Read more!

తెలుగుదేశం మూడో జాబితా..13 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు

సుదీర్ఘ కసరత్తు తరువాత తెలుగుదేశం తరఫున పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు11 అసెంబ్లీ, 13 లోక్ సభ స్థానాలలో  పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తూ శుక్రవారం (మార్చి 23)మూడో జాబితాను విడుదల చేశారు.  

దీంతో  తెలుగుదేశం పార్టీ ఐదు అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ జాబితాలో తెలుగుదేశం కొన్ని కీలక స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటి వరకూ పెండింగ్ లో ఉంచిన బోడె ప్రసాద్ కు తెలుగుదేశం అధినేత టికెట్ ఖరారు చేశారు. ఆయనకు పెనమలూరు స్థానాన్ని కేటాయించారు. అలాగే తొలి రెండు జాబితాలలోనూ పెండింగ్ లో పెట్టిన సర్వేపల్లి స్థానాన్ని సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

అలాగే మైలవరం అసెంబ్లీ నియోజవకర్గం విషయంలో కూడా కూడా ఊగిసలాటకు తావివ్వకుండా ఆ స్థానానికి వసంత కృష్ణ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమ గత ఎన్నికలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే.  అలాగే పలాస నియోజకవర్గం నుంచి గౌతు శిరీష, కాకినాడ సిటీ నియోజవవర్గం నుంచి వనమాడి వెంకటేశ్వరరావులకు అభ్యర్థులుగా ప్రకటించారు.  ఇక నరసరావు పేట స్థానాన్ని చదలవాడ అరవింద్ బాబుకు కేటాయించారు. 

ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే విశాఖపట్నం లోక్ సభ స్థానాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కు కేటాయించారు. అలాగే విజయవాడ లోక్ సభ స్థానం నుంచి కేశినేని చిన్నిని అభ్యర్థిగా ప్రకటించారు.  అలాగే హిందుపూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ పోటీ చేస్తుందని గట్టిగా వినిపించినప్పటికీ ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థగా బీకే పార్థ సారధిని నిలబెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.  ఇక ఏలూరు లోక్ సభ స్థానాన్ని యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కు కేటాయించారు.  

గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తారు.  అదే విధంగా నరసరావు పేట నుంచి వైసీపీకి రాజీనామా చేసిన వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయులు,  నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల నుంచి బైరెడ్డి శబరిలు తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తారు.  అమలాపురం లోక్ సభ స్థానం నుంచి దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ ను చంద్రబాబు ఎంపిక చేశారు.