గోవు నిజంగా కామధేనువే..!

భారతీయ సంస్కృతిలో..చరిత్రలో గోవుకు ప్రత్యేక స్థానముంది. అనాది నుంచి గోవు భారతీయులకు ఆరాధ్య దేవత. ఆ తల్లి కరుణా కటాక్షాలతో సకల సంపదలతో మన భారతావని పూర్వం అత్యంత వైభవంగా విరాజిల్లింది. సకల వేదాలు, పురాణాలు, శాస్త్రాలు గోమాతను కొనియాడాయి. గోవును ప్రత్యక్ష దైవంగా ఈ దేశం స్వీకరించింది. గోవును నడిచే దేవాలయంగా మన పెద్దలు నిర్వచించారు. గోవు మూత్రానికి అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన రుషులు ఎనాడో చెప్పారు. దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రజ్ఞులు గోమూత్రంలో 47 రకాల మూల పదార్ధాలున్నాయని మన మహర్షులు చెప్పిన మాటలు అక్షరసత్యాలని నిరూపించారు.   ఇక తాజాగా జరిపిన మరో పరిశోధనలో ఆవును కామధేనువని ఎందుకంటారో తెలిపే నిజం వెలుగు చూసింది. 400 గిర్ జాతి ఆవుల మూత్రంపై గుజరాత్‌లోని జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ పరిశోధనలు చేసింది. మూత్రం నమూనాలను పరీక్షించగా లీటర్ మూత్రంలో మూడు నుంచి 10 మిల్లీ గ్రాముల బంగారం ఉన్నట్లు బయటపడింది. ఆయాన్ల రూపంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.   గో మూత్రంలో బంగారం ఉంటుందని పూర్వీకులు చెప్పగా వినడమే తప్ప ఇంతవరకు శాస్త్రీయంగా నిర్థారణ కాలేదు..అందుకే ఈ విషయాన్ని తేల్చేందుకే తామీ పరిశోధన చేపట్టినట్టు పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ బీఏ గొలాకియా పేర్కొన్నారు. ఒంటెలు, గేదెలు, గొర్రెలు, మేకల మూత్రంపైనా పరిశోధనలు చేయగా అందులో యాంటీ బయోటిక్ పదార్ధాలు కనిపించలేదన్నారు. ఆవు గొప్పతనం నలుదిశలా వ్యాప్తి చెందడం శుభపరిణామం. దీని వల్ల ఇకపైనైనా గోవుల సంరక్షణ చేపట్టే అవకాశం ఉంది.  

బ్రెగ్జిట్ ఎఫెక్ట్..భారతీయులపై జాత్యాంహకార దాడులు

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంతో ఆ దేశపు వాసులు ఇతర దేశీయులపై దాడులకు పాల్పడుతున్నారు. బ్రెగ్జిట్‌‌పై రెఫరెండం జరిగిన తరువాతి రోజు నుంచి ఇప్పటి వరకు 100కు పైగా జాతి వివక్ష, వేధింపుల ఘటనలు నమోదయ్యాయి. ముఖ్యంగా సిరియా, ఇరాక్‌ల నుంచి వచ్చిన శరణార్థులను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ యువత రెచ్చిపోతున్నారు. పోలాండ్ వాసులు తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ కేంబ్రడ్జ్ యూనివర్శిటీ గోడలపై రాశారు. అంతటితో ఆగకుండా పోలీష్ వాసులు నివసిస్తున్న కాలనీపై దాడులకు దిగుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీష్ ఎంబసీ బ్రిటన్ ప్రధాని కార్యాలయానికి తన నిరసన తెలిపింది.   ఇదిలా ఉండగా బ్రెగ్జిట్ ఎఫెక్ట్ భారతీయులపై పడింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ విద్యార్థిని నిఖిల్ పంధీ 24వ తేదిన, లిన్సన్ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద ఉన్న సమయంలో కొంతమంది వ్యక్తులు నిఖిల్ వద్దకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించారు. తాను ఇండియా నుంచి అని సమాధానం ఇవ్వగా..పాస్‌పోర్ట్‌ను..బ్రిటన్ జాతీయుడినని నిరూపించే బయోమెట్రిక్ ప్రూఫ్‌ను లాక్కొన్నారు. రెండేళ్ల నుంచి బ్రిటన్‌లో ఉంటున్న తనకు ఇలాంటి అనుభవం ఎప్పుడు ఎదురు కాలేదని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు.   ఇతర దేశస్థులపై జరుగుతున్న జాత్యాంహకార దాడులపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్పందించారు. బ్రిటన్‌లో నివసిస్తున్న యూనియన్ ప్రజలు, యూనియన్‌లో భాగమైన విదేశాల్లో ఉంటున్న బ్రిటీష్  జాతీయులందరూ ఒకటే. ఈ తరహా ఘటనలను తీవ్రంగా పరిగణిస్తానని..కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. అటు అంతర్జాతీయ సమాజం కూడా తమ పౌరుల భద్రతను పర్యవేక్షించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

పెద్దాయనపై సోనియా మనసు కరగదా..?

పాములాడించే దేశంగా ముద్రపడిన దేశాన్ని, ప్రగతి పథం వైపు నడిపించిన దార్శనికుడు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పూర్తికాలం నడిపించిన అపర చాణక్యుడు. ఆయనే తెలుగు బిడ్డ పీవీ నరసింహరావు. ఇవాళ ఆయన జయంతి..ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పీవీ జయంతిని అధికారికంగా నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఆయనకు నివాళుర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీ బయటి పార్టీలకు చెందిన వ్యక్తులు. వారే పీవీపై అంతటి కృతజ్ఞత చూపుతుంటే..కాంగ్రెస్ పార్టీ ఇంకెంతగా చేయాలి. కానీ దేశవ్యాప్తంగా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ ఆ జాడ కనిపించలేదు. ఏ పార్టీ కోసమైతే ఆయన జీవితాన్ని అంకింత చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ కనీసం ఆయనను పట్టించుకోలేదు.   ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ శ్రేణులు పీవీని పట్టించుకున్న పాపాన పోలేదు. పీవీని కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విధానం, సీతారాం కేసరి తర్వాత సోనియా పగ్గాలు చేపట్టిన రీతి అన్నీ కాంగ్రెస్ మార్క్ రాజకీయమే. ఆనాడు పీవీకి జరిగిన అవమానాన్ని ఏ తెలుగుబిడ్డా మర్చిపోలేడు. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తుంటే కాంగ్రెస్ మొత్తం ఆయన పక్షాన నిలబడింది. చమురు కుంభకోణం, జేఎంఎం, సెయింట్ కిట్స్, లఖూభాయ్ పాఠక్, యూరియా కుంభకోణాల్లో పీవీ పాత్ర ఉందంటూ అప్పట్లో పెద్ద దుమారం రేగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ కనీసం సంఘీభావం ప్రకటించపోవడంతో పీవీ ఒంటరి వాడైయ్యారు. ఆఖరికి మరణానంతరం కూడా ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సోనియా అంగీకరించలేదు.   ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో హైదరాబాద్‌లో జరిగిన అంత్యక్రియలు తూతూ మంత్రంగా కానిచ్చేశారు. సగం కాలిన పీవీ భౌతిక కాయాన్ని ఊరకుక్కలు పీక్కుతినడం ఎంతోమందిని కలచివేసింది. పార్టీ కోసం త్యాగం చేసిన మనిషికి ఇదా సత్కారం అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి...దుమ్మె కదా అని కాంగ్రెస్ దులిపేసుకుంది. ఇయన చనిపోయి పుష్కరం కావొస్తున్నా అధినేత్రి కాస్త కూడా మెత్త బడలేదు. దానికి రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన వినయ్ సీతాపతి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమమే ఉదాహరణ. సోనియా విధేయుడైన మణిశంకర్ అయ్యర్ మళ్లీ పీవీ మీద విషం కక్కారు. కానీ ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా లోకం గుర్తించింది. ఆయన చేపట్టిన సంస్కరణల ఫలాలు ఇపుడు అందుతున్నాయి.

మోడీజీ..ఈ పని అప్పుడే చేసుంటే..?

ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌ సగం భారతీయుడని..విదేశాలకు అనుకూలంగా పనిచేస్తూ..భారతదేశం అభివృద్ది చెందకుండా అడ్డుకుంటోందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి రాజేసిన చిచ్చు దేశ ఆర్థిక, రాజకీయ రంగాలలో పెను ప్రకంపనలు సృష్టించారు. రాజన్‌ను రెండోసారి కొనసాగిస్తారా..? లేదంటే ఉద్వాసన తప్పదా అని దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన రాజన్ తాను రెండవసారి ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగలేనని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోడీ కనీసం మాట మాత్రంగానైనా స్పందించలేదు. ఇంత కాలం తర్వాత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్‌ను మునగ చెట్టు ఎక్కించారు.   రాజన్‌తో తనకున్న అనుబంధం ప్రత్యేకమైనదని అన్నారు.. రాజన్ మనసు భారతీయమని..ఆయన అసలు సిసలు దేశ భక్తుడని కితాబిచ్చారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రాజన్ పనిని నేను ప్రశంసిస్తున్నా..ఆయన భారతదేశాన్ని ప్రేమిస్తారు...రాజన్ దేశభక్తిని ప్రేమించాల్సిన అవసరం లేదు. వివాదాలు రేకెత్తిస్తున్న వారు రాజన్‌కు హానీ చేస్తున్నారు అన్నారు.   అటు స్వామి ఆరోపణలు తప్పుబడుతూ  ప్రచారం కోసం పాకులాట వల్ల దేశానికి ఏ మాత్రం మంచి జరగదు. ఎవరికి వారు తమ బాధ్యతను గుర్తించి ప్రవర్తించాలి. వ్యవస్థ కంటే ఎవరు గొప్ప కాదు అని అన్నారు. మోడీ వ్యాఖ్యల పట్ల దేశంలో మిశ్రమ స్పందన వస్తోంది.  స్వామి ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్న సందర్భంలో మోడీ కాస్త వెనకేసుకొచ్చినా బాగుండేదని..స్వామి కాస్త వెనకాడేవారని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. అటు రాజన్ కూడా తనకు ప్రధాని అండ ఉందన్న భావనతో ఉండేవారు.. మరి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు మోడీ ఎందుకు రియాక్ట్ అయినట్లు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇష్టానుసారంగా ఎవరిపై పడితే వారిపై ఆరోపణలు చేస్తున్న సుబ్రమణ్యస్వామి ప్రధాని వార్నింగ్‌తో కాస్త తగ్గే అవకాశం ఉంది.

అభివృద్దికి అభివృద్ధి..రాజకీయానికి రాజకీయం

పాలన స్వరాష్ట్రం నుంచే సాగించాలన్న కల నెరవేరింది..విజయవాడతో పాటు గుంటూరులో పలు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల ఉత్కంఠకు తెరదించుతూ ఒకదాని వెంట మరొకటి శరవేగంగా కార్యాలయాల తరలింపు ప్రక్రియ జరుగుతుండటం శుభపరిణామం. విజయవాడ, గుంటూరు జంటనగరాలు..మధ్యలో తాత్కాలిక సచివాలయం ఉన్న వెలగపూడి..టోటల్‌గా రాజధాని ప్రాంతంలో పండగ వాతావరణమే. నిన్న మొన్నటి వరకు అమరావతికి పాలనా యంత్రాంగాన్ని తరలించాలని అహర్నిశలు శ్రమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ బాధ తీరిపోవడంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంతోపాటు రాజకీయంగా ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.    తీవ్ర ఆర్థిక లోటుతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తన అనుభవంతో, చాకచాక్యంతో ఒక్క గట్టు ఎక్కిస్తూ వస్తున్నారు బాబు. ఆర్థికంగా నిలబడాలంటే పెట్టుబడులు ఆకర్షించబడాలి..ఈ విషయం ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు.. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో కంపెనీలను రప్పించారు. ఇప్పుడు నవ్యాంధ్ర విషయంలోనూ ఇదే రకమైన ఫార్మూలాను అనుసరిస్తున్నారు చంద్రబాబు. దీనిలో భాగంగానే తన బృందంతో కలిసి చైనా పర్యటనకు వెళ్లారు. ఇటు రాష్ట్రాభివృద్ధితో పాటు రాజకీయంగానూ ఈ పర్యటనను చంద్రబాబు ఉపయోగించుకున్నారు.   నవ్యాంధ్ర రాజధానిగా ముందు ప్రచారం జరిగిన ప్రకాశం జిల్లా దొనకొండలో అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కానుంది. దీనిని రాజకీయంగా ఎలా వాడతారా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఉంది బాబు మైండ్ గేమ్‌..అదే అసలు స్టోరీ. దొనకొండలో రాజధాని ఏర్పాటుకానుందనే ముందస్తు సమాచారంతో జగన్ అండ్ కో అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అంతేకాకుండా తన అనుకూల మీడియాతో రాజధాని దొనకొండే అన్నట్లుగా ప్రచారం చేయించారు. అయితే రాజధానిగా అమరావతి ఫిక్స్ కావడంతో జగన్ షాక్‌కు గురయ్యారు. కోట్లు కుమ్మరించి కొన్న భూములు బూడిదలో పోసిన పన్నీరు చెందంగా తయారైంది. చంద్రబాబు చైనా పర్యటనలో భాగంగా అక్కడి చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలతో చేసుకున్న ఒప్పందం కుదుర్చుకుంది.    దీని ప్రకారం దొనకొండ ప్రాంతంలో మూడు దశల్లో రూ.49 వేల కోట్ల పెట్టుబడులతో 55 వేల మందికి ఉపాధి కల్పించేందుకు డ్రాగన్ ముందుకొచ్చింది. అనుకున్న ప్రకారం ప్రాజెక్ట్‌లు రావాలంటే భూములు కావాలి. అందుకోసం భూసేకరణ చేయాలి. అంటే ఆ భూసేకరణలో జగన్ అండ్ కో భూములు పోతాయి. నా భూములు నాకు కావాలి అంటే అక్కడ కుదరదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే రాష్ట్రం..రాష్ట్రం అనే జగన్..ఇపుడు భూముల విషయంలో మొండి పట్టుదల పడితే జనంలో చులకన అవుతారు. కాబట్టి తప్పక భూసేకరణకు ఒప్పుకోవాలి. ఇక రెండోది జగన్ సొంత జిల్లా కడపలో కొత్త స్టీల్ ఫ్యాక్టరీకి ఒప్పందం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి స్టిల్స్ పేరుతో ఉక్కుపరిశ్రమకు శంకుస్థాపన చేశారు.    అయితే ఆ పరిశ్రమ వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. పరిశ్రమ నిర్మిస్తామని భూమిని తీసుకున్న బ్రహ్మణి సంస్థ అధినేత గాలి జనార్థన్ రెడ్డి అది నిర్మించకుండానే జైలుపాలయ్యారు. తదనంతరం పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుంది. దీంతో స్టీల్ ఫ్యాక్టరీ కల ఇప్పట్లో సాధ్యం కాదనే అభిప్రాయం ఆ ప్రాంత వాసుల్లో పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఐరన్ ఇండస్ట్రీని బ్రాహ్మణి స్టీల్స్‌కి ఇచ్చిన భూముల్లో పెట్టబోతున్నారు. త్వరలోనే చైనా బృందం వచ్చి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఓ అంచనాకి రాబోతున్నారు. ఇక్కడ పెట్టుబడుల కోణంలో పెద్ద ప్లస్ రాష్ట్రానికి..పొలిటికల్‌గా అంతకంటే పెద్ద బూస్ట్‌ చంద్రబాబుకి. చైనా వాళ్లు స్టిల్ ఫ్యాక్టరీ పెడితే జగన్‌కి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు అడ్డుతగిలితే జనం చెప్పులు, చీపుళ్లు చూపిస్తారు ఎందుకంటే వైఎస్ హయాంలో వేల ఎకరాలు ధారాదత్తం చేస్తే మీరేం చేశారు..ఇప్పుడు చంద్రబాబు మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుతగులుతున్నారని ఎదురు తిరుగుతారు. ఇక సొంతజిల్లాలో జగన్‌కు సెగే. మొత్తానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు సాధించారు..రాజకీయవేత్తగా ప్రత్యర్థికి చెక్ పెట్టారు .

చంద్రన్న సాధించారు

“ఉత్తముడైన వాడు దేనినాచరిస్తారో సాధారణ జనులూ దాన్ని అనుకరిస్తూ, అనుసరిస్తూ జీవిస్తారు” అని భగవద్గీతలో చెప్పినట్టు ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ ఉండగా..నవ్యాంధ్రకు ఎలాంటి రాజధాని లేదు. అయితే రాజధాని నిర్మించేంత వరకు పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించింది కేంద్రప్రభుత్వం. జూన్ 2 నుంచి రెండు తెలుగు ప్రభుత్వాలు హైదరాబాద్‌లోని సచివాలయం కేంద్రంగా పాలన ప్రారంభించాయి. ఈ లోగా రాజధానిగా అమరావతిని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.   రాష్ట్రం విడిపోయినా పాలన ఇంకా హైదరాబాద్‌లోనే నెలకొని ఉండటంతో ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు. దానికి తోడు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు హైదరాబాద్ నుంచి వెళ్లడం సమీక్షలు విజయవాడలో నిర్వహించడంతో వారంలో మూడు రోజులు బెజవాడలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు సీఎం. మళ్లీ విజయవాడ-హైదరాబాద్ మధ్య చక్కర్లు కొట్టడంతో ఆయన తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు. ఇక లాభం లేదనుకుని కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి ప్రజల కోసం విజయవాడకు వచ్చేశారు. ఆయన లేకుండా మేముండలేమని మంత్రులు సైతం చలో బెజవాడ అన్నారు. ఉద్యోగులు కూడా విజయవాడ వచ్చేయాలని సీఎం విజ్ఞప్తి చేయడంతో అంతా కదిలొస్తున్నారు.   కానీ ఇదంతా ఉన్నపళంగా జరిగింది కాదు. వారిని ఒప్పించి..మెప్పించడానికి చంద్రబాబు చెమటోడ్చాల్సి వచ్చింది. ఉద్యోగులు హైదరాబాద్ వదిలి రావడానికి మొదట్లో ఒప్పుకోలేదు. వసతి అన్నారు..పిల్లల చదువులు అన్నారు..ఇంటి అద్దెలన్నారు..చివరికి స్థానికత అన్నారు. మీ పిచ్చిగాని ఉద్యోగులు ఇప్పట్లో రారు అని అన్నింటా విమర్శలు అయినా అక్కడుంది చంద్రబాబు..మొక్కవోని దీక్షతో అవాంతరాలను అధిగమించి తను అనుకున్న దానిని సాధించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనను అమరావతి కేంద్రంగానే నిర్వహించాలన్న కలను సాకారం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్లకే పాలనరథం స్వరాష్ట్రానికి తరలివచ్చింది. కృషి, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు.

జంప్‌కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేకి హైకోర్టు షాక్..

కుత్బుల్లాపూర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన కెపి వివేకానందకు హైకోర్టులో చుక్కెదురైంది. నిబంధనలకు విరుద్దంగా ఆయన నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. చింతల్ హైదర్‌గూడ ప్రాంతంలోని సర్వే నం. 208, 209, 211, 212లలో గల స్థలంలోని భవనాల నిర్మాణానికి చట్టాన్ని అతిక్రమించారని స్వయానా ఎమ్మెల్యే పినతండ్రి కె.ఎం ప్రతాప్ గత సంవత్సరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాణానుమతులు తీసుకోకపోగా సెట్‌బ్యాక్, పార్కింగ్ ఏరియా నిబంధనలనూ పట్టించుకోలేదని అందులో పేర్కొన్నారు.   దీనిని పరిశీలించిన న్యాయస్థానం ఆ భవనాలను జూన్ 1కల్లా కూల్చి వేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో తీర్పు వెలువరించింది. ఈ భవనంలో నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలను జూన్ ఖాళీ చేయాలని ఆదేశించింది. చట్టవిరుద్దంగా ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు అక్రమ నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. అయితే కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే వివేకా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆక్రమణదారులపై కరుణ చూపరాదని..అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాల్సిందేనని వ్యాఖ్యానించింది. చట్టాలు తెలిసిన, చట్టాలు చేసే ఎమ్మెల్యేనే ఇలా చేస్తే సామాన్యుల సంగతేంటని నిలదీసింది. హోదాను అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలనుకోవడం సమంజసం కాదని హైకోర్టు తూర్పారబట్టింది. భవనాన్ని కూల్చివేయాలని పాత తీర్పునే వెలువరించింది.

వీళ్లు లేకపోతే కేసీఆర్ వల్లకాదు..!

ఎన్నో పోరాటాలు, మరేన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణకు తొలి సారథ్య బాధ్యతలు స్వీకరించింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు పాలన పరాయి వారిది కాదు.. మనవారిది ఇప్పుడు పనులు జరగడం లేదని చెప్పడానికి వీల్లేదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రతి పనిని చేయాలని మంత్రులకు, అధికారులకు క్లాసులు పీకారు. పేరుకు క్యాబినెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మొత్తం 18 మంది ఉన్నారు. ఇందులో నలుగురైదుగురు మినహా మిగిలిన వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, తుమ్మల, కడియం, తలసాని ఈ ఆరుగురు తెలంగాణ పాలనకు ఆరు ప్రాణాలు.   తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్..పాలనపై నెమ్మదిగా పట్టు సాధించారు. తనదైన శైలిలో స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు శాఖపై పట్టుసాధించారు. జలవివాదాలు, ప్రాజెక్ట్‌ల పురోగతి, మహారాష్ట్రతో ఒప్పందాలు ఇలా అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ తనయుడు  గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సీఎం తరువాత నెంబర్-2గా కొనసాగుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఐటీ పాలసీలు, పెట్టుబడుల ఆకర్షణ ఇలా తన శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు.   కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని భావించిన కేసీఆర్..విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరిని నియమించారు. ఆయన కూడా ఆ దిశగా ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక తుమ్మల విషయానికి వస్తే రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన విధంగా రోడ్ నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దుతున్నారు. నిన్న మొన్నటి వరకు వాణిజ్య పన్నుల శాఖను నిర్వహించిన తలసాని ఆ శాఖను పరుగులు పెట్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పన్ను వసూలు చేయించి సీఎం మెప్పు పొందారు.   వీరు ముగ్గురు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం కలవారు. పైగా అప్పుడు ఏ శాఖలు నిర్వహించారో అవే శాఖల్ని కేసీఆర్ కేటాయించడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు పని చేసుకుపోతున్నారు. ఇక మిగిలిన 12 మంది వచ్చామా..? వెళ్లామా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ఇంకా శాఖలపై పట్టుబిగించకపోవడంతో సీఎం వీరిపై కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలోనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని..వీరి స్థానంలో సమర్థులైన వారిని తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

ఆధిపత్యం.. మంత్రి టూ ఎమ్మెల్యే వయా ఎంపీ

ఖమ్మం జిల్లా అంటే టక్కున గుర్తొచ్చేది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..టీడీపీలో ఉన్నా టీఆర్ఎస్‌లో ఉన్నా జిల్లాలో ఆయన చెప్పిందే శాసనం. నిన్నటి వరకు సింగిల్ హ్యాండ్‌తో ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పిన తుమ్మలకు ఇప్పుడు పోటీ ఎదురైంది. అది కూడా సొంతపార్టీ నేతల నుంచే. 2014 సాధారణ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  టీడీపీ తరపున తుమ్మల, కాంగ్రెస్ తరపున పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేసి..నాగేశ్వరరావుపై అనూహ్యంగా గెలుపోందారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్..తన చిరకాల మిత్రుడు తుమ్మలను టీఆర్ఎస్‌లోకి చేర్చుకుని మంత్రిని చేశారు. అప్పటి నుంచి జిల్లాలో వార్ వన్ సైడ్ అయ్యింది. ఈ మధ్యలో పువ్వాడ, తుమ్మల అనేక సందర్భాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు.   అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా పువ్వాడ గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరికి కోల్డ్ వార్ జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రి ఆధిపత్యాన్ని ఎమ్మెల్యే..ఎమ్మెల్యే పెత్తనాన్ని మంత్రి సహించుకోలేకపోతున్నారు. తుమ్మల ప్రమేయం లేకుండా ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పువ్వాడ శంకుస్థాపన చేయడం..మంత్రి ప్రత్యేక చోరవతో చేపట్టిన గోళ్లపాడు ఛానల్ ప్రక్షాళన పనులను ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించడం తుమ్మలకు ఆగ్రహాన్ని తెప్పించింది.   సీఎం కేసీఆర్ తుమ్మలకు..కేటీఆర్ పువ్వాడకు అండదండలు అందిస్తుండటంతో జిల్లాలో ఏ పని జరగాలన్నా ముందు వీరిద్దరిని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుందని నేతలు వీరి ఇంటి ముందు క్యూలు కడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నామినేటేడ్ పోస్టుల భర్తీ తెరపైకి వచ్చింది. దీంతో పార్టీలోని ఆశావహులంతా మంత్రి, ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వీరిద్దరూ ఈ పదవులు తమ వర్గీయులకు దక్కాలంటే..కాదు తమకే దక్కాలని అడ్డుపడుతూ క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్యలోకి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి చేరారు. తమ వర్గీయులకు నామినేటేడ్ పదవులు కావాలని ఎంపీ సీఎం స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమస్యను టీఆర్ఎస్ అధినేత ఎలా పరిష్కరిస్తారో..?

అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు కావాలంటున్నారు..!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత జానారెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కావడం లేదు. ఏ రాజకీయ నాయకుడికైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఒక కల. అలాంటిది అప్పట్లో తాను సీఎం పీఠాన్నే త్యాగం చేశానని ఒక సందర్భంలో అన్నారాయన. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండమని సోనియా గాంధీ, ఆజాద్ తనను అడిగారని..తనకు ముఖ్యమంత్రి పదవి వద్దు..తెలంగాణ ఇవ్వండి చాలు అన్నానని జానా వరంగల్ వేదికగా వ్యాఖ్యానించారు. అయితే మళ్లీ పెద్దాయనకు సీఎం కుర్చీ గుర్తొచ్చింది..టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కాంగ్రెస్ శ్రేణులు నిరాశలో కూరుకుపోవడంతో వారిలో ఉత్సాహం నింపడానికి జానారెడ్డి నడుంబిగించారు.   ఈ నేపథ్యంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ మరోసారి ముఖ్యమంత్రి పీఠమే తన కల అని స్సష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..తానే సీఎం పదవిని చేపడతానని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్..తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సీఎంతో పాటు సమాన హోదా కలిగిన ఏకైక నాయకుడిని తానే అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి పార్టీని వీడినవారికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. 40 ఏళ్లుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు..20 ఏళ్లుగా రాజకీయంగా దగ్గరి బంధం కలిగిన వారు పార్టీని వీడటం బాధగా ఉందన్నారు. అయినప్పటికి పార్టీకి అవమానం కలిగించేలా ఫిరాయింపులుకు పాల్పడిన వారి నుంచి పార్టీని కాపాడుకునేందుకు ప్రతి కార్యకర్త ఎంతో కసితో ఉన్నారని అన్నారు. మొత్తానికి జానా మరోమారు తన మనసులో మాట బయటపెట్టుకున్నారు.

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్-II

ఎన్నటికి సాకారం కాదనుకున్న ప్రత్యేక రాష్ట్రం సాధించి..తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఉద్యమ పార్టీ టీఆర్ఎస్. తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో తనకు పోటీ ఇస్తారనుకున్న వారందరిని..ఆనవాళ్లు కూడా లేకుండా చేసే పనిలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీశారు సీఎం. ఇప్పటికే ఈ ఆపరేషన్‌ సక్సెస్ అయ్యి టీడీపీ, వైసీపీలు కనుమరుగయ్యాయి. ఈ రెండు పార్టీలు సైడవ్వడంతో తన నెక్ట్స్ ఫోకస్‌ని కాంగ్రెస్ పార్టీ మీద పెట్టారు కేసీఆర్. నిన్నటికి నిన్న కంచుకోట లాంటి నల్గొండ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్‌తో కోలుకోలేని దెబ్బ కొట్టారు. నల్గొండ పార్లమెంట్ సభ్యుడితో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అన్ని పార్టీల్లో మిగిలిపోయిన వారిని కూడా కారెక్కించుకుని ఆపరేషన్ ఆకర్ష్‌ను పరిపూర్ణం చేయాలని కేసీఆర్ స్కెచ్ గీస్తున్నారు.   ఇప్పటి వరకు అగ్రశ్రేణి నాయకత్వాన్నే టార్గెట్ చేసిన గులాబీ బాస్, క్యాడర్‌ను కూడా కారెక్కించాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్‌లో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుండటంతో పాటు సమీప కాలంలో టీఆర్ఎస్‌ను తట్టుకుని మరో పార్టీ నిలబడే పరిస్థితి కనిపించక పోవడంతో చోటా, మోటా నాయకులతో పాటు క్యాడర్ తమ రాజకీయ భవిష్యత్ కోసం గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది.     మొదటి దశ ఆపరేషన్ ఆకర్ష్‌కు కేసీఆర్ నాయకత్వం వహించగా..రెండోవిడత ఆకర్ష్‌కు సీఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత సారథ్యం వహించనున్నారు. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా నుంచే రెండో విడత ఆకర్ష్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించిన డీఎస్ టీఆర్ఎస్‌లో చేరిన వెంటనే క్యాబినెట్ పదవిని పోందారు ఆ వెంటనే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం పొందారు. ఈ నేపథ్యంలో మిగిలిన నేతల చూపు గులాబీ పార్టీపై మళ్లిందని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో పాటు టీడీపీకి చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులు ఏ క్షణంలోనైనా కారు ఎక్కెందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేజ్రీవాల్‌కు ప్రత్యేక దిల్లీ కావాలట

  ప్రపంచంలో ఏం జరిగినా దానిని దిల్లీకో, మోదీకో ముడిపెట్టి ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్‌కు అలవాటే. దాన్ని చూసి నవ్వుకోవడమో, ఉతికి ఆరేయడమో కూడా జనానికి అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ప్రకారమే ఇప్పుడు కేజ్రీవాల్‌ మరోసారి ట్వీటారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ విడిపోయిన విధంగా, దిల్లీకి కూడా పూర్తి స్థాయి హోదా దక్కేందుకు రిఫరెండం జరగాలని ట్విట్టర్‌లో తన సందేశాన్ని అందించారు. నిజానికి దిల్లీ ఒక ప్రత్యేక హోదా! అటు రాష్ట్రమూ కాకుండా, ఇటు కేంద్ర పాలిత ప్రాంతమూ కాకుండా ఉన్న స్థితి. అందుకనే దిల్లీలో ఏదన్నా పొరపాటు జరిగితే కేజ్రీవాల్‌ కేంద్రం మీదా, కేంద్రం కేజ్రీవాల్‌ మీదా ఆరోపణలు చేసుకుని చేతులు దులిపేసుకునే పరిస్థితి.   ఈ స్థితిని చక్కదిద్దాలని అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఇటు భాజపా ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. అంతవరకూ బాగానే ఉంది. కానీ బ్రిటన్‌ ఓ సమాఖ్య నుంచి విడిపోయిన ఈ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీదే నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు మీరే బ్రిటన్‌కు ప్రధానిగా ఎందుకు ఉండకూడదు అని ఒకరంటే... అసలు మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, రెఫరెండం పెట్టండి చూద్దాం అని మరొకరు జవాబుగా ట్వీట్ చేశారు. ఇదంతా కాదుగానీ మీరు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయండి అని ఒకరంటే దిల్లీని ప్రత్యేక దేశంగా ప్రకటిస్తే పోలా అని మరొకరు నొసలు చిట్లించారు. ఏతావాతా.. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలతో నెట్టింత మరోసారి నవ్వులు పండాయి. ఇంతకీ, తను మరీ నవ్వులపాలైపోతున్న విషయం ఆయన గ్రహించారో లేదో!

ఐరోపా సమాఖ్య విచ్ఛిన్నం కానుందా!

  ఎట్టకేలకు బ్రిటన్‌ వాసులు ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగేందుకు నిశ్చయించుకున్నారు. సమాఖ్యలో కొనసాగాలా వద్దా అని నిర్ణయించుకునేందుకు ఆ దేశం ఏర్పరిచిన రిఫరెండం ప్రపంచానికి దిమ్మతిరిగే తీర్పుని అందించింది. సర్వేలనీ, ఊహాగానాలనీ పక్కన పెట్టి సమాఖ్య నుంచి తప్పుకోమంటూ దేశాధినేతలను కోరింది. నిజానికి ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోయేది బ్రిటిష్‌ ప్రజలే. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఆ దేశం ఎలాంటి అస్థిర పరిస్థితుల్లో చిక్కుకుపోయిందో... ఇప్పుడూ అవే పరిస్థితులు పునరావృతమవుతాయన్నది నిపుణుల విశ్లేషణ. వ్యాపారం దగ్గర నుంచి దౌత్యం వరకూ బ్రిటన్‌ మళ్లీ తన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటితోనూ కొత్తగా ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుంది. అయితే బ్రిటన్‌ వాసులు ఆకాంక్ష వేరే విధంగా ఉంది. సమాఖ్యలో ఉండటం వల్ల తమ దేశం స్వతంత్రంగా ముందుకు సాగలేకపోతోందనీ... తమ అస్తిత్వానికీ, అభివృద్ధికీ సమాఖ్య సభ్యత్వం అడ్డుపడుతోందనీ వీరు భావిస్తున్నారు.   బ్రిటన్‌ వాసులు తీసుకున్న ఈ నిర్ణయం తాలూకు పరిణామాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. పౌండ్‌ విలువ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్ పునాదులు కదిలిపోతున్నాయి. ఈ దేశాన్ని మరో నేతకి అప్పగించండి అంటూ బ్రిటన్‌ ప్రధాని కెమరూన్‌ చేతులెత్తేశారు. కేవలం బ్రిటన్‌ ఆర్థికరంగమే కాదు... భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేర్‌ మార్కెట్లన్నీ కుదేలైపోయాయి. ఈ నష్టం మాట అటుంచితే ఇప్పుడు మరో భయం మొదలైంది. ఇప్పటివరకూ ఐరోపా సమాఖ్యలో చేరాలని తహతహలాడే సందర్భమే కానీ బయటకు వెళ్లిపోతాననే దేశం కనిపించలేదు. కానీ ఇప్పుడు బ్రిటన్‌ వీడ్కోలుతో సమాఖ్య ముఖచిత్రం కూడా మారిపోయే అవకాశం ఉంది. ఈ పరిణామం తరువాత మిగిలన 27 దేశాలలో కూడా సమాఖ్య నుంచి వైదొలగాలనే అలజడి మొదలైతే ఐరోపా ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గత మూడు దశాబ్దాలుగా ఈ సభ్య దేశాలన్నీ కూడా వ్యాపారం మొదలుకొని వీసాల వరకూ పరస్పరం సహకారంతో ముందుకు సాగుతూ వచ్చాయి. ఆ సహకార భావం కనుక విచ్ఛిన్నమైతే పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు కోటి పౌండ్ల ప్రశ్న!

దేవుడా.. సుబ్రహ్మణ్యస్వామిని ఆపేవారు లేరా..?

  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నోటికి అడ్డు అదుపూ లేకుండా పోతుంది. నోరు ఉంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ల మీద విమర్శలు చేయడం.. ఏది అనాలనిపిస్తే అది అనేయడం ఆయనకు కామన్ అయిపోయింది. మొన్నటి వరకూ రఘురామ్ రాజన్ పై విమర్శలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి.. ఆఖరికి మళ్లీ ఆయనకు పదవి ఇచ్చినా వద్దు మహాప్రభో అనే పరిస్థితికి వచ్చారు. ఇక ఆతరువాత కేంద్ర అర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పై రెచ్చిపోయారు. ఆయన కాంగెస్ నేత అని..పార్టీ వ్యతిరేకుల్ని పార్టీలో ఉంచకూడదని.. ఆయనను పదవి నుండి తొలగించాలని అన్నారు. ఇక దీనిపై స్పందించిన అరుణ్ జైట్లీ.. అరవింద్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వకుండా తమ పని తాము చూసుకోవాలని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.   అయినా స్వామి గారు వింటారా.. ఇప్పుడు మరో విషయంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. విదేశీ పర్యటనలు చేసే దుస్తుల గురించి కామెంట్లు చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రులు సంప్రదాయ, లేదా మన దేశానికే చెందిన ఆధునిక దుస్తులు ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. వారు టై, కోట్ ధరిస్తే వెయిటర‍్లలా కనిపిస్తారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు  చేశారు. దీంతో స్వామి చేసే వ్యాఖ్యలపై బీజేపీ నేతలే తలలు పట్టుకునే పరిస్థితి వచ్చారు. ఆయనను ఎలా కంట్రోల్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదిలా ఉండగా స్వామి ఒకవైపు అంతలా రెచ్చిపోతుంటే ప్రధాని మోడీ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారు అని.. ఆయనను ఎందుకు అడ్డుకోవడంలేదు అని అనుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీని ఆమాత్రం ఎదుర్కోవాలంటే స్వామి లాంటి వారు కావాలని అనుకుంటున్నారేమో మోడీ అందుకే అతన్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు. స్వామి ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో.. ఎవర్ని టార్గెట్ చేస్తారో చూడాలి.

డీఎంకేలో జయలలిత చిచ్చు..

  తమిళనాడు సీఎంగా రెండో సారి అధికారం చేపట్టి రికార్డులు జయలలిత రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈసారి అధికారం చేపట్టేది డీఎంకే పార్టీనే అని ఎన్ని సర్వేలు వచ్చినా.. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ అమ్మ మరోసారి అధికారం చేపట్టారు. అలా అధికారం చేపట్టారో లేదో  తన ప్రత్యర్ధి అయిన కరుణానిధిపై అప్పుడే తన విమర్శల బాణాలు వదులుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆమె డీఎంకే పార్టీ అధినేత కరుణానిదినా?.. లేక ఆయన కుమారుడు స్టాలినా..? అని తెలియని గందరగోళంలో పార్టీ ఉందని.. సెటైర్లు పేల్చారు. దీనిపై కరుణానిధి అసెంబ్లీకి వచ్చి తనకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మరి అమ్మ కామెంట్లకు డీఎంకే పార్టీ నేతలు ఊరుకుంటారా. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ నిరసన తెలిపారు. దానికి మరోసారి జయలలిత ఫైర్ అయి తన విమర్శలపై సమాధానం ఇచ్చే దమ్ము,ధైర్యం కరుణానిధికి లేవంటూ మరోసారి రెచ్చిపోయారు. దమ్ముంటే డీఎంకే ఎమ్మెల్యేలు కరుణానిధిని అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ చేశారు. డీఎంకేలో తండ్రీ కొడుకుల మధ్య గ్రూపు రాజకీయాలున్నాయని జయలలిత విమర్శించారు.   ఇదిలా ఉండగా జయలలిత చేసిన విమర్శలు ఆ పార్టీలో కొత్త దుమారమే రేపేలా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్ల నుండి ప్రతిపక్షనేతగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు కరుణానిధి. అయితే కరుణానిధి ఉన్నా.. ప్రస్తుతం ఆయన కొడుకు స్టాలిన్ పక్షానికి నాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరుణానిధి మాట్లాడుతూ.. తాను బ్రతికి ఉన్నంత కాలం ఒకవేళ సీఎంగా గెలిస్తే తానే సీఎం పదవిని చేపడతానని.. తాను పోయిన తరవాతనే తన కొడుకులు సీఎం పదవి చేపడతారని చెప్పారు. కానీ సీఎం పదవి ఎలాగూ దక్కలేదు. ఇక ప్రతిపక్ష నేతగా ఉండాల్సిందే. కొంత కాలంగా వీల్ చైర్ కే పరిమితమైన కరుణానిధి అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక పరోక్షంగా ఆ బాధ్యతలు స్టాలిన్ చేపట్టాడు.   అయితే కొంత కాలంగా స్టాలిన్, కరుణానిధిల మధ్య కూడా దీనిపై గొడవలు జరుగుతున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ బాధ్యతలు పూర్తిగా తనకే ఇవ్వాలని చూస్తున్నారంట స్టాలిన్. ఇప్పుడు జయలలిత చేసిన వ్యాఖ్యల వల్ల మరింత చిచ్చు రేగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అయినా కరుణానిధి పూర్తి బాధ్యతలు స్టాలిన్ కు అప్పగించి దిగిపోతారో.. లేక అలానే కొనసాగుతారో.. చూడాలి.

నిజాం ఫండ్స్ మాకే దక్కాలి..

  నిజాం నిధులు తెలంగాణ ప్రభుత్వానికే దక్కాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి షాకిచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నిజాం ఫండ్ కు సంబంధించిన కేసు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తోపాటు.. కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి ముందుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. అందుకే దీనికి సంబంధించిన ఫైళ్లను అందించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్నికోరింది. అంతేకాదు ఆ ఫైళ్ల కోసం కేంద్రం నుండి పలువురు అధికారులు కూడా హైదరాబాద్ కు వచ్చారు. కానీ ఆఫైళ్లు మాత్రం లభించలేదు. అయితే కేంద్రం చొరవ తీసుకొవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలు వచ్చాయేమో తెలియదు కానీ.. హైదరాబాద్ ప్రభుత్వం నుండే నిధులు లండన్ వెళ్లాయి కాబట్టి ఈ ఫండ్స్ తిరిగి తెలంగాణ ప్రభుత్వానికే దక్కతాయని.. కేంద్రానికి ఎట్టిపరిస్థితుల్లోనూ దక్కవని తేల్చిచెబుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ  అధికారి మాట్లాడుతూ.. 'రాష్ట్ర విభజన అనంతరం ఆధారాల కోసం భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వెంటపడుతోంది. హైదరాబాద్‌లో ఉన్న ఫైళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం వెదుకులాట ప్రారంభించింది. అయితే, ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో తెలియదు. ఏదేమైనా నిజాం ప్రభుత్వానికి చెందిన నిధులు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయి' ఆ అధికారి తెలిపారు. మరోవైపు దాదాపు లండన్ ప్రభుత్వం నుండి 350 కోట్లు నిధుల గురించి నిజాం మనవడు నవాబ్‌ నజఫ్‌ అలీ ఖాన్‌ కూడా ప్రయత్నిస్తున్నారు. అసలు స్టోరీ.. నిజాం సంస్థానంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన నవాజ్‌ జంగ్ 10,07,940 పౌండ్ల తొమ్మిది షిలింగ్‌లను లండన్‌లోని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధిగా ఆ దేశ హైకమిషనర్‌ హెచ్‌ఐ రహీమ్‌తులాకు చెందిన నేషనల్‌ వెస్ట్‌మినిస్టర్‌ బ్యాంక్‌లోని ఖాతాలో జమ చేశారు. '1947-48లో హైదరాబాద్ ఖాతా నుంచి లండన్‌కు నిధులు బదిలీ అయ్యాయి. 1947, ఆగస్ట్ 15 తర్వాత కూడా హైదరాబాద్ స్వాతంత్ర్య రాష్ట్రంగా ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసుకుంది. హైదరాబాద్‌ సంస్థానం అప్పటికే ఉనికిని కోల్పోవడంతో ఖాతాదారు నవాజ్‌ జంగ్‌ అనుమతి లేకుండా ఆ నిధులను వెనక్కు మళ్లించలేమని బ్యాంక్‌ తేల్చి చెప్పింది. అయితే నిజాం ఇప్పుడు స్వతంత్ర పాలకుడు కాడని, ఒకప్పటి హైదరాబాద్‌ సంస్థానానికి చెందిన ఆ నిధులు తమకు చెందుతాయని భారత్‌ వాదించడంతో కేసులో న్యాయ వివాదం ముదిరింది. ఈ వివాదం 67 ఏళ్లుగా కొనసాగుతూ ఇప్పుడు లండన్‌లోని హైకోర్ట్‌ చాన్స్‌రైలో ఉంది.

తెలంగాణ ప్రభుత్వానికి 1500 కోట్లు టోకరా..

సామాన్య ప్రజలనే కాదు.. ప్రభుత్వాలకు కూడా బిల్డర్లు టోకరా వేసేస్తున్నారు. అలా తెలంగాణ ప్రభుత్వానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 కోట్లు టోకరా వేసేశారు బిల్డర్లు. అయితే ఇప్పుడు ఈ సొమ్మును వసూలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ నడుంబిగించింది.   అసలు సంగతేంటంటే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2001 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంతో కలిసి పలు బిల్డర్లు హైదరాబాద్లో జాయింట్ వెంచర్లు ప్రారంభించారు. వాణిజ్య, నివాస ప్రాజెక్టుల పైన ఐదు శాతం షేర్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్నట్టే 2004 నుండి 2008 మధ్యలో మొత్తం 19 వెంచర్లు ప్రారంభించగా అందులో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే పూర్తయింది. మిగిలినవి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.. కొన్ని మాత్రం మధ్యలోనే ఆగిపోయాయి. ఇక బిల్డర్లు ఇచ్చిన మాట కూడా గాల్లోనే కలిసిపోయింది. ప్రభుత్వానికి ఇస్తానన్న షేర్ ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, వ్యాట్ తదితర రూపాల్లో బిల్డర్లు ప్రభుత్వానికి రెవెన్యూ చెల్లించాల్సి ఉంది. అలాగే ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం రూపంలో ఏపీహెచ్‌బీకి సొమ్ము చెల్లించాల్సి ఉంది. సంవత్సరాల తరబడి ఈ విషయం పెండింగ్‌లో ఉండగా.. కళ్లు తెరిచిన తెలంగాణ ప్రభుత్వం బిల్డర్ల నుంచి బకాయిలు వసూలు చేయాలని గట్టి  నిర్ణయం తీసుకుంది. 9 మంది బిల్డర్లే ప్రభుత్వానికి దాదాపు 600 కోట్ల వరకు చెల్లించాల్సింది వుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరి బిల్డర్ల నుండి తెలంగాణ సర్కార్ సొమ్ము రాబట్టుకుంటుందో లేదో చూద్దాం..

ఇదెక్కడి "జెండా" రా బాబు..

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ నెల 2వ తేదీ నాటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ వేడుక సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం భారీగానే ఖర్చు పెట్టింది. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాస్త భిన్నంగా ఆలోచించి.. అతిపెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసి విభిన్నంగా ఆలోచించడంలో తన మార్కును మరోసారి చూపించారు. దాదాపు 291 అడుగుల ఎత్తులో రెపరెపలాడే భారీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అయితే ఆవేశంగా జెండా పెట్టడానికైతే పెట్టారు కానీ.. దాని తరువాత వచ్చే ఇబ్బందుల గురించి ఆలోచించి ఉండరు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎగరేసిన జాతీయ జెండా.. ఆతరువాత రెండు రోజులకే చిరిగిపోయి షాకిచ్చింది. పోతే పోయింది కదా అని మరో జెండాను ఏర్పాటు చేశారు. అది కూడా మూడు రోజులకే చిరిగిపోయింది. మళ్లీ మరో జెండాను ఏర్పాటు చేయడం అది కూడా పోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకొని కూర్చున్నారు. మొదట ఏర్పాటు చేసిన జెండాలు ఖమ్మం నుండి తెప్పించినవి కాగా.. ఈసారి మాత్రం ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ కంపెనీ నుండి మూడు జెండాలు తెప్పించారు. ఈ సందర్బంగా తెలంగాణ అధికారులు వేగంగా వీస్తున్న గాలులకు జెండాలు పదే పదే చినిగిపోతున్నాయని..దానికి నియమ నిబంధనల గురించి కంపెనీని అడిగి తెలుసుకుంది. దీనికి ఢిల్లీలోని ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కేవి గిల్ స్పందించి.. గాలులకు జెండాలు చిరగడం మాన్యమెంట్ ఫ్లాగ్ కేటగిరి కిందకు వస్తుందని, జెండా తొలగించినా కొన్ని రోజులు ఇబ్బంది ఉండదనే విషయం చెప్పి వివరించారు. దీంతో పోల్ ను రెండు రోజులు ఖాళీగా ఉంచిన అధికారులు.. నాలుగో జెండాను ఎగరవేశారు. అయితే ఈ జెండాల ఖరీదు వింటే కూడా షాకవ్వాల్సిందే. ఒక్కో జెండా ఖరీదు దాదాపు 2 లక్షల వరకూ ఉంది. ప్రస్తుతానికి మూడు జెండాలు తెప్పించారు.. అంటే సుమారు ఆరు లక్షల వరకూ అన్నమాట. మరి ఇప్పుడు నాలుగో జెండా ఎగరేశారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఒకవేళ ఇది కూడా రెండు మూడు రోజులకే చిరిగిపోతే.. నెలకు ఓ పదికి పైన జెండాలు అవసరమవుతాయి. అప్పుడు దాని ఖర్చు.. ఎంత లేదనుకున్నా 20 లక్షల పైన అవుతుంది. మొత్తానికి ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న సామెత ప్రకారం.. జెండా పెట్టగానే పని అయిపోయిందని అనుకొని ఉంటారు పెద్దలు. దేశంలోనే పెద్ద జెండా పెట్టామని సంకలు గుద్దుకునే అధికారులకు.. ఈ జెండా పెద్ద టార్చర్ అయిపోయింది. ఈ నాలుగో జెండా ఎన్ని రోజులు ఉంటుందో.. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఇప్పుడు అనుకుంటున్నారు.

ఇంత శాడిజం ఏంటి స్వామి..

  మొన్నటి వరకూ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ పై తన ప్రతాపాన్ని చూపిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు మరో అధికారిపై కూడా తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అయ్యారు. సుబ్రహ్మణ్యస్వామి రాజన్ పదవిపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రఘురామ్ రాజన్ తప్పుడు విధానాలవల్లే దేశంలో నిరుద్యోగం పెరుగుదలకు దారి తీసిందని.. రాజన్ తీసుకుంటున్న చర్యల మూలంగా ద్రవ్యోల్భణం మరింత పెరిగే అవకాశం ఉందని.. వడ్డీ రేట్లు పెంచాలనే యోచన సరైంది కాదని.. ఆ ఫలితాన్ని దేశం అనుభవిస్తోందని.. వెంటనే రాజన్ ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు దీని గురించి ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. దీనిపై చర్చ కూడా బాగానే జరిగింది. ఒకపక్క స్వామి గారు రాజన్ వద్దని వితండవాదం చేస్తున్నా.. మరోవైపు నెటిజన్లు మాత్రం ఈసారి కూడా రాజనే గవర్నర్ కావాలని అంటున్నారు. దీనిపై మోడీ కూడా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదనుకోండి. అయితే మళ్లీ తనకు పదివి వస్తుందో లేదో తెలియదు కాని రాజన్ మాత్రం స్వామి దాటికి తట్టుకోలేకనో ఏమో.. తాన పదవికాలం అయి పోయిన తరువాత తిరిగి చికాగో వెళ్లి ఉపాధ్యయ వృత్తిలోనే పాఠాలు చెప్పుకుంటానని చెప్పారు. పాపం అలా రాజన్ స్వామి టార్చర్ తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు.   ఇక్కడితో రాజన్ చాప్టర్ అయిపోయింది అనుకంటే.. ఇప్పుడు మరో అధికారిపై స్వామి దాడికి దిగారు. అది కూడా ప్రధాని ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పై. అరవింద్ సుబ్రమణియన్ కాంగ్రెస్ వ్యక్తని, ఇలాంటి వ్యక్తిని సలహాదారునిగా నియమించడం తప్పని.. ప్రభుత్వ వ్యతిరేకుల్ని సాగనంపాలని.. అందుకే ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు స్వామి అరవింద్ సుబ్రమణియన్ గురి పెట్టారని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు స్వామి ఆరోపణలు ఆ పార్టీ నేతలే వ్యతిరేకించడం విశేషం. అది ఆయన అభిప్రాయం మాత్రమేనని, అటువంటి వ్యాఖ్యలు పార్టీలో నేతల మధ్య విభేదాలు సృష్టిస్తాయని.. స్వామి వార్తల్లో నిలిచేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పాలనా సంబంధ వ్యవహారాల్లో ఈ తరహా వ్యాఖ్యలు తగవని, అదికూడా సొంత పార్టీపైనే చేస్తుంటే, ప్రజల్లో చులకన అవుతామని అంటున్నారు. ఆర్బీఐ తదుపరి గవర్నరుగా రేసులో  అరవింద్ సుబ్రమణియన్ ఉన్న సంగతి తెలిసిందే.   మరి స్వామి చేసిన రచ్చకు రఘురామ్ రాజన్ మళ్లీ పదవి ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో లేరని ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమైపోయింది. ఇప్పుడు ఇంకా గవర్నర్ పదవి రేసులో ఉండగానే స్మామి అరవింద్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అరవింద్ స్వామి చేసిన వ్యాఖ్యలను పట్టించుకుంటారా.. లేక ఆ పోరు తట్టుకోలేక పదవే వద్దనుకుంటారా చూడాలి.