మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించారు.  బుడగట్లపాలెం సముద్రతీరంలో మత్య్సకారుల వద్దకు వెల్లి వారి జీవన విధానాన్ని పరిశీలించారు.  అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మత్స్య కారులను ఆదుకుంటామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని.. ఎన్ని కష్టాలున్నా మీ పరిస్థితి మారుస్తామని తెలిపారు.  ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్‌ వెళ్లినా.. ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ పని చేసేవారు ఇక్కడి వారే. 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదే.  ఈ జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశాను. నేనూ బటన్‌ నొక్కవచ్చు.. కానీ,  మీ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చా. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయం పెంచాలి. ప్రజల జీవనప్రమాణాలను మెరుగుపరచాలి. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. గత ప్రభుత్వ హయాంలో రూ.10లక్షల కోట్లు అప్పులు చేశారు. వాటితో ఏం చేశారో లెక్కలు కూడా లేవు. గతంలో ఎర్రన్నాయుడు ఉద్దానం ప్రాంతానికి నీళ్లు సాధించారు. ఎంపీ రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం పూర్తికాబోతోందన్నారు.  దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుంది. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే 6 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశాం. ఎచ్చర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. స్థానిక ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే వచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు అన్నారు. రూ. 1990 కోట్లతో 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు రూ. 33 వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

కన్నడ నటి రన్యారావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

  గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెతో పాటు మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ ఎస్. విశ్వనాథ్ శెట్టి ఈ మేరకు తీర్పు వెలువరించారు. డీఆర్ఐ అధికారుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నిందితుల అభ్యర్థనలను తోసిపుచ్చారు. గత నెలలో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె వద్ద నుంచి సుమారు 14.7 కిలోల గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసులో రన్యాతో పాటు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తనను బెదిరించి ఇరికించారని రన్యారావు మొదట చెప్పినట్లు అధికారులు తెలిపారు.  కానీ, డీఆర్ఐ లోతైన దర్యాప్తులో భాగంగా, ఈ బంగారం అక్రమ రవాణాలో రన్యారావు కొన్నేళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలిందని అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయవద్దని గట్టిగా వాదించారు.ఈ కేసులో మూడో నిందితుడిగా (ఏ3) ఉన్న ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్‌ను కూడా డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బెయిల్ కోసం రన్యారావు చేసిన ప్రయత్నాలు ఇప్పటికే రెండుసార్లు విఫలమయ్యాయి. మరో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితి లేదు. ఆమెపై నమోదైన కేసుల తీవ్రత దృష్ట్యా ఏడాది పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రన్యా రావుపై అక్రమ రవాణా నిరోధక చట్టం కింద అధికారులు అభియోగాలు మోపారు. దీంతో ఒక సంవత్సరం పాటు నిర్బంధంలో ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి. రన్యారావుపై కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ , 1947 (COFEPOSA) కింద కేసు నమోదు చేసినట్లు శుక్రవారం సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. కోఫెపోసా చట్టం కారణంగా ఒక సంవత్సరం పాటు బెయిల్ లభించే అవకాశం ఉండదని తెలుస్తోంది. 

వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉండి ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించినట్లు సమాచారం. వివేకా మర్డర్ కేసులో ఫస్ట్ నుంచి సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరుగురు సాక్షులు ఇలా మరణించడంతో, ముఖ్యంగా కీలక సాక్షి రంగన్న మృతి తర్వాత, ప్రభుత్వం ఈ వరుస మరణాలపై దృష్టి సారించి సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సిట్ అధికారులు పులివెందులలో ఉంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ దర్యాప్తులో భాగంగా, వివేకా హత్య కేసులో మరో సాక్షిగా ఉన్న కసునూరు పరమేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు నేడు విచారిస్తున్నారు. మొదట తనకు నోటీసులు ఇవ్వలేదని పరమేశ్వర్ రెడ్డి వాదించినప్పటికీ, పోలీసులు ఆయనను ఇంటి నుంచి పులివెందులలోని విచారణ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. తాజాగా, ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు కూడా సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. రంగన్న మృతికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆమె నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. సుశీలమ్మను కూడా ఈ రోజు సాయంత్రం విచారించవచ్చని భావిస్తున్నారు.

రేపటిలోగా వెళ్లిపోండి.. భాగ్యనగరంలో ఉన్న పాకిస్థానీల‌కు నోటీసులు

  కాశ్మీర్ ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న న‌లుగురు పాక్ పౌరుల‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ వీసాల‌తో ఉంటున్న‌ట్లు గుర్తించారు. రేప‌టిలోగా నగరం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కాగా, భాగ్య‌న‌గ‌రంలో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్న‌ట్లు పోలీసుల త‌నిఖీల్లో తేలింది.  ఉగ్రదాడి నేపథ్యంలో  భార‌త ప్ర‌భుత్వం పాకిస్థానీల‌ను దేశం నుంచి వెళ్ల‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప‌లు రాష్ట్రాల్లో పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు.  త‌నిఖీలు చేప‌ట్టి పాకిస్థానీల‌ను గుర్తిస్తున్నారు. హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు ఇచినట్లు తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు షార్ట్ టర్మ్ వీసా (STV) హోల్డర్స్ గా ఉన్నట్లు గుర్తింపు. రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఈ నెల 27 తర్వాత వీసాలు రద్దవుతాయి డీజీపీ జితేందర్ తెలిపారు. మెడికల్‌ వీసా దారులకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులివ్వలేం : కోర్టు

  నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. నూతన న్యాయ చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని పేర్కొంది. కాగా, మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్లో కాంగ్రెస్ అగ్రనేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా ఈడీ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.సుమారు రూ. 5,000 కోట్ల మేర మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఈ చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ పరిణామం సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై క్రిమినల్ విచారణ ప్రారంభించే దిశగా ఈడీ వేసిన కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చార్జిషీట్‌లో ఐదుగురు వ్యక్తులు, రెండు కంపెనీలను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో గాంధీ కుటుంబానికి నియంత్రణ వాటా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థతో పాటు, గాంధీ కుటుంబానికి సన్నిహితులుగా భావించే కాంగ్రెస్ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి వారు ఉన్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన లావాదేవీలు, నిధుల మళ్లింపును ధృవీకరించే పత్రాలను కూడా ఈడీ కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.గత కొన్నేళ్లుగా ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు దివంగత కాంగ్రెస్ కోశాధికారులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లను కూడా ఈడీ గతంలో పలుమార్లు ప్రశ్నించింది  

మూడు రోజులు భారీగా ఎండ తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

  తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ముఖ్యంగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. తీవ్ర ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రెండు వారాలుగా ఎండ తీవ్రతలు అధికంగా ఉండటంతో 30 మంది వరకు వడదెబ్బ కారణంగా మరణించారు. అలాగే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ  అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎటువంటి బయట పనులు పెట్టుకోవద్దని సూచించిచారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొవాలని, నిత్యం శరీరానికి నీటిని అందించాలని, ముఖ్యంగా పండ్ల రసాలను తీసుకొవాలని తెలిపారు

వంశీని సర్కార్ వేధిస్తోందంట.. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన పంకజాక్షి

అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు దౌర్జన్యాలు, కిడ్నాప్ లు, బెదరింపులకు పాల్పడిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు  పెట్టి  వేధిస్తున్నదంట. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారాలోకేష్  పై అనుచిత వ్యాఖ్యలు ేసినప్పుడూ, గన్నవరం  తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ఉసికొల్పిన సమయంలోనూ.. అదే కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించినప్పుడూ నోరెత్తిని ఆ గొంతు ఇప్పుడు లేస్తోంది. ఇంతకీ  ఆ గొంతు ఎవరిదంటే వల్లభనేని వంశీ సీమణి  పంకజాక్షిది. ఔను  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తన భర్తపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందంటున్నారు వల్లభనేని  పంకజాక్షి.  ఈ మేరకు ఆమ రాష్ట్ర వర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదు చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 25) విజయవాడలోని రాజ్ భవన్ కు  వెళ్లి ఫిర్యాదు చేశారు  తన భర్త వల్లభనేని వంశీ పట్ల కూటమి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌ కు చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ సందర్భంగా ఆమె వెంట వైసీపీ నేతలు నేతలు  మాజీ మంత్రి పేర్ని నాని,  ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ కూడా ఉన్నారు.  జగన్‌   హయాంలో చంద్రబాబు మీద, లోకేష్‌ మీద, టీడీపీ మీద, నారా భువనేశ్వరి మీద వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు, అదే టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసు, భూ ఆక్రమణ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో  రిమాండ్‌ ఖైదీగా  ఉన్నారు.

అయితే అటు లేకపోతే ఇటు.. దానం డ్యుయల్ పాలిటిక్స్

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు.  బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో? ఏమో? ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. సర్కారుని ఇరుకున  పెట్టేలా  తాజాగా బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ విజయవంతం అవుతుందంటూ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  బీఆర్ఎస్ పాతికేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 27) వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై దానం స్పందించారు. బీఆర్ఎస్ మహాసభ విజయవంతం అవుతుందనీ,  కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ఏం మాట్లాడతారన్న విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దానం నాగేందర్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇక  కీలక పోస్టులో ఉంటూ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విషయంపైనా దానం పాజిటివ్‌గా స్పందించారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న ‘హాయ్‌ హైదరాబాద్‌’ అనే ఎక్స్‌ హ్యాండిల్‌ పోస్ట్‌ చేసిన ఫొటోను స్మితా సబర్వాల్‌ రీపోస్ట్‌ చేశారు. సేవ్‌ హైదరాబాద్‌, సేవ్‌ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్‌ రాక్‌ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. వినిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్‌ ఫొటో అంటూ అభియోగాలు మోపారు.  ఆ మేరకు బీఎన్‌ఎస్‌ 179 సెక్షన్‌ కింద స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్‌ విచారణకు హాజరయ్యారు. ఆ విషయాన్ని ఎక్స్  ద్వారా స్మిత వెల్లడించారు. తన విచారణను పోలీసులు రికార్డ్‌ చేశారని, స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత స్మిత ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. చట్టపరిధిలో పోలీసులకు సహకరించినట్టు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా పోలీసులను తాను కొన్ని ప్రశ్నలు అడిగినట్టు వెల్లడించారు. ఆ పోస్టును 2వేల మంది రీషేర్‌ చేశారని .. వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా.? అని స్పష్టత కోరినట్లు పేర్కొన్నారు . విచారణ తర్వాత కూడా గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్మితా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.  దాంతో పలువురు కాంగ్రెస్‌ నాయకులు స్మితా సబర్వాల్‌పై మండిపడుతున్నారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.  కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తున్నారు. 10 ఏళ్లలో 13లక్షల చెట్లు నరికినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడుతున్నారు. స్మితా సబర్వాల్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకోసం చెట్లను నరికేస్తే ఎందుకు నోరు  విప్పలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో మౌనంగా ఉండి, ఇపుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇబ్బందికరంగా పోస్టులు పెడితే అది ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ అవుతుందా అని నాగేశ్వర్ ప్రశ్నించారు. అయితే దానం నాగేందర్ మాత్రం సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు మద్దతుగా మాట్లాడటం చర్చనీయంశమైంది. ఆమె నిజాయితీ గల అధికారి అనీ, వాస్తవాలను మాత్రమే సోషల్ మీడియాలో పంచుకున్నారని  దానం కితాబు ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటన్న చర్చ  నడుస్తంది.  కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్‌ పోస్టులను ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావిస్తుంటే,  దానం నాగేందర్ మాత్రం  ఆమెకు మద్దతు ప్రకటించడం హాట్ ‌టాపిక్‌గా మారింది. మళ్లీ బీఆర్ఎస్‌ ప్రస్తావన తెచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పోస్టులు పెడుతున్న స్మితాకు కితాబు ఇవ్వడం వెనుక అంతర్యం ఏంటని ఆయన అనుచరులతో పాటు కాంగ్రెస్ వర్గాలూ చర్చించుకుంటున్నాయి. దానం వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లు అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం, బీఆర్ఎస్‌ను పరోక్షంగా సమర్థించడం వెనక వ్యూహం ఏంటన్న చర్చమొదలైంది. కాంగ్రెస్‌లో దానం నాగేందర్‌కు ప్రముఖ పదవులు లేదా గుర్తింపు లభించకపోవడంతో, బీఆర్ఎస్‌ ప్రస్తావన తీసుకొస్తూ,  ఎమోషనల్ బ్లాక్‌మెయి లింగుకి దిగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఫార్ములా-ఈ కార్ రేస్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వాదనను సమర్థిస్తూ దానం మాట్లాడారు. ఫార్ములా-ఈ కార్ రేస్‌తో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌  పెరిగిందనే విధంగా దానం నాగేందర్ మాట్లాడటం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. అలాగే హైడ్రా కూల్చివేతలపైనా విమర్శలు చేశారు. ఈ విమర్శలు బీఆర్ఎస్ వాదనలతో సమానంగా ఉండటం కూడా చర్చకు దారి తీసింది. తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు మద్దతుగా దానం మాట్లాడుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ తరుపున పోటీ చేసిన దానం ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత దానం తీరులో మార్పు వచ్చిందనే టాక్ నడుస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నప్పుడే పదవులు ఆశించారంట. 2018లో దానం నాగేందర్ బీఆర్ఎస్‌లో చేరినప్పుడు కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో  ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట.  ఆ క్రమంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ద్వారా దానం బీఆర్ఎస్‌కు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఓ వైపు సుప్రీంకోర్టులో అనర్హత వేటు కేసు విచారణ జరగుతుండడం, స్థానికంగా ఉన్న ఇబ్బందులతో దానం మళ్లీ కారు పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్

  ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్రం శుభవార్త  చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను విడుద‌ల చేసింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్స‌రానికి సంబంధించిన నిధుల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఖ‌జానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జ‌మ‌య్యాయి. ఇందులో 70 శాతం గ్రామ పంచాయ‌తీల‌కు, మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు 20 శాతం, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు 10 శాతం చొప్పున నిధుల‌ను కేటాయించ‌నున్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఆయా గ్రామ పంచాయ‌తీల బ్యాంక్ ఖాతాల‌కు ఆర్థిక శాఖ అనుమ‌తితో పంచాయ‌తీ రాజ్ శాఖ నిధుల‌ను జ‌మ చేయ‌నుంది. 2024 నుంచి 2025 సంవత్సరానికి గాను రెండో విడుదగా కేంద్రం నుంచి ఈ నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇప్పటికే అమరావతి కోసం భారీగా ప్రత్యేక నిధులు కేటాయించారు

తిరుమలలో భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 12 గంటల సమయం

  తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ సాధారణం ఉంది. టోకెన్లు లేని భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి 26 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉంది. శుక్రవారం 64వేల 536 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30వేల 612మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా భక్తులు 3 కోట్ల 36 లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.. విద్యాసంస్థలకు వేసవి సెలవులతో పాటు వారాంతపు సెలవులు  కలిసి రావటంతో భక్తులు కుటుంబసభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు.. ముందుముందు మరింత మంది?

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని శుక్రవారం(ఏప్రిల్ 25) సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని  విజయవాడకు తరలించారు. శనివారం (ఏప్రిల్ 26) కోర్టులో హాజరు పరచనున్నారు.   ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు ఇప్పిటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు.  వైసీపీ హయాంలో మద్యం క్రయ విక్రయాల్లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో కోరడంతో పాటు ఇందుకు సంబంధించిన వివరాలను హోంమంత్రి అమిత్ షా‌ను కలిసి అందించారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది.   అదలా ఉంటే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఈ కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సాక్షిగా విచారణకు పిలిచిన అధికారులు.. చార్జిషీట్ లో మాత్రం నిందితుడిగా చేర్చారు. దీనిని బట్టి విజయసాయిని అప్రూవర్ గా మార్చేందుకు అధికారులు రంగం సద్ధం చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి  విశ్లేషణలకు వాస్తవమేననడానికి చార్జిషీట్ లో తనను నిందితుడిగా చేర్చినట్లు తెలియగానే.. విజయసాయి మద్యం కుంభకోణానికి సంబంధించినంత వరకూ తనకు తెలిసిన ప్రతి విషయం, ఈ స్కాంతో సంబంధం ఉన్న అందరి  గురించీ చెబుతానంటూ ఓ ట్వీట్ చేశారు.  దీంతో మద్యం కుంభకోణం విషయంలో విజయసాయి అప్రూవర్ గా మారిపోయారనది అవగతమౌతోందంటున్నారు.  అయితే ఇప్పటికిప్పుడు విజయసాయిరెడ్డిని పోలీసు అధికారులు విశ్వసించే అవకాశాలు  లేవనీ, తాము దర్యాప్తులో కనుగొన్న అంశాలు, విజయసాయిరెడ్డి చెబుతున్న  అంశాలూ బేరీజు వేసుకున్న తరువాత మాత్రమే ఆయన నిజాలే చెబుతున్నారని నిర్ధారించుకున్న వరువాత మాత్రమే విజయసాయిని పోలీసులు విశ్వసించే అవకాశం ఉందంటున్నారు.  ఇలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో తాజాగా అరెస్టైన సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన సమాచారం విజయసాయి  రెడ్డి ద్వారానే పోలీసులకు అందిందంటున్నారు.  లిక్కర్ స్కాంలో సజ్జల శ్రీధర్ రెడ్డి  మద్యం కంపెనీల నుంచి ఉత్పత్తికి తగ్గట్లుగా   ముడుపులు వసూలు చేయడంలో   కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.  ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజ్ తో పాటు  ఏ8 చాణక్యను అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. రానున్నరోజులలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందంటున్నారు.  

హాం ఫట్.. అధికారుల భూమ్ ఫట్

  అవినీతి అనగానే రాజకీయ నాయకులే గుర్తొస్తారు. అందులోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణ,అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అయ్యే పని కాదని అనుకుంటాము, కానీ, అది సంపూర్ణ సత్యం కాదు. రాజకీయ నాయకులలో ఎక్కడో అక్కడ ఒకరో ఇద్దరో నిజాయతీ పరులు ఉన్నట్లుగానే, ప్రభుత్వ అధికారులలోనూ, ప్రభుత్వ భూములను ఇతరత్రా భూమలను అక్రమంగా సొంత చేసుకోగల సమర్ధులు ఉంటారు.ఉన్నారు.అంతే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  అవినీతి గ్రాఫ్’ కు పార్లర్’గా అవినీతి అధికారుల గ్రాఫ్’కూడా పెరుగుతోందని’ అధికార వర్గాల్లోనే వినిపిస్తోంది.నిజానికి ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేరు అంటారు, కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సార్ల భూదందా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే వుంది. సంచలనం అవుతోంది.  ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించి సంచలనమ మారిన వివదాన్నే తీసుకుంటే, తెలంగాణ హై కోర్టు ఈ కేసులో చాలా కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ కేసులో, ఆరోపణలు ఎదుర్కుంటున్న వారంతా, ఉన్నత స్థానాల్లో ఉన్న,ఉన్నతాదికారులని,అలాగే, వారిపై  రోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. రాష్ట్ర హై కోర్టు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసిందంటే, పెద్ద సార్లు, భూదందాలో ఎంతటి సమర్ధులో  వేరే చెప్ప నక్కర లేదు. అంతే కాదు, రాష్ట్ర హై కోర్టు’ రాష్ర వ్యాప్తంగా భూదాన భూముల దురాక్రమణలు, అక్రమాల పై విచారణ జరిపి నిజాలను నిగు తేల్చేందుకు సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఇందుకు సంస్థ సంసిద్ధంగా ఉందా, లేదా తెలియచేయాలని సిబిఐకి నోటీసులు జారీ చేసింది.అంతే కాదు, ఈ భూముల్లో అక్రమాలు జరిగాయని, పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపవద్దని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వంతో పాటు ఇడి, సిబిఐ, పిటిషన్‌లో పేర్కొన్న అధికారులు,వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. మహేశ్ అనే వ్యక్తి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,వారి కుటుంబసభ్యులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది.  పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భూదాన్ బోర్డుకు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలాలంటే సిబిఐ లేదా ఇడి వంటి స్వతం త్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ అం శంపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు.తదుపరి విచారణను హైకోర్టు జూన్ 26కు వాయిదా వేసింది. భూములకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయనే అభియోగాలపై విచారణకు ముగ్గు రు సభ్యులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, రఘునందన్‌రావు, శశాంక్‌లతో కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పింది.  నాగారం గ్రామంలోని సర్వే నెం.181,182లో 103.22 ఎకరాల భూదాన్ భూముల అక్రమాలపై కూడా అదే కమిటీ విచారిస్తున్నదని గతంలోనే హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది.అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అక్రమ సంపాదనతో, బినామీ పేర్లతో  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పెద్ద సార్లు ఐఎఎస్,ఐపీఎస్’లు,ఉన్నారని,అంటున్నారు. అవునుమ నలుపును తెలుపు చేసుకునేందుకు, కాకుంటే, గుట్టుచప్పుడు కాకుండా దోచిన సొమ్ములను దాచుకునేదుకు పెద్ద సార్లు,రియల్ వ్యాపారాన్ని నమ్ముకునారని అంటారు. నిజానికి బయటకు వస్తున్నది, చాలా తక్కువ అంటున్నారు. విశాఖ, విజయవాడ, హైదరాబద్’ సహా అనేక ప్రధాన నగరాలు, పట్టణాలలో, కొండకచో ఇతర రాష్ట్రాల్లోనూ, పెద్ద సార్లు రియల్’ దందాను దిగ్విజయంగా నడుపుతున్నారనే ఆరోపణలకు కొదవ లేదు. అయితే, అంతిమంగా ఏమి జరుగుతుంది, ఆవినీతికి సంకెళ్ళు పడతాయా అంత అనుమానమే అంటున్నారు

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపండి : సీఎం రేవంత్ రెడ్డి

  పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రవాద చర్యలను ఖండించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారని ఆయన తెలిపారు.ఇందిరాగాంధీని వాజ్ పేయి దుర్గామాతతో పోల్చారని ఆయన పేర్కొన్నారు. దుర్గామాత భక్తుడైన ప్రధాని మోదీ ఉగ్రమూకలకు గట్టి జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు.ఈ శాంతి ప్రదర్శన పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ట్యాంక్‌బండ్‌పై ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో బాధితులకు సంఘీభావం తెలపాలని, ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో శాంతియుత నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌

  వక్ఫ్‌ సవరణ చట్టంను సమర్థిస్తూ మోదీ సర్కార్  సుప్రీంకోర్టు లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌ వేసింది. ఈ చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై పిటిషన్లు ఉన్నాయని ఆరోపించింది. ఆర్టికల్‌ 32 ప్రకారం ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షించవచ్చని తెలిపింది. కాకపోతే పార్లమెంటరీ ప్యానెల్ ద్వారా సమగ్రమైన, లోతైన, విశ్లేషణాత్మక అధ్యయనం అనంతరమే వక్ఫ్‌ చట్టానికి సవరణలు చేశామని తెలిపింది. గతంలో ఉన్న నిబంధనలతో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం జరిగిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.  ఈ మేరకు 1332 పేజీలతో దాఖలు చేసిన ప్రాథమిక కౌంటర్‌ అఫిడవిట్‌లో ఈ చట్ట సవరణలను సమర్థించుకుంది. 2013 తర్వాత ఆశ్చర్యకరంగా వక్ఫ్‌ భూమి భారీగా పెరిగిందని పేర్కొంటూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ షేర్షా సీ షేక్ మొహిద్దీన్ అఫిడవిట్ దాఖలు చేశారు. వక్ఫ్‌ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ 72 పిటిషన్లు దాఖలు కాగా.. వాటిపై ఏప్రిల్‌ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ముందు దీనిపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం అయితే అప్పటివరకు వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది.  

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..అమరావతి నిర్మాణ పనులపై చర్చ

  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సుమారు రూ. లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌మ్యాప్‌ తయారు చేసింది.వెలగపూడి సచివాలయం వెనక అమరావతి పునఃప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్‌షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపు 30 వేల మంది పాల్గొంటారని అంచనా. రూ.లక్ష కోట్ల పనుల ప్రారంభ సూచికగా ప్రధాని మోదీ.. పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ప్రధానితో భేటీ సమయంలో అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.  వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన తోడ్పాటును అందించాలని ప్రధానిని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యేందుకు అంగీకరించారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే రోజున దాదాపు 30 వేల మందితో ఒక రోడ్‌షో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం

  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పిఠాపురంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని తమ ప్రభుత్వం మాట ఇస్తే నెరవేరుస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్  అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు ప్రధాని మోదీ, సీఎంచంద్రబాబుల నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు. స్వారత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. "అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నాం" అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.  పిఠాపురం మున్సిపాలిటీకి రూ.3 కోట్ల మంజూరైనట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న హామీల అమలును ముందుకు తీసుకెళ్లున్నట్లు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు.

వంశీ, రాజ్ కసిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు.. ఒకే జైలు.. ఒకే బ్యారక్

వేర్వేరు కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రముఖులు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఒకే బ్యారక్‌లో  ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్మలానీని వేధించిన కేసులో అరెస్టయిన పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ జైలులోని ఒకే బ్యారక్‌లో వేర్వేరు సెల్స్‌లో రిమాండ్‌లో ఉన్నారు.  తెలుగుదేశం కార్యాలయ సిబ్బంది కిడ్నాప్ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ఇప్పటికే  చాలా రోజులుగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. తాజాగా, మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఒకరి తర్వాత ఒకరు ఇదే జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చారు.  ఈ ముగ్గురినీ కూడా ఒకే బ్యారక్ లోని వేరువేరు సెల్స్ లో జైలు అధికారులు  ఉంచారు.   ముగ్గురు ప్రముఖులు ఒకే బ్యారక్‌లో ఉండటంతో జైలు అధికారులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. వారి కదలికలను పర్యవేక్షించేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురి సెల్స్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వేర్వేరు కేసుల్లో అరెస్టయిన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే బ్యారక్‌లో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉండగా వల్లభనేని వంశీ, పీఎస్సార్ ఆంజనేయులు మధ్య గతంలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండేవని చెబుతారు. మొత్తం మీద జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ముగ్గురు ప్రముఖులు.. ఆ సమయంలో తాము చేసిన చర్యల కారణంగా అరెస్టై ఒకే జైలులో ఒకే బ్యారక్ లో ఉండటం కాకతాళీయమే అయినా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

అధికార లాంఛనాలతో ముగిసిన చంద్రమౌళి అంత్యక్రియలు

  జమ్ముకశ్మీర్‌‌లో పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన విశాఖ వాసి జేఎస్ చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. ఇవాళ చంద్రమౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం పాండురంగాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర మొదలవగా.. భారీగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. కూటమి నేతలు కూడా చంద్రమౌళి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కశ్మీర్ లోని పహెల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి. ఈ రోజు చంద్ర మౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృత దేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా ఆయన కుమార్తె తీవ్రంగా రోధించింది. బంధువులు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. అంతకుముందు చంద్రమౌళి నివాసం వద్ద హోంమంత్రి అనిత ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.  అలాగే మంత్రి సత్య కుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అంతిమయాత్రలో పాల్గొని చంద్రమౌళి పాడి మోసారు. అశృనయనాల నడుమ చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. జ్ఞానాపురం స్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రమౌళిని కడసారి చూసేందుకు బంధువులు, వేలాదిగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన నెల్లూరు వాసి మధుసూదన్‌ పార్థివ దేహానికి నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మధుసూదన్‌ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.          

జలాస్త్రమే.. బ్రహ్మాస్త్రం

పాక్ పని అవుట్ ! భారత,పాకిస్థాన్ దేశాల మధ్య ఎప్పుడో 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందానికి చాలా చరిత్ర వుంది. నిజానికి ఉభయ దేశాల మధ్య యుద్దాలు, ఉద్రిక్తలు , సరిహద్దు ఘర్షణలు వంటి అనేక ఆటు పోట్లను ఎదుర్కుని ఇంతవరకూ సజీవంగా నిలిచిన ఒప్పందం ఏదైనా ఉందంటే  అది 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక్కటే. అయితే ఇప్పడు ఆ  పవిత్ర  బంధం కూడా పుటుక్కుమంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కరులు, జమ్మూకశ్మీర్‌లో అత్యంత హేయమైన ఉగ్ర దాడికి పాల్పడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో మన దేశం సింధూ జలాల ఒప్పందానికి  చెల్లు చీటి రాసింది. నిజానికి గతంలోనూ అనేక సందర్భాలలో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ వుంది. నిజానికి దేశాల మధ్యనే కాదు, రాష్ట్రాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందాలు నిత్య కలహాలకు కారణం అవుతున్న తీరును చూస్తున్నాం. ఎక్కడి దాకానో ఎందుకు, నిన్న మొన్నటి వరకు కలిసున్న ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరీ జలాల పంపకాలకు సంబంధించిన ఒప్పందాల  ఉల్లంఘనలు, ట్రిబ్యునల్ తీర్పులు, అనేకం ఉన్నాయి. రైతులు, రాజకీయ పార్టీలు కత్తులు దూసుకున్న సందర్భాలూ  ఉన్నాయి.   అలాగే..  ఇంకా అనేక ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య కూడా జల జగడాలు సాగుతున్నాయి. అయితే.. భారత ,పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక చారిత్రిక ఒప్పందంగా చరిత్రలో మిగిలి పోయింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నదీ జలాల పంపిణీ ఒప్పందాలలో ఒకటిగా  నిలిచింది.  చరిత్రలోకి వెళితే.. 1960లో ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంతో భారత్‌-పాక్‌ ఈ ఒప్పందం పై సంతకాలు చేసాయి. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నదుల నీటిని ఇరుదేశాలు పంచుకొన్నాయి. దీని కింద సింధూ, జీలమ్‌, చీనాబ్‌ నదుల నీరు పాకిస్థాన్‌కు దక్కింది. ఇవి కాకుండా బియాస్‌, సట్లెజ్‌ జలాలు కూడా వెడుతుంటాయి. ఇక మన దేశం భూభాగంలో ప్రవహించే నదీ జలాలను  ప్రవహించే నీటిని మనం వాడుకోవచ్చును. కానీ, జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే వాడుకుని..  మళ్ళీ పాక్ కు వదిలేయాలే కానీ..  ఆ నీటిని నీటిని సాగు, తాగు ప్రయోజనాలకు వాడుకోరాదు.  నిజానికి ఎగువన ఉన్న దేశంగా మనం ప్రాజెక్టులు కట్టుకుని, నీటిని నిల్వ చేసుకున్నా.. మళ్ళించి మన అవసరాలకు వాడుకున్నా..  పాకిస్థాన్ గొంతు తడవదు. పంట పొలాలు నీరు  అందదు.  పాకిస్థాన్ నీటి అవసరాలకు 80 శాతం వరకూ  ఈ ఒప్పంద పరిధిలో అందుతున్న నీరే  ఆధారం. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే..  సింధూ జలాల ఒప్పందమే పాకిస్థాన్  ను బతికిస్తున్నది. ఆదే  ఆ దేశానికి జీవాధారం, జీవనాధారం. పాకిస్థాన్ నీటి సరఫరా అత్యధికంగా ఈ నదుల పైనే ఆధారపడింది.  ఆ దేశంలో 23.7 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు. కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి. పాక్‌ వ్యవసాయానికి వాడే నీటిలో  80శాతం ఈ ఒప్పందం కింద లభించేదే.  16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. ఆ దేశ జీడీపీలో 23 శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68 శాతం ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు. సింధూ బేసిన్‌ నుంచి పాక్‌కు 154.3 మిలియన్ ఎకరాల అడుగుల (ఎమ్‌ఏఎఫ్‌) నీటిని ఏటా సరఫరా చేస్తోంది. ఆ దేశ ఆహార భద్రతకు ఇది చాలా కీలకం. పాకిస్థాన్‌ ఇప్పటికే తీవ్రమైన నీటి కరవులో ఉంది. ఆ దేశ ఇరిగేషన్‌ మేనేజ్‌మెంట్‌ అధ్వాన స్థితికి చేరింది. భూగర్భజలాలు పడిపోతున్నాయి.  పాకిస్థాన్‌ విద్యుత్ కు కీలకమైన మంగల డ్యామ్‌ను జీలమ్‌ నదిపై నిర్మించారు.  ఏటా ఆ దేశ విద్యుత్తు ఉత్పత్తిలో 8 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్‌ పాక్‌ వినియోగంలో 16 శాతానికి సమానమైన విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. తాజాగా సింధూ జలాల ఒప్పందంతో పాక్‌లో 24శాతం జల విద్యుత్ పై ప్రతికూల ప్రభావం పడనుంది. పాకిస్థాన్‌ జీడీపీలో 25శాతం ఈ నదుల నుంచే లభిస్తోందంటే.. భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చును.  అయితే మన దేశం ఒప్పందం నిలిపివేసినా.. పాకిస్థాన్ పై తక్షణ ప్రభావం పెద్దగా ఉండదని..  గతంలో సింధూజలాల కమిషనర్‌గా పనిచేసిన ప్రదీప్‌కుమార్‌ సక్సెనా  వంటి నిపుణులు అంటున్నారు. అవును. మన దేశం తీసుకున్న కఠిన  నిర్ణయం ప్రభావం  పాక్‌పై తక్షణమే పడకపోవచ్చు. నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాంకేతికంగా సాధ్యం కాదు. సింధూ జలాలను నిల్వ చేయడానికి.. మళ్లించడానికి తగిన వసతులు లేవు.  అయిత డ్యాముల నిర్మాణానికి ఇంతవరకు ఉన్న అవరోధాలు   ఈ నిర్ణయంతో తొలిగి పోతాయి. కానీ..  తక్షణం నిర్మాణాలు చేపట్టినా, అవి పూర్తయ్యే సరికి ఎంత కాలం పడుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు.  అలాగే..  ప్రస్తుత ఉద్రిక్తలు కొంత సర్డుమణిగిన  తర్వాత,  ప్రపంచ బ్యాంకు,  లేదా ఎ అమెరికానో పట్టుకుని ఒప్పందాన్ని పునరుద్దరించుకో వచ్చనే ఆలోచనతో పాక్ నేతలు ఉన్నారని అంటున్నారు. మరోవంక భారత ప్రభుత్వం దీన్నొక అవకాశంగా తీసుకుని, పాకిస్థాన్  ఉగ్ర చర్యలకు జలాస్త్రంతో సమాధానం చెప్పాలని కృత నిశ్చయంతో ఉందని అంటున్నారు.