కేసీఆర్ టీమ్‌పై సీబీఐ కోర్టు కేసు: ఎన్నెన్నో సందేహాలు!

      కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతి సంపాదన మీద విచారణ జరిపించాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ ఆదేశాల మీద స్పందిస్తూ హరీష్‌రావు ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రే అని గగ్గోలు పెట్టగా, విజయశాంతి మాత్రం తనకేం భయం లేదని చెప్పారు. అయితే టోటల్‌గా ఈ అంశంలో సమాధానాలు దొరకని కొన్ని సందేహాలున్నాయి. కేసులు పెడితే, తెలంగాణ ఉద్యమం పేరుతో వసూళ్ళు చేశారన్న ఆరోపణలు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మీద, కేసీఆర్ కుమార్తె కవిత మీద కూడా వున్నాయి. అయితే వాళ్లిద్దరినీ ఈ కేసు నుంచి ఎందుకు తప్పించారనేది ఒక పెద్ద సందేహం. హరీష్‌రావు ఆక్రోశించినట్టు ఇది కాంగ్రెస్ కుట్ర అయితే కేసీఆర్, హరీష్‌రావు పేరుతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే వున్న విజయశాంతి మీద కూడా ఎందుకు కేసు పెట్టారు? కేసీఆర్, హరీష్‌రావుతోపాటు విజయశాంతి మీద కూడా కేసు పెడితే ఇది కాంగ్రెస్ కుట్ర అని ఎవరూ అనుకోరని ముందు జాగ్రత్త చర్యగా ఆమెను కూడా ఈ కేసులో ఇరికించారా? మరో ఐదు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ జరగబోతూ వుండగా, ఇప్పుడే ఈ కేసుని ఎందుకు వెలుగులోకి తెచ్చారు? ఇలాంటి సందేహాలు ఎన్నెన్నో కలుగుతున్నాయి. ఈ సందేహాలకు సమాధానాలు దొరకాలంటే మరికొంతకాలం ఆగాలి.

సోనియా, రాహుల్ ప్రచారంతో ఓట్లు రాలుతాయా?

  ఈరోజు రాహుల్ గాంధీ మరోమారు తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆయన మొదట వరంగల్‌లో పార్టీ తరపున ప్రచార సభలో పాల్గొన్న తరువాత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. రాహుల్ క్రిందటి సారి తన పర్యటనలో కేసీఆర్ నే ప్రధాన లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించి, టీ-కాంగ్రెస్ నేతల ఆత్మవిశ్వాసం పెంచగలిగారు. అదేవిధంగా జాతీయ పార్టీ అయిన తమ పార్టీ మాత్రమే తెలంగాణా త్వరగా అభివృద్ధి చేయగలదని, ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వల్ల సాధ్యం కాదని గట్టిగా నొక్కి చెప్పారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీయే దేశంలో, రాష్ట్రంలో కూడా అధికారం చలాయిస్తున్నపటికీ చేయలేని అనేక అభివృద్ధి పనులను ఇప్పుడు తమకు ఓటేస్తే చేసి చూపుతామని చెపుతూ, వాటికి మరికొన్ని కొత్తగా జోడించి తెలంగాణ ప్రజలకు తమ హస్తంలో వైకుంటం చూపించేరు. బహుశః ఈరోజు సభలలో కూడా అవే విషయాలు మరోమారు వల్లెవేయవచ్చును.   అయితే ఆయన వెళ్ళిన తరువాత మోడీ తెలంగాణాలో ప్రచారసభలు నిర్వహించి, తెలంగాణా కోసం వందల మంది యువకులు చనిపోతున్నపటికీ, పదేళ్ళ పాటు నిర్లిప్తంగా చూస్తూ కూర్చొని 1100 మంది యువకులను పొట్టన పెట్టుకొన్న పాపాత్మురాలు కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీ తెలంగాణాను, ప్రజలను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఉద్యమాలు మొదలయ్యాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. కనుక రాహుల్ గాంధీ ఈరోజు సభలలో బీజేపీ దానితో పొత్తులు పెట్టుకొన్న తెదేపాపై బాణాలు వేయవచ్చును. పనిలోపనిగా కేసీఆర్ చేసిన ప్రతివిమర్శలకు కూడా ధీటుగా బదులివ్వవచ్చును.   అయితే రాహుల్ గాంధీ తన పార్టీ శ్రేణులకు, నేతలకు తన ప్రసంగంతో ఉత్సాహం కలిగించవచ్చునేమో కానీ, కేసీఆర్, తెలంగాణా సెంటిమెంటు ప్రభావంలో ఉన్న తెలంగాణా ప్రజలను కాంగ్రెస్ పార్టీకే ఓటేసేలా చేయలేరని చెప్పవచ్చును. ఆ పని కేవలం టీ-కాంగ్రెస్ నేతల వలననే సాధ్యమవుతుంది. వారు కాంగ్రెస్ జెండా, సోనియా, రాహుల్ గాంధీల ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నపట్టికీ, వారు ప్రధానంగా తమ స్వశక్తి, పలుకుబడితోనే ఎన్నికలలో విజయం సాధించగల సమర్ధులు. ప్రస్తుతం వారందరూ తమ తమ నియోజకవర్గాలలో ఆ పని మీదనే ఉన్నారు. అందువల్ల రాహుల్, సోనియాగాంధీల ప్రచారం కేవలం కాంగ్రెస్ ప్రత్యర్ధులను బలంగా డ్డీకొని, ప్రజలకు అరచేతిలో వైకుంటం చూపించడానికే తప్ప వేరెందుకు ఉపయోగపడదనే భావించవచ్చును.

చంద్రబాబు హామీతోనే పోటీపై పట్టు సడలించా: కంఠంనేని

      ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడే నిజమైన నాయకుడు. అలాంటి వ్యక్తే కృష్ణాజిల్లా అవనిగడ్డకి చెందిన తెలుగుదేశం నాయకుడు కంఠంనేని రవిశంకర్. ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసి, స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన కంఠంనేని రవిశంకర్‌కి ఈ ఎన్నికలలో అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్ ఇస్తానని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో మండలి బుద్ధ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడంతో చంద్రబాబు కంఠంనేని రవిశంకర్‌ని కాదని బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇచ్చారు. దాంతో మనస్తాపం చెందిన రవిశంకర్ అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం రెబల్‌గా నామినేషన్‌ వేశారు.   కంఠంనేని రవిశంకర్ నామినేషన్ వేయడానికి వెళ్తున్నప్పుడు దాదాపు పదివేలమంది మద్దతుదారులు ఆయనవెంట నడిచారు. స్థానిక తెలుగుదేశం కార్యకర్తలందరూ మేమంతా కంఠంనేని వెంటే వుంటామని ముక్తకంఠంతో చెప్పారు. ఎలాంటి అధికారం లేకపోయినా తమకు ఎంతో సేవ చేసిన కంఠంనేనిని గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు కూడా ఆయనకు బలమిచ్చారు. రాజకీయ వర్గాలు కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో కంఠంనేని రవిశంకర్ గెలుపు ఖాయమని నిర్ధారణకి వచ్చాయి. అవనిగడ్డ సీటు తెలుగుదేశం అకౌంట్‌లోంచి జారిపోయినట్టేనని తీర్మానించేశాయి. అందుకే కంఠంనేని నామినేషన్‌ వేసినప్పటి నుంచి సుజనాచౌదరి లాంటి అనేకమంది నాయకులు ఆయనన్ని పోట నుంచి విరమించుకోవాల్సిందిగా కోరారు.  అయితే కంఠంనేని అందుకు నిరాకరించి ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రవిశంకర్‌కి ఫోన్ చేసి పోటీనుంచి విరమించుకోవాలని కోరడంతో ఎప్పుడు తగ్గాలో కూడా తెలిసిన రవిశంకర్ తన నామినేషన్‌ని ఉపసంహరించుకుని మండలి బుద్ధ ప్రసాద్ గెలుపుకి మార్గం సుగమం చేశారు. తనవెంట వున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని చంద్రబాబు నుంచి, బుద్ధ ప్రసాద్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో పోటీ నుంచి వెనక్కి తగ్గానని రవిశంకర్ చెప్పారు.  ఇక అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. నామినేషన్ ఉపసంహరించుకున్న కంఠంనేనికి మండలి బుద్ధ ప్రసాద్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రవిశంకర్ వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను తన సొంత మనుషుల మాదిరిగా చూసుకుంటానని బుద్ధ ప్రసాద్ హామీ ఇచ్చారు.  కంఠంనేని పోటీ నుంచి తప్పుకోవడంతో అవనిగడ్డ నుంచి తన విజయం ఖాయమైందని ఆయన సంతోషాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి కంఠంనేని రవిశంకర్ చేసిన సేవలను చంద్రబాబు నాయుడు గుర్తించారని, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కంఠంనేని రవిశంకర్‌కి ప్రాధాన్యం వున్న పదవి ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా వున్నారని, ఈ విషయంలో తనవంతు సహకారాన్ని మనస్పూర్తిగా అందిస్తానని అన్నారు.

శోభానాగిరెడ్డి మృతి: రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక శైలి

      రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక శైలి కలిగిన రాజనీతివేత్తగా శోభానాగిరెడ్డి నిలిచారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభా నాగిరెడ్డి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. యాక్సిడెంట్‌కి గురైన వెంటనే కోమాలోకి వెళ్ళిపోయిన ఆమె రక్తపోటు, పల్స్ నార్మల్‌గానే ఉన్నాయని మొదట వైద్యులు ప్రకటించినప్పుడు ఆమె కోలుకుంటారన్న ఆశ కలిగింది. అయితే అంతలోనే ఆమె కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించడం విషాదాన్ని కలిగించింది.   శోభానాగిరెడ్డి రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం. ఆమె తండ్రి ఎస్.వి.సుబ్బారెడ్డి కాకలు తీరిన రాజకీయవేత్త, రాష్ట్రానికి మంత్రిగా కూడా పనిచేశారు. ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్న శోభ వివాహం 1986లో భూమా నాగిరెడ్డితో జరిగింది. శోభానాగిరెడ్డిగా మారిన శోభ గృహిణిగా తన కుటుంబాన్ని ఆదర్శవంతంగా నడిపారు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవలే కుమార్తె వివాహం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఎంతమాత్రం లేని ఆమె తన భర్త ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్త, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలో ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.  తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమె ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ఛైర్మన్‌గా రెండేళ్ళపాటు ప్రశంసనీయంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఇమడలేక చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికలలో రాయలసీమలో ప్రజారాజ్యం తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి నిలిచారు.  ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ప్రస్తుత ఎన్నికలలో ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. శోభా నాగిరెడ్డి ఏ పార్టీలో వున్నా అగ్రశ్రేణి  నాయకురాలిగానే  ఉన్నారు. చక్కని మాట తీరుతో, సంస్కారం ఉట్టిపడేలా మాట్లాడేవారు. రాష్ట్ర రాజకీయాలలో ఉజ్వలమైన భవిష్యత్తు వున్న శోభా నాగిరెడ్డి ఇలా ఆకస్మిక మరణం చెందటం ఆమె కుటుంబాన్ని, ఆమె నియోజకవర్గ ప్రజలను మాత్రమే కాకుండా ఆమె రాజకీయ ప్రత్యర్థులను కూడా షాక్‌కి గురి చేసింది.  

ఏపీఎన్జీవోలను దువ్వుతున్న జైరాం

      ప్రస్తుతం తెలుగుదేశానికి దగ్గరై వున్న ఏపీఎన్జీవోలను దువ్వడానికి కేంద్ర మంత్రి జైరాం రమేష్ పెద్ద దువ్వెనతో సిద్ధమయ్యారు. సీమాంధ్రలో ఉద్యోగులందరూ తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఓటు వేయడానికి మానసికంగా సిద్ధమైపోయారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెబితేనే ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల మద్దతు లేని పార్టీ గెలిచిన దాఖాలాలు చరిత్రలో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీఎన్జీవోలను మచ్చిక చేసుకోవడం ద్వారా సీమాంధ్రలో గండం నుంచి గట్టెక్కాలని జైరాం రమేష్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్‌లో భాగంగా ఏపీఎన్జీవోలతో సమావేశం ఏర్పాటు చేశారు.   ప్రస్తుతం ఏపీఎన్జీవోలు ‘ఆప్షన్లు ఉండాల్సిందే’ అనే పట్టు మీద వున్నారు. వారికి ఏం కావాలో వారికి ఇచ్చి తమకు ఏంకావాలో అది తీసుకునే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో జైరాం రమేష్ వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి తీరతామని వాళ్ళకి హామీ ఇచ్చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరగకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించాలని  ఉద్యోగ సంఘాల నాయకులను కోరినట్టు సమాచారం. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి సీమాంధ్రులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని సీమాంధ్రులెవరూ నమ్మరన్న విషయాన్ని జైరాం రమేష్ మరచిపోయినట్టున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతమే విభజించి పాలించు. అందుకే రాష్ట్రాన్ని విభజించి కూడా రెండు ప్రాంతాలనీ పాలించాలని అనుకుంటోంది. ఈ విషయంలో ఏపీఎన్జీవోలని కూడా అనాలి. రాష్ట్రం అడ్డగోలు విభజనకు జైరాం రమేష్ కూడా కారణమని తెలిసి కూడా, ఆయన పిలవగానే కలవటానికి వెళ్ళారు. వినతిపత్రాలు సమర్పించారు. ఆయన చెప్పిన సోది అంతా విని వచ్చారు.  

టీఆర్ఎస్‌కి ఓటమి భయం పట్టుకుంది

      ఈ ఎన్నికలలో 90 అసెంబ్లీ స్థానాలు తమ పార్టీ సంపాదించుకుంటుందని, తెలంగాణలో ప్రభుత్వం స్థాపించడంతోపాటు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతుందని టీఆర్ఎస్ నాయకులు పైకి చెబుతున్నారు. మొన్నటి వరకూ 60 సీట్లు వస్తాయని అనుకున్నామని, ఇప్పుడు 90 వస్తాయని అనుకుంటున్నామని ప్రకటిస్తున్నారు. అయితే బయట పరిస్థితి చూస్తే టీఆర్ఎస్‌కి అంత సీన్ కనిపించడంలేదు. అందుకే పైకి ఎంత డాంబికాలు పలుకుతున్నా, లోలోపల మాత్రం టీఆర్ఎస్ నాయకులను ఓటమి భయం పట్టి పీడిస్తోంది.   అందుకే అప్పుడప్పుడు నోరు జారి నిర్వేదంగా మాట్లాడుతున్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు పక్కాగా కుదరడంతో ఆ రెండు పార్టీలకి తెలంగాణ ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఉద్రికత్తలు పెంచి లాభపడటం తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చే సమయంలో మోడీని తిట్టిపోసే టీఆర్ఎస్‌కి ఓటేస్తే భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం టీఆర్ఎస్‌కి సహకరించదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే టీఆర్ఎస్ కేవలం ఉత్తర  తెలంగాణలో మాత్రమే బలంగా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో ఆ పార్టీని పట్టించుకునేవారే కనిపించడంలేదు. ఖమ్మం జిల్లాలో అయితే టీఆర్ఎస్ ఊసే లేదు. దీంతోపాటు తెలంగాణ అంతటా టీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలామంది బలహీనంగా వున్నారు. ఇలా అనేక కారణాలు టీఆర్ఎస్‌ని ఓటమి వైపు తీసుకెళ్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న టీఆర్ఎస్ నేతలు వారం రోజుల నుంచి నిర్వేదంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ అయితే నన్ను గెలిపిస్తే తెలంగాణని పాలిస్తా, లేకపోతే రెస్ట్ తీసుకుంటానని నిర్మొహమాటంగా ప్రకటించేశారు. టీఆర్ఎస్ మిగతా నాయకులు కూడా అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే టీఆర్ఎస్ ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకోక తప్పేట్టులేదు.  

కేవీపీ అరెస్టు నోటీసు ఏ పార్టీకి చేటు?

      రెండు వారాల క్రితం అమెరికా దర్యాప్తు సంస్థ రాజ్యసభ సభ్యుడు కే.వీ.పీ. రామచంద్రరావుపై టైటానియం కుంభకోణంలో మోపిన అభియోగాలను చికాగో కోర్టు దృవీకరించినప్పుడు, అదొక పెద్ద సంచలనం సృష్టించింది. అయితే షరా మామూలుగానే అప్పుడు కేవీపీ తనపై అటువంటి నిరాధారమయిన ఆరోపణలు రావడం దురదృష్టకరమని, చికాగో కోర్టు, సదరు దర్యాప్తు సంస్థ వెంటనే తమ నివేదికలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఆ నివేదిక చూసిన తరువాతనే తాను స్పందిస్తానని అప్పటికి తప్పుకోగలిగారు. అయితే కదా అక్కడితో ముగిసిపోలేదు.   ఆ తరువాత కొద్ది రోజులకే, అమెరికా సంస్థ కేవీపీ అరెస్టు కోరుతూ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి భారత ప్రభుత్వానికి ఆ నోటీసులు అందజేసి ఆయనను తమకు అప్పగించమని కోరింది. ఇదంతా జరిగి అప్పుడే పది రోజులయిన సంగతి ఈరోజే బయట పడింది. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయిన కేవీపీ ఈరోజే ప్రమాణ స్వీకారం చేసారు. బహుశః అందుకోరకే ఇంతకాలం ఈ విషయాన్ని ప్రభుత్వం త్రొక్కిపెట్టి ఉండి ఉండవచ్చును. తమకు పది రోజుల క్రితం అందిన రెడ్ కార్నర్ నోటీసును సీబీఐ, ఈరోజు రాష్ట్ర సీఐడీ పోలీసు శాఖకు పంపినట్లు సమాచారం.     భారత పార్లమెంటు సభ్యుడయిన ఆయనను అమెరికా దర్యాప్తు సంస్థ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ద్వారా అరెస్టు చేయడం సాధ్యమా కాదా అనేది న్యాయ నిపుణులు తేల్చవలసిన విషయం గనుక అది అప్రస్తుతం. ఈ నోటీసు వలన ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా? ఆయన తనకున్న అపారమయిన రాజకీయ పలుకుబడి, పరపతిని వినియోగించి అరెస్టు నుండి తప్పించుకొంటారా? లేక ఆయన కూడా తెలివిగా కోర్టును ఆశ్రయించి తప్పుకుంటారా? అనేవి కూడా అప్రస్తుత విషయాలే. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇటువంటి వ్యవహారం వల్ల ప్రధానంగా కాంగ్రెస్, వైకాపాలపై ప్రభావం ఏవిధంగా ఉంటుంది? దాని నుండి ఆ రెండు పార్టీలు ఏవిధంగా తప్పుకొనే ప్రయత్నాలు చేస్తాయి? వంటివే ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించబోతున్నాయి.

మెగా సోదరులు...మెగా డిఫరెన్స్...

  కాంగ్రెస్ పార్టీని ఎలాగయినా గెలిపించి తీరుతానని చిరంజీవి డిల్లీలో శపథం చేసి ప్రచారానికి బయలుదేరితే, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమికొట్టేందుకే తాను రాజకీయాలలోకి రావలసి వచ్చిందని చెప్పడం విశేషం. అయితే వీరిరువురిలో చిరంజీవి స్థిరంగా కాంగ్రెస్ టైటానిక్ పడవ మీదనే నిలబడి గంట కొడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం నేటికీ ‘ఎన్డీయే అభ్యర్ధులకే నా మద్దతు!’ అంటున్నారు తప్ప, స్వయంగా చంద్రబాబే ఆయనింటికి వచ్చి మరీ తమ పార్టీకి మద్దతు ఇమ్మని కోరినా ఆయన నోటంట ‘తెలుగుదేశం పార్టీకే నా మద్దతు’ అనే ముత్యాలవంటి ఆ మూడు ముక్కలు రాలలేదు. అంటే ఆయనకి తెదేపా పట్ల నేటికీ ఇంకా ఏవో అభ్యంతరాలున్నట్లు భావించవలసి ఉంది. ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో ‘ఎన్డీయే అభ్యర్ధులకు’ ప్రచారం చేసి పెట్టబోతున్నట్లు రూడీ అయ్యింది.   ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ నేటికీ తెలంగాణాలో ప్రచారం చేయడానికి వెళ్ళగలుగుతున్నారు. ఆయనకి అక్కడ ప్రజల నుండి అభిమానుల నుండి నేటికీ మంచి ఆదరణ కనబడుతోంది. కానీ కేంద్రమంత్రి అయిన చిరంజీవి హైదరాబాదులోనే నివాసం ఉంటున్నప్పటికీ, కాంగ్రెస్ తరపున తెలంగాణాలో ప్రచారం చేయలేని దుస్థితి. ఆయన ప్రచారానికి వెళితే పడే ఓట్లు కూడా పడవని గ్రహించిన టీ-కాంగ్రెస్ నేతలు చిరంజీవి ‘నో ఎంట్రీ’ బోర్డు ఎప్పుడో పెట్టేసారు. నిజానికి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చిన కారణంగా ఎంతో కొంత అనుకూల పరిస్థితి ఉంది. కానీ, అక్కడ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు చిరంజీవి వంటి ప్రజాకర్షక నేత ఒక్కడూ లేడు. అయినప్పటికీ మా తిప్పలేవో మేమే పడతాము తప్ప ఆ జీవి మాత్రం మాకొద్దు మహాప్రభో! అంటున్నారుట.    పోనీ ఆయనకు సీమాంద్రాలో ప్రజలు ఏమయినా బ్రహ్మ రధం పడుతున్నారా.. అంటే అదీ లేదు. అక్కడా ఆయన సభలకు జనాలు మొహాలు చాటేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన నిర్వహించిన బస్సు యాత్రలోను అదే స్థితి, నేడు ఆయన చేస్తున్న ప్రచారంలోనూ అదే పరిస్థితి. చిరంజీవి రెండు ప్రాంతాల ప్రజలకు కాని వాడయిపోతే, ఆయన తమ్ముడు మాత్రం అందరివాడు, అందరికీ కావలసినవాడు అనిపించుకొంటున్నారు. చిరంజీవిని సీమాంద్రాలో ప్రజలు సైతం పట్టించుకోకపోయినా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చి తమకోసం తెలంగాణాలో కూడా ప్రచారం చేయాలని ‘ఎన్డీయే అభ్యర్ధులు’ కోరుకోవడం గమనిస్తే ప్రజలలో మెగా సోదరుల వ్యక్తిత్వాలకున్న విలువ ఏమిటో స్పష్టంగా అర్ధమవుతుంది. చివరికి ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సైతం ఇదేవిధంగా స్పందించడం మరో విశేషం.   అయితే అందుకు కేవలం వారి వ్యక్తిత్వాలు మాత్రమే ప్రధాన కారణమని చెప్పలేము. వారి ప్రసంగ శైలి, వారు ఎన్నుకొన్న పార్టీలపై ప్రజలకున్న అభిప్రాయాలు కూడా వారి ప్రజాధారణలో తీవ్ర అంతరాన్ని కలిగిస్తున్నాయి. చిరంజీవి తన సినిమాలలో ప్రజలను ఆకట్టుకొనే విధంగా చాలా గొప్పగా డైలాగ్స్ చెపుతూ నటించి ఉండవచ్చును. కానీ నేటికీ ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగ అలవోకగా ప్రసంగించలేరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేఖత, ముఖ్యంగా రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన అనుసరించిన ద్వంద వైఖరి ఇత్యాది కారణాలు కూడా ఆయన పట్ల ప్రజలలో విముఖత ఏర్పడేందుకు కారణమవుతోందని చెప్పవచ్చును.   ఒకవైపు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కోసం సీమాంద్రాలో ప్రచారం చేస్తూ గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటే, మరో వైపు ఆ పార్టీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్ధులు ఓటమి భయంతో తమ నామినేషన్లు ఉపసంహరించుకొని పోటీ నుండి తప్పుకోవడం ఆయన ప్రచారం యొక్క గొప్పదనానికి మరో నిదర్శనం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సీమాంద్రాలో కూడా ‘ఎన్డీయే అభ్యర్ధుల’ తరపున ప్రచారానికి దిగినట్లయితే కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును.   పాపం ఆ ఒంటరి జీవి కష్టం చూసి చలించిపోయిన కాంగ్రెస్ టైటానిక్ షిప్ కెప్టెన్స్- సోనియా రాహుల్ గాంధీలు కూడా త్వరలోనే సీమాంద్రాలో పర్యటించి ‘మిగిలిన పని’ పూర్తి చేయడానికి వస్తున్నట్లు తాజా సమాచారం. శుభం.

పొన్నాలకి హై బీపీ!

      పాపం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు.  మంత్రిగాఉన్నంతకాలం ఎంచక్కా జోకులేసుకుంటూ, డాన్సులు చేసుకుంటూ, పాటలు, పద్యాలు పాడుతూ ఉత్సాహంగా గడిపిన ఆయన నెత్తిన ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి బండలా మారింది. ఏ బ్యాడ్ ముహూర్తంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారోగాని అప్పటి నుంచి ఆయనకి బ్యాడ్ టైమ్ స్టార్టయినట్టు కనిపిస్తోంది.   ఒకప్పుడు ఎంతో కూల్‌గా వుండే ఆయన ఇప్పుడు గరమ్ గరమ్‌గా కనిపిస్తున్నారు. ప్రెస్ వాళ్ళు గతంలో ఏదైనా ప్రశ్నిస్తే చిరునవ్వుతో సమాధానం చెప్పే ఆయన ఇప్పుడు అంతెత్తున విరుచుకుపడుతున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నెరవేర్చడంలో ఆయన పూర్తిగా స్ట్రెస్‌కి గురై, హైబీపీకి లోనయినట్టుగా పరిస్థితి చూస్తే అనిపిస్తోంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే మీకు సీన్ సితారైపోద్దని సోనియా మేడమ్ వార్నింగ్ ఇచ్చారో ఏమోగానీ, ఆయన మీద ఏదో ఒత్తిడి బాగా వున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మంగళవారం నాడు ఆయన బీపీ ఏ స్థాయికి చేరిందో తెలిస్తే ఆశ్చర్యపోయారు. ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్ ఎక్కిన ఆయన ఒకచోట ప్రచారం పూర్తి చేసుకున్నారు. మరోచోటకి పోదామని అంటే, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదని సదరు హెలికాప్టర్ పైలెట్ చెప్పాడట. అంతే, పొన్నాల గారికి హైబీపీ పెరిగిపోయి ఆ పైలెట్‌ని నానా మాటలూ అనేసి హెలికాప్టర్ దిగేసి కారులో వెళ్ళిపోయారట. ఇలా వుంది పొన్నాల గారి బీపీ వ్యవహారం.

ఎన్నికల సంఘం: ఓటేస్తే బహుమతులిచ్చే ఖర్మేంటి?

      ఓటర్లని రాజకీయ నాయకులు ఎప్పుడో బిచ్చగాళ్ళని చేసేశారు. మా పార్టీకి ఓటేస్తే ఫలానా ఫలానా విధంగా మీకు లాభం కలిగిస్తానని రాజకీయ నాయకుడు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ వుంటారు. చాలామంది ఓటర్లు ఆ ఆఫర్లు నిజమేననుకుని పొంగిపోతూ వుంటారు. ఇక ఎలక్షన్లు వచ్చాయంటే ఓటర్లకి డబ్బులు పంచడం కామన్. ఓటు ఒక శక్తి.. ఓటు ఒక ఆయుధం అని స్టేట్ మెంట్లు కొంతమంది అభ్యుదయవాదులు ఇస్తూ వుంటారుగానీ, ఇప్పుడు దేశంలో జనం డబ్బు తీసుకుని ఓట్లు వేయడానికి ఎంతమాత్రం సిగ్గుపడటం లేదు.   అసలు డబ్బు ఇచ్చే నాయకులని అని లాభం లేదు. చేతులు జాస్తున్న ఓటర్లనే అనాలి. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఎవరికో ఒకరికి ఓటు వేసే ప్రబుద్ధులు, అందరి దగ్గరా చేతులు చాచి అసలు ఎవరికీ ఓటు వేయని మహానుభావులు కూడా ఓటర్లలో వున్నారు. వాళ్ళు ఇస్తునందుకు వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు తీసుకుంటున్నందుకు వాళ్ళు ఇస్తున్నారు. ఇందులో తప్పు ఎవరిదో వెతకడం దేవుడనేవాడుంటే ఆయనగారి వల్ల కూడా కాదు. కోడి ముందా గుడ్డు ముందా.. చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న ఎంత కఠినమైనదో ఇదీ అంతే. సరే ఈ గోల ఇలా వుంటే, రాజకీయ నాయకులకు తోడుగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లని ముష్టోళ్ళని చేయడానికి తనవంతు కృషి చేస్తోంది.  ఈసారి 90 శాతానికి మించి పోలింగ్ జరపాలని అధికారుల లక్ష్యంగా పెట్టుకున్నారట. దానికోసం ఓటర్లని ఓటు వేయించేలా మోటివేట్ చేయడానికి స్కీములు ప్రకటించారు. ఓటు వేసిన ఓటర్ల నుంచి డ్రా తీసి, సదరు డ్రాలో పేర్లు వచ్చిన ఓటర్లకు కార్లు, ఇంకా ఏవేవో వస్తువులు ముష్టిగా పడేస్తారట. అసలు మీపని ఎలక్షన్లు సక్రమంగా నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ పని. ఎంత శాతం ఓట్లు పడితే మీకెందుకంటా? ఓటర్ల శాతం పెంచడానికి లక్కీ డ్రాలు.. బంపర్ బహుమతులు.. ఈ దరిద్రం అంతా ఎందుకంటా?  ఈ తతంగమంతా నిర్వహించే ఖర్మ మీకెందుకంటా? రాజకీయ నాయకులతో కలసి తిరిగీ తిరిగీ ఈ ప్రభుత్వ అధికారులకి కూడా ఓటర్లు ముష్టోళ్ళలాగా కనిపిస్తున్నట్టున్నారు.

ఎన్టీఆర్ ని పట్టించుకోని నందమూరి ఫ్యాన్స్..!

      నటరత్న, విశ్వవిఖ్యత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ అంది పుచ్చుకున్నారు. సినిమా రంగంతోపాటు రాజకీయ రంగంలో కూడా నాన్న వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తున్నారు. ఈ వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్‌ కొనసాగిస్తారని నందమూరి అభిమానులు గతంలో భావించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలి కొరుకుడు పడని విధంగా, నందమూరి కుటుంబానికి దూరంగా వెళ్తున్న విధంగా వుండటంతో నందమూరి వంశాభిమానులందరూ క్రమంగా జూనియర్ ఎన్టీఆర్‌కి దూరమవుతున్నారు.   నందమూరి ఫ్యాన్స్ జూనియర్‌కి దూరం కావడం వల్లే ఇటీవలి కాలంలో ఆయన సినిమాలకు ప్రేక్షకాదరణ లభించడం లేదన్న అభిప్రాయాలు వున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైతే భారీ స్థాయిలో హడావిడి చేసే నందమూరి వంశాభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఊరుకుంటున్నారు. దీనివల్ల ఆయన సినిమాలు రిలీజైన థియేటర్లు మొదటి రోజు నుంచే చల్లగా వుంటున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కి, తమకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా నందమూరి వంశాభిమానులు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ఎన్నికలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకోకపోవడం, ఆయన నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎలాంటి స్పందన లేకపోవడంతో నందమూరి వంశాభిమానులతో ఆయనకున్న దూరం మరింత పెరిగింది. వీరి మధ్య ఏర్పడిన గ్యాప్‌లో నందమూరి వంశాకురం నందమూరి మోక్షజ్ఞ ఎంటరవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞను అభిమానించే వారి సంఖ్య బాగా పెరిగింది. నందమూరి వంశానికి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కాదని, సినిమా వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞే అసలైన వారసుడని అభిమానులు అంటున్నారు. తాజాగా మోక్షజ్ఞ తెలుగుదేశానికి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వుండటం కూడా ఆయన మీద అభిమానుల అభిమానం మరింత పెరగడానికి కారణమైంది. మోక్షజ్ఞ వెండితెర మీదకి ఎంట్రీ ఇచ్చి, ఒక్క భారీ హిట్ కొట్టాడంటే చాలు నందమూరి వంశాభిమానులందరూ మోక్షజ్ఞ వైపు పూర్తిగా షిఫ్ట్ అయిపోయే అవకాశం వుంది.  

హిందూపురంలో ప్రచారంతో మోక్షజ్ఞ పొలిటికల్ ఎంట్రీ?

      నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి తారకరామ మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశం కంటే ముందే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడా? తాతకి, తండ్రికి, హోల్‌సేల్‌గా నందమూరి వంశానికి తానే అసలైన వారసుడనని చెప్పకనే చెప్పబోతున్నాడా? ఈ ప్రశ్నలకి తెలుగుదేశం వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.   ఇప్పటికే ఇరవై యేళ్ళు నిండిన మోక్షజ్ఞను రాజమౌళి దర్శకత్వంలో తెలుగు తెరకు పరిచయం చేయడానికి ఓపక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పొలిటికల్‌గా కూడా మోక్షజ్ఞ ఫుల్ యాక్టివ్‌గా వున్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రచారాన్ని ఫేస్‌బుక్, లింక్‌డ్ ఇన్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లద్వారా నిర్వహిస్తున్న విషయం రీసెంట్‌గా బయటపడింది. కూల్‌గా, బయటకి రాకుండా వుంటూనే లోపల్లోపల తెలుగుదేశం పార్టీ కోసం నందమూరి వంశ వారసుడిగా మోక్షజ్ఞ చేస్తున్న సర్వీస్ తెలుగుదేశం వర్గాలని ముగ్ధులను చేస్తోంది. అలాగే ఈసారి ఎన్నికలలో తన తండ్రి పోటీ చేస్తున్న హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మోక్షజ్ఞ తండ్రితోపాటు ప్రచారంలో పాల్గొనే అవకాశం వుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. తండ్రితోపాటు ప్రచార రథంపై మోక్షజ్ఞ కూడా కనిపించే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే  మోక్షజ్ఞ భారీ ప్రసంగాలేవీ చేయకుండా ముద్దుముద్దుగా రెండు మూడు మాటలతో తన తండ్రికి ఓటేయమని హిందూపురం ఓటర్లని రిక్వెస్ట్ చేస్తాడని తెలిసింది.

బీజేపీలోకి జంప్ కానున్న శ్రవణ్?

      పీఆర్పీ ద్వారా రాజకీయాల్లోకి ఎంటరై, పీఆర్పీని మూసేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌ని తెరాస సీమాంధ్రులను తిట్టడానికి బాగా వాడుకుంది. శ్రవణ్ సీమాంధ్రులను తిడుతుంటు ఆ మాటలకు తెలంగాణ వాళ్ళ కళ్ళలోంచి కూడా నీరు వచ్చేది. సీమాంధ్రులకు అయితే గుండె రగిలిపోయేది. సీమాంధ్రులను తిట్టడంలో, అడ్డంగా వాదించడంలో స్పెషలిస్టు అయిన శ్రవణ్ తనకు కేసీఆర్ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వలేదని లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ జిలానీ అయ్యాడు.   కాంగ్రెస్‌లోకి జంప్ కాగానే తెలంగాణ కాంగ్రెస్ ఆయనకి అధికార ప్రతినిధి హోదా ఇచ్చింది. దాంతో అప్పటి  వరకూ కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తున్న అధికార ప్రతినిధులకు మండింది. శ్రవణ్ రోజుకో ప్రెస్‌మీట్ పెట్టి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ని నానా తిట్లూ తిట్టడం మొదలుపెట్టాడు. మొన్నటి వరకూ కేసీఆర్ని దేవుడని పొగిడిన నోటితోనే ఇప్పుడు తిట్టడానికి శ్రవణ్‌ ఎలాంటి ఇబ్బందీ పడటం లేదుగానీ, వినేవాళ్ళకే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అయినా సరే శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ని తిడుతూనే వున్నాడు. వినలేక వినేవాళ్ళు వింటూనే వున్నారు. కాంగ్రెస్‌లో చేరిన పది రోజులలోపే శ్రవణ్ ఎంత ఎదిగిపోయాడంటే,  నిన్న రాహుల్ గాంధీ తెలంగాణకి వచ్చినప్పుడు ఆయన ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించేంత ఎదిగిపోయాడు. ఇది కాంగ్రెస్‌లో వున్నవారికి ఎంతమాత్రం నచ్చడం లేదు. శ్రవణ్‌ని అవసరమైనదానికంటే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారన్న రుసరుసలు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రారంభమయ్యాయి. శ్రవణ్ చాలా ఎక్కువ చేస్తున్నాడన్న కంప్లయింట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శ్రవణ్‌కి కూడా కాంగ్రెస్ పార్టీలో వున్న చాలామంది తనను శత్రువులా చూస్తూ వుండటం భరించలేకపోతున్నాడు. తాను తన ‘టాలెంట్’తో ఎదిగిపోతుంటే టీ కాంగ్రెస్‌లో  ఓర్వలేకపోతున్నారని ఫీలైపోతున్నట్టు సమాచారం. అందువల్ల కాంగ్రెస్‌ని కూడా విడిచిపెట్టి, భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని భావిస్తున్న బీజేపీలోకి జంప్ అయిపోతే మంచిదని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం పవన్ కళ్యాణ్ ద్వారా పావులు కదుపుతున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే శ్రవణ్ త్వరలో బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయి.

అవనిగడ్డలో టీడీపీకి సవాల్‌గా మారిన రెబల్!

    ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, సీమాంధ్రలో ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే టీడీపీ ఓడిపోయే మొట్టమొదటి సీటు కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ స్థానమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలహీనమైన అభ్యర్థులు వున్నారు. చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం తరఫున బలహీనమైన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ని ఈ స్థానం నుంచి నిలబెట్టారు. అయితే ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ, స్థానికంగా ప్రజల్లో మంచి పేరు వున్న కంఠంనేని రవిశంకర్ తనకు తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ స్థానం నుంచి టిక్కెట్ ఇస్తుందని ఆశించారు. ఈ మేరకు పార్టీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ తెలుగుదేశంలోకి జంప్ జిలానీ కావడంతో కొత్త ఒక వింత అన్నట్టు చంద్రబాబు స్థానికంగా ఎంతో బలం వున్న కంఠంనేని రవిశంకర్‌ని కాదని బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇచ్చారు. దాంతో కంఠంనేని తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థిగా అవనిగడ్డ స్థానం నుంచి పోటీలో నిలిచారు. ఆయన నామినేషన్ వేసిన రోజున ఆయనతోపాటు వచ్చిన మద్దతుదారులను చూసి తెలుగుదేశం వర్గాలు నోళ్ళు తెరిచాయి. ఇంత బలం వున్న వ్యక్తిని మనం దూరం చేసుకున్నామే అన్న బాధ తెలుగుదేశం వర్గాల్లో మొదలైంది. అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలకు మండలి బుద్ధ ప్రసాద్ మీద నమ్మకం లేదు. ఆయనను గెలిపిస్తే ఏదో పదవిలో ఫిక్సయిపోయి నియోజకవర్గం ముఖమే చూడడన్న అభిప్రాయం ఇక్కడి ప్రజల్లోవుంది. అందుకే గత ఎన్నికలలో ఆయనను ఓడించారు. గెలిచినా నియోజకవర్గం ముఖం చూడను.. ఓడినా నియోజకవర్గం ముఖం చూడను అని ఆయన ఆ తర్వాత నిరూపించారు. మొత్తమ్మీద ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మండలి బుద్ధ ప్రసాద్, కాంగ్రెస్ తరఫున పోటీలో వున్న మత్తి వెంకటేశ్వరరావు, వైసీపీ తరఫున పోటీ చేస్తున్న సింహాద్రి రమేష్‌బాబు కంటే టీడీపీ రెబల్‌గా రంగంలో వున్న కంఠంనేని రవిశంకర్ బలమైన అభ్యర్థిగా నిలిచారు. అవనిగడ్డలో నిలిచిన అభ్యర్థులందరినీ పరిశీలిస్తే కంఠంనేని రవిశంకర్‌కే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయని రాజకీయ  పరిశీలకులు భావిస్తున్నారు.

అప్పుడు సమైక్యం, ఇప్పుడు సింగపూర్

  గతేడాది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించినప్పటి నుండి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, కేవలం తాను మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలనని చెపుతూ వచ్చారు. అయితే అందుకు ప్రతిగా ప్రజలు తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి,30 యంపీ సీట్లు ఇవ్వాలని కోరుతూ వచ్చారు. అయితే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆయన ఇక ఆ సమైక్య ప్రస్తావనే అసలు ఎత్తడంలేదు. ఇప్పుడు ఆయన కూడా రాష్ట్రాన్ని సింగపూరులా మార్చేస్తానని, మళ్ళీ రాజన్నరాజ్యం ఏర్పాటు చేస్తానని మాత్రమే చెపుతున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమయింది గనుకనే ఆయన ఆ ప్రసక్తి ఎత్తడంలేదని ఆయన మద్దతుదారులు సర్దిచెప్పుకోవచ్చు గాక, కానీ జగన్ మోహన్ రెడ్డి ఆనాడు చేసిన సమైక్య పోరాటమంతా కేవలం ప్రజలను మభ్యపెట్టి, సీమాంద్రాపై పూర్తి పట్టు సాధించేందుకే తప్ప, నిజానికి ఆయనకు కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖించే ఉద్దేశ్యం అసలు లేనేలేదని ఋజువు అవుతోంది.   ఒకప్పుడు తెలంగాణాలో పట్టు సాధించేందుకు ‘తెలంగాణా సెంటిమెంటు పట్ల గౌరవం’  ప్రదర్శించారు జగన్. ఆ తరువాత సీమాంధ్రపై పట్టుకోసం ఉత్తుత్తి సమైక్య పోరాటాలు చేసారు. ఇప్పుడు అధికారం సంపాదించేందుకు సింగపూర్ స్కెచ్ గీసి చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణాలో పోటీ చేసేందుకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు రెండూ తనకు రెండు కళ్ళ వంటివని, తన చెల్లెలు షర్మిల ద్వారా చెప్పిస్తున్నారు. ఈవిధంగా మాట నిలకడ, విశ్వసనీయత, ఎటువంటి పరిపాలనానుభవమూ లేని ఆయన అధికారం చేపడితే ఇంకెన్ని స్టోరీలు వినిపిస్తారో మరి!

మోడీ ప్రచారంతో మారనున్న బలాబలాలు

  రాహుల్ గాంధీ నిన్న తన ప్రసంగంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణా ప్రజలను కూడా ఏవిధంగా మోసం చేసారో చాలా సమర్ధంగా చెప్పుకోగలిగారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెప్పట్టగల సత్తా ఉన్న జాతీయపార్టీ అయిన తమకి ఓటు వేయడం ద్వారానే తెలంగాణా అభివృద్ధి సాధ్యం అవుతుంది, తప్ప ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వలన సాధ్యంకాదని గట్టిగా నొక్కి చెప్పారు. అదేవిధంగా తమ పార్టీ గెలిస్తే తెలంగాణకు ఏమేమి చేయబోతున్నామో కూడా చాలా చక్కగా, గొప్పగా వివరించి ప్రజలను ఆకట్టుకోగలిగారు. మళ్ళీ చాలా కాలం తరువాత రాహుల్ గాంధీ, ప్రజలను ఆకట్టుకొనేలా ప్రసంగించడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా సమరోత్సాహంతో ఉన్నాయి.   సరిగ్గా ఇటువంటి సమయంలోనే, నరేంద్ర మోడీ కూడా ఈరోజు తెలంగాణాలో వరుసగా నాలుగు సభలలో ప్రసంగించనున్నారు. ఆయన కూడా కేసీఆర్ లాగే మాటల మాంత్రికుడనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ఆయన కూడా తమ ప్రధాన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెరాసల పైనే, ముఖ్యంగా తమ విజయానికి అడ్డుగోడగా నిలుస్తున్న కేసీఆర్ మీదనే తన అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించవచ్చును.   కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి జరగాలంటే, తమ కూటమికే ఓటేసి అధికారం కట్టబెడితేనే సాధ్యమవుతుందని, ఎటువంటి పాలనానుభావం లేని ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వల్ల కాదని గట్టిగా నొక్కి చెప్పవచ్చును. నరేంద్ర మోడీ కూడా సరిగ్గా ఇదే పాయింటు మీద గట్టిగా మాట్లాడినట్లయితే, అది తప్పకుండా ప్రజలపై చాలా ప్రభావం చూపవచ్చును. అయితే దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మోడీకి అనుకూల పరిస్థితులు కనబడుతున్నందున, ఆ ప్రభావం బీజేపీ-తెదేపా కూటమికి కూడా చాలా లబ్ది చేకూర్చవచ్చునని సర్వే సంస్థల నివేదికలు చాటి చెపుతున్నందున, (తెలంగాణాలో) ఎన్నికలకు ఇంకా కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలిఉన్న ఈ తరుణంలో నేడు నరేంద్ర మోడీ స్వయంగా చేయబోయే ప్రచారం వలన తెదేపా-బీజేపీ కూటమికి సానుకూల వాతావరణం సృష్టించవచ్చును.   అయితే, ఇదే కారణంగా అంటే ఈవిధంగా నాలుగు బలమయిన రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం వలన, ప్రజల ఓట్లు చీలి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రిగా రాజ్యం ఏలాలని కేసీఆర్ కంటున్న కలలు కలలుగానే మిగిలిపోవచ్చును. కానీ, అధికార దాహంతో తహతహలాడిపోతున్న కేసీఆర్, ఇంతకాలం తాను ఏ కాంగ్రెస్ పార్టీని ‘చ్చీ’ కొట్టారో మళ్ళీ అదే పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దపడినా ఆశ్చర్యం లేదు.

పవన్ కళ్యాణ్ పార్టీ ఖరీదు 500 కోట్లు?

  పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడిన తీరు చూసి అందరూ ‘అబ్బో పర్లేదు’ అనుకున్నారు. ఆ తర్వాత రెండోసారి ఆయన మాట్లాడిన తీరు చూసి ‘ఈయనేదో కాస్త తేడాగా వున్నాడే’ అనుకున్నారు. ఆ తర్వాత ఒక్కో స్టెప్‌లోనూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఒక్కో స్టెప్ డౌన్ అవుతూ వస్తోంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం చెప్పినట్టు ఆడే వ్యక్తి అనే ఇమేజ్ వచ్చేసింది. అయితే పవన్ పార్టీ వెనుక వున్న రహస్యాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ రహస్యాల గురించి చర్చ భారీ స్థాయిలో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించడానికి, ఆ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఐదు వందల కోట్లు చేతులు మారాయనేది తాజా చర్చ. ఈ చేతులు మారే వ్యవహారానికి మధ్యవర్తిలా వ్యవహరించింది ఘనత వహించిన తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడట. అందరూ ఇంతకాలం జనసేన పార్టీ ప్రకటించిన తర్వాతే మోడీ నుంచి పవన్‌కి పిలుపు వచ్చందని, అప్పుడే ఆయన గుజరాత్‌కి వెళ్ళి మోడీని కౌగలించుకున్నాడని అనుకుంటున్నారు. అయితే అంతకుముందే మోడీతో పవన్ సీక్రెట్‌గా మాట్లాడుకుని 500 కోట్ల డీల్ కుదర్చుకున్నాడని అనుకుంటున్నారు. ఆమధ్య హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘అత్తారింటికి దారేది’ సినిమా సక్సెస్ మీట్ జరిగిన తర్వాత పవన్‌కి చంద్రబాబు నుంచి పిలుపు వచ్చిందట. వెంటనే పవన్ చంద్రబాబుని కలవటం, చంద్రబాబు మోడీతో పవన్‌ని లింక్ చేయడం జరిగిపోయిందట. ఈ రకంగా పవన్ కళ్యాణ్‌ని ఇమేజ్‌ని ఓట్లుగా మలచుకోవడానికి బీజేపీ, టీడీపీ కలసికట్టుగా కథ నడిపారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు.

రెంటికీ చెడ్డ రేవడి కానున్న జూనియర్ ఎన్టీఆర్!

  నాన్నచాటు బిడ్డలాగా, నాన్న చెప్పినట్టే వింటున్న జూనియర్ ఎన్టీఆర్ రాబోయే కాలంలో ఇటు రాజకీయ రంగానికి, అటు సినిమా రంగానికి దూరమై రెంటికీ చెడ్డ రేవడి అవడం ఖాయమన్న అభిప్రాయాలు అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో ఎవరూ పిలవకుండానే వచ్చి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి చప్పుడు చేయడం లేదు. తన తండ్రి నందమూరి హరికృష్ణకి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం లభించకపోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా వున్నాడనేది బహిరంగ రహస్యం. అయితే ఎన్టీఆర్ సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ప్రధాన కారణం ఆయనకు తెలుగుదేశం పార్టీ అండగా వుండటమే. ఆయన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కూడా వుంది. భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలన్నా తెలుగుదేశం పార్టీతోనే ఆయనకు భవిష్యత్తు వుంటుంది. తెలుగుదేశం అభిమానులు చూడటం, ప్రమోట్ చేయడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ విజయాలు అందుకుంటున్నారన్న అభిప్రాయం జనాల్లో వుంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమైన తర్వాత ఆయనకు సినిమా రంగంలో అన్ని ఫ్లాపులే వస్తూ వుండటాన్ని దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. అటు సినిమా అయినా, ఇటు రాజకీయమైనా తనకు భవిష్యత్తు టీడీపీతోనే వుందని తెలిసినా కావాలని దూరమవుతూ వుండటం అతనికే మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రచారానికి రావడానికి ఎవరూ బొట్టుపెట్టి పిలవరు, ఎవరికి వారే రావాలని చంద్రబాబు దగ్గర్నుంచి, లోకేష్ వరకూ అందరూ చెబుతూనే వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆరే పంతం తగ్గించుకున్ని తెలుగుదేశానికి ప్రచారం చేయడానికి ముందుకు వస్తే అందరికీ బాగుంటుందన్న అభిప్రాయాలున్నాయి. అయితే జూనియర్ తెలుగుదేశానికి ప్రచారానికి రాకపోగా వైకాపాలోకి వెళ్ళిన కొడాలి నానికి మద్దతు ఇస్తూ వుండటం, తనకు సంబంధించిన ఛానల్‌లో వైకాపాకు మద్దతు ఇస్తూ వుండటం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావాలంటే ఆయన తెలుగుదేశానికి ప్రచారం చేయడానికి ముందుకు రావాలని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.