తిరుపతిలో భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న ఆటోవాలాలు.. మితిమీరిన వేగంతో ప్రమాదాలు

ఓ వైపు తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మరో వైపు శ్రీవారి మెట్ల నడకమార్గంలో భక్తులు పొటెత్తుతున్నారు. ఇదే అదునుగా భక్తులను ఆటోవాలాలు నిలువుదోపిడీ చేస్తున్నారు. తిరుపతి బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్లు వరకూ కేవలం 20 కిలోమీటర్ల దూరానికి పెద్ద మొత్తంలో సొమ్ములు దండుకుంటున్నారు. టైమ్ స్టాట్ టోకెన్లు తీయిస్తామంటూ భక్తుల నుంచి అదనంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు.  వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు.ఇదే అదునుగా ఒక్కో ఆటోలో పరిమితికి మించి భక్తులను తరలిస్తూ ఆటోవాలాలు ప్రమాదాలకు కారణమౌతున్నారు. సోమవారం (ఏప్రిల్ 21) ఎనిమిది మంది భక్తులను అలిపిరి బస్టాండ్ నుంచి శ్రీవారి భక్తులతో వస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఆ ఆటోవాలా కేవలం 20 కిలోమీటర్ల దూరానికి ఆ ఎనిమిది మంది భక్తులకూ కలిసి నాలుగువేల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అతి వేగంగా ఆటో నడుపుతూ భక్తుల నుంచి ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి జీపును ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న భక్తులు గాయపడ్డారు. వారిలో బెంగళూరుకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోవాలాల దోపిడీని పోలీసులు నియంత్రించాల్సిన అవసరం ఉందనీ, అలాగే పరిమితిని మించిన ప్రయాణీలతో, మితిమీరిన వేగంతో వెళ్లే ఆటో డ్రైవర్ల మీద చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్ కు ప్రధానమంత్రి పురస్కారం

ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెడిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్ డబ్ల్యేఆర్ఇఐఎస్) సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేణ్  దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక   ప్రధానమంత్రి పురస్కారాన్ని అందుకున్నారు.  2023 సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అందుకున్నారు.  సోమవారం (ఏప్రిల్ 21)   17వ సివిల్ సర్వీస్ డే సంధర్బంగా డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన వికసిత్  భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రధాని నరేందర మోడీ.. పాలనలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఐఏఎస్ లకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.  ప్రసన్న వెంకటేష్ జనవరి 2022 నుంచి జూలై 2024 వరకు ఏలూరు జిల్లాకు తొలి కలెకర్ట్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ప్రజలకు అందించిన సేవలకు గాను ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది.  ఏలూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ప్రసన్న వెంకటేష్ ప్రభుత్వ పథకాలను విస్సతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలులో భాగంగా మహిళలు, బాలికల్లో రక్తహీనత నివారణకు విశేష కృషి చేశారు.  సామాజిక బాధ్యత చొరవ కింద జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ‘అక్షజ’ అనే కార్యక్రమంతో గర్భిణీలు, ప్రసూతి మహిళల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుననారు. ఆయన కృషికి గుర్తింపుగా ప్రధాన మంత్రి పురస్కారానికి ఎంపికయ్యారు.   దేశ వ్యాప్తంగా పది జిల్లాల కలెక్టర్లకు ప్రధాని చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు. ా పది మందితో ప్రసనన వెంకటేష్ ఒకరు. పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రసన్న కుమార్  ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిచేందుకు  శక్తివంచన లేకుండా తాను కృషి చేస్తానన్నారు.

చెలామణిలో నకిలీ కరెన్సీ.. రూ.500 నోట్లతో జాగ్రత్త!

500 రూపాయల నోట్లపై కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన చేసింది.   నకిలీ నోట్ల విషయంలో ఎన్ఐఏ, డీఆర్ఐ, సీబీఐ, సెబీ సహా అనేక శాఖలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు తేడా అస్సలు గుర్తించ లేకుండా ఉన్నాయనీ,  అప్రమత్తంగా ఉండానీ ఆదేశాలు జారీ చేసింది. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ తో నకిలీ నోట్లు చెలామణి అయ్యే ప్రమాదం భారీగా ఉందని చెప్పింది. అలాగే ఇప్పటికే అలాంటి 500 నోట్లు సర్కులేషన్ లో ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆర్బీఐ కూడా నకిలీ 500 రూపాయల నోట్ల విషయంలో ప్రజలను అప్రమత్తం చేసింది.  నల్లధనాన్ని (బ్లాక్ మనీ) రూపుమాపడం, దొంగనోట్ల బెడద లేకుండా చేయడమే లక్ష్యమంటూ 2016 నవంబర్ లో ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఉరుములేని పిడుగులా మోడీ తీసుకున్న ఆ నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పట్లో మోడీ నిర్ణయంతో సంపన్నులు, పేదలు అన్న తేడా లేకుండా జనం నానా ఇబ్బందులూ పడ్డారు. గంటల తరబడి నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు క్యూలో నిలుచున్నారు. కొన్ని నెలల పాటు ప్రజలంతా నగదు చెలామణి విషయంలో అల్లాడిపోయారు. అయినా దొంగనోట్ల బెడద ఇక ఉండదన్న ఆశతో భరించారు.  అయితే మోడీ నాడు తీసుకున్న నిర్ణయం లక్ష్యాన్ని సాధించిందా? అంటే లేదని ఇప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. మార్కెట్ లో పెద్ద సంఖ్యలో దొంగనోట్లు చెలామణిలో ఉన్నాయనీ, అప్రమత్తంగా ఉండా లని ప్రజలను హెచ్చరిస్తోంది. ఆర్భాటంగా దేశ ప్రజలందరినీ నానా అగచాట్లకూ గురి చేస్తూ నాడు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి సత్ఫలితాన్ని ఇవ్వలేదు సరికదా.. దొంగనోట్ల బెడద మరింత తీవ్రమైందని కేంద్రం స్వయంగా చెబుతోందిప్పుడు.  నిజం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన నకిలీ 500 రూపాయల నోట్లు పెద్ద ఎత్తున చెలామణిలోకి వచ్చినట్లు కేంద్రమే స్వయంగా ప్రకటించింది.  ఇలా మార్కెట్లో చెలామణి అవుతున్న నకిలీ నోట్ల సంఖ్య ఎంతన్నది చెప్పడం కూడా కష్టమని పేర్కొంది. నకిలీ కరెన్సీ విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.   నకిలీ, ఒరిజినల్ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందనీ పేర్కొంది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ కూడా పేర్కొంది. అత్యంత నాణ్యతతో అచ్చుగుద్దినట్లు ఒరిజినల్ నోట్లను పోలి ఉండేలా నకిలీ నోట్లను రూపొందించిన నేర ముఠాలు వాటిని పెద్ద ఎత్తున మార్కెట్ లోకి తీసుకువచ్చారని, నకిలీ, ఒరిజినల్ మధ్య చిన్న అక్షరమే తేడా ఉందనీ పేర్కొంది. ఒరిజనల్ నోట్లపై రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్ కరెక్టుకు RESERVE BANK OF INDIA అని ఉంటుందనీ, అయితే నకిలీ నోట్లపై ఆ స్పెల్లింగ్ RASERVE BANK OF INDIA అని ఉంటుందనీ వివరించింది. అత్యంత నిశితంగా పరిశీలిస్తే తప్ప మామూలుగా ఈ తేడాను కనిపెట్టడం కష్టమనీ పేర్కొంది.  

నకిలీ ఐడీతో విదేశాలకు పారిపోయే ప్రణాళిక.. భగ్నం..రాజ్ కసిరెడ్డి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ మద్యం లిక్కర్ కుంభకోణం కేసులో సోమవారం అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో, ఇప్పటికి నాలుగు సార్లు నోటీసులు అందుకుని కూడా సిట్ విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం (ఏప్రిల్ 21) అరెస్టు చేశారు. ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో   అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు. నకిలీ ఐడీతో విదేశాలకు పారిపోయేందుకు పక్కా ప్రణాళికతో ఆయన గోవా నుంచి మారు పేరుతో హైదరాబాద్ కు వచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో అన్నీ తానై వ్యవహరించినట్లుగా రాజ్ కసిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మారుపేరుతో గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు.  ఆయన గోవానుంచి రాజేష్ రెడ్డి అనే మారుపేరుతో వచ్చినట్లు తెలుస్తోంది.   ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. అయితే అక్కడ విచారణ జరిగిందా? లేదా అన్న సంగతి తెలియదు కానీ, ఇన్నాళ్లూ గోవాలో తలదాచుకున్న రాజ్ కసిరెడ్డి ఇంకా అక్కడే ఉంటే అరెస్టు తప్పదన్న బయంతో మారుపేరుతో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి నకిలీ ఐడీతో విదేశాలకు చేక్కేయాలన్నది రాజ్ కసిరెడ్డి ప్లాన్ అని సిట్ పోలీసులు చెబుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తనను అదుపులోనికి తీసుకున్న సందర్భంగా తాను మంగళవారం (ఏప్రిల్ 22) సిట్ విచారణకు హాజరౌతాననీ, అసలు అందుకోసమే తాను హైదరాబద్ కు వచ్చానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాను ఒక ఆడియో ద్వార తెలియజేసిన సంగతిని కూడా ఆయన సిట్ పోలీసులకు తెలిపారు. అయితే సిట్ అధికారులు మాత్రం మీ మీద నమ్మకం లేదనీ, మీరు విచారణకు హాజరౌతారని తాము విశ్వసించడం లేదనీ విస్పష్టంగా చెప్పి అదుపులోనికి తీసుకున్నారు.   రాజ్ కసిరెడ్డిని మంగళవారం (ఏప్రిల్ 22) విజయవాడ కోర్ట్లో హాజరు పరిచే అవకాశం ఉంది. ఆ తరువాత కోర్టు అనుమతితో ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని విచారించే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినప్పుడే రాజ్ కసిరెడ్డి వచ్చి ఉంటే ఆయన అరెస్టు అయ్యే వారు కాదనీ, విచారణకు డుమ్మా కొట్టి అజ్ణాతంలోకి వెళ్లినందుకే సిట్ ఆయనను అరెస్టు చేసిందని న్యాయనిపుణులు అంటున్నారు.    

మాజీ ఎంపీ గోరంట్లకు పోలీస్ కస్టడీ విధించిన మొబైల్ కోర్టు

    పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు  ఏప్రిల్ 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు మాధవ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు రోజుల పాటు గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్‌ను అదుపులోకి తీసుకుని, కేసు వివరాలపై లోతుగా విచారించనున్నారు. మరోవైపు, ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాధవ్ పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.  వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పార్టీ నుంచి సస్పెండై అరెస్టు కూడా అయిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు మాధవ్ ను అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో గోరంట్ల మాధవ్ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొన్నాది. అన్ని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. వీటికి సంబంధించిన హాల్ టికెట్లను httpps://psc.ap.gov.in అధికారిక వెబ్సైట్ లో నేటి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఏపీలో మొత్తం 81 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,48,881మంది ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా.. 4,496మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.  గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు సంగతి విదితమే

రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌‌ఫోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. తాను రేపు విచారణకు హాజరవుతానని వారికి ఆయన తెలిపారు. అయితే, హాజరవుతారో లేదోనని అనుమానంగా ఉందని, తమ వెంట రావాల్సిందేనని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. మరికాసేపట్లో అతడిని విజయవాడ తరలించనున్నారు. మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్‌ కసిరెడ్డి, హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో మంగళవారం తాను విచారణకు హాజరవుతానని రాజ్‌ కసిరెడ్డి ఇవాళ ఆడియో  రిలీజ్ చేశారు. అంతలోనే అతడిని ఏపీ సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆయన సిట్ అధికారులనుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన కోసం సిట్ బృందాలు గాలింపు చేపట్టాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్‌లో గాలించాయి. ఈ క్రమంలో అతడి నివాసానికి నోటీసులు అంటించాయి. అతడి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న రాయదుర్గంలోని ఆరేట ఆసుపత్రితోపాటు రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్‌పై విధించిన పాలసీలు, సరఫరా విధానాలు, టెండర్ విధానాల్లో భారీ ఆర్థిక అక్రమాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా, కొన్ని లిక్కర్ కంపెనీలకు ప్రభుత్వ నిబంధనలు మీరి మినహాయింపులు ఇవ్వడం, కొందరికి అనుచిత లాభాలు వచ్చేలా పాలసీ మార్చడం వంటి చర్యలు ఈ స్కాంకు బలమైన ఆధారాలుగా మారుతున్నాయి. ఈ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

రికార్డు స్థాయిలో బంగారం ధర.. తులం ఎంతంటే?

  బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇక పసిడి కోనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి గోల్డ్ రేటు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  ఇక పెరిగిన పసిడి ధరను చూసి సామాన్యులు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పట్లో తాము పసిడి కొనుగోలు చేయడం ఇక కలే అని వాపోతున్నారు. శుభకార్యాల సీజన్ ముందుండటంతో అసలు ఏం చేయాలో పాలు పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అమెరికా-చైనా సుంకాల యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. బలహీనపడుతున్న డాలర్, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,469గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,599గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,475గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,605గా నమోదైంది.దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,613గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,743గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,465 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,595గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,461గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,591గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,455గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,585గాను ఉంది.

బాలినేని చాణక్యం.. జనసేన గూటికి మానుగుంట?

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఆయన చేరిక అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఆయన జనసేన చేరికను తెలుగుదేశం గట్టిగా వ్యతిరేకించింది. బాలినేని చేరిక సందర్కభంగా ఒంగోలులో పలు చోట్ల ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు ధ్వంసం చేశారు. ఇక అటు జనసేనలో కూడా అప్పట్లో ఆయన చేరిక పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది.  వైసీపీ అధినేత జగన్ కు బంధువు కావడం, ఆయన చేరికతో వైసీపీ నుంచి పలువురు ఆయన అనుచరులు కూడా వచ్చి చేరే అవకాశాలు ఉండటంతోనే అప్పట్లో బాలినేనిని తెలుగుదేశం, జన సేనలు వ్యతిరేకించాయి. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం బాలినేనిని మాత్రమే చేర్చుకుంటున్నట్లు క్లారిటీ ఇవ్వడమే కాకుండా బాలినేని కోరినట్ల ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి మందీ మార్బలంతో పార్టీ తీర్ధం పుచ్చుకోవాలని భావించిన బాలినేనికి చెక్ పెట్టారు. ఒంగోలులో కాదు.. ఒక్కరుగా మంగళగిరి వచ్చి పార్టీ కండువా కప్పుకోండని తేల్చి చెప్పారు. దాంతో బాలినేని అప్పట్లో ఒక్కడుగానే మంగళగిరి వెళ్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో తన అనుచరులందరినీ జనసేన గూటికి చేర్చాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేశారు.  వైసీపీలో అసంతృప్త నేతలపై ఫోకస్ చేస్తున్న బాలినేని.. ఉమ్మడి ఒంగోలు జిల్లాలో  జనసేన బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.   వైసీపీలోని ఓ కీలక నేతతో  బాలినేని మంతనాలు సాగిస్తున్నారనీ, త్వరలో ఆ కీలక నేత జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయనీ అంటున్నారు.  గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతోపాటు పార్టీకి భవిష్యత్తు లేదన్న అంచనాతో కందుకూరు మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని గట్టిగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా వైదొలగుతుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అంటున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు.. అక్కడ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు తమ అనుచరులను వైసీపీకి రాజీనామా చేసి రమ్మంటూ ప్రోత్సహిస్తున్నారు.  గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి బాలినేని ఈ కోవలో అందరికంటే ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరినప్పుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేస్తానని ఆయన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆ దిశగా అడుగులేస్తూ కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేనలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.  ప్రకాశం జిల్లాకు చెందిన మహీధర్ రెడ్డి సీనియర్ నేత. 1989లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2014 వరకు కాంగ్రెస్ లో కొనసాగారు. 2014లో వైసీపీలో చేరిన ఆయన కందుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పోటీకి దూరంగా ఉండిపోయారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రమంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి కూడా శాసనసభ్యుడిగా సేవలందించారు. తొలి నుంచి టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న మహీధర్ రెడ్డి ఈ కారణంగా గత ఎన్నికల ముందు తెలుగుదేశం నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెబుతున్నారు. వైసీపీ టికెట్ నిరాకరించినా, అందుకే ఆ పార్టీని వీడకుండా కొనసాగుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న మహీధర్ రెడ్డి అధినేత జగన్ వైఖరి మారుతుందని ఇన్నాళ్లు వెయిట్ చేశారని అంటున్నారు.  కానీ  పార్టీ ఓడినా అధిష్టానం వైఖరి మారకపోవడంతో ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తు న్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకలాపాలు పుంజుకోవడం, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందన్న అంచనాకు తోడు బాలినేని ప్రోత్సాహంతో  మహీధర్ రెడ్డి జనసేనపై మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.  ఆయన చేరికకు  జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. వివాద రహితుడు, సీనియర్ నేత,  రాజకీయ కుటుంబ నేపథ్యం వల్ల మహీధర్ రెడ్డి చేరికను ఇతర భాగస్వామ్యపక్షాలు వ్యతిరేకించే పరిస్థితి లేదనీ,  త్వరలోనే మహీధర్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తెలుగుదేశం మహానాడుకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా?

ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కార్యకర్తల పార్టీయే. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పార్టీకి అండగా కార్యకర్తలు నిలబడి పార్టీని నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తొలి నుంచీ కార్యకర్తల సంక్షుమానికే పెద్ద పీట వేస్తూ వస్తున్నది అనడంలో సందేహం లేదు.  పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ, విపక్షంలో ఉన్నప్పుడూ కూడా పార్టీ అధినాయకత్వం కార్యకర్తల పక్షానే నిలబడింది.  సాధారణంగా రాజకీయ పార్టీలు కార్యకర్తల గురించి ఆలోచించేదీ, మాట్లాడేదీ పార్టీ అధికారంలో లేని సమయంలో మాత్రమే. ఆ పద్ధతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ భిన్నంగానే ఉంది.  పార్టీ మనుగడ, ఉనికికి కార్యకర్తలే ప్రధానమని భావిస్తూ వచ్చింది.   ఇందుకు తజా నిదర్శనం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ కడప వేదికగా నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడుకు తొలి ఆహ్వానం పార్టీ కార్యకర్త కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడమే. అది కూడా పార్టీ కోసం ప్రాణాలను త్యాగం చేసిన తోట చంద్రయ్య కుటుంబానికి మహానాడుకు తొలి ఆహ్వానం అంద జేయాలని నిర్ణయించింది. ఆ ఆహ్వానం కూడా  ఏ స్థానిక నేతతోనో పంపించడం కాకుండా.. మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా చంద్రయ్య ఇంటికి వెళ్లి అందజేయాలని నిర్ణయించుకున్నారు.   చంద్రయ్య ఎవరో కాదు. పార్టీలో సామాన్య కార్యకర్త. తన చివరి రక్తం బొట్టు వరకూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ఆ పార్టీ కోసమే పని చేశారు. జగన్ రాక్షస పాలన సాగుతున్న కాలంలో వైసీపీ గూండాల చేతిలో హతమయ్యారు. చంద్రయ్య తెలుగుదేశం జెండా మోయడమే వైసీపీ గూండాలు ఆయనను హత్య చేయడానికి కారణం.  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన తోట చంద్రయ్య 2022 జనవరి 13న స్థానిక వైసీపీ నేతలు అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేశారు. గొంతు కత్తిమీద పెట్టి జై జగన్, జై వైసీపీ అంటే వదిలేస్తామన్నా కూడా చంద్రయ్య నోటి వెంట జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న నినాదమే వచ్చింది.దీంతో వైసీపీ   మూకలు ఆయనను అత్యంత పాశవికంగా హత్య చేశాయి. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. చంద్రబాబు స్వయంగా తోట చంద్రయ్య అంత్యక్రియలకు హాజరై, ఆయన పాడె మోశారు.   ఇప్పుడు కడపలో నిర్వహించనున్న మహానాడును వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో నిర్వహించనున్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పండుగకు ఆహ్వాన పత్రికలు రెడీ అయ్యాయి. మొదటి ఆహ్వాన పత్రికను పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబానికి ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా గుండ్లపాడు గ్రామానికి వెళ్లి తన స్వహస్తాలతో తోట చంద్రయ్య కుటుంబాన్ని మహానాడుకు ఆహ్వానిస్తారు.  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణమనీ, అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడటం తన కర్తవ్యమనీ లోకేష్ ఎప్పుడూ చెబుతుంటారు. ఆ చెప్పడం మాటల వరకే పరిమితం కాదనీ, చేతలు కూడా అలాగే ఉంటాయనీ మరోసారి పార్టీ  కార్యకర్త కుటుంబానికి మహానాడు తొలి ఆహ్వానాన్ని అందించడం ద్వారా రుజువు చేస్తున్నారు నారా లోకేష్.  

హైకోర్టు‌లో కేటీఆర్‌కు ఊరట.. రెండు కేసులను కొట్టివేసిన న్యాయస్థానం

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్‌తో పాటు మరికొంతమందిపై మహాదేవ్‌పూర్‌ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేశారని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లు కింద మహాదేవ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ న్యాయవాది టీవీ రమణారావు అన్నారు. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. డ్రోన్ ఎగురవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇరువైపులా వాదనలు ముగిసియి. మరోవైపు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.  కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు 2024 సెప్టెంబర్‌లో ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని ఉట్నూరులో జరిగిన ఒక సభలో మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. దేశంలో రాబోయే ఎన్నికల నిధుల కోసం మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్‌లా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది.  

హైదరాబాద్‌లో మత్తు ఇంజెక్షన్ తీసుకున్న ఇంటర్ విద్యార్ధి మృతి

  హైదరాబాద్ బాలనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఇంటర్ విద్యార్ధి మృతి చెందాడు. ఇంజక్షన్‌తో పాటు టాబ్లెట్లను ఒకేసారి తీసుకోవడంతో డోస్ ఎక్కువైంది. ఈ క్రమంలో నాసర్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు పరిస్థితి విషమంగా ఉంది. సదరు విద్యార్ధులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం, సరఫరాపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో కొందరు యువకులు మత్తు ఇంజెక్షన్‌లు, మరియు డ్రగ్స్ సొంతగా వినియోగించడమే కాకుండా ఇతరులకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగిస్తున్న, సరఫరా చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారని ఇటీవల గణాంకాలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు మరో ఉదాహరణగా నిలిచింది.సదరు వ్యక్తి మత్తు మాత్రలు, ఇంజెక్షన్ లను విక్రయిస్తున్నాడు? అతని వద్దకు మత్తు ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంత మందికి విక్రయిస్తున్నారు? అనే కోణాల్లో ను బాలాపూర్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.   

పూజా ఖేడ్కర్‌‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  మాజీ ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌  మే 2వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఖేద్కర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అంతకు ముందు అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిజమైన ఎంక్వైరీ జరగలేదని  త్వరగా ఈ కేసు విచారణ ముగించాలని పోలీసులను ఆదేశించింది.  పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఖేద్కర్‌ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని .. అయితే కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ కల్పించిందని అన్నారు. కోర్టు దాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో యూపీఎస్సీ నమోదు చేసిన క్రిమినల్ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అధికార దుర్వినియోగం,తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ వ్యవహారంలో పూజా ఖేద్కర్‌ ,యూపీఎస్సీ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పేరు ఇటీవలా మీడియాలో వినిపించింది. ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదైందైన సంగతి తెలిసిందే.  

వల్లభనేని వంశీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా

విజయవాడ జిల్లా జైల్లో గత రెండు నెలలుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను కోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.  భూ ఆక్రమణ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వల్లభనేని  వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ పై సోమవారం (ఏప్రిల్ 21) విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.   గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడి 8.91 ఎకరాలను విక్రయించారని తేలబ్రోలుకు చెందిన ఎన్‌ శీధర్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు   ఆత్కూరు పోలీసులు వంశీ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదే కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.   ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించారు.   ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది  ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాలని కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.   వల్లభనేని వంశీ ఇప్పటికే పలు కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు,  గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉన్న సత్యవర్థన్‌ కిడ్నాప్‌ చేశారనే కేసు, భూ ఆక్రమణ కేసులో కూడా ఆయన  రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు చెల్లించిన చెన్నమనేని ఎందుకంటే?

తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టులో రూ.25 లక్షల  డీడీ అందజేశారు. జర్మనీ పౌరసత్వం ఉండి చెన్నమనేని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో ఆది శ్రీనివాస్‌ తెలంగాణ హైకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని.. ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై కోర్టులో ఆది శ్రీనివాస్‌ సుదీర్ఘ కాలం పోరాడారు. పలు దఫాలుగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. చెన్నమనేని రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉన్నట్లు గతేడాది డిసెంబర్‌లో తేల్చింది. తప్పుదోవ పట్టించినందుకు ఆయనకు జరిమానా విధించింది. పిటిషనర్‌ ఆది శ్రీనివాస్‌కు రూ.25లక్షలు, న్యాయసేవాధికార సంస్థకు రూ.5లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు మేరకు నేడు ఆ డబ్బును డీడీల రూపంలో చెన్నమనేని రమేశ్ అందజేశారు.

చంద్రబాబుకి ఊహించని ప్రత్యర్థుల బర్త్ డే విషెస్..

కేసీఆర్ నుంచి  కేశినేని నాని వరకు తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఊహించని ప్రత్యర్థులు విషెస్ చెప్పడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ దగ్గర నుంచి ఏపీ మాజీ సీఎం జగన్ సహా పలువురు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. అటు తెలంగాణ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ సైతం చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు.. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు వచ్చాయని, హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. కేసీఆర్, షర్మిల కూడా సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలపడం విశేషం.  పార్టీ నేతలు, మిత్రపక్షాలు, అభిమానులు సరేసరి.. వైరి వర్గాలు కూడా ఈసారి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలపడం ఆసక్తిగా మారింది. మాజీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈసారి సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలపలేదు.  కన్నతల్లి పుట్టినరోజుని పట్టించుకోని జగన్, తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆయన చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ వేశారు. ఆయన ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఆ మధ్య స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం హైదరాబాద్ లో నిరసనలకు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. పక్క రాష్ట్రం వ్యవహారాలు ఇక్కడెందుకంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై అక్కసుని ప్రదర్శించారు. అయితే నేడు సీఎంగా ఉన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ తన సహజ వైఖరికి భిన్నంగా స్పందించడం విశేషం. ట్విట్టర్లో విషెస్ చెబుతూనే.. పార్టీ మీటింగ్ లో చంద్రబాబు గొప్పదనాన్ని మెచ్చుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు చంద్రబాబు తీసుకొచ్చారని వివరించారు. అభివృద్ధి విషయంలో ఆయన  ఆనవాళ్లు, ముద్రను ఎవరూ చెరిపేయలేరని చెప్పుకొచ్చారు. అటు కేసీఆర్ కూడా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని, ఆయన పాలనలో ఏపీ ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు కేసీఆర్. ప్రధాని మోదీ నుంచి మొదలు పెడితే ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి పుట్టిన రోజు కావడంతో మిత్రపక్షాల నేతలంతా సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన వారంతా ఈ రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం.  ఇదంతా ఒక ఎత్తైతే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబును కీర్తిస్తూ విషెస్ చెప్పడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టీడీపీ తరఫున రెండు సార్లు విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేశినేని నాని పార్టీకి వీర విధేయుడిగా ఉండేవారు. కానీ సొంత పార్టీలో ప్రత్యర్దులను పెంచిపోషించుకుని, పార్టీలో ఇమడ లేక గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం వీడి వైసీపీలో చేరారు. అక్కడ ఎంపీ సీటు తెచ్చుకున్నా ఓడిపోయారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా సోషల్ మీడియాలో నాని యాక్టివ్ గానే ఉంటున్నారు. ఇదే క్రమంలో  సీఎం చంద్రబాబును ఉద్దేశించి కేశినేని నాని ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో చంద్రబాబుకు వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. అసలే టీడీపీలోకి కేశినేని నాని రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబుతో అనుబంధాన్ని నాని గుర్తుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మైలురాయి ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని, దశాబ్దాల రాజకీయ నాయకత్వం, పాలన, ప్రజా సేవను సూచిస్తుందని నాని పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట దశలో ఆ ప్రయాణంలో భాగం అయ్యే అవకాశం తనకు లభించిందన్నారు. ఆ అనుభవాన్ని తాను అంగీకరిస్తున్నట్లు కూడా నాని తెలిపారు. మీకు మంచి ఆరోగ్యం, నిరంతర బలం, ప్రజా జీవితంలో, సేవలో మరిన్ని చురుకైన సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్తూ కేశినేని నాని తన పోస్టును ముగించారు.  గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అంతకు ముందు తాను కలిసి పనిచేసిన వ్యక్తులతో కేశినేని నాని తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారన్న ప్రచారం ఉంది. అదే క్రమంలో ఆయన్ను తిరిగి టీడీపీలోకి వచ్చేయాలంటూ ఆఫర్లు వస్తున్నాయంట. అయితే రాజకీయాల్లో రీఎంట్రీపై ఏ నిర్ణయం తీసుకోలేదంటూ కేశినేని నాని గతంలో పలు మార్లు చెప్పారు. 

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలో తన నివాసంలో సోమవారం (ఏప్రిల్ 21) ఉదయం కన్నుమూశారు. వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషయాన్నిధృవీకరించారు.  పోప్ ఫ్రాన్సిస్ వయస్సు 88 ఏళ్లు.   1936 డిసెంబర్ 17న  జన్మించిన ఆయన 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.  పోప్​ తన జీవితమంతా చర్చి సేవకే అంకితమయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఈస్టర్ సందర్భంగా ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ రోజున సందేశం కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన  ఆరోగ్యం క్షీణించి మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల  ప్రపంచ వ్యాప్తంగా నాయకులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.  

స్వామీ ఏమి ఈ క్రిష్టియ‌న్ ప్రేమ‌! బేసిగ్గా హిందూ ద్వేష భావ‌జాల‌మా?

సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి  చంద్ర‌బాబు అంటే అంత ద్వేషం ఎందుకు? జ‌గ‌న్ అంటే వ‌ల్ల‌మాలిన‌ అభిమానం.. కార‌ణ‌మేంటి? అస‌లు స్వామికి  తిరుమ‌ల తిరుప‌తి అంటే అంత ఇంట్ర‌స్ట్ ఏంటి? సాటి సామాజిక వ‌ర్గ‌పు జ‌య‌ల‌లిత‌ను వ‌ద‌ల‌ని స్వామి క్రిష్టియ‌న్ అయిన జ‌గ‌న్ అంటే ప్ర‌త్యేక ప్రేమ క‌న‌బ‌రుస్తారెందుకు? 2021లో ప‌రువు న‌ష్టం దావా.. 2023లో శ్రీవాణి విష‌యంలో బాబు, ప‌వ‌న్ పై ఆరోప‌ణ‌లు.. 2024లో ల‌డ్డు నెయ్యి క‌ల్తీ వ్య‌వ‌హారంలో బాబు వ్యాఖ్య‌ల ఆధారంగా భ‌ద్ర‌త‌పై ప్ర‌శిస్తూ పిటిష‌న్.. 2025లో టీటీడీ చైర్మ‌న్ వ‌య‌సు మ‌ళ్లిన మ‌నుషుల‌కు మ‌ల్లే ఆవులు సైతం చనిపోతాయ‌న్న కామెంట్ల‌పైనా కేసు వేస్తాన‌న‌డం.. అదే జ‌గ‌న్ పాల‌న‌లో క‌నీసం ఒక్క మాట కూడా అన‌ని స్వామి- అంత‌ర్యం ఏమిటి? అని చూస్తే.. పై నాలుగు ఘ‌ట‌న‌ల్లో స్వామి డైరెక్టుగా కానీ.. ఇన్ డైరెక్టుగా కానీ సుబ్రహ్మణ్య స్వామి చంద్ర‌బాబును అటాక్ చేశార‌న‌డానికి మ‌న ద‌గ్గ‌రున్న ఆధారాలు. బీజేపీకి ప్రాతినిథ్యం వ‌హించే స్వామి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్.. త‌మ కూట‌మిలో భాగ‌స్వామ్యం అన్న క‌నీస  జ్ణానం కూడా లేకుండానే కామెంట్లు  ఎందుకు చేస్తుంటారో అర్ధం కాదు..  తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆపై కేసులు కూడా వేస్తుంటారు.    ఇదే స్వామికి క్రిష్టియ‌న్ జ‌గ‌న్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. అంతులేని ప్రేమతో కూడిన‌ వాత్సల్యాన్ని క‌న‌బ‌రుస్తుంటారు. అదేమంటే జ‌గ‌న్ హ‌యాంలో తాను తిరుమల తిరుపతి దేవస్ధానం ఆదాయ వ్య‌యాల‌పై కాగ్ ఆడిట్ చేయించాల‌ని కోర‌గా.. అందుకు ఆయ‌న‌ ఒప్పుకున్నారు. దీంతో స్వామి..  జ‌గ‌న్ ని ప‌ల్లెత్తు మాట కూడా అన‌ర‌ని చెబుతారు. కానీ ఇక్క‌డే స్వామిని అనుమానించాల్సి వ‌స్తోంది. ఇదే స్వామి ఇటు నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల‌ను, అటు అక్ర‌మాస్తుల కేసులో జ‌య‌ల‌లిత వంటి వారిని కోర్టు కీడ్చారు. మ‌రీ ముఖ్యంగా  జ‌య త‌న ప‌ద‌వి వీడేలా చేసిన ఘ‌న‌త సుబ్ర‌హ్మ‌హ్మ‌ణ్య స్వామిది. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి టీటీడీ అంటే ఎందుకంత ఆస‌క్తి అంటే తిరుపతి హైంద‌వ ఆధ్యాత్మిక బాంఢాగారం.. అక్క‌డ ఏ చిన్న త‌ప్పిదం జ‌రిగినా ఒక బాధ్య‌త కొద్దీ  తాను స్పందిస్తాన‌ని అంటారాయ‌న‌. స‌రిగ్గా అదే స‌మ‌యంలో సోనియా, జ‌య‌ల‌లిత వంటి వారి విష‌యంలో అవినీతి మ‌కిలిని తుద‌ముట్టించే వ‌ర‌కూ తాను నిద్రించేది లేద‌ని.. అంటారు. బేసిగ్గా తాను అంత‌టి నీతి మంతుడ్న‌ని తెలియ చేస్తుంటారు. ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే చెన్నై మైలాపూర్ లో పుట్టిన స్వామి   బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. జ‌యల‌లిత‌ సైతం అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వారే. అందుకే ఆమె తానెంత‌టి సీఎం స్థాయి వ్య‌క్తినైనా కుంభ‌కోణం వంటి  బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం గ‌ల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ  చేస్తుంటారు. సాటి సామాజిక వర్గానికి చెందిన  జ‌య అంటే కూడా స్వామికి  ప‌డ‌దు. అదేమంటే ఆమె చుట్టూ పేరుకుపోయిన‌ అవినీతే అస‌లు కార‌ణం అంటారు. సాటి సామాజికవర్గానికి చెందిన జయలలిత ప‌ట్ల కూడా అంత‌టి విద్వేషం  క‌న‌బ‌ర‌చే స్వామికి జ‌గ‌న్ అవినీతి ఎందుకు క‌నిపించ‌దు? అన్న  ప్ర‌శ్న‌కు స‌మాధానం  వెత‌కాలి. జ‌గ‌న్ పై ఎంత‌టి అవినీతి ఆరోప‌ణ‌లున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికీ ఆయ‌న బెయిలుపై తిరుగుతోన్న   అవినీతి కేసుల నిందితుడు. అలాంటి స్వామి క‌నీసం జ‌గ‌న్ మీద రాంగ్ కామెంట్లు కూడా చేయ‌రు. ఇదే జ‌గ‌న్ తాను క్రిష్టియ‌న్ కావ‌డ‌మే కాదు.. టీటీడీకి కూడా ఒక క్రిష్టియ‌న్ని చైర్మ‌న్ గా చేశారు.  అప్పుడు స్వామికి క‌నీసం నోరు పెగ‌ల‌దు. అంతే కాదు జ‌గ‌న్ ఎప్పుడైనా తిరుమ‌ల‌కు వెళ్తే ఒక క్రిష్టియ‌న్ గా డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌రు. అప్పుడు కూడా స్వామికి ఏదైనా కామెంట్ చేయాల‌న్న ఆలోచ‌న రాదు. జ‌గ‌న్ సాక్షాత్తూ శ్రీవారి ప‌విత్ర‌త‌ను మంట‌గ‌లుపుతూ.. ఇంటి ముందే ఆల‌యం సెట్ వేశారు. అప్పుడు కూడా  స్వామి నోరు మెదపలేదు. I am a devotee of Lord Venkateswara. Tirumala is not just a temple, it is a national treasure for Hindus,, అని చెప్పే సుబ్ర‌హ్మ‌ణ్య‌ స్వామికి శ్రీవారి భ‌క్తుల‌పైకి చిరుత పులుల‌ను వ‌దులుతుంటే ప‌ట్ట‌దు. ఇక వాటిని త‌ర‌మ‌డానికి చేతి క‌ర్ర‌ల‌ను ఇస్తుంటే చోద్యం చూస్తుంటారు. అదేమంటే శ్రీవాణి విష‌యంలో జ‌రిగే అవ‌క‌త‌వ‌క‌ల గురించి బాబు, ప‌వ‌న్ మాట్లాడితే మాత్రం విరుచుకుప‌డిపోతారు. క్రిష్టియ‌న్ జ‌గ‌న్ కి బ్రాహ్మిన్ స్వామికీ ఉన్న లింకేంటి? ఇరువురి మ‌ధ్య ఉన్న సంబంధ‌బాంధ‌వ్యాలేంటి?.. శ‌బ‌రిమ‌ల‌, రామ‌సేతు ప‌రిర‌క్ష‌ణ‌పై పిటిష‌న్లు వేసి హిందుత్వం అన్నా హైంద‌వ ఆచార వ్య‌వ‌హారాల‌కు కించిత్ భంగం క‌లిగినా.. కేసుల‌తో విజృంభించే స్వామికి.. తిరుమ‌ల ల‌డ్డూలో నెయ్యి క‌ల్తీ జ‌రిగితే గొడ‌వ‌కు దిగాల్సింది ఎవ‌రితో?  రివ‌ర్స్ లో ఈ విష‌యం వెలుగులోకి తెచ్చిన బాబునే త‌ప్పు ప‌డ‌తారు. ఇదెక్క‌డి విడ్డూరం??? అన్న‌ది శ్రీవారి భ‌క్తుల‌కు వ‌చ్చే అనుమానం.  టీటీడీ అంటే హిందూ ధార్మిక సంస్థ అయిన‌ప్పుడు అక్క‌డ 2వేల‌కు పైగా అన్య‌మ‌త‌స్తులు ఉద్యోగాలు చేస్తుంటే స్వామికి ఎందుకు ప‌ట్ట‌దు? ఇదే అంశంలో నాటి సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం తీవ్ర స్థాయిలో పోరాడి.. త‌న సీఎస్ వంటి కీల‌క ప‌ద‌విని సైతం కోల్పోయారు. హైంద‌వ ఆల‌యాల్లో అన్య‌మ‌త‌స్తుల‌కు తావు లేద‌న్న పాయింట్ మీద జ‌గ‌న్ తో బ‌రాబ‌ర్ ఫైట్ చేసి.. ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అంతే త‌ప్ప ఎంత‌కీ త‌ల వంచ‌లేదు. అలాంటి పేరే గ‌ల సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి జ‌గ‌న్ అన్నా, ఆయ‌న పాల‌న‌లో టీటీడీలో జ‌రిగిన గోల్ మాల్ వ్య‌వ‌హారాల‌న్నా ఎందుకు ప‌ట్ట‌ద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రావాల్సి ఉంది. ఇదే టీటీడీ గోశాల‌లో స్వ‌దేశీ ఆవులనే ఎక్కువ‌గా పెంచి పోషించాలన్న నిబంధ‌న ఉంది. ఇక్క‌డా ఆ నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తూ.. జ‌గ‌న్ హ‌యాంలో గో.. గోల్ మాల్ జ‌రిగితే.. స్వామికి క‌నీసం ప్ర‌శ్నించాల‌ని అనిపించ‌దు. ఇది ఎందుకో తేలాల్సి ఉంది.  జ‌గ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి మ‌ధ్య ఏవైనా ఒప్పందాలున్నాయా? లేక మ‌రేదైనా  మ‌త‌ల‌బు దాగి ఉందా? ఆ స్వామివారే వెలికి తీయాలి..  త‌మ‌ కూట‌మి  ప్ర‌భుత్వ పాల‌న అన్న క‌నీస కన్సర్న్ లేకుండా స్వామి చేస్తున్న ఈ ఆధ్యాత్మిక విధ్వంసానికి అడ్డుక‌ట్ట ఎప్పుడో కూడా ఆ వెంక‌టేశ్వ‌రుడే చెప్పాల‌ని అంటున్నారు ప‌లువురు శ్రీవారి భ‌క్తులు.