‘ఫలానా కిరణ్ కుమార్ అనే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఈ గొప్ప పనులు చేసారు’ అనే పేరు సంపాదించుకోగలిగితే అదే ఆయనకు శ్రీ రామరక్షగా నిలుస్తుంది తప్ప ఈ ‘దూకుడు’ మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

దీక్ష చేస్తున్న నేతలతో మాట్లాడిన చంద్రబాబు

        విద్యుత్ సమస్యలపై ఓల్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో తూ.గో జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీక్షలకు సంఘీభావంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు బాబు పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలపాలని సూచించారు.  మరోవైపు విద్యుత్ సమస్యలపై టీడీపీ పోరుబాట కొనసాగుతోంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిరవధిక దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎమ్మెల్యేల దీక్షకు మద్దతు ప్రకటించారు.

టిడిపి పవర్ దీక్ష

        పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని, అప్రకటిత విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని, వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక నిరసనదీక్షలు చేపట్టింది. మంగళవారం రాత్రి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ల లో 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. అసేంబ్లీ నుండి పాదయాత్రగా వేదిక వద్దకు చేరుకుని దీక్షలో కూర్చున్నారు. దీక్షలో రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌ రాథోడ్‌, టిడిపి శాసనసభాపక్షం విప్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, సీనియర్‌ శాసనసభ్యులు కెఇ.కృష్ణమూర్తి, అశోక్‌ గజపతిరాజు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌, జి.జయపాల్‌ యాదవ్‌, పి.మహేందర్‌రెడ్డి, కె.ఎస్‌.రత్నం, కె.దయాకర్‌రెడ్డి, డి.అనసూర్య, ఎస్‌.వెంకటవీరయ్య, డి.ఉమామహేశ్వరరావు, శ్రీరామ్‌ రాజగోపాల్‌, కె.నారాయణరెడ్డి, పి.రఘునాథరెడ్డి, సీతక్క, సత్యవతి రాథోడ్‌, రత్నం, తుమ్మల నాగేశ్వరరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, ఎల్వీ రమణ, పి.కేశవ్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, శ్రీరాం తాతయ్య, పి.పుల్లారావు, జె.ఆంజనేయులు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అన్నపూర్ణమ్మ, ఉమామాధవరెడ్డి, బి.చందర్‌రావు, కె.లలితా కుమారి, ఎం.లింగారెడ్డి, హనుమంత్‌షిండే, అబ్దుల్‌ గని, నక్క ఆనంద్‌, శివరామరాజు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, కె.శ్రీధర్‌ తదితరులు దీక్షలో కూర్చున్నారు.

మొబైల్ ఫోన్లలో వస్తున్నా మీకోసం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎల్లపుడూ ముందుడే తెలుగుదేశం పార్టీ కొంత కాలం క్రితం చంద్రబాబు పాదయాత్రను యూ-ట్యూబ్, గూగుల్ హాంగ్ అవుట్ వంటి వెబ్ సైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసి అందరి ప్రశంశలు అందుకొంది. మళ్ళీ ఇప్పుడు పార్టీ పాటలను కాలర్ ట్యూన్స్ మరియు డైయలర్ టోన్స్ గా అందజేస్తోంది. పార్టీ కార్యకర్తల, నేతల కోరిక మేరకు పార్టీ పాటలలో బాగా ఆకటుక్కొన్న 6 పాటలను, చంద్రబాబు పాదయత్ర కోసం ప్రసిద్ధ సినిమా గీత రచయితల చేత వ్రాయించిన 15 పాటలను కాలర్ ట్యూన్స్ మరియు డైయలర్ టోన్స్ గా అందజేసేందుకు రాష్ట్రంలో మొబైల్ సర్వీసులు అందజేస్తున్న ఫోన్ ఆపరేటర్లతో పార్టీ ఒప్పందం చేసుకొందని పారీ ఐటీ విభాగం అధిపతి శ్రీనివాసరావు మీడియాకు తెలియజేసారు. వీటిని పార్టీ అధికారిక వెబ్ సైటు నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.

లెఫ్ట్ నేతల దీక్ష భగ్నం, ఉద్రిక్తత

        విద్యుత్ బిల్లుల పెరుగుదల, విద్యుత్ సరఫరా సమస్యలపై గత నాలుగు రోజులుగా ఇందిరా పార్క్‌వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తున్న వామపక్ష నేతలను పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. దీక్షలో ఉన్న లెఫ్ట్ నేతలు బివి రాఘవులు, నారాయణలను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. కాగా సీపీఐ నేత నారాయణ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ తగ్గిపోవడంతో ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు తక్షణం నారాయణకు వైద్య సహాయం అందించాలని పోలీసులకు సూచించారు. దీంతో లెఫ్ట్ నేతలు నారాయణ, రాఘవులు సహా పలువురు కార్యకర్తలను బలవంగా అరెస్టు చేశారు. నేతలను గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలియవచ్చింది.

కృష్ణా జిల్లాలో ఫ్లెక్సీ పాలిట్రిక్స్

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరుకున్న సంధర్బంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో కోడాలినాని తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టడం సర్వత్రా చర్చ మొదలైంది. కొడాలి నాని జూ.ఎన్టీఆర్ కి స్నేహితుడనే విషయం అందరికీ తెలిసిందే, కానీ ఆయన ఇటీవల తెదేపా వీడి వైకాపాలో చేరిన తరువాత కూడా వారిద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని వార్తలు వచ్చాయి. వాటిని ఎన్టీఆర్ ఖండించక పోవడంతో టిడిపి నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు మరింత రాజుకొనేందుకు దోహదపడ్డాయి. ఇటీవల జూ.ఎన్టీఆర్ విజయవాడ వచ్చినప్పుడు టిడిపి పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ జెండాలు గానీ చుట్టుపక్కల ఎక్కడా కనబడక పోవడంతో బాలకృష్ణ ఆదేశాల మేరకే ఆవిధంగా జరిగిందని వర్ణిస్తూ మీడియా కూడా యదాశక్తిన నిప్పు రాజేసే ప్రయత్నం చేసింది. ఆ తరువాత బాలకృష్ణ ఆ వార్తలను ఖండించడం జరిగింది. కానీ, ఇప్పుడు కొడాలి నానితో ఎన్టీఆర్ ఉన్న బ్యానర్ ప్రత్యక్షం అవడం మళ్ళీ కలకలం రేపుతోంది. నాని అనుచరులే తమ అభిమానం చాటుకోవడానికి ఆ బ్యానర్ ఏర్పాటు చేసి ఉండవచ్చును. అలా కాని పక్షంలో టిడిపిలో ముసలం పుట్టించెందుకే కావాలని ఎవరో పనికట్టుకొని ఆ పని చేసి ఉండవచ్చును. ఈ విషయం ఇప్పటికే మీడియా దృష్టికి రావడంతో వార్తను హైలైట్ చేస్తూ విశ్లేషణలు మొదలు పెట్టేసి౦ది.

జగనన్న బోనులో ఉన్న పులి: షర్మిల

  ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర విజయవాడ ప్రకాశం బ్యారేజి మీదుగా కృష్ణ జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా స్థానిక కాళోజి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ పులి బోనులో ఉన్నప్పటికీ అది పులే అని తన సోదరుడిని బోనులో ఉన్న పులితో ఆమె పోల్చారు. ఆయన బయట ఉంటే తెదేపా, కాంగ్రెస్ పార్టీల ఆటలు సాగవు గనుక, ఆ రెండు పార్టీలు కుమ్మకయి జగన్ మోహన్ రెడ్డి ని అన్యాయంగా జైలులో ఇరికించాయని ఆమె అన్నారు. ఈ ప్రభుత్వానికి బొత్తిగా మానవత్వం అనేది కరువయిపోయిందని ఆమె విమర్శించారు.   పాదయాత్రలు చేస్తూ ప్రజల మద్య తిరుగుతున్న చంద్రబాబు ప్రజల కష్టాలు స్వయంగా చూస్తున్నపటికీ, వారిని కష్టాలు పాలు చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికే అండగా నిలబడి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆమె అన్నారు. త్వరలోనే జగనన్న విడుదలయి రాజన్న రాజ్యం తెస్తాడని ఆమె ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.   ఆమె తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిని బోనులో ఉన్న పులితో పోల్చడం కాంగ్రెస్, తెరెసా, తెదేపాలకు మరో కొత్త అస్త్రం అందించినట్లయింది. జగన్ మోహన్ రెడ్డి వంటి పులిని బోనులో ఉంచక బయటకి వదిలితే అది మరింత రెచ్చిపోయి అందరినీ తినేస్తుందని, అందువలన దానిని బోనులోనే ఉంచడమే మేలని రేపటి నుండి తెదేపా, కాంగ్రెస్ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆట పట్టించే అవకాశం ఉంది.

అక్బరుద్దీన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి

        హిందువులు, హిందూ దేవతల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ మంగళవారం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. జనార్థన్ గౌడ్ అనే న్యాయవాది ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని న్యాయవాది తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను కోర్ట్ ఎల్లుండి కి వాయిదా వేసింది. నిర్మల్, నిజామాబాద్ సభల్లో అసంధర్భగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ మీద దేశవ్యాప్తంగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

"బ్రిక్స్'' సమావేశానికి చేరుకున్న మన్మోహన్ సింగ్

  బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా)సదస్సు దక్షిణాఫ్రికాలో తొలిసారిగా జరుగుతున్నాయి. ఈ సమావేశానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, మంత్రులు చిదంబరం, ఆనంద్ శర్మ, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ లు దక్షిణాఫ్రికాలోని డర్బన్ కు చేరుకున్నారు.  భారత ప్రధాని తన నాలుగు రోజుల పర్యటనలో చైనా కొత్త అధ్యక్షుడు జీ.జిన్ పింగ్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో భారత, చైనా మధ్య సంబంధాలు పటిష్టంగా ఉంచడంపై చర్చిస్తామని తెలిపారు. అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్ బ్రిక్స్ దేశాల్లో మౌలిక సదుపాయాలూ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు సంబంధించి సద్దాస్సులో ప్రకటన చేసే అవకాశముందని, ప్రపంచ ఆర్థికాభివృద్ధి, పునరుద్దరణ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ సంస్థలను, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలను సంస్కరించే మార్గాలపై చర్చిస్తామని అన్నారు.

కేంద్రానికి మళ్ళీ తమిళ సెగ

  యుపీయే ప్రభుత్వానికి శ్రీ లంక రూపంలో దురదృష్టం ఇంకా వెంటాడుతూనే ఉంది. మొన్న కరుణానిధి పేల్చిన మద్దతు ఉపసంహరణ బాంబు దెబ్బకి యుపీయే కుప్పకూలి పోతుందని అందరూ భావించినప్పటికీ ఆపద్బాందవుల వంటి యస్పీ బీయస్పీ లు చక్రం అడ్డువేయడంతో ఇంకా నిలిచి ఉంది. ఎందరికో హ్యాండిచ్చిన తనకే డీయంకే హ్యాండిచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బాధపడకుండా తమిళ తంబిల కోరిక మేరకు ఐక్య రాజ సమితిలో శ్రీ లంకకు వ్యతిరేఖంగా ఓటేసి వచ్చి వారిని ప్రసన్నం చేసుకొందామనుకొంది. కానీ, అంతలోనే కామన్వెల్త్ దేశాల సమావేశం కూడా సరిగ్గా ఇప్పుడే వచ్చింది. అది కూడా శ్రీ లంక దేశంలోనే నిర్వహించబడతాయి గనుక యుపీయే సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఈసారి తన బద్దశత్రువయిన కరుణానిధి కంటే ముందుగానే తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత ప్రధాని మన్మోహన్ సింగుకి ఆ సమావేశాలను బహిష్కరించాలని కోరుతూ లేఖ వ్రాసారు. తద్వారా సభ్య దేశాలకు శ్రీలంక సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తుందని, అది ఆ ప్రభుత్వం పై ఒత్తిడి సృష్టించి అక్కడ నివశిస్తున్న అమాయకులయిన తమిళుల ప్రాణాలు కాపాడుతుందని ఆమె వ్రాసారు. మానవ ధర్మంగా శ్రీ లంక లోని తమిళులను కాపాడవలసిన బాద్యత ఒక్క శ్రీ లంక మీదే కాక అందరి మీద ఉంది. కానీ, ఆ దేశంతో ఉన్న వ్యాపార సంబందాలు దెబ్బతింటాయనే భయంతో భారత్ తో సహా అనేక దేశాలు వెనకడు వేస్తున్నాయి. ఇటీవలే భారత్ ఆ దేశానికి వ్యతిరేఖంగా ఐక్యరాజ సమితిలోఓటేసి వచ్చింది కనుక, ఇప్పుడు కూడా కామన్ వెల్త్ సమావేశాలను బహిష్కరించే అవకాశం ఉంది.

ఊహాగానాలకు స్పందించను ... రాజీనామాపై జైపాల్ రెడ్డి

  కేంద్ర శాస్త్రం సాంకేతిక శాఖ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి  కేంద్రం మే నెలలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై అనుకూల నిర్ణయం తీసుకోకపోతే రాజీనామా చేస్తారని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్ శ్రేణులను ప్రశ్నించగా అది వారి వ్యక్తిగత అంశమని పిసిసి ప్రధాన కార్యదర్శి, జైపాల్ బంధువు ఉద్దేమర్రి నరసింహారెడ్డి సమాధానం ఇచ్చారు. జైపాల్ రెడ్డిని రాజీనామా విషయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రత్యేక తెలంగాణాపై కేంద్రమంత్రిగా నేను ఏమీ మాట్లాడను, రాజీనామా చేస్తున్నానన్న ఊహాగానాలకు నేను స్పందించను అన్నారు.

సాయంత్రం బాబ్లీపై అఖిలపక్ష భేటి

        బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. దీంతో ఈ విషయంపై అన్ని పార్టీలతో చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సుప్రీం ఆదేశాల ప్రకారం బాబ్లీ నుంచి నీరు విడుదల చేసేందుకు స్పష్టమైన విధానాలకోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది.

అత్యాశకు పోయినందుకే జగన్ జైలుకు

  చంద్రబాబు పాదయాత్ర ముగింపు దశకు చేరుకొనే సమయానికి ఆయన గ్రామీణ ప్రజలతో ఏవిధంగా అనుసంధానం అవ్వాలోఇప్పుడు బాగా నేర్చుకొన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన ఇప్పుడు గ్రామీణులకు సులువుగా అర్ధం అయ్యేందుకు తన ప్రసంగాలలో పిట్టకధలను జోడిస్తూ తను చెప్పదలుచుకొన్నది వారి మనసులలో నాటుకొనేలా చెపుతున్నారు. నిన్న మండపేట వద్ద గల ఏడిద గ్రామంలో జగన్ మోహన్ రెడ్డి గురించి వివరిస్తూ ఆయన చెప్పిన చిన్నపిట్ట కధ గ్రామస్తులను బాగా ఆకట్టుకోంది. దురాశాపరుడయిన వ్యక్తి ఒకడు రాజుగారి వద్దకు వచ్చి తనకు కొంత భూమి ఇప్పించమని అడిగితే, అతని సంగతి కనిపెట్టిన రాజుగారు ఆ రోజు మొత్తం అతను ఎంత దూరం నడిస్తే అంత మేరా అతనికే ఇచ్చేస్తానని చెప్పడంతో, అత్యాశకు పోయినా ఆ వ్యక్తి ఆయాసపడుతూ రోజంతా తిరిగి తిరిగి చివరకి గుండె ఆగి చనిపోయాడు. అప్పుడు ఆ రాజుగారు తన భటులను పిలిచి అతనికి ఇప్పుడు కేవలం 6 అడుగుల స్థలం చాలు గనుక, అతనిని 6అడుగుల గోతిలో కప్పెట్టమని ఆజ్ఞాపించారు. ఈ కధ అంతా చెప్పి జగన్ కూడా ఆ వ్యక్తిలాగే అత్యాశకు పోయినందుకు ఇప్పుడు అతనికి చిన్న జైలు గదే మిగిలిందని చెప్పడంతో ప్రజలు నవ్వాపుకోలేక పోయారు.

ఎమ్మేల్యే దేవిరెడ్డి మనసులో మాట

        ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిచాలని కోరగా కాంగ్రెస్ పెద్దలు చెప్పినా ఆ పనిమాత్రం చేయనని అంటూ తన మనసులోని ఆలోచనను బయటపెట్టారు. నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలి అనుకుంటే నన్ను ఆపేవారు ఎవరూ లేరు. నేను అందరికీ చెప్పిన తరువాతనే ఆ పార్టీలోకి వెళతాను. రాత్రికిరాత్రే పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తారా ? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? అన్న ప్రశ్నకు నేను ఎక్కడ పోటీ చేసినా ఎలాంటి ఇబ్బందిలేదు. నేనేంటో అందరికీ తెలుసు అని అన్నారు.

హోలీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  హోలీ వస్తుందంటే పిల్లలలో చెప్పలేని ఆనందం. హోలీ రోజుల రంగు రంగుల రంగులు ఒకరిపై ఒకరు జల్లుకుంటూ, పూసుకుంటూ తెగ హడావుడి చేస్తుంటారు పిల్లలే కాదు పెద్దలు కూడా. పూర్వకాలంలో ఎండాకాలంలో వచ్చే చర్మవ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు ప్రకృతిలో దొరికే మొక్కలు, పూలతో రంగులు తయారుచేసుకునేవారు. కానీ ప్రస్తుతం అంత ఖాళీ ఎవరికుంది అందుకనే బజార్లలో దొరికే రంగులతోనే ఆనందిస్తున్నారు. మార్కెట్లలో దొరికే రంగులతో కళ్ళకు వివిధ రకాల జబ్బు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హోలీ ఆడేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం ... * చిన్న పిల్లలలను రంగులకు దూరంగా ఉంచాలి ఒకవేళ ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు వారి దగ్గర ఉండాలి. * రసాయనాలతో తయారైన రంగులు కంట్లోకి వెళితే కార్నియా దెబ్బతిని, చూపు కోల్పోయే ప్రమాదం ఉంది, రంగుల్లోని ఆమ్లాలు, క్షారాలు వెంటనే తమ ప్రభావాన్ని చూపకపోయినా రాను రాను కంటి చూపును దెబ్బతీస్తాయి. * గులాల్ లాంటి రంగులు కంట్లోకి వెళ్ళి ఇబ్బందిని కలిగిస్తాయి. * పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగించి సునేర్ ను ముఖానికి పూసుకుంటారు. అయితే సునేర్ కంట్లోకి వెళితే కంటికి వెంటనే నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువ అందుకే సునేర్ ను వాడకపోవడమే మంచిది. * రంగులు కంట్లో పడితే వెంటనే శుభ్రమైన చల్లటి నీళ్ళతో కడగాలి. * కన్ను ఎరుపుగా మరి, మంటపుడితే వెంటనే కంటి వైద్యున్ని సంప్రదించాలి.

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదిక

  ఈనెల 20వ తేదీన నాంపల్లి సిబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలు అధికారులు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఉస్మానియా వైద్యాధికారులను కోరింది. ఉస్మానియా వైద్యుల బోర్డు శ్రీలక్ష్మికి ఈనెల 30వ తేదీన అపాయింట్ మెంట్ ఇచ్చింది.  జైలు అధికారులు సిబీఐ కోర్టు 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని వైద్యుల బోర్డుకు తెలుపగా వైద్యాధికారుల బోర్డు సోమవారమే నివేదిక ఇచ్చేందుకు సిద్దమై శ్రీలక్ష్మి ఆరోగ్య సమస్యలను అడిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య పరీక్షలు చేసి, ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదని, కనీసం లేచి నిలబడే స్థితిలో కూడా లేరని, ఆమె ఎడమకాలు ఎముక జాయింట్ల వద్ద తీవ్రంగా నొప్పి ఉందని ఆ మేరకు నివేదిక సిద్ధం చేసి చంచల్ గూడ జైలు అధికారులకు అందచేసినట్లు తెలిసింది. జైలు అధికారులు శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదికను సిబీఐ కోర్టుకు సాయంత్రం సమర్పించింది. ఈ అంశంలో శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదిక పై మంగళవారం సిబీఐ కోర్టు తదుపరి ఆజ్ఞలు జారీ చేసే అవకాశం వుంది.