తిరుపతి వైసీపీ నేతలంతా డమ్మీలే!
posted on Apr 16, 2021 @ 12:22PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగబోతోంది. ఉప ఎన్నికను ఎలాగైనా గెలిచేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. అధికారుల సాయంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వాలంటీర్ల ద్వారా అధికార పార్టీ ఓటర్లకు డబ్బులు పంచుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో తమకు పట్టించుకోకుండా అంతా వాలంటీర్లకే డబ్బుల పంపకాలు అప్పగించారంటూ స్థానిక వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
తిరుపతి ఉప ఎన్నికలో వాలంటీర్లతోనే తతంగం అంతా నడిపించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ శ్రేణుల పనైపోయిందని, వారిని చూస్తే జాలేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్ చేశారు. వాలంటీర్లే వైసీపీకి ఓట్లు వేయిస్తారని, వారే పెత్తనం చేస్తారని, ఇతర వైసీపీ నేతలు చూస్తూ ఉండాలనే నిర్ణయానికి జగన్ వచ్చారని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను జగన్ డమ్మీలుగా మిగిల్చేశారన్నారు. జగన్ తీరుపై స్థానిక వైసీపీ నేతలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు సోమిరెడ్డి.
తిరుపతిలో గెలిచేందుకు అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వాలంటీర్లందరికీ కలిపి రూ.11 కోట్ల వరకు పంచారని చెప్పారు. వాలంటీర్లకు ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చి వారితోనే ఓటర్లకు పంపిణీ చేయిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటోన్న వారిని వైసీపీ రాజకీయాలకు వాడుకుంటుండడం సరికాదన్నారు సోమిరెడ్డి. ఎన్నికలో గెలవడం కోసం వాలంటీర్లను పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం ఏంటని ఆయన నిలదీశారు. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రేపు ఇంకో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టీచర్లను, రెవెన్యూ అధికారులను కార్యకర్తలుగా వాడుకుంటామంటే వ్యవస్థలు ఏమైపోతాయని ఆయన ప్రశ్నించారు.