Read more!

మీరూ ఫొటోస్ తీస్తారు ఫిల్మ్ మేకర్స్ లా!

మనుషులు గడిచిపోయిన కాలాన్ని గుర్తుచేసుకోవడానికి చాలా రకాల మెరుగు ఉన్నాయి. గడిచిపోయినా కాలంలో చేదు జ్ఞాపకాలు అయితే మనసులో అలా ఉండిపోతాయి. కానీ తీపి జ్ఞాపకాలు చాలావరకు ఏదో ఒక ఉనికిని మనదగ్గర వదిలి ఉంటాయి. ముఖ్యంగా చిన్నతనంలో బుడిబుడి నడకలు, ఇష్టమైన వారితో కలసి గడిపిన క్షణాలు, ఇష్టమైన ప్రదేశాలను సందర్శించిన రోజులు ఇలాంటివన్నీ చాలావరకు ఫోటోల రూపంలో మనదగ్గర ఉంటాయి. వాటిని ఎప్పుడైనా చేసుకున్న ఆ కాలంలోకి వెళ్ళిపోయి ఆ క్షణాలను గడిపినట్టే ఉంటుంది. ఇంత తీపి గుర్తులు అయిన ఫోటోల వెనక చరిత్ర ఏంటి??  దాని పరిణామక్రమం ఏంటి అని చూస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిశాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 19 వ తేదీని ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎన్నెన్నో కొత్త పుంతలు తొక్కి బోలెడు అద్బుతాలు సృష్టిస్తున్న ఫోటో వెనుక అసలు సంగతి ఏముంది?? మొబైల్స్ లో కూడా చక్కగా ఫొటోస్ తీసేస్తున్న మనకు ఈ ఫోటో ఆవిష్కరణ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం  సందర్భంగా వచ్చేసింది.

ఫోటోగ్రఫీ డే ని ఎలా నిర్ణయించారు??

1837లో లూయిస్-జాక్వెస్-మాండే డాగురే, డాగ్యురోటైప్ ను ఆవిష్కరించారు. ఇతను  ఫ్రెంచ్ కళాకారుడు మాత్రమే కాకుండా ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన ఆవిష్కరణ ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు విక్రయించారు. తరువాత అది బహుమతిగా అందివ్వబడింది. ఆయన అవిష్కరణను 1839 ఆగస్ట్ 19 న గుర్తించారు. 

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 మంది కలసి 1991 నాటికి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్న మీదట ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం మొదలయ్యింది.

ఫోటో అనే ప్రక్రియకు బీజం వేసిన లూయిస్ డాగురే భౌతికాశాస్త్రవేత్త కూడా. ఆ తరువాత అతను ప్రసిద్ధ థియేటర్ డిజైనర్ అయ్యాడు. జోసెఫ్ నైసెఫోర్ నీప్స్ అనే వ్యక్తి డాగురే తో వ్యాపార భాగస్వామిగా ఉండేవాడు. ఇతను హీలియోగ్రాఫి పద్దతిలో ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ తెలిసినవాడు. నీప్సే "వ్యూ ఫ్రమ్ ది విండో ఎట్ లే గ్రాస్" అనే చిత్రాన్ని 1826లో పాలిష్ షీట్ మీద రికార్డ్ చేసాడు. ఇదే మొట్టమొదటి ఫోటో. 

నీప్సే మరణం తరువాత లూయిస్ డాగురే 1837లో తన సొంత పద్దతిలో డ్యాగురోటైప్ ను కనుగొన్నాడు. అది సిల్వర్ అయోడైడ్ తో రాగి ప్లేట్ పై రికార్డ్ చేయబడిన ఫోటో. కెమెరాలో రికార్డ్ చేయబడిన ఈ ఫొటోస్ పాదరసం ఆవిరికి గురిచేయడం వల్ల డవలప్ చేయబడ్డాయి. 1839 తరువాత గ్రేట్ బ్రిటన్ మినహా అన్నిచోట్లా పేటెంట్ దాఖలు చేశారు దీనికి. 

ఇవీ ఫోటోగ్రఫీ వెనక ఉన్న కొన్ని విషయాలు. అయితే ప్రస్తుతం అరచేతిలో ఇమిడిపోతున్న మొబైల్ ఫోన్స్ లో ఉన్న లెన్స్ కెమెరాలు ఉపయోగిస్తే ఎంతో అద్భుతమైన ఫొటోస్ తీసేస్తున్నారు అందరూ. నిజం చెప్పాలంటే ఫొటోస్ తీయడం మీద కాస్త ఆసక్తి ఉంటే చాలు ఇప్పుడు చేతుల్లో ఉండే మొబైల్ సహాయంతో ప్రతిఒక్కరూ ఫోటోగ్రాఫర్స్ తీసినంత అందంగా ఫొటోస్ తీసేస్తున్నారు. 

అయితే ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్నా కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల  ఫొటోస్ ఔట్పుట్ సరిగా రాదు. అందుకే ఫొటోస్ తీసేటప్పుడు గమనించుకోవలసిన కొన్ని విషయాలు తెలుసుకోండి!!

ఉపయోగిస్తున్న పరికరం ఏదైనా అంటే మొబైల్ కానీ కెమెరా కానీ దాన్ని వాడటం ఎలా అనే విషయం పూర్తిగా తెలుసుకోవాలి. 

ఏవిధమైన ఫొటోస్ తీయాలి అనేది ముందే నిర్ణయించుకోవాలి.

కెమెరా సెట్టింగ్స్ ను సరిచేసుకోవాలి.

ఫొటోస్ తీసేటప్పుడు లైటింగ్ ను ఒడిసిపట్టడం నేర్చుకోవాలి. షేడ్ ప్రాంతాలను, దిశలను అవగాహన చేసుకుని ఫొటోస్ తీయాలి.

ఫొటోస్ తీసేటప్పుడు కెమెరా షేక్ అవ్వకుండా మీ పాదాలను కదల్చడం కూడా తెలిసిఉండాలి. లేకపోతే ఫొటోస్ బ్లర్ గా వస్తాయి.

ఫొటోస్ తీయడం  కోసం ఉపయోగించే ఇతర అదనపు సహాయపరికరాలు ఉంటాయి. అదే ట్రై పాడ్. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఎత్తు, మౌల్డ్ చేయడం వంటివి.

కెమెరాకు కు ఫ్లాష్ ను ఎలా ఎప్పుడు ఉపయోగిస్తే ఫొటోస్ బాగా వస్తాయి తెలుసుకోవాలి.

ఫొటోస్ ని ఎప్పుడూ బ్యాకప్ పెట్టుకోవాలి. అలా చేస్తే పోగొట్టుకున్నాం అనే బాధ ఉండదు.

ఫోటో కి ఫోటో కి మధ్య చేంజ్ ని గమనించాలి. ఎలాంటి ఫొటోస్ బాగా తీయగలుగుతున్నారు అనేది బాగా అర్థమైపోతుంది.

ఫోటో ఔట్పుట్ బాగా వచ్చేవరకు వెనక్కు తగ్గకండి. ఓపిక చాలా ముఖ్యం.

ఇవన్నీ తెలుసుకుని పాటిస్తే మీకు మించిన ఫోటోగ్రాఫర్ లేరని అందరూ ఒప్పేసుకుంటారు. మీరు తీసిన ఫొటోస్ ఎవరికైనా చూపించినప్పుడు.

                                     ◆నిశ్శబ్ద.