ఛలో అసేంబ్లీ..హై టెన్షన్

      నగరమంతా భారీ కేడ్లు పెట్టేశారు..హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఎంఎంటీఎస్ రైళ్లు ఆపేశారు. అర్ధరాత్రి నుండే రహదారులు ..ఫ్లై ఓవర్లు మూసేశారు. అడుగు అడుగునా సాయుధ పహారా. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలంగాణ వాదులను అరెస్టులు, బైండోవర్లు చేసేశారు. తెలంగాణ ఉద్యోగులు ఎట్టి పరిస్థితులలో ఉదయం 10 గంటలకు తమ తమ కార్యాలయాలకు చేరుకోవాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఛలో అసేంబ్లీకి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో దానిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవి. తెలంగాణ జిల్లాల ఎస్పీలు ప్రత్యేకంగా ఛలో అసేంబ్లీకి అనుమతి లేదు..ఎవరూ వెళ్లవద్దు అని గోడపత్రికలు ముద్రించి అంటించారు. ఎట్టి పరిస్థితుల్లోను ఛలో అసేంబ్లీ జరిపి తీరుతామని తెలంగాణ వాదులు చెబుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏ మలుపు తిరుగుతుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది.

జైల్లో జగన్ పరిపాలన సాగుతోందా?

  ఒక వైపు క్రింద నుండి పైవరకు అన్ని కోర్టులు కూడా జగన్ కి బెయిలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ అయన పట్ల కటువుగా వ్యవహరిస్తున్నపటికీ, ఆ విషయాన్ని మరుగుపరిచి, తెదేపా కాంగ్రెస్ పార్టీలు రెండూ కుమ్మకై జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో నిర్బందించాయని వైకాపా నేతలు షర్మిల, విజయమ్మ తదితరులు ప్రజలకి నమ్మబలుకుతున్నారు. అయితే, అదే సమయంలో ‘పులి బయట ఉన్నాలోపల ఉన్నా పులి పులే!’ అని షర్మిల చెపుతున్నట్లుగానే జైల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించడం మరో విశేషం. తను జైల్లో ఉన్నా బయట ఉన్నాతన వ్యవహారాలు మాత్రం సజావుగా సాగిపోతాయని ఆయన చెప్పడమే కాకుండా దానిని ఆచరణలో అమలుపరచి కూడా చూపుతున్నారు.   ఆయన జైలునే పార్టీ కార్యాలయంలా మార్చేసుకొని కులాసాగా వ్యహారాలు చక్కబెట్టుకొంటున్నారని సాక్షాత్ అధికార పార్టీ నేతలయిన, ఆనం రామినారాయణ రెడ్డి, వీ.హనుమంత రావు వంటి వారే స్పష్టంగా చెప్పడం అందుకు ఋజువు అయితే, జైలులో నిబందనలు ఉల్లంఘనలు జరుగుతున్నట్లు జైళ్ళ శాఖ తెలుగుదేశం పార్టీకి స్వయంగా ఇచ్చిన నివేదిక చాటిచెపుతోంది. అయినప్పటికీ, వైకాపా తన ఆరోపణలను మానుకోలేదు. ప్రభుత్వం కూడా జగన్ విషయంలో చూసి చూడనట్లు ప్రవర్తిస్తోంది.   చంద్రబాబో, కిరణ్ కుమార్ రెడ్డో ఒకవేళ అరెస్ట్ అయితే నిబందనల ప్రకారమే విజిటర్స్ ని కలుస్తారా? అంటూ నిబంధనల ఉల్లంఘనలు సహజమనట్లు జగన్ భార్య భారతి ఎదురు ప్రశ్నించడం చూస్తే చంచల్ గూడా జైల్లో ఏమి జరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఇటువంటి నేపద్యంలో కూడా జైళ్ళశాఖ అధికారులు చంచల్ గూడా జైలులో నిబంధనలకి విరుద్ధంగా ఏమీ జరగట్లేదని బుకాయించడం విశేషం.   ఏమయినప్పటికీ, ఇదంతా చూస్తే జగన్ మోహన్ రెడ్డి జైలులో సిబ్బందిని నయాన్నో భయన్నో లొంగ దీసుకొన్నాడనేది మాత్రం స్పష్టం అవుతోంది. 2జి.స్కాములో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఏడాది పైగా గడిపిన ఏయస్.రాజా కానీ, కనిమోలి గానీ ఇతర రాజకీయకులు గానీ ఎన్నడూ ఈ విధమయిన దుర్వినియోగానికి పాల్పడినట్లు వార్తలు రాలేదు. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రం జైలు నుండే తన వ్యాపార మరియు పార్టీ కార్యక్రమాలన్నిటినీ కూడా నిర్వహించుకోగలగడం విశేషం.   ఆయనను కలవడానికి వచ్చే రాజకీయ నాయకులు కూడా జైలు బయటే ప్రెస్ మీట్ పెట్టేయడం చూసినట్లయితే, జగన్ విషయంలో ఎటువంటి నిబంధనలు వర్తించవని అర్ధం అవుతుంది. అయినప్పటికీ, తాము తప్ప మిగిలిన వారందరు కూడా అవినీతిపరులేనన్నట్లు జగన్ సోదరి షర్మిల, విజయమ్మలు ఎదురు దాడి చేయడం చూస్తే, ఒక అబద్దాన్ని కూడా పదేపదే దృడంగా ప్రచారం చేసుకోగలిగితే అబద్దం కూడా నిజమయిపోతుందని వారు నిరూపిస్తున్నారు.   మరి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మారనున్నరాజకీయ సమీకరణలతో రేపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వైకాపా తరపున వకాల్తా తీసుకొని జగన్ కూడా నిర్దోషని ప్రజలకి నచ్చజెప్పుతారేమో చూడాలి మరి.  

ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరిక

      శాంతియుతంగా తాము ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినా అనుమతి ఇవ్వకుండా, భారీగా పోలీసులను మోహరించి, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ముందస్తుగా తెలంగాణవాదులను అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తోందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా తాము తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిర్వహించి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు, ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన పార్టీలు రేపు ఇందిరా పార్క్ వద్దకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక వేళ పోలీసులు అడ్డుకుని నిర్భంధిస్తే ఎక్కడివాళ్లు అక్కడే నిరసన తెలియజేయాలని, శాంతియుతంగా జరగాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడవద్దని కోదండరాం విజ్ఞప్తి చేశారు. న్యాయంగా, చట్టపరంగా ఛలో అసెంబ్లీని నిర్వహిస్తామని చెప్పినా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని కోదండరాం తప్పుబట్టారు. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎవరు తెలంగాణకు వచ్చినా అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఒకే వేళ అనుకోని సంఘటనలు జరిగితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే బాధ్యత వహించాలని చెప్పారు.

మోడీ 'తంథాన' పలికితే..భారతానికి విషమ ఘడియలే!

      ఏమీ తెలియనట్టు, ఇంతకుముందెలాంటి ఘోరకలికి తాను కారణం కాదని బుకాయించజూచే వాడికి నటించేవాడికి మనపెద్దలు "నంగనాచి తుంగబుర్ర'' అని ఎద్దేవా చేసేవారు! ఇప్పుడు అలాంటి పరిణామం "హిందుత్వ'' పేరిట మతరాజకీయాలు నడుపుతున్న భారతీయ జనతా పార్టీ మూలంగా ఏర్పడింది. నిజానికి అది "హైందవం'' అనేది అసలైన సిసలైన లోకికభారతం, అదే "ఆది బౌద్ధం''. కులాతీత, మతాతీత వృత్తి సమాజాన్ని బౌద్ధధర్మం నిర్మించింది. దాన్ని చెడకొట్టి వృత్తులమీద, శ్రమజీవనంమీద ఆధారపడి బతికే వృత్తి సమాజాన్ని కాస్తా దెబ్బతీసి సమాజంలోని ఛాందస వర్గం సోమరిపోతులను, దోపిడీ వర్గాన్ని పెంచే మతరాజకీయానికి ప్రాణం పోసింది. ఆ సంప్రదాయ ఛాయల్లో స్వాతంత్ర్యానికి ముందూ, ఆ తరువాతా ఎదిగివచ్చిన ఛాందసవర్గానికి "హిందూ మహాసభ'' పేరిట కొన్నాళ్ళూ, 'జనసంఘ్' పేరిట మరికొన్నాళ్ళూ, 'రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్' ముసుగులో ఇంకొన్నాళ్ళు పెరుగుతూ వచ్చిన మతశక్తులకు ఎమర్జెన్సీ కాలంలో ఏర్పడిన "జనతాపార్టీ''లోకి దూరి, మత రాజకీయాలకు కానరాని ప్రతినిధిగా అవతరించిందే "భారతీయ జనతా పార్టీ''. దానికి పొట్టిపేరు బి.జె.పి. జనతాపార్టీ ప్రభుత్వంలో దూరడం ద్వారా కొన్నాళ్ళ పాటు మతరాజకీయాన్ని పెట్టెలో దాచి, జనతా ప్రభుత్వం కూలిపోయిన తరువాత తిరిగి మతరంగంలో ["హిందూత్వ''] జనంలో ప్రవేశించింది. ఎమర్జెన్సీ దుష్టపాలనకు నిలువెత్తు చిహ్నంగా మిగిలిపోయిన ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం జనరల్ ఎన్నికల్లో కుప్ప కూలిపోవటంతో హిందూత్వశక్తులు జనతా ప్రభుత్వంలో పాగావేశాయి.   ఆదినుంచీ ఈ శక్తులకు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చింది. ఆర్.ఎస్.ఎస్. సంస్థ. ఈ సంస్థలో ప్రధాన కార్యకర్త అయిన నాధోరామ్ గాడ్సే జాతిపిత గాంధీజీని ప్రార్థనా సమయంలో దారుణంగా హత్య చేసినవాడు. గాంధీ హత్యతో దేశం అట్టుడికి పోతున్న సమయంలో ఆర్.ఎస్.ఎస్. కార్యాలయాలపైన ప్రజలు తిరగబడుతున్న సమయంలో గాంధీ హత్యలతో తనకెలాంటి 'సంబంధంలేద'ని గాడ్సే ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త కాదనీ బుకాయించడానికి ఆర్.ఎస్.ఎస్. నాయకత్వం ప్రయత్నించి విఫలమవడం, గాడ్సే తమ్ముడు తన సోడరుడే గాంధీజీని హత్య చేసినవాడని అతను ఆర్,ఎస్,ఎస్, క్రియాశీల కార్యకర్త అని తరువాత వాంగ్మూలం యివ్వడం చేరపరాని చరిత్ర. ఈ చరిత్ర పూర్వరంగంనుంచి వచ్చిన వాడే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ! ఆ మాటకొస్తే బి.జె.పి. రాజకీయాలను మతరాజకీయాలుగా మలిచి, పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ దేశంలో అమలు జరిపిస్తున్నది ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంస్థలే.   ఈ తానులోని 'ముక్క' అయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్ లో 2000 మంది ముస్లీం మైనారటీల ఊచకోతకు కారణం అయి, దేశ లౌకిక (సెక్యులర్) ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికే ప్రమాదంగా పరిణమించడం దేశప్రజలకు తెలుసు; అలాంటి మోడీని రేపు 2014 నాటి జనరల్ ఎన్నికలలో నరేంద్రమోడీని బిజెపి జాతీయ ప్రచారక్ సంఘ్ సారధిగా, అదే ఆర్.ఎస్.ఎస్. తానులో మరో ముక్కగా అవతరించిన బిజెపి అధ్యక్షుడుగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ తన నిర్ణయంగా గోవాలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకపక్షంగా ప్రకటించాడు. దాంతో బిజెపి శ్రేణుల్లో, నాయకుల్లో ముసలం పుట్టింది. ఇందుకు బిజెపి అగ్రనాయకుడు, ప్రధానమంత్రి పదవి తానింతవరకు నిర్వహించలేదన్న దిగులుతో ఉన్న లాల్ కిషన్ అద్వానీ కోపంతో గోవా సమావేశానికి గ్రైర్ హాజరై ఇంటివద్ద కూర్చున్నాడు. అయితే ఈ 'అలకపాన్పు' మానడానికి ఆయనకు రెండురోజులు కూడా పట్టలేదు. ఏడాదిలోగా జనరల్ ఎన్నికలు జరుగనుండగా బిజెపిలో ముసలం వల్ల కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం లేదా పాత ఎన్.డి.ఎ. పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం కష్టమని భావించిన బిజెపి అగ్రశ్రేణి నాయకులంతా పునరాలోచన చేసుకుని అద్వానీపై వత్తిడి తెచ్చి, ఆయన అన్ని పార్టీ పదవులకు యిచ్చిన రాజీనామానుంచి వెనక్కి తగ్గెట్టు చేయగలిగారు! కాని, ఇలా వెనక్కి తగ్గడానికి మూడ్ను చేసిన ఒక ప్రకటనలో అద్వానీ "పార్టీలో కొందరు పదవీకాంక్షతో తీసుకుంటున్నందువల్లనే పార్టీ పక్కతోవలు పడుతోంద''ని విమర్శించారు. నిజానికి "ప్రధానమంత్రి'' పదవిని తాను అనుభవించలేదన్న 'గుర్రు' అద్వానీలో కూడా చాలాకాలంగా గూడుకట్టుకుని ఉండిపోయిందని మరవరాదు! అయితే అదే తపనలో ఉన్న నరేంద్రమోడీ గుజరాత్ లో తన ప్రభుత్వం చేసిన మానవమారణకాండ తాలూకు కేసులనుంచి తప్పించుకుపోవాలన్న కోర్కె బలీయంగా తనలో పీడిస్తున్నందున బిజెపిలోని ఆర్.ఎస్.ఎస్. ముఠాను కూడగట్టుకుని దేశ ప్రధానమంత్రి పదవివైపు మోరలు చాచాడు. అతని కోర్కెను రాజ్ నాథ్ సింగ్ రానున్న ఎన్నికల్లో బిజెపిని తిరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన వాతావరణాన్ని సమీకరించగల శక్తి మోడీకి ఉందని భావించి, పార్టీ ప్రచార సంఘానికి సారథిగా చేశాడు. అయితే రాజ్ నాథ్ సింగ్ నిర్ణయం తప్పని బిజెపి సీనియర్ నాయకులు కొందరు భావించడానికి కారణం ఉంది. నరేంద్ర మోడీ మతతత్వ రాజకీయాన్ని మానవమారణకాండకు ఆయుధంగా మార్చినందువల్ల, ఇప్పటికి గుజరాత్ వరకే పరిమితమై ఉన్న మత దురహంకార రాజకీయం రేపు అతను ప్రధాని అయ్యే పక్షంలో దేశాన్ని అల్లకల్లోలంలోకి నెట్టే ప్రమాదం లేకపోలేదని లోలోన భయ సందేహాలున్నాయి. మత దురహంకారానికి సరిహద్దులుండవన్న నిజాన్ని జర్మనీలో, అబిసేనియా (ఇటలీ)లో హిట్లర్, ముస్సోలినీలు నిరూపించడం ఒక చారిత్రిక సత్యం. ఆ హిట్లర్ "ఆర్య జాతి'' రక్తం ఏ జాతికన్నా కూడా పవిత్రమైనదన్న నమ్మకం మీదనే జర్మనీలో యూదుల్ని లక్షల సంఖ్యలో కాల్చి చంపాడు, గ్యాస్ ఛాంబర్లలో బంధించి చంపాడు. ఆ హిట్లర్ ఆరాధకులే భారతదేశంలోని హిందూ మహా సభ, విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్. వర్గీయులని మరచిపోరాదు! ఈ 'హిట్లర్ ఆరాధన' పూర్వరంగాన్ని ఏయే భారత ప్రతినిధులు హిట్లర్ నాజీ పార్టీతో ఒకనాడు కలిసి వచ్చారో ప్రసిద్ధ పరిశోధకుడు జెఫ్రలాట్ భారతదేశంలో 'హిందూత్వ'' ముఠా పుట్టుపూర్వోత్తరాలను వెల్లడిస్తూ రాశాడు!   ఎందుకంటే, అయోధ్యలో తప్పుడు భావాల మీద ఆధారపడి బాబ్రీ మసీదును కూలగొట్టిన 'హిందుత్వ' ముఠా, గుజరాత్ లో మైనారిటీళ ఊచకోతకు వెనుకాడని మతశక్తులు రేపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రత్యామ్నాయం తామేనని భావిస్తున్నందువల్ల భారతదేశ లౌకిక వ్యవస్థను "కుమ్మరి పురుగుల్లా'' తొలుచుకుంటూ వెళ్ళి గుజరాత్ ఘటనలను జాతీయస్థాయిలో పునరావృత్తం చేయరన్న గ్యారెంటీ లేదు, ఆ భరోసాను ఎంతటి శాంతికాముకుడూ, మరెంతటి ప్రజాస్వామ్యవాదీ కూడా యివ్వలేరు. కనుకనే రాజ్యాంగబద్ధమైన లౌకిక, ప్రజాతంత్ర సమసమాజ వ్యవస్థాభిలాషులంతా ఇనుమడించిన చైతన్యంతో మతశక్తుల రేపటి ఎజెండాను ఈ రోజు నుంచీ, ఈ క్షణం నుంచీ మిలిటెన్సీతో ఎదుర్కొని లౌకిక సమైక్య భారత వ్యవస్థను, విభిన్నజాతులు, మతధర్మాలు, భిన్నభాషలతో దీపించె భారతదేశాన్ని వేయికళ్ళతో కాపాడుకోవలసిన అవసరం ఉంది. ప్రమత్తత ప్రాణం తీస్తూంది, అప్రమత్తత ప్రాణం పోస్తూంది! కనుకనే 'మోడీ' తపనను తుంచివేయాలి గాని 'తంథాన' పలకరాదు!    

స్పీకర్ పై మండిపడ్డ చంద్రబాబు

      టి.డి.పి. అదినేత చంద్రబాబు నాయుడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై తీవ్ర విమర్శలు చేసారు. టి.డి.పి.కి జరిగిన అవమానం పై చంద్రబాబు మాట్లాడుతూ...స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారు. సభలోకి మీడియాకు మరియు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక నియంతలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుక్క తోక అని విపక్షాలను తిడితే, కనీసం క్షమాపణలు కూడా చెప్పించకుండా స్పీకర్ విదిచిపెట్టేసాడని ఆయన అన్నారు. ఈ విధంగా ప్రవర్తిస్తున్న స్పీకర్ పై అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెడతామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

మమత ఫెడరల్ ఫ్రంట్ లోకి టిడిపి

      పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ లో మేము కూడా ఒక భాగంగా ఉంటామని టి.డి.పి. అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో చేరే విషయంపై చంద్రబాబు మాట్లాడుతూ... మమత బెనర్జీ ఎప్పటికప్పుడు తనతో మాట్లాడుతున్నారని, అదే విధంగా ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా తనతో టచ్ లో ఉంటున్నారని, త్వరలోనే ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతామని చంద్రబాబు అన్నారు. బి.జె.పి. నేతృత్వంలోని ఎన్.డి.ఎ. సరిగ్గా నిలబడట్లేదని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యు.పి.ఎ. ప్రజల మద్దతు కోల్పోయిందని, కేవలం ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇదిలా ఉంటే... ఫెడరల్ ఫ్రంట్ పై వ్యతిరేకతను చూపుతున్న సి.పి.ఎం.కు, మమతకు ఉప్పు-నిప్పుగా ఉంది పరిస్థితి. మరి చంద్రబాబు ఇక్కడి వామపక్ష పార్టీలతో సంబంధాలు తెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఉస్మానియా వద్ద ఉద్రిక్తత పరిస్థితులు

        ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఛలో అసేంబ్లీకి అనుమతి కోరుతూ ఉస్మానియా విద్యార్థులు ర్యాలీగా వస్తుండగా ఎన్ సీసీ గేటువద్ద పోలీసులు వారిని అడ్డుకుని లాఠీఛార్జ్ చేసి భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో విద్యార్థులు తిరగబడి రాళ్లదాడికి దిగారు. అక్కడి పరిస్థితిని చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా లైవ్ వాహనాల కేబుల్ ను పోలీసులు కత్తిరించారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న కూడా ఆందోళనకు దిగిన తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థుల మీద కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేసి భాష్పవాయివు ప్రయోగించారు. ఈ రోజు పోలీసుల కళ్లుగప్పి సిటీ బస్ లో అసేంబ్లీ వద్దకు చేరుకున్న ఉస్మానియా విద్యార్థులు అసేంబ్లీ 2 వ గేటు నుండి లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. మరో వైపు తెలంగాణ ప్రాంతంలో అక్రమ నిర్భంధాలను నిలిపివేయాలని కోరుతూ సాయంత్రం 4:30 నిమిషాలకు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌ను కలవనున్నారు. అరెస్టుల విషయమై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.

'బొగ్గు'మంటున్న దాసరి !

        "బొబ్బిలిపులి"తో దాసరి నారాయణరావుకు ప్రత్యేకమైన అనుబంధముంది. ఆ పేరుతో ఎన్టీఆర్‌తో ఓ సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన దాసరి.. ఆ తర్వాత "బొబ్బిలిపులి" పేరుతో ఓ రాజకీయ వార్త పత్రికను ప్రారంభించి కొన్నళ్లు నడిపారు. అందుకే "బొగ్గు" కుంభకోణంకు సంబంధించి.. దాసరిపై సి.బి.ఐ దాడులు నిర్వహించింది మొదలు.. దాసరిని "బుగ్గుల పులి" అమ్టూ సంబోధిస్తున్నారు. పత్రికల్లో "బొగ్గుల పులి" అనే పతాక శీర్షిక (మెయిన్ హెడ్‌లైన్)తో వార్తలు వెలువడ్డాయి. దీనిపై దాసరి భగ్గుమంటున్నారు. "ఇదంతా ఓ కుట్ర" అని కొట్టిపారేస్తున్నారు. తాను "బొబ్బిలిపులి"నే తప్ప "బొగ్గుల పులి"ని కాదంటూ ఎక్కలేని సత్తువను తెచ్చుకుని తెగ గాండ్రిస్తున్నారు. దేశంలోని అతి పెద్ద కుంభకోణంలో ఒకటిగా భావించబడుతున్న బొగ్గు కుంభకోణం నుంచి దాసరి ఏ విధంగా బయటపడతాడో వేచి చూడాల్సిందే!

ఈపాపం ఎవరిది ?

....సాయి లక్ష్మీ మద్దాల       శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు ప్రజలకు అసహ్యాన్ని కలుగచేస్తోంది. గత 4సం॥ లుగా ఒక్క సమావేశం కూడా సజావుగా సాగలేదు అంటే దీనికి కారణం ఏమిటి?ప్రజాసమస్యలపై చర్చించే ధైర్యం అటు అధికార పక్షానికి గాని ఇటు ప్రతిపక్షాలకు గాని లేవనే అనుకోవాలా?ఈపాపమెవరిది    అసెంబ్లీలో కొనసాగుతున్న వాయిదాల పర్వం ..... నిరసనలు,వాగ్వివాదాలతో దద్దరిల్లుతున్న సభ. వాద... ప్రతివాదాలకే ఆవిరవుతున్న సభాసమయం. ఎవరి స్కెచ్ వారిదే, ఎవరి మైండ్ గేమ్ వారిదే. సభను అడ్డుకోవటంలో ఎవరికీ తీసిపోనట్లుగా ఒకరితో ఒకరు చాలా ధీటుగా తె. దే.పా ..... టి. ఆర్. ఎస్ పోటీ పడుతున్నాయి.              రాష్ట్రంలో ప్రజాసమస్యలు చాలాఉన్నాయి. ఆసమస్యలతో ప్రజలు నిత్యంనరకం అనుభవిస్తున్నారు. విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు,అదుపులేని విద్యుత్ చార్జీలు,మోత మోగిస్తున్న బడి ఫీజులు,స్కూళ్ళు తెరిచినా అందుబాటులోకి రాని పాఠ్యపుస్తకాలు,రైతుల విత్తనాల సమస్య,వర్షాలకారణంగా ప్రబలె అంటువ్యాధుల సమస్య,రహదారుల సమస్య ,శాంతిభద్రతల సమస్య....... ఇలా చెప్పుకుంటూ పోతే పేద ,మధ్యతరగతి ప్రజల సమస్యలు అన్ని ఇన్ని కావు.                ఎవరికీ ప్రజాసస్యలపై చర్చించే ఆలోచన లేదు. ఎవరికీ వారే తప్పు మీదంటే మీదని దుమ్మెత్తి పోసుకుంటూ సభాసమయాన్ని,ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తూ తనకేమీ పట్టనట్లుగా ముఖ్యమంత్రి కాలం గడిపేస్తున్నారు. ఈ రకమైన సహనాన్ని స్వపక్షంలోని సీనియర్ నేతలే వ్యతిరేకిస్తున్నారు. స్పీకర్ వైనం మరీ ఘోరం. ఎవరిని ఆదేశించలేరు,ఆగ్ఘ్నాపించ లేరు. మాటకు ముందు సభను వాయిదా వేయటం తప్ప.                  నేతల తీరు చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. సభలో వీరంగమాడతారు,మీడియా ముందుకు వచ్చి హీరోలా ఛాలెంజింగ్ డైలాగులు కొడతారు. ప్రతి ఒక్క పార్టీ నేతలు మాటకుముందు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్ళటం,అక్కడే బైఠాయించటం తదనుగుణంగా స్పీకర్ సభను వాయిదా వేయటం . మిగతా పార్టీల దారిలోనే  వై.యస్. ఆర్. సి. పి వెళ్తోంది. పాదయాత్రాలలో ప్రగల్భాలు పలకటం వరకే వారు చేసేది ,శాసనసభలో ప్రజాసమస్యలపై పోరాడాలనే ధ్యాస వారికి ఉండదు. ఒకపార్టీ వారు ఒకసమస్యను లేవనెత్తితే,మరోపార్టీవారు ఆ సమస్య మీహయంలో ఇంత ఘోరం అంటే మీహయాములో ఇంత ఘోరం అంటూ తాతల వరకు వెళ్లి పోట్లాడుకుంటున్నారు.                    జరుగుతున్న విధానంలో ప్రతిపక్షాల తీరు మరీ విడ్డురంగా ఉంది. ఈ రకమైన గొడవల కారణంగా అధికార పార్టీని ప్రజల యొక్క వివిధ సమస్యల పై ఎందుకు నిలదీయరు? ఈ నిలదీసే ప్రయత్నంలో అన్ని ప్రతిపక్షాలు ఒక్క తాటిమీదకు ఎందుకు రారు?ఈరకంగా సభ పదేపదే వాయిదా పడటం కారణంగా అధికార పక్షం సమస్యలనుండి తప్పించుకోవటానికి మార్గం సుగమం అవుతుందనే విషయాన్ని ప్రతిపక్షాలు గమనించటంలేదా?సభకు పదేపదే అడ్డుపడుతున్న వారిపై తగు రీతిలో చర్యలు తీసుకోవాలని,వీలైతే వారిని సభనుండి బయటకు పంపించి ప్రజాసమస్యలను పరిష్కరించాలనే కనీసపు భాద్యత మన ముఖ్యమంత్రికి లేక పోవటం ఏమిటి?దీనిని బట్టి అటు అధికార పక్షానికి గాని ఇటు ప్రతిపక్షానికిగాని సభ సవ్యంగా జరగి,ప్రజాసమస్యలు చర్చకు రావాలని కోరుకోవటం లేదని ప్రజలకు అర్ధం అవుతోంది.  

చంద్రబాబుకి జేడీ లక్ష్మి నారాయణ క్లీన్ చిట్

  సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్రంలో తన పదవీ కాలం ముగియడంతో మహారాష్ట్రలోని తన స్వంత క్యాడర్ కు మొన్న తిరిగి వెళ్ళిపోయారు. వెళిపోయే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ కేసుల గురించి కొంత వివరణ ఇచ్చారు.   జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ దాదాపు ముగింపుకు చేరుకొందని, అందువల్ల తన బదిలీవల్ల దానిపై ఎటువంటి ప్రభావం పడబోదని విచారణకు కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడదని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ కేసును ఎవరు చేప్పటినా కూడా విచారణ త్వరలోనే ముగిసిపోవచ్చునని ఆయన అన్నారు.   చెన్నై కి చెందిన అరుణాచలం అనే సీబీఐ అధికారికి ఈ బాధ్యతలు అదనంగా అప్పగించబడ్డాయి. ఆయన గనుక ఇంతవరకు ఈ కేసులపై విచారణ చేస్తున్న రాష్ట్ర సీబీఐ అధికారులకు పూర్తి స్వేచ్చనిస్తే, త్వరలో దర్యాప్తు ముగిసి జగన్ కేసుల్లో తుది చార్జ్ షీట్స్ దాఖలయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, జగన్ త్వరలో బెయిలు పొందే అవకాశం కూడా ఉండవచ్చును.   ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తానూ చంద్రబాబును ఉపేక్షిస్తున్నానని వైయస్సార్ కాంగ్రెస్ నేతల చేస్తున్న విమర్శలకు బదులిస్తూ, ఈవిషయంలో చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడినట్లు ప్రాధమిక ఆధారాలు లేనందునే ఆయనపై విచారణ మొదలుపెట్టలేదని, ఆయన హయంలో ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం మొదలయినపట్టికీ, దానిని ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి మాత్రం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డేనని ఆయన స్పష్టం చేసారు.   లక్ష్మి నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకి కొండంత బలం ఇవ్వగా, వైకాపా నేతలకి ఇబ్బందికరంగా మారనుంది. ఇంతవరకు, ఆ పార్టీ నేతలు ఈ వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నఆరోపణలు లక్ష్మి నారాయణ వ్యాక్యాలతో తప్పని ఋజువు అవడమే కాకుండా, తిరిగి మళ్ళీ అవి వైకాపా మెడకే చుట్టుకొన్నాయిప్పుడు. అయితే, జగన్ అమాయకుడని బలంగా వాదిస్తున్న ఆ పార్టీ నేతలు లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను కూడా తీవ్రం ఖండించి, చంద్రబాబు విషయంలో తమ పాత పాటే అందుకొనే అవకాశం ఉంది.

టి నాయకులపై నోరు జారిన కిరణ్

      ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్వపక్షం నుండే విమర్శలు వచ్చాయి. తాజాగా శాసనసభ సమావేశాల నేపథ్యంలో నీలం తుఫాను బాధిత రైతులకు, వడగండ్ల మూలంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అసేంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ ఎదుట బైఠాయించారు. దీంతో అటుగా వచ్చిన ముఖ్యమంత్రి “నాటకాలు ఆపి ఛాంబర్ లోపలకు వస్తే మాట్లాడదాం” అని అన్నారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ రైతుల సమస్యల గురించి మాట్లాడితే డ్రామాలని అవమానిస్తారా ..వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అసేంబ్లీలో హరీష్ రావును ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడితే ఒక్క పైసా కూడా ఇవ్వను ..ఏం చేసుకుంటారో ? ఏం రాసుకుంటారో ? చేసుకోండి అని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు.

ఓయులో ఉద్రిక్తత

      తెలంగాణ రాజకీయ జేఏసీ ఛలో అసేంబ్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో దానికి మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయలయంలో విద్యార్థులు ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు ర్యాలీగా వస్తుండగా ఎన్ సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని విద్యార్థులు చెప్పినా పోలీసులు వినకపోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదాలు జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లాఠీ ఛార్జ్, బాష్పవాయువు ప్రయోగాలతో ఉస్మానియా అట్టుడుకుతోంది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్రమ అరెస్టులు, బైండోవర్లకు ఎట్టి పరిస్థితులలోనూ భయపడం అని, ఖచ్చితంగా ఛలో అసేంబ్లీ జరుగుతుందని విద్యార్థి నేతలు అంటున్నారు.

నేను బొబ్బిలి పులినే..దాసరి

        మాజీ కేంద్ర బొగ్గు సహాయమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణవు ను బొగ్గు కుంభకోణంలో సిబిఐ ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పేర్కొన్నడం పై స్పందించారు. 'ఒక పథకం ప్రకారం నా మీద అసత్య ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయి. అంతవరకూ ఆందోళన చెందకుండా అభిమానులు ఓపిక పట్టాలి. నేను ఎప్పటికీ బొబ్బిలిపులినే' అని అన్నారు. దాసరిని ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పేర్కొన్న సీబీఐ జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి లాభం చేకూరేలా చేశారని, ఆయన చేసిన మేలుకు ప్రతిఫలంగా ఆయనకు చెందిన సౌజన్య మీడియాలోకి రూ.2.5 కోట్లు పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీ నుండి వచ్చిన సీబీఐ అధికారులు దాసరి నివాసంలో, సిరి మీడియా, సౌజన్య మీడియా కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు.

వచ్చే ఎన్నికల్లో కిరణ్ పోటి చేయరు!

        మాజీ మంత్రి డి.ఎల్.రవీంద్ర రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై విమర్శల ఘాటును పెంచారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై ఆగ్రహంతో ఉన్న డి.ఎల్. ముఖ్యమంత్రి పై విరుచుకుపడుతున్నారు. కిరణ్ బ్రదర్స్ జైలు కు వెళ్ళే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్న విషయం ముఖ్యమంత్రికి తెలుసునని, అందువల్ల ఆయన ఎన్నికల్లో పోటిచేయకపోవచ్చునని రవీంద్రరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పదివి నుంచి కిరణ్ దీగిపోయాక అమెరికా వెళ్లి స్థిరపడాలని అనుకుంటున్నారని కూడా రవీంద్ర రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని కిరణ్ సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మజ్లిస్ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కిరణ్ సోదరులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారని, అదే నిజమనిపిస్తోందన్నారు.

సొంత రాష్ట్రానికి సీబీఐ లక్ష్మినారాయణ

      సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మహారాష్ట్ర క్యాడర్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో ఆయన ఇవాళ రిలీవ్ అయ్యారు. డీఐజీ వెంకటేష్‌కు తన బాధ్యతలను అప్పగించారు. తాను రిలీవ్ అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి వల్లే దేశాభివృద్ధి కుంటు పడుతోందని .. ఇప్పటి వరకు రాష్ట్రంలో దర్యాప్తు చేసిన కేసుల వివరాలను సీబీఐ కోర్టుకు తెలిపామని, ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో కోర్టుకు సమర్పించామని” ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దర్యాప్తును డీఐజీ వెంకటేష్ బృందం పూర్తి చేస్తోందని తెలిపారు. అయితే కేసుల దర్యాప్తు విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడిలేదని తెలిపారు. తాను మీడియాకు ఎలాంటి దర్యాప్తు సమాచారాన్ని లీకు చేయలేదని, అవసరమనిపిస్తే తానే మీడియా నుంచి సమాచారాన్ని సేకరించానని తెలిపారు. సొంత రాష్ట్రంలో పనిచేయడం తనకెంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చిందని లక్ష్మినారాయణ అన్నారు.

బొగ్గు స్కామ్ లో దాసరి పై ఎఫ్‌ఐఆర్‌

        దేశంలోనే భారీ స్థాయి కుంభకోణాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న బొగ్గుస్కామ్ లో ఏపీ వాటాలు కూడా బయట పడుతున్నాయి. యూపీఏ ప్రభుత్వాన్ని వణికిస్తున్న కోల్ స్కామ్ లో దాసరికి కూడా వాటా ఉందని దాదాపుగా నిర్దారణ అయ్యింది. లక్షా 86 వేల కోట్ల రూపాయల కోల్‌స్కామ్‌లో దాసరి నారాయణరావుపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బొగ్గు కేటాయింపుల్లో మంత్రిగా దాసరిపాల్పడిన అక్రమాలకు పక్కా ఆధారాలు దొరికనట్టు తెలుస్తోంది. ఈ కేసులో కూడా సీబీఐ క్విడ్ ప్రోకో కోణాన్ని పసిగట్టినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నవీన్‌ జిందాల్‌ కంపెనీలకు దాసరి బొగ్గు కేటాయింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిగా దాసరి నారాయణరావు కంపెనీ సిరి మీడియాలో నవీన్‌జిందాల్‌ పెట్టబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాసరితో పాటు మరికొంత మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలను కూడా నిర్వహించింది సిబిఐ.. కాగ్‌ నివేదిక ఆదారంగా జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకెంత మంది పేర్లు బయట పడతాయో అని భయపడుతుంది కేంద్ర నాయకత్వం..

వీసీ శుక్లా కన్నుమూత

        కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా కన్నుమూశారు. గత నెల 25వ తేదీన ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన శుక్లా ఢిల్లీలోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన మృతికి ప్రముఖ నేతలు సంతాపం తెలియజేశారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమ ప్రగాఢ సంతాపం తెలుపుతూ, శుక్లా కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు.వీసీ శుక్లా తొమ్మిది సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.

నన్ను రెచ్చగొడితే నీకే నష్టం: దగ్గుబాటి

      తనను రెచ్చగొడితే సుబ్బరామిరెడ్డికే నష్టమని దగ్గుబాటి వెంకటేశ్వర రావు హెచ్చరిక జారీ చేశారు. మరి ఈయన దగ్గరు సుబ్బిని బెదిరించడానికి ఏ అస్త్రాలు ఉన్నాయో కానీ…ఇలా నాతో పెట్టుకోకు అని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ''సుబ్బరామిరెడ్డి పంపించిన లీగల్ నోటీసుల వ్యవహారం నేను కోర్టులోనే తేల్చుకుంటాను. అయినా నాతో వివాదం పొడిగించుకోవడం సుబ్బరామిరెడ్డికే నష్టం. నాతో పెట్టుకోవద్దు..నన్ను రెచ్చగొట్టొద్దు..ఇలాగే చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి” అని కేంద్రమంత్రి పురంధేశ్వరి భర్త, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. సుబ్బరామిరెడ్డి పంపిన లీగల్ నోటీసులను ఆయన చాలా తేలికగా తీసుకున్నారు. మా ఇద్దరి వివాదం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని, అభ్యర్థుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఎన్నికల్లో టికెట్లు వస్తాయని అయన అన్నారు.