ఎంపీ కుటుంబాన్ని జగన్ అవమానించారు!
posted on Apr 12, 2021 @ 2:10PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు టీడీపీ నేతలు.
దళితుల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్కు లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ముఖ్యమంత్రి దళితుల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలను వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. తిరుపతి దళిత ఎంపీ దుర్గా ప్రసాద్ చనిపోతే.. ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని ఆరోపించారు.
సిట్టింగ్ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఇచ్చే ఆనవాయితీని కూడా పట్టించుకోలేదని నక్కా ఆనందబాబు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకుని బెదిరించారని, ఎమ్మెల్సీ ఇస్తాం పొండి అని చెప్పి పంపారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫిజియో తెరపి చేస్తున్న ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో వారిపైనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
తిరుమలలో ఓ కార్యక్రమంలో నారాయణస్వామిని నిల్చో బెట్టి జగన్ అవమానించారని, దళితుల హక్కులను కాలరాస్తున్నారని నక్కా ఆనందబాబు విమర్శించారు. ఆర్థిక సమానత్వం పేరుతో రిజర్వేషన్ను తొలగించాలని సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దళిత విద్యార్థుల కోసం చంద్రబాబు రూ. 1050 కోట్లు ఇస్తే... దాన్ని ముఖ్యమంత్రి జగన్ రూ. 750 కోట్లకు కుదించారన్నారు. స్టడీ సర్కిళ్లు ఉన్నపుడు దళిత పిల్లలు ఐఎఎస్, ఐపిఎస్ అయ్యేవారని, ఉన్న మూడు స్టడీ సర్కిళ్లను ప్రభుత్వం మూసివేసిందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అవమానించటం అంటే అంబేద్కర్ను అవమానించటమేనని, దళిత సంఘాలు ఆలోచించుకోవాలని, తిరుపతి ఉప ఎన్నికలో సీఎం జగన్కు బుద్ధి చెప్పాలని నక్కా ఆనంద్ బాబు పిలుపు ఇచ్చారు.
తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే.. అప్పుడు ఆ పార్టీకి ప్రజలంటే భయం పుట్టుకొస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాన్ని దోచుకునే బందిపోటు ఏదైనా ఉందటే అది వైసీపీ ప్రభుత్వమేనని తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచడమేనా మీ రాజన్న రాజ్యమంటూ? అంటూ జగన్ సర్కార్ను ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై విద్యుత్ భారాన్ని రూ. 40వేల కోట్లు చేసిందని.. టీడీపీ హయాంలో రూ. 200 బిల్లు వస్తే.. ఇప్పుడు ఏకంగా 2వేలు వస్తోందని ఆయన మండిపడ్డారు. స్లాబుల పేరుతో మాయ చేసి రూ.1500 కోట్లు భారం మోపారని.. గ్రామాల్లో అనధికార కోతలు విధిస్తూ ప్రజల్ని జగన్ సర్కార్ వేధిస్తోందని.. రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు లేకుండా చేస్తున్నారంటూ గోవిందరెడ్డి ధ్వజమెత్తారు.