కరోనా వ్యాక్సిన్ కు బ్రిటన్ అత్యవసర అనుమతి... వచ్చే వారమే ప్రజలకు పంపిణీ
posted on Dec 2, 2020 @ 4:30PM
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కరోనా సెకండ్ వేవ్ తో తల్లడిల్లుతున్న నేపథ్యంలో బ్రిటన్ లో కూడా మరో సారి కరోనా విజృంభిస్తుందని వార్తలు వస్తున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మన్ ఫార్మా సంస్థ బయో ఎన్టెక్ కలిసి రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను అత్యవసరంగా ప్రజలకు అందించేందుకు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ ను మంజూరు చేసింది. దీంతో కరోనా వ్యాక్సిన్ ను తన ప్రజలకు అందిస్తున్న తొలి దేశంగా బ్రిటన్ రికార్డ్ సృష్టించింది. వచ్చే వారం నుంచి బ్రిటన్లో ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుంది. మరో వారం రోజులలో వ్యాక్సిన్ అనుమతులు వస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఔషధ నియంత్రణ సంస్థ ఎమ్హెచ్ఆర్ఏ సూచనల్ని అంగీకరిస్తూ ఈ అనుమతిని జారీ చేశాం. వచ్చే వారం నుంచి ఈ వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది అని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తొలి విడతలో వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని బ్రిటన్ కు చెందిన వ్యాక్సిన్ కమిటీ నిర్ధారించనుంది. అయితే.. తొలి విడతలో కరోనాతో ఎక్కువ ప్రమాదం ఎదుర్కొంటున్న ఓల్డేజ్ హోంలలోని వారు, వృద్ధులు, వైద్య సిబ్బందికి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా బ్రిటన్ ప్రభుత్వం వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతులు మంజూరు చేయడమనేది కరోనాపై జరుగుతున్న యుద్ధంలో చాలా కీలక ఘట్టంగా నిపుణులు పేర్కొంటున్నారు. మరో పక్క బ్రిటన్ హెల్త్ సెక్రెటరీ స్పందిస్తూ.. ఇది చాలా గొప్ప శుభవార్త అని వ్యాఖ్యానించారు.
బ్రిటన్ ప్రజల క్షేమం కోసం ఫైజర్ వ్యాక్సిన్ పనితీరును వేగంగా ముదింపు వేసి, అత్యవసర అనుమతులను జారీ చేసినందుకు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థకు ఫైజర్ కంపెనీ సంస్థ సీఈఓ ఆల్బర్టా బోర్లా ధన్యావాదాలు తెలిపారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ను అత్యవసరంగా అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని అయన పేర్కొన్నారు.