పరీక్ష రాయకున్నా.. డీబార్ అయినా పాసే! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
posted on Nov 3, 2020 @ 1:57PM
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరు కాని వారందరిని పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డిబార్ అయిన విద్యార్థులను కూడా పాసైనట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా తెలంగాణలో 27,589 మంది ఇంటర్ విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో డీబార్ అయిన 338 మందితో పాటు, పరీక్షలకు హాజరు కాని 27,251 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ గ్రేస్ మార్కులు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది.
సాధారణంగా పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ల విద్యా భవిష్యత్తే అంధకారంలో పడిపోతుంటుంది. కానీ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు డీబార్ అయిన విద్యార్థుల పాలిట వరంలా మారింది. తెలంగాణలో వివిధ కారణాలతో మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన విద్యార్థులంతా ఇప్పుడు కరోనా కారణంగా ఇలా బయటపడ్డారు.