Read more!

ఉగాది పురస్కారాల్లో 'తెలుగు వన్'కి రెండు అవార్డులు

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రకటించారు. మొత్తం 23 విభాగాలకు గాను వందల సంఖ్యలో జర్నలిస్టులు పోటీ పడగా.. వారి ప్రతిభ, వారు రాసిన కథనాల ఆధారంగా ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేశారు. ఈ పురస్కార గ్రహీతల జాబితాను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాలో తెలుగు వన్ రెండు ప్రతిష్టాత్మక విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. సినిమా విభాగంలో సీనియర్ జర్నలిస్టు బుద్ధి యజ్ఞమూర్తి, అగ్రికల్చర్ విభాగంలో సీనియర్ జర్నలిస్టు ఎస్. కె సలీం ఉత్తమ జర్నలిస్టులుగా పురస్కారాలు గెలుచుకున్నారు.

అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్య పరిచే బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న పాత్రికేయులను ఉగాది పురస్కారాల ద్వారా సత్కరించి, గౌరవించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు అన్నారు. అక్షరాన్నే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఇటువంటి ప్రోత్సాహం ఎంతగానో ఉత్తేజాన్నిస్తుందని చెప్పారు. జర్నలిస్టు సంఘాలంటే పోరాటాలకు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే మూస ధోరణిని దాటి.. జర్నలిస్టులను వృత్తిపరంగా ప్రోత్సాహించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. త్వరలోనే ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు.