జోరందుకున్న సైకిల్ స్పీడు

      తెలుగుదేశం పార్టీలోకి భారీ స్థాయిలో నాయకులు వలస వెళ్తున్నారు. సీమాంధ్రలో సైకిల్ స్పీడు పెరిగింది. వివిధ పార్టీల నుంచి చేరికల జోరు ఊపందుకుంది. సోమవారం ఒక్కరోజే కాంగ్రెస్, జగన్ పార్టీలకు చెందిన సుమారు 20 మందికి పైగా నేతలు పచ్చ కండువాలు కప్పించుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తిప్పేస్వామి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తదితరులు టీడీపీలో చేరారు. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్‌సీ రెడ్డి (తిరుపతి), చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి జి. శంకర్ యాదవ్, తిరుపతి నియోజకవర్గానికి చెందిన హరిప్రసాద్, నరసాపురం కాంగ్రెస్ నేతలు పొత్తూరు రామాంజనేయరాజు, అన్నా రామచంద్రయ్య, హరికుమార్ టీడీపీ గూటికి చేరారు. అనంతపురం జిల్లాకు చెందిన వి.రామ్మూర్తి, మాజీ ఎంపీ డి. పుల్లయ్య కుమారుడు దరూరి రమేశ్ చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పెద్దాపురం నుంచి దావూలూరి దొరబాబు, అమలాపురం నుంచి ఎస్. నాగేశ్వరరావు, హనుమాన్ జంక్షన్‌కు చెందిన వీరమాచినేని సత్యప్రసాద్, ఎనికపాడుకు చెందిన గోగం బాలకోటేశ్వరరావు కూడా దేశంలో చేరారు. తులసీ గ్రూప్ సంస్థల అధినేత తులసీ రామచంద్ర ప్రభు టీడీపీలో చేరేందుకు నిశ్చయించుకున్నారు. సోమవారం రాత్రి ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనను గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈయన గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీచేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఆయన మేనల్లుడు, కురుపాం ఎమ్మెల్యే జనార్దన థాట్రాజ్ , నోవా విద్యాసంస్థల అధినేత, కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్తం శెట్టి కృష్ణారావు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

గులాబీ కారులో సీట్ల కోసం ఫైట్

  ఎన్నికల దారిలో కనిపించిన కాంగ్రెస్ వారందరికీ లిఫ్ట్ ఇచ్చి మరీ కారు ఎక్కించుకుంటున్న కేసీ..యార్.. టికెట్ కోసం వెనుక సీట్లో జరుగుతున్న ఫైట్ చూసి డ్రైవింగ్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు. తెలుగు తమ్ముళ్ళు, ఇతరుల వలసలతో బెంబేలెత్తిపోతున్న టీఆర్ఎస్ నేతల అసంతృప్తి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి రెండు సార్లు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సయ్యద్ ఇబ్రహీంను కాదని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కు గులాబీ దళపతి టికెట్ కేటాయించారు. దీనిపై టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ కూడా అయిన ఇబ్రహీం తీవ్రమైన ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఇస్తామని కేసీయార్ ప్రకటించినా..ఇబ్రహీమ్ వర్గీయులు సంతృప్తిచెందలేదు. దీంతో ఎన్నికల సమయానికి సమీకరణాలు మారే అవకాశం ఉంది.   నల్గొండ జిల్లాలో ముఖ్యనేతగా, టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందిస్తున్న చెరకు సుధాకర్ అసెంబ్లీ టికెట్ కోసం వినూత్న నిరసనలు దిగారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెరకు సుధాకర్ బెదిరించారు. ప్రత్యెక తెలంగాణా ఉద్యమం సమయంలో పీడీయాక్ట్ కింద చెరుకు సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం వివాదస్పదమైంది. రాష్ట్ర హైకోర్టు జోక్యంతో సుధాకర్ ను విడుదల చేశారు. అయితే చెరుకు సుధాకర్ కు కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తున్నారనే సమాచారం అందుకున్న అనుచరులు నకిరేకల్ లో సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించారు.   తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి తనకు టీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అవకాశం కల్పించాలని కేసీఆర్ ను కోరినా అటునుంచి ఎటువంటి స్పందన లేదు. తనకు నచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చేందుకు సొంత సర్వేల పేరుతో ఉద్యమకారులను, అమరుల బంధువులను, పదేళ్లకు పైగా టీఆర్ఎస్ కష్టనష్టాల్లో వెన్నంటి ఉన్న తమకు అన్యాయం చేస్తున్నారని తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు ఆశావహులు.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సభ

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపిస్తూ చేసిన రెండు గంటల ప్రసంగం ప్రజల్నిఆకట్టుకోనెలా వుంది. జెండా వుంది కాని ఎజెండా గురుంచి ఎక్కువగా మాట్లాడలేదు. పార్టీ కార్యాచరణ, పార్టీ కోసం కార్యకర్తలు, ఫాన్స్ ఏం చేయాలి అనే దానిపై దిశానిర్దేశం చేయలేదు. దీనిని పార్టీ ఆవిర్భావ సభ అనే కంటే పవన్ వ్యక్తిగత సభ అని అనుకోవచ్చు. సామాన్య ప్రజలకు దగ్గరయ్యేందుకు పవన్ ఎక్కువగా ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. చాలా సహజమైన దోరణిలో..యూత్ ని ఆకట్టుకోనేలా ప్రసంగించారు. కాంగ్రెస్ తో తప్ప ఇతరపార్టీలతో పోత్తుకు రెడీగా వున్నానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీతో పోత్తు పెట్టుకోవాలి అనే దానిపై ఆయనకి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. వలసలను ప్రోత్సహించనని అన్నారు. చిరంజీవి పెట్టిన పీఆర్పీ పార్టీకి 17శాతం ఓట్లు వస్తే, పవన్ కళ్యాణ్ కి మాత్రం 3 లేదా నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు మాత్రమే వున్నాయి. పవన్ తెలంగాణకు ఎక్కువగా ప్రధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసిఆర్ ను టార్గెట్ చేసి..సీమాంధ్ర ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ నిర్ద్వందంగా తనకు ఏ (కాపు) కులస్థుల మద్దతు అవసరం లేదని, ఎందుకంటే తను పదవులకోసమో, అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి దేశం నుండి తరిమికొట్టి మళ్ళీ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకే రాజకీయాలలో ప్రవేశించానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి, ఒకేసారి కాంగ్రెస్ పార్టీకి, తను అభిమానించే అన్న చిరంజీవికి, కాపు కుల నేతలకూ కూడా గట్టిగా చురకలు వేశారు. తన పార్టీ విధానాలను జనంలోకి తీసుకెళ్లడానికి మాత్రం పవన్ ఈ రెండు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శకులు అంటున్నారు. అయితే ఆయన పార్టీకి జనాల్లో  క్రేజ్ వచ్చిన కానీ కలెక్షన్లు (ఓట్లు) మాత్రం నీల్ అనే అభిప్రాయాలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.  

కారులో కయ్యం

      కారు ఎక్కాలన్న సరదా అందరికీ ఉన్నా, అందులో పట్టేది కొందరే. సరిగ్గా ఇదే అంశంపై టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. కరీంనగర్ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలతో పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అన్ని చోట్లా టికెట్లను ఆశిస్తున్నవారు పెరిగిపోతుండడంతో గొడవలు ముదురుతున్నాయి. పార్టీలో కొత్తగా చేరేవాళ్లకు టికెట్లు ఇస్తే ఊరుకొనేది లేదని.. సామూహికంగా రాజీనావూలు చేస్తామని మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి హెచ్చరించారు. దీంతో టీఆర్‌ఎస్ టికెట్ల పోరు బజారుకెక్కింది. మంథని నుంచి రాంరెడ్డి, ఆయన తనయుడు సునీల్‌రెడ్డి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. తమకే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్న రాంరెడ్డి కుటుంబానికి, అదేస్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుట్ట మధు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడం ఇబ్బందిగా మారింది. కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలతో మధు చర్చలు జరపడం, పార్టీ కూడా ఆయనకు టిక్కెటు ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రాంరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. రామగుండంలోనూ అదే పరిస్థితి. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ పార్టీ టికెట్ కోసం పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో కోరుకంటి చందర్ టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయగా, పొత్తును ఉల్లంఘించి సోమారపు సత్యనారాయణ టీడీపీ నుంచి నామినేషన్ వేయడానికి రావడం, సకాలంలో బీ-ఫారం రాక స్వతంత్రుడిగా బరిలోకి దిగి విజయం సాధించడం తెలిసిందే. ఈసారి ఇరువురు ఒకే పార్టీలో ఉన్నా సమాంతరంగా గ్రూపులకు సారథ్యం వహిస్తున్నారు. చొప్పదండి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి బొడిగె శోభ టికెట్ ఆశిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య టీఆర్‌ఎస్‌లోకి వస్తారని, లేదంటే టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ కు టికెట్ వస్తుందనే ప్రచారంతో శోభ పార్టీపై గుర్రుగా ఉన్నారు. జగిత్యాలలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.జితేందర్‌రావు, వి.రమణారావుల నడుమ టికెట్ కోసం పోరు కొనసాగుతోంది.  కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టికెట్ తనకే అనే ధీమాతో ఉండగా, టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ సైతం ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

జనసేన రాకతో రాజకీయ కలకలం

  పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేన రాకతో రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ ఒక కుదుపు వచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల తనకున్న అసహ్యాన్ని ఏమాత్రం దాచుకొనే ప్రయత్నం చేయలేదు. దానిని తరిమికొట్టడమే తన లక్ష్యమని ప్రకటించేశారు గనుక ఇక నేటి నుండి కాంగ్రెస్ నేతలందరూ తమ విభేదాలను పక్కన బెట్టి మరీ ఆయనపై విమర్శల వర్షం కురిపించడం ఖాయం. ఇక, బీజేపీకి తాను దూరంగా ఉంటానని స్పష్టంగా చెప్పకపోయినా ఆయన మాటలని బట్టి ఆయన దూరంగానే ఉంటారని అర్ధమవుతోంది. కానీ ఆయన తెదేపాతో పొత్తులకు సిద్దమన్నట్లు సూచించారు గనుక, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆయన, తమను వ్యతిరేఖిస్తున్నట్లు విస్పష్టంగా ప్రకటన చేసే వరకు కూడా ఆయనను తమ మిత్రుడుగానే భావించవచ్చును. ఈ కారణంగా వైకాపా, జై సమైక్యాంధ్ర పార్టీలు కూడా ఆయనను తమ శత్రువులాగే భావిస్తాయి. అదేవిధంగా ఆయన తెలంగాణాలో కూడా తన పార్టీని నిర్మించి అక్కడ కూడా పోటీ చేసేందుకు సిద్దపడున్నందున తెరాస కూడా ఆయనపై యుద్ధం ప్రకటించడం ఖాయమే. బహుశః ఈ పాటికే తెరాస నేతలు యుద్ధం ప్రకటించి ఉండవచ్చును. అయితే, ఒకవేళ ఆయన బీజేపీకి ఏ మాత్రం సానుకూలంగా ప్రకటన చేసినా బీజేపీ ఆయన రాకను స్వాగతించే అవకాశం ఉంది. పవన్, చంద్రబాబు, నరేంద్ర మోడీ ముగ్గురు చేతులు కలిపినట్లయితే, సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో కూడా ఒక బలీయమయిన శక్తిగా అవతరించగలరు.   పవన్ కళ్యాణ్ కాపుల మద్దతు కోసం తాను తహతహ లాడటం లేదని చెప్పినప్పటికీ, ఒకవేళ ఆయన తెదేపాతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, ఆ పార్టీకే మద్దతు ఇస్తామని చెపుతున్న కాపు సామాజిక వర్గం నేతలు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకే మద్దతు ఈయవచ్చును. అయితే పవన్ కళ్యాణ్ జంపింగ్ జిలానీలను, రాజకీయ బఫూన్లను తాను వ్యతిరేఖిస్తున్నాని, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే రాజకీయాలలోకి వస్తున్నానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పినందున, అటువంటి వారితోనే పూర్తిగా నిండిపోయున్న తెలుగుదేశం పార్టీతో ఆయన ఏవిధంగా పొత్తులు పెట్టుకోగలరో వేచి చూడాలి.   రాష్ట్ర విభజనకు కారణమయిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కండువాలు, జెండాలు, టోపీలు మార్చేసి సరికొత్త వేషాలతో ప్రజల ముందుకు వస్తున్న సంగతి పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు. మరి అటువంటి వారిని ఓడించాలని భావిస్తున్న ఆయన తెదేపాతో సహా కిరణ్, జగన్ పార్టీలలో ఉన్న కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొంటే, అన్ని పార్టీలతో ఆయన ఒకేసారి యుద్ధం చేయవలసి ఉంటుంది. అయితే ఆయన తను పదవుల కోసమో అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని స్పష్టం చేస్తున్నందున, ఆయన అందుకు వెనుకాడకపోవచ్చును. అదే జరిగితే కాంగ్రెస్ నేతలు ఏ కండువా కప్పుకొని పోటీ చేసినా వారికి పవన గండం తప్పదని చెప్పవచ్చును.   అయితే పవన్ కళ్యాణ్ ఈ వేడిని ఎంతకాలం నిలుపుకోగలడనే దానిపైనే ఆయన పార్టీ భవిష్యత్త్ మరియు ఇతర పార్టీలపై ఆయన ప్రభావం కూడా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అతను ఎంత త్వరగా, ఎంత సమర్ధంగా, బలంగా తన పార్టీని నిర్మించుకోగలడనే దానిపైన పవన్ కళ్యాణ్, జనసేనల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

మెగా అన్నదమ్ముల సవాల్..

  పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ప్రవేశిస్తాడని కాంగ్రెస్ పార్టీ గ్రహించినందునే చాల దురాలోచనతో పదవి కోసం తహతహలాడిపోతున్న చిరంజీవిని రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా నియమించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతలు తనకే కట్టబెట్టినందుకు బహుశః చిరంజీవి హనుమంతుడిలా పొంగి పోయుండవచ్చును. కానీ తన ద్వారానే లక్షమణుడు వంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ న్ని దూరం చేసి అతనికి చెక్ పెట్టించాలని పధకం పన్నిందని ఆయన గ్రహించలేకపోయారు. గ్రహించలేకపోయారు అనే కంటే పదవి కోసమే ఆయన గ్రహించలేదని చెప్పుకోవడమే సముచితంగా ఉంటుందేమో! కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవికున్న మెగా ఇమేజ్ ద్వారా ప్రజలను, అభిమానులను, చివరికి తన కాపు కులస్తులను కూడా చీల్చి సోదరుడు పవన్ కళ్యాణ్ నుండి దూరం చేయగల సమర్ధుడనే ఆయనకు ఆ పదవి కట్టబెట్టింది.   అయితే పవన్ కళ్యాణ్ నిర్ద్వందంగా తనకు ఏ (కాపు) కులస్థుల మద్దతు అవసరం లేదని, ఎందుకంటే తను పదవులకోసమో, అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి దేశం నుండి తరిమికొట్టి మళ్ళీ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకే రాజకీయాలలో ప్రవేశించానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి, ఒకేసారి కాంగ్రెస్ పార్టీకి, తను అభిమానించే అన్న చిరంజీవికి, కాపు కుల నేతలకూ కూడా గట్టిగా చురకలు వేసారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు చిరంజీవి బయలు దేరితే, దానిని తుడిచి పెట్టేస్తానని తమ్ముడు పవన్ కళ్యాణ్ శపదం చేయడం విశేషం. వీరిద్దరి పోరాటంలో ప్రజలు, అభిమానులు, మీడియా చివరికి ఆయన వద్దన్న కాపు కులస్తులు కూడా పవన్ కళ్యాణ్ పక్షాన్నే నిలివడం తధ్యం. ఎందుకంటే ఆయన మాటలలో నీజాయితీ కొట్టవచ్చినట్లు కనబడుతోంది. ఆయన మాటలలో తమ ఆవేదన స్పష్టంగా కనబడుతోంది. కాంగ్రెస్ పట్ల తమలో రగులుతున్న కసినే వారు ఆయనలో కూడా చూడగలిగారు. ఇదంతా చూస్తే మూలిగే ముసలి నక్క మీద తాటి పండు పడినట్లుగా ఇప్పటికే సగం చచ్చి జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ పాడి కట్టడానికే వచ్చాడేమో.. అనిపిస్తోంది. ఇక సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఏ జీవీ రక్షించాలేదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

అన్నపట్ల అదే అభిమానం గౌరవం...

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...ఎవరి అంచనాలకు అందనంత ఎత్తులో...అభిమానుల అంచనాలను నిజం చేస్తూ ప్రసంగించి, అందరి నోళ్లకు, బుర్రలకు పని కల్పించారు. తన సభకు అడ్డంకులు సృష్టించిన అన్న చిరంజీవిని ఏకి పారేస్తారని రాజకీయ నాయకులు భావిస్తే, అభిమానులు మాత్రం ఆయన ఆ పని ఎన్నడూ చేయడనే బలంగా నమ్మారు. వారూహించినట్లే తన ప్రసంగం మొదట్లోనే అన్నయ్య చిరంజీవి పట్ల అపారమయిన ప్రేమ, అభిమానం, తనకు తండ్రి వంటివాడు అని చెప్పుకొని ఆయన పట్ల హనుమంతుడిలా భక్తి ప్రదర్శించడంతో పవన్ అభిమానులే కాదు చిరంజీవి అభిమానులు, ప్రజలు కూడా ఆయనను హర్షించాకుండా ఉండలేక పోయారు.   పవన్ నిశిత దృష్టి నుండి జైరామ్ రమేష్ తన అన్నయ్యకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖలు సైతం తప్పించుకాకపోవడం గమనిస్తే ఆయన ఎంత నిశితంగా రాజకీయాలను పరిశీలిస్తున్నారో అర్ధమవుతుంది. కేంద్రమంత్రి అయిన జైరామ్ రమేష్, తనతోటి కేంద్రమంత్రి అయిన చిరంజీవి గురించి అనుచితంగా మాట్లాడితే, ఆయన తమ్ముడిగా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను తను ప్రేమించే, అభిమానించే అన్నకు వ్యతిరేఖంగా పోరాడే దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.    తమ్ముడి ఈ ప్రసంగం విన్న తరువాతయినా చిరంజీవిలో పశ్చాతాపం కలిగితే  పవన్ తన పోరాటంలో తొలి విజయం సాధించినట్లే. కానీ చిరంజీవి వంటి పదవీ లాలసుడిలో అంత త్వరగా మార్పు ఆశించడం అత్యసే అవుతుంది.

పవన్ ప్రసంగంలో ప్రధానాంశాలు నాలుగైదే

  ‘‘చట్టం అందరికీ సమానంగా ఉండేలా చూస్తాం, బ్లాక్ మార్కెటింగ్ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అరికడతాం, స్త్రీ రాత్రి వేళ కాకపోయినా కనీసం పట్టపగలు అయినా క్షేమంగా బయటకు వచ్చి తిరిగి వెళ్లేలా వచ్చే సమాజాన్ని స్థాపిస్తా. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం. కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరితోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నా‘‘. ఇదీ స్థూలంగా పవన్ కళ్యాణ్ రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగం సారాంశం.   తాను పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పే ప్రయత్నం, టీఆర్ఎస్ నాయకుల మీద రివ్వురివ్వున సంధించిన శస్త్రాలు, కాంగ్రెసోళ్ల పంచెలు ఊడదీయాలని కాకపోయినా.. దాదాపు అదే స్థాయిలో ఆ పార్టీ మీద చేసిన విమర్శలు, మధ్యమధ్యలో పిట్ట కథలు.. ఇవన్నీ కలిసి తొలి భేటీలో అభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే, మామూలుగా పది రూపాయలు కూడా చేయని కప్పు కాఫీ 200 రూపాయలుండే నోవోటెల్ హోటల్లో, కేవలం తాను ఆహ్వానించినవారి మధ్య మాత్రమే, అదికూడా రాసుకొచ్చిన ప్రసంగాన్ని, పేదవాళ్ల గురించి చెప్పడం పట్ల మాత్రం కొన్ని విమర్శలు కూడా లేకపోలేవు.   అమ్మ తిడుతుంది, కొట్టినా కొడుతుందని, అన్నయ్యకు ఎదురెళ్తున్నానని కుటుంబకథా చిత్రాన్ని కూడా పవన్ ఆవిష్కరించారు. అయితే తన చిన్నతనంలో పోలీసు స్టేషన్ సంఘటనను మాత్రం పూర్తిస్థాయిలో ఆవిష్కరించడంలో కాస్త విఫలమైనట్లే కనిపించింది.   కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీల మీద చేసిన విమర్శలకు మాత్రం జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ‘‘తగలబెట్టండి, నాలుకలు కోస్తాం, అడ్డంగా నరికేయండి అనే పదజాలం తెలంగాణ మాండలికం కాదు. కంచె ఐలయ్య మాటల్లో చెప్పాలంటే అది ప్యూడలిస్టు భావజాలం. ఎకరాకు కోటి రూపాయలు ఆయన ఎలా సంపాదించారో తెలంగాణాలో రైతులందరికీ చెబితే వాళ్లు కూడా సంపాదిస్తారు.   అమ్మా... కవితా.. నీవు నా చెల్లెలులాంటి దానివి. నీ వేదనను అన్నయ్యలా అర్థం చేసుకున్నా. తెలంగాణా జాగృతి కోసం దేశ విదేశాల్లో సేకరించిన కోట్ల రూపాయల విరాళాలు ఏమయ్యాయో వెల్లడించు‘‘ అని పవన్ చెప్పినప్పుడు జనం అది నోవోటెల్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఈలలు, కేకలు వేశారు.   ‘‘జంపింగ్ జోకర్స్‌కు నా దగ్గర చోటులేదు. వాళ్లంటే నాకు చిరాకు. అలాంటివాళ్లను నా దగ్గరకు రానివ్వను. వాళ్ల కంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి, మొదట్నుంచి ఇప్పటివరకు ఒకేచోట పనిచేసిన టీఆర్‌ఎస్ నాయకులకు మాత్రం సలాం. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఒకలా, ఆయన వెళ్లిపోయాక మరోలా కొత్త వాదంతో మాట్లాడే కాంగ్రెస్ నేతలు నాకు నచ్చరు. వాళ్లను క్షమించను‘‘ అన్నప్పుడు కూడా ప్రజలు బాగానే స్పందించారు.   అయితే తన పార్టీ విధానాలను జనంలోకి తీసుకెళ్లడానికి మాత్రం పవన్ ఈ రెండు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శకులు అంటున్నారు. 9.10 గంటల సమయంలోనే ఆయన తన ప్రసంగం ముగించి, చివర్లో కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో అంటూ ఆవేశం నినాదం ఇచ్చి, వేగంగా వెళ్లిపోతూ.. మర్చిపోయినట్లు మళ్లీ వెనక్కొచ్చి తన ప్రసంగం పుస్తకాన్ని తీసుకుని నవ్వుకుంటూ వేదిక దిగిపోయారు.

పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్స్-1

  కేసీఆర్ ఎకరా పొలానికి కోటి రూపాయలు ఆదాయం ఏవిధంగా సంపాదిస్తున్నారో అదేవిధంగా తెలంగాణా రైతన్నలకి కూడా సంపాదించుకొనేలా చేయగలిగితే నేను కూడా ఆయనకే జై కొడతాను.   కేసీఆర్ కుమార్తె కవిత నేను తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరినట్లు విన్నాను. నేను ప్రేమించే నా తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పమని అడిగేందుకు నువ్వెవరు? వాళ్ళు నావాళ్ళు. నా వాళ్ళకి నేను క్షమాపణలు చెప్పమని ఎవరో సలాహా ఈయడం ఏమిటి? నువ్వు నా చెల్లిలాంటి దానివి. ఒక అన్నగా నీ ఆవేదనను అర్ధం చేసుకోగలను. కానీ ఇటువంటి సలహాలు నీ నుండి నేను కోరుకోవడం లేదు. నువ్వు విదేశాల నుండి ఉద్యమాల కోసం పోగేసిన డబ్బుకు జమాఖర్చుల లెక్కలున్నాయా?   స్త్రీల మీద అనేక ఏళ్లుగా అత్యాచారాలు జరుగుతున్నపటికీ నిర్భయ కేసు తరువాతనే మెలుకువ వచ్చిందా? అంతవరకు కళ్ళు మూసుకుపోయాయా మీకు?   కులం కోసం, మతం కోసం కొట్టుకొని చచ్చిపోయే వారిని చూసి ఉండవచ్చేమో కానీ దేశం కోసం చచ్చిపోవాలనుకొన్న నాలాంటి పిచ్చివాడిని ఎవరూ చూసుండరేమో... దేశ సమగ్రతకు భంగం కలిగించే వాళ్ళ తాట తీస్తా.   రాజకీయ జంపర్స్, బఫూన్ గాళ్ళకి నా పార్టీలో స్థానం లేదు.   కాంగ్రెస్ పార్టీ హటావ్..దేశ్ కొ బచావ్..

పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్స్-2

  పవన్ కళ్యాణ్ ప్రసంగమంతా హైలైట్. అవి ఏ స్క్రిప్టులో కనబడవు, దొరకవు. ఎందుకంటే అవి ఆయన హృదయంలో నుండి వచ్చినవి. వాటిలో మళ్ళీ కొన్ని హైలైట్స్ అని వేరు చేసి చెప్పడం చాలా కష్టమే! అయినా కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసినవీ ఉన్నాయి.   ఎవరన్నారు...నేను అన్నయ్యను వ్యతిరేఖిస్తున్నానని? అన్నయ్యను వ్యతిరేఖించడం లేదు. ఆయన పార్టీని మాత్రమే వ్యతిరేఖిస్తున్నాను. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పుణ్యమాని తండ్రి వంటి అన్నయను రాజకీయాలలో ఎదుర్కోవలసివస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్న జైరామ్ మరో కేంద్ర మంత్రి అయిన అన్నయను గౌరవించడం నేర్చుకోవడం మంచిది.   నా వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి ఎవరయినా విమర్శలు చేయదలిస్తే వారు కూడా అటువంటి ప్రతివిమర్శలకు సిద్దంగా ఉండాలి. రాహుల్ గాంధీ అయినా రాబర్ట్ వాద్రా అయినా ఐ డోంట్ కేర్..ఎవరినీ వదిలిపెట్టను..   జగ్గారెడ్డి వంటి వ్యక్తి తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించి ఉండి ఉంటే, రాష్ట్ర ప్రజలు విడిపోతూ స్వీట్లు పంచుకొనేవారు. ఆయనకున్న జాతీయ దృక్పదం మరే కాంగ్రెస్ నేతలో లేడు. అరవై ఏళ్లుగా జరుగుతున్నా తెలంగాణా ఉద్యమాలు, పదేళ్లుగా సాగుతున్న తెలంగాణా ఉద్యామాలు, వందల మంది అమాయకులయిన యువకులు చనిపోయిన తరువాత కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇవ్వాల్సిన అవసరం ఉందని అర్ధంకాలేదా? సినిమాలలో వేషాలు వేసుకొనే నాకే ఆర్ధమయిన సంగతి రాజకీయాలలో తలలు పండిపోయిన మీకెందుకు అర్ధంకాలేదు. అర్ధం అయిన తరువాత పార్లమెంటులో కేవలం 26నిమిషాలలోనే ఎలా పూర్తి చేసారు? చేసినా ఆంధ్ర, తెలంగాణా ప్రజలు సంతోషంగా ఉండేలా ఎందుకు చేయలేకపోయారు?      

పొత్తులకు ఇంకా ముహూర్తం కుదరలేదా?

  ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసాలు పొత్తుల విషయం తేల్చుకోలేక ఆపసోపాలు పడుతున్నాయి. రెండు పార్టీలు కూడా తెలంగాణాలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లలో తమకే 75 సీట్లు కావాలని పట్టుబడుతుండటంతో పొత్తులు కుదరడం లేదు. బహుశః ఒకటి రెండు రోజుల్లో ఆ సంగతీ తేలిపోవచ్చును. అదేవిధంగా తెరాస-మజ్లిస్-సీపీఐలు ఎన్నికల పొత్తులకు సిద్దపడుతున్నట్లు సమాచారం. కానీ, కాంగ్రెస్-తెరాసల మధ్య పొత్తుల కధ ముగిస్తే తప్ప, వాటి గురించి ఆలోచించలేదు. ఇక తెదేపా-బీజేపీలు కూడా పొత్తులపై నోరుమేదపలేని పరిస్థితిలో ఉన్నాయి. ఆంధ్రాలో బీజేపీకి ఉన్న వ్యతిరేఖత కారణంగా తెదేపా వెనుకాడుతుంటే, తెలంగాణాలో బీజేపీ నేతలే తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అందువల్ల త్వరలో నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన తరువాతనే ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల విషయం తేలవచ్చును. అంతవరకు వారు శత్రువులుగానే వ్యవహరిస్తారేమో.   వైకాపా-సీపీయం పార్టీలు ఇంకా పొత్తులు కుదుర్చుకోకపోయినప్పటికీ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వామపక్ష పార్టీలు రెండూ మున్సిపల్ ఎన్నికల వరకు మాత్రం కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నాయి. అయితే ఈరోజు సీపీఐ నారాయణ తెలంగాణా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపే సాకుతూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను కలవడం చాలా ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేఖించే ఆయన స్వయంగా వెళ్లి అభినందనలు ఎందుకు చెపుతున్నారో త్వరలోనే బయటపడవచ్చును.   ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా కొత్త పార్టీ ప్రకటించబోతున్నందున, ఆయన పార్టీ విధి విధానాలు వగైరా చూసిన తరువాత ఏఏ రాజకీయ పార్టీలు ఎవరితో పొత్తుల పెట్టుకోవాలనే విషయంలో మరికొంత స్పష్టత రావచ్చును. పవన్ కళ్యాణ్ వామపక్ష భావజాలం పట్ల ఆసక్తి కలిగి ఉన్నందున లెఫ్ట్ పార్టీలతో పొత్తులకు అంగీకరిస్తే అంగీకరించవచ్చును. అదే జరిగితే, లెఫ్ట్ పార్టీలకు దశ తిరిగినట్లే. పవన్ కళ్యాణ్ కున్న అశేషజనాదారణ వల్ల అవి లాభాపడవచ్చును. అదేవిధంగా వాటికున్న బలమయిన క్యాడర్ వలన పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా లబ్ది పొందవచ్చును.   పవన్ విషయంలో సీపీఐ నారాయణ సానుకూలంగా స్పందించగా, సీపీయం రాఘవులు మాత్రం అది ప్రజా రాజ్యం పార్టీలా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని ముందే జోస్యం చెప్పడంతో, సీపీయం పవన్ పార్టీ పట్ల ఆసక్తి లేదని అర్ధమవుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏ పార్టీతోను పొత్తులకు ఆసక్తి చూపకపోయినట్లయితే, అన్ని పార్టీలు శత్రువులుగా మారడం తధ్యం. ఇప్పటికిప్పుడు ఆయనపై ఎవరూ దండయాత్ర చేయకపోయినా, మున్ముందు ఎన్నికల ప్రచారం మొదలయిన తరువాత, ఇతర పార్టీలు ఆయన వ్యక్తిగత విషయాలను సైతం కెలకకుండా వదిలిపెట్టవు.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని స్థాపించినప్పటికీ, ఆ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి ఏ పార్టీ ఆసక్తి చూపలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయినా ఆ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకొనే పరిస్థితిలో లేదు. మహా అయితే తమలాగే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొన్న సీపీయంతో పొత్తులు ఆశించవచ్చును, కానీ ఆ పార్టీ ఇప్పటికే వైకాపా వైపు మొగ్గు చూపుతోంది గనుక ఆ అవకాశం కూడా లేదనే చెప్పాలి.

యధా నేత తదా పార్టీ

      జగన్ కూడబెట్టిన అక్రమాస్తుల విలువ ఎంత ఉండొచ్చు? వైఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వేల కోట్లు ఎలా సంపాదించాడు? ఇవన్నీ సీబీఐకీ దొరకని భేతాళ ప్రశ్నలు. జగన్ పై మీడియాలో వచ్చిన, సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్లు ప్రకారం అయితే లక్షల కోట్లకు యువనేత పడగలెత్తాడు. ఈ (అవినీతి) ప్రచారం శృతి మించడంతో జగన్, టాటా,బిర్లా, అంబానీల సరసన చేరిపోయారు.   అయితే, జగన్ ఇంత డబ్బు ఎలా సంపాదించాడనే సంగతిని మరిచిన కొందరు జనాలు ఆయనను అభిమానించడం మొదలెట్టారు. దానితో వైకాపాలో ఆయన బాపతు నేతలు చాలా మంది చేరుతున్నారు. వైసీపీ కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి కుడిభుజంగా వ్యవహరిస్తున్న శ్రీధర్‌రెడ్డి..రాజమండ్రిలో బ్యాంకు లాకర్లను పగలగొట్టి సెక్యూరిటీ గార్డును చంపిన కేసులో నిందితులు. ఆ డబ్బుని అతను షర్మిల మరో ప్రజా ప్రస్తానం పాదయాత్రకు ఖర్చు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరిచారు కూడా. విశాఖలో దొంగనోట్ల మూటా నాయకురాలు మల్లిక కూడా జగన్ పార్టీలో చేరాడం, ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత ఆమెతో తమ పార్టీకి సంబంధం లేదని వైకాపా ప్రకటించడం అందరికీ తెలిసిన సంగతే. ఇక గుంటూరులో (మేడికొండూరు) చెందిన మరో వైకాపా మహిళా నేత ధనేకుల కళ్యాణి, గుంటూరు బ్రాడీపేటలోని ఓ జువెలరీ దుకాణానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత పేరుతో ఫోన్ చేసి లక్షలకు టోకరా వేసింది. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.  ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జగన్ పార్టీ టికెట్లు కొనుక్కున్న వారిలో ఎంత మంది గెలుస్తారో.. తెలంగాణా విడిపోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని కొల్లగొడతారో, ఏమేమి అమ్మేస్తారో అనే ఆందోళనతో ఉన్నారు ప్రజలు.  

Decoding Pawan Kalyan

      Known to be temperamental and reserved, Pawan Kalyan hasn’t let the media get too close to him and this elusive behavior has helped in creating the enigma that he is purportedly to be. Known to be reserved where he has few friends in the Industry it is a daunting task to try and decode the persona that is Pawan Kalyan.     With whatever that is published in the paper or web which has no official ratification from his side, except during the episode when his niece Srija got married in front of the media which caused a great deal of discomfort to the Mega family  and where he surrendered his revolver assuring the lady he meant no harm. Another major episode where he gave  public declaration that he was living in with Renu Desai and married her later in 2009 as his first wife of 1997 came  in and filed a case against him and also with his brother Chiranjeevi’s political career talking off , the damage control had to be done. The lady Nandini eventually married again but the blame was squarely put on Pawan Kalyan , why didn’t anyone think that because Nandini wanted to get married again she had to apply for a legal divorce? The gentleman went on to divorce Renu Desai also for reasons best known to him by paying a hefty alimony. His third marriage with a Russian lady Anna in September 2013 sends the media into a tizzy confusing her with an Australian actress in one of his movies. The Erragadda sub register squealed it all and that saved Pawan from giving any clarification about the Special Marriage Act pun- unintended. That he has had another child through her is also known but he remains tight lipped about the whole episode. Now if a man wears his heart up his sleeve and with three marriages we wonder what kind of an impression he leaves on his fans ! He is known to hobnob with elitist crowd and also known to be a reserved person who enjoys an organic life in his Shankarpally farm house. Director Trivikram Srinivas and art director Anand Sai and a few friends are known to be a part of his close group. These people show utmost loyalty and refuse to entertain any questions about their friendship with him. The whole idea of the party is questioning the political scenario in the country and the Party song which reflects his sort of Communist ideologies and as to how does one fight the corruption and where should the common man go reflects his anguish. But if it is only going to be questioning the state of affairs in the country is not going to solve the people’s problems and that we need some concrete action in place is needed and we hope he has figured that out. Hope he is happy watching from the comforts of his home the kind of public adulation and media hype he has garnered for his self in the past week!  

తమ్ముడికి బాటలో ముళ్ళు పరుస్తున్న మెగా అన్నయ్య

      మెగా సోదరుడు నాగబాబు తమకు చిరంజీవి అన్నయ్యే రాజబాట పరిచారని చెపుతుంటే, ఆయన మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంచుకొన్న కొత్త బాటలో ముళ్ళు పరుస్తూ అతనిని కుటుంబంలో, రాజకీయాలలో సమాజంలో కూడా ఒంటరివాడిని చేయాలని ప్రయత్నించడం చాలా విచారకరం. ఆయన పదవుల కోసం ఆరాటపడుతూ ఇప్పటికే తన మెగా ఇమేజ్ పూర్తిగా డేమేజ్ చేసుకొని, ఇప్పుడు తమ్ముడు పవన్ పట్ల వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల దృష్టిలో మరింత చులకనవడం తధ్యం. చిరంజీవి స్వయంగా తన అభిమాన సంఘాల నేతలకు ఫోన్లు చేసి తన సోదరుడి సభకు వెళ్ళవద్దని చెప్పడం, బహుశః ఆయనకు ఎటువంటి బాధ కలిగించకపోవచ్చు గాక, కానీ వారి అభిమానుల మనసులు మాత్రం నొప్పిస్తోంది. అందుకే అనేక మంది ఆయన మాటను కాదని పవన్ కళ్యాణ్ వెంట వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పుడు వారి వద్ద కూడా ఆయన తన గౌరవం పోగొట్టుకోవడమే గాక తమ్ముడితో బాటు వారిని కూడా దూరం చేసుకొన్నట్లయింది.   అయితే పవన్ కళ్యాణ్ తన ప్రయత్నంలో సఫలమయినా, విఫలమయినా, చిరంజీవి మాత్రం ప్రజల, అభిమానుల దృష్టిలో దోషిగా తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడటం ఖాయం. పవన్ తన ప్రయత్నంలో సఫలమయితే, స్వయంగా అన్నఅయ్యి ఉండి కూడా చిరంజీవి ఆయనకు అడ్డంకులు సృష్టించారని, అయినా వాటినన్నిటినీ అధిగమించి విజయం సాధించారని అందరూ చెప్పుకొంటారు. దురదృష్టవశాత్తు ఒకవేళ పవన్ కళ్యాణ్ తన ప్రయత్నంలో విజయం సాధించలేకపోతే, అప్పుడు కూడా ఆయనకు అడ్డంకులు సృష్టించినందుకు ప్రజలు, అభిమానులు చిరంజీవినే నిందించడం ఖాయం. ఈవిషయం గ్రహిస్తే ఆయన అటువంటి ప్రయత్నాలు చేసి ఉండరు.    

చిరు అన్నయ్యకు చిక్ బళ్లాపూర్ లేనట్లే

      రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేసి నెగ్గడం కష్టమని, అందువల్ల కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ నుంచి బరిలోకి దిగాలని భావించిన కేంద్ర మంత్రి చిరంజీవికి చుక్కెదురైంది. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ, మరో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీకే కాంగ్రెస్ పార్టీ కేటాయించేసింది. దాంతో చిరంజీవి అన్నయ్య మరో స్థానం వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. బెంగళూరుకు సమీపంలోని చిక్ బళ్లాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి చిరంజీవి బరిలోకి దిగుతారని ఇంతకుముందు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండటంతో పాటు చిరంజీవికి చెప్పుకోదగ్గ సంఖ్యలో అభిమానులున్నారు. చిరంజీవి విజయం సాధించే అవకాశాలున్నందున ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ రెండో జాబితాతో వాటికి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది.

‘జానా‘.. బెత్తెడేనా?

  ఎప్పుడు ఏ సమావేశం జరిగినా పెద్దమనిషిలా, పెద్ద విగ్రహంతో కనిపించే జానారెడ్డి ఇప్పుడు చిన్నబోయారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తాను కీలక పాత్ర పోషిస్తానని ఆయన భావించారు. కాబోయే ముఖ్యమంత్రిని తానేనని కూడా ఓ దశలో ప్రచారం చేసుకున్నారు. మొదటి తెలంగాణా పీసీసీ పదవి తనకే దక్కుతుందని ఎదురు చూశారు. ఇప్పుడు అన్నీ అడియాసలయ్యాయి. కీలక పాత్ర కాదు కదా, చివరకు ఏ పాత్రా ఆయనకు దక్కేలా కనిపించట్లేదు. తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవిని పొన్నాల లక్ష్మయ్యకు ఇచ్చేశారు. తెలంగాణాకు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు. దాంతో ఎన్నో కలలు కన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం మంత్రిగా కొనసాగిన రికార్డు ఉన్న జానారెడ్డి ఒక్కసారిగా డీలాపడ్డారు.   నిజానికి తెలంగాణా జేఏసీ ఏర్పాటులో జానారెడ్డిదే కీలకపాత్ర. అప్పట్లో రాష్ట్ర సాధనకు అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలంటూ ఆయన పెద్దమనిషి పాత్రను పోషించారు. తర్వాతి కాలంలో అదికాస్తా టీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు సొంత పార్టీ వాళ్లు కూడా ఆయనను కూరలో కర్వేపాకులా తీసి పక్కన పారేస్తున్నారని ఆయన అనుచరులు వాపోతున్నారు.   ఇదంతా ఒక ఎత్తయితే, జానారెడ్డికి ఇంటిపోరు కూడా ఎక్కువైంది. జానా వారసుడుగా రఘువీర్‌ రాజకీయాలలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న డిమాండ్ ఇంట్లోనుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్న రాహుల్ ఫార్ములాతో అసలుకే ఎసరు వస్తుందేమోనని ఆందోళన పడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యం తెలంగాణా రాష్ట్రంలో కూడా నెరవేరే అవకాశం కనిపించకపోవడంతో రఘువీర్‌ కు రాజకీయ వారసత్వం అప్పగించి రిటైర్‌ కావాలని జానారెడ్డి అనుకుంటున్నట్లు వినవస్తోంది.

రసవత్తరంగా గూడెం రాజకీయాలు

  తాడేపల్లిగూడెం.. ఈ పట్టణం పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయాలకు ప్రధాన కేంద్రం. ఇక్కడ మునిసిపల్ చైర్మన్ దగ్గర్నుంచి ఎమ్మెల్యే వరకు ఏ ఎన్నిక జరిగినా రాజకీయాలు రసవత్తరంగా మారుతూనే ఉంటాయి. 1985 నుంచి 1999 వరకు వరుసగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. 85లో ఎర్రా నారాయణస్వామి, 89, 94లలో పసల కనకసుందరరావు, మళ్లీ 99లో ఎర్రా నారాయణస్వామి ఇక్కడ టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో 99 ఎన్నిక బాగా ఉత్కంఠభరితంగా సాగింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ బాగా బలమైన అభ్యర్థి అని ప్రచారం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తర్జనభర్జన పడి.. నారాయణ స్వామిని పిలిపించి మరీ పోటీ చేయించారు. అప్పటికి ఆయనతో పోలిస్తే కొట్టు సత్యనారాయణ యువకుడు కావడం, ప్రచారం ఉధృతంగా చేయడంతో ఫలితాలను ఎవరూ ఊహించలేపోయారు. చివరకు ఎర్రా నారాయణస్వామే గెలిచారు.   తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైఎస్ హవాతో కొట్టు సత్యనారాయణ గెలిచారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా ఈలి నాని, కాంగ్రెస్ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ, టీడీపీ నుంచి ముళ్లపూడి బాపిరాజు పోటీపడ్డారు. ముగ్గురికీ 40వేల ఓట్లకు పైగానే వచ్చాయి. బాపిరాజుకు 41282 ఓట్లు రాగా, కొట్టు సత్యనారాయణకు 45727 వచ్చాయి. 3020 ఓట్ల తేడాతో.. అంటే 48747 ఓట్లు సాధించిన ఈలి నాని విజేత అయ్యారు. తర్వాత పీఆర్పీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడంతో ఇప్పుడాయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. అయితే.. ప్రస్తుత రాజకీయం మరింత చిత్రంగా ఉంది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అటు కొట్టు సత్యనారాయణ గానీ, ఇటు ఈలి నాని గానీ సుముఖంగా లేరు. ఒక దశలో జగన్ పార్టీలోకి కొట్టు వెళ్తారనుకున్నా, అక్కడ అప్పటికే తోట గోపికి టికెట్ దాదాపుగా ఖరారు కావడంతో ఊరుకున్నారు.   ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ దక్కుతుందో, ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారోనన్న విషయం మంచి ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా పోరాడిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీ టికెట్ కోసం కొట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు తాడేపల్లిగూడెం టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి బాపిరాజు, ఎర్రా నారాయణస్వామి మనవడు ఎర్రా నవీన్ లకు ఈ రాజకీయాలతో దిమ్మ తిరిగిపోతోంది.

ఛలో చిక్బల్లాపూర్ అంటున్న చిరు?

  కాంగ్రెస్ తురుపుముక్క మడత పడిపోయిందా? సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా కాడి భుజానికెత్తుకొన్నమెగాజీవిని వీరప్ప మొయిలీ కర్ణాటకకి లాక్కుపోనున్నారా? లేక పోతే మొయిలీని తప్పించేసి ఈ జీవే అక్కడి నుండి పోటీ చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కన్నడ నాట వెబ్ సైట్లలో దొరుకుతున్నాయి. జగన్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే, తాను నిలబెడతానని కాంగ్రెస్ అధిష్టానం అడక్కుండానే తొడ కొట్టి భరోసా ఇచ్చిన చిరంజీవి అంటే టెన్ జనపథ్ యజమానికి భలే అభిమానం అట!   ఆ అభిమానంతోనే, ఆ నమ్మకంతోనే ముఖ్యమంత్రి కావలసిన అంతటి మహావ్యక్తిని అంతకు ఏమాత్రం తీసిపోని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టేసింది కాంగ్రెస్ అధిష్టాన దేవత. ఆ మెగాజీవి రాష్ట విభజన నిర్ణయాన్ని పైపైన వ్యతిరేకిస్తూ, లోలోన మాత్రం తమకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు రాజమాత, యువరాజులవారు ఇరువురూ కూడా ఆయన పట్ల చాలా ప్రసన్నం అయినప్పటికీ, సరిగ్గా అదే కారణంతో సీమాంధ్ర ప్రజలలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేఖత గూడు కట్టుకొని ఉందని, అందువల్ల ఆయనకు ప్రచార భాధ్యతలు అప్పగించడం వలన రివర్స్ ఎఫ్ఫెక్ట్స్ కనబడతాయని, ఆయన ఇమేజుకి తోడూ యువరాజావారి ఇమేజు కూడా తోడయితే ఇక తిరుగే ఉండదని కాంగ్రెస్ నేతలే ఒకరి చెవులు మరొకరు పరపరా కోరికేసుకొంటున్నట్లు గాలి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినదని ఇప్పటికే చాలా సార్లు స్పష్టమయింది గనుక ఆ జీవినే నమ్ముకొని ముందుకు వెళ్ళేలా ఉంది.   అయితే చిరంజీవి వచ్చి చెయ్యేస్తే చాలు మళ్ళీ నాకు యంపీ సీటు కన్ఫర్మ్ అని కేంద్ర మంత్రి వీరప్ప మోయిలీగారు ఆశలన్నీ మెగా జీవిపైనే పెట్టేసుకోన్నారుట. ఈ సారి కర్ణాటకలోని చిక్బల్లాపూరు నుండి పోటీ చేస్తున్న ఆయన ఈ చిరు జీవి అండతో ఎన్నికల వైతరిణిని దాటేయాలని ఆశడుతున్నట్లు కన్నడ వెబ్ సైట్లన్నీ కాకుల్లా గోలగోల చేసేస్తున్నాయి. అందుకు అవి మంచి రీజనింగ్ పాయింటు కూడా చెపుతున్నాయి.   చిరంజీవీ ఎందుకంటే.. చిక్బల్లాపూర్ లో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ. అందులోనూ బలిజలు అధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ వారికి చిరు గురించి ఇంకా చాలా గొప్ప అభిప్రాయాలే ఉన్నాయిట! వారు ఇంకా త్రేతాయుగంలోనే ఉండిపోయినట్లుగా నేటికీ ఆయన అభిమాన సంఘాలు, బ్లడ్ బ్యాంకులు, సమాజ సేవ, దానగుణం వగైరా సీనుల వద్దనే ఆగిపోవడంతో, విలీనమే మార్గం- కేంద్రమంత్రి పదవే లక్ష్యం, విభజనే ఆచరణీయం-ముఖ్యమంత్రి పదవే ప్రధానం వంటి తాజా కొటేషన్లను, డెవెలప్మెంట్లను బొత్తిగా గమనించలేకపోయారుట! అందువల్ల ఈ జీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ ఒడ్డుకు చేరుస్తారో తెలియక పోయినా, తనను మాత్రం తప్పకుండా ఒడ్డునపడేయగలడని మోయిలీగారి వీర నమ్మకంతో ఉన్నారు.   మళ్ళీ అవే వెబ్ సైట్లు కొన్ని చిరంజీవి తెలుగు ప్రజలకు హ్యండిచ్చినట్లే, మొయిలీ కూడా ఆయన హ్యండిచ్చేసి ఇంత సేఫ్ గా ఉన్న జోన్ లో తనే స్వయంగా ఎందుకు పోటీ చేయకూడదూ? అనే ఐడియాని అధిష్టానం మెదడులో నేర్పుగా జొప్పించేసినట్లు మరో నాలుగు ముక్కలు గీకి పడేశాయి. అది చూసి మోయిలీ షాకయిపోతే అధిష్టాన దేవత బలే ఇంప్రెస్స్ అయిపోయిందిట!   ఈ మెగాజీవిని కూడా కర్ణాటకలో పోటీకి దింపితే సినీ గ్లామర్, తెలుగువాళ్ళ ఓటు బ్యాంక్ అన్నీ కలిపేసుకొని లెక్క చూసుకొంటే కనీసం మరొక్క లోక్ సభ సీటు ఎక్సట్రాగా వచ్చినా యువరాజవారి పట్టాభిషేకానికి అదే పదివేలు అని భావిస్తోందిట. కనుక, ఏ జీవి మద్దతులేనిదే ఎన్నికలలో గెలవలేని మొయిలీని రాజ్యసభకి ట్రాన్స్ఫర్ చేసేసి, ఆయనకు బదులు మెగాజీవినే చిక్భుల్లా పూర్ లో పోటీకి దింపితే బెటర్ కదాని ఆలోచిస్తున్నట్లు తాజా గాలివార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను అక్కడ నుండి పోటీ చేయిస్తే పనిలోపనిగా ఆయన ఎన్నికల రధాన్ని ఓ సారి కర్ణాటకలో తెలుగు వాళ్ళున్న అన్ని ప్రాంతాలలో కూడా ఓ రౌండేయించేస్తే బెటరేమో.. అని అధిష్టాన దేవతలు ఆలోచిస్తున్నారుట.   మన మెగాజీవి మాత్రం పాలకొల్లు పరాభవం, ఉప ఎన్నికల్లో తిరుక్షవరం కంటే, చిక్బల్లాపూరు కి జంపై పోతే మళ్ళీ ఐదేళ్ళు తిరిగి చూసుకోక్కరలేదు అని లోలోన సంతోషపడిపోతున్నట్లు ఆయన మనసులో తొంగి చూడగల కొన్ని వెన్ సైట్లు కనిపెట్టిసాయి. మరి ఈ గాలి కబుర్లు అన్నీ వినివినీ మొయిలీ హార్ట్ అయిపోయారంటే అవరూ...పాపం మొయిలీ...