ఊపందుకున్న ఎన్నికల ప్రక్రియ... నేటి నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ
posted on Nov 15, 2023 @ 11:27AM
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. మరో 15 రోజుల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి పోలింగ్ కేంద్రం, బూత్ల వివరాలతో కూడిన చీటీల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఇవాళ్టి(నవంబర్ 15) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ స్లిప్పుల పంపిణీ చేయనున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రాసెస్ జోరందుకుంది. బుధవారం నుంచి రాష్ట్రంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ఈ నెల 23 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3న కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణతో పాటు మిజోరాం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మిజోరాంలో ఇప్పటికే పోలింగ్ పూర్తవగా.. ఛత్తీస్ గఢ్ లో మొదటి దశ పోలింగ్ పూర్తయింది.
ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 3,26,18,205 ఓటర్లు, ఇందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది స్త్రీలు, 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 15,406 మంది, విదేశాలలో ఉంటున్న 2,944 మంది కూడా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,99,667 మంది యువ ఓటర్లు ఉండగా.. ఇందులో 90 శాతం మంది తొలిసారిగా ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు.
రాష్ట్రంలో నామినేషన్ దాఖలు గడువు ఇప్పటికే ముగియగా.. బుధవారం (నవంబర్ 14) తో ఉపసంహరణ గడువు కూడా ముగుస్తుంది. స్క్రూటినీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల బరిలో 4,798 నామినేషన్లు నిబంధనల మేరకు ఉన్నాయని ఈసీ అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో 86 మంది నామినేషన్ వేసి బరిలో నిలిచారు. అత్యల్పంగా నారాయణ పేటలో ఏడుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మేడ్చల్లో 67 మంది, కామారెడ్డిలో 58 మంది, కొడంగల్లో 15 మంది బరిలో ఉన్నారు.