కాంట్రాక్టు కాదు దొర.. పర్మినెంట్ రిక్రూట్ చెయ్!
posted on Apr 26, 2021 @ 4:47PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. వైద్యశాఖలో కొన్ని పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలన్న సర్కార్ నిర్ణయంపై ఆమె సెటైర్లు వేస్తూ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్ కాదు దొర.. పర్మినెంట్ ఉద్యోగాలు రిక్రూట్ చేయ్ అంటూ తెలంగాణ యాసలో కేసీఆర్ పై ఘాటుగా కామెంట్ చేస్తూ షర్మిల ట్వీట్ చేశారు.
‘‘రోజురోజుకు తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దొర కేసీఆర్కు పట్టింపు లేదు. సిబ్బంది కొరతతో వైద్యారోగ్యశాఖ ఇబ్బంది పడుతుంటే సారుకు కనపడటం లేదు’’ అంటూ తెలంగాణ యాసలో ట్వీట్ చేశారు. హెల్త్ డిపార్ట్ మెంట్లో ఉన్న 23512 ఖాళీపోస్ట్లను నింపు జర అంటూ నిరుద్యోగానికి షర్మిల లింక్ పెట్టారు. అవి నింపితే ప్రజల ప్రాణాలతో పాటూ నిరుద్యోగులు సైతం ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారంటూ కేసీఆర్కు షర్మిల ట్వీట్ చేశారు.
కొంత కాలంగా సీఎం కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో వెంటనే 1.9 1లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇటీవలే ఉద్యోగ దీక్షకు దిగిన షర్మిల.. తన అనుచరులు కోవిడ్ బారిన పడటంతో ప్రజాసమస్యలపై పోరుకు కాస్త గ్యాప్ తీసుకున్నారు. తర్వాత తెలంగాణ సర్కార్పై విమర్శనాస్త్రాలు సందించేందుకు ట్విట్టర్ను వేదికగా ఎంచుకున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు.